Tuesday, 24 September 2024

శాస్త్రాధారిత సహజమార్గము

 

శాస్త్రాధారిత సహజమార్గము

రచన:- పూజ్యశ్రీ రాఘవేంద్ర రావ్, రాయచూర్.    అనువాదం:- పి. సుబ్బారాయుడు, హైదరాబాద్ .  

సైన్స్ (శాస్త్రము) అంటే యేమిటోకూడా తెలియకుండానే  నేటికాలపు మనుజులు సైన్స్ ప్రకారంఉండాలన్న తీరునప్రకారం వుండాలన్న తీరున వ్యవహరిస్తున్నారు. నిఘంటువులో చూపినప్రకారం శాస్త్రీయం (సైన్స్) అంటే బాగుగుగా గమనించి ప్రయోగముద్వారా ఖచ్చితముగా పరిశీలించినదై, ఒక క్రమపద్దతిలో సామాన్యసూత్రములకనుగుణంగా, వివరింపగలిగినదై వుండాలి. భౌతికశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే యేవిధమైన సందిగ్దములేకుండా, అసంబద్దముగాని విధానమున వాస్తవములను నిగ్గుదేల్చి అనుభవపూర్వకముగ గుర్తించి సిద్ధాంతములుగా యేర్పరచి యేవిధమైన వంచనకు స్వప్రయోజనమునకు తావివ్వక నిజాలు, అనుభవముల ప్రాతిపదికగా కనుగొనబడిన సూత్రములే శుద్ధశాస్త్ర (ప్యూర్ సైన్స్) మనబడును.

సందిగ్దత, సస్వ ప్రయోజనాపేక్ష లేకుండుటన్నది విస్మరింపరాని ముఖ్యాంశములు. దురదృష్టవశాత్తు భౌతికవస్తుమయ శాస్త్రము, మనమెక్కడున్నామో తెలుసుకొనేలోపలే, ఆనేకములైన ఆకర్షక వస్తువులను శాస్త్రరీత్యా మన‍ఉపయోగార్థమన్నట్లు మనపై విపరీతముగా వచ్చిపడి, శాస్త్రార్థమునకే భంగము కలుగుతున్నది.

ఇదే పరిస్థితి మనదేశఆధ్యాత్మిక శాస్త్రమునకూ దాపురించినది. అది డాంబికుల మరియు క్షుద్రయాచకుల వాతబడి, కొద్ది కొద్దిగా దిగజారి, ఒకబూటకముగాను, నీచమాంత్రికవిద్యగాను మారిపోయినది. అంతేగాకుండా మరోవిధంగానూ ప్రక్కదారి పట్టింది. ఆధ్యాత్మికత మాసొంతమని చెప్పే పెద్ద పెద్ద విద్యావంతులు, నిరర్థకమైన తత్త్వజ్ఞానమును వారి పేరుప్రతిష్టలకోసం వ్యాప్తిజేస్తున్నారు. కనుక యేపద్దతిగాని సిద్దాంతముగాని సరియైన ఆలోచ, సాధన ప్రాతిపదికగా, శాస్త్రసమ్మతముగా నేర్పుతున్నారా లేదా? అవి నిష్పక్షపాతంగా స్వార్థప్రయోజనరహితంగా వున్నాయా లేదా? అన్నవిషయాన్ని జాగ్రత్తగా గమనింపవలసి యున్నది.

మరొక్కవిషయం. ఒక ఆలోచనావిధానము శాస్త్రసమ్మతమైనది అంటే , అది అద్భుతాలుచూపేదిగాను, చపలచిత్తుల యిచ్ఛగానూ వుండరాదు. ఆవిధానములో గమనించిన వాస్తవాలు లేదా అనుభవాలు పూర్వము నిర్ధారించిన వాస్తవాల ఆధారంగా అర్థవంతముగా వివరింపగలిగి వుండాలి. మార్మికవాదులు, తమకైతాము అపరోక్షాజ్ఞానులమని ప్రకటించుకొన్నబోధకులు యీవాస్తవాన్ని అంగీకరించకపోవచ్చును. రాధాకమల్‍ముఖర్జీవారు చెప్పినట్లు మర్మజ్ఞాని వాస్తవానికి విశాలదృక్పదంగలిగి శాస్త్రసమ్మతమైన ఆలోచన గలిగివుండాలి. అద్భుతప్రదర్శనల ప్రపంచమునుండి బయటపడి చపలచిత్తుడుగాకుండా వుండాలి. శాస్త్రసమ్మతమైన ఆలోచనగలవ్యక్తి, ఇంద్రియప్రవర్తనలను చక్కగా విశ్లేశించుకోగలిగి, వాటిని  అదుపుచేసుకోగలిగి, ఆచరణలో పెట్టుకున్నవాడై వుండవలెను, ఒక మార్మికయోగి కూడా పొందికగా సమ్మతమ గురీతిలో తన క్రొంగొత్త ఆవిష్కరణలను వివరించ గలిగి వుండాలి .

(ముఖర్జి 1889-1968 – ఒక నవీన భారత స్దామాజిక శాస్త్రవేత్త. ఆర్థిక సామాజిక ప్రొఫెసర్. లక్నొ (U . P) విశ్వవిద్యాలయ వైస్‍ఛాన్స్‍లర్)

యోగ సంబంధ ప్రాణాహుతి ప్రసారము:- ఈప్రధానశాస్త్ర భుమికగా, సహజమార్గంగా గుర్తింపబడిన సాధనను గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

సహజమార్గంలో గైకొన్న భావనలు సరళమైనవి. అందులో మొదటిది మరియు అతిముఖ్యమైన‍అంశం, భగవంతుడున్నాడు, భగవంతుడొక్కడే (ఏకంసత్) అని విశ్వసించడము. ఈభావనను వృత్తిరీత్య నాస్తికుడైవాడు తప్ప మిగిలినవారు అంగీకరించడానికి సంశయిస్తారు (నాస్తికుడు అసలొప్పుకోడు) కాని ఒక భౌతికశాస్త్రావేత్త మాత్రము వెంటనే భగవంతుని లక్షణాలను

  C G S  లేదా F P C విధానంలో తెలియజేయమంటాడు. శాస్త్రజ్ఞుని, యీప్రశ్నకు జవాబు, మీరే కనుగొనండి అనాలి. అంటే అతడు నిజంగా భగవంతునిగురించిన జ్ఞానం పొందితేనే గాని అతనికి సాధ్యపడదు. ఇది అనుభవముద్వారా పొందవలసిన జ్ఞానం. పుస్తకపఠనం ద్వార లభ్యంకాదు. కేవలం తన్నుతాను భగవంతునితో సమమైన నిజతత్త్వానికి మార్పుచేసుకున్నప్పుడే సాధ్యమౌతుంది. ఇదే మనకు సహజమార్గంలో  లభిస్తున్నది. 

ఇక తర్వాతిభావన, వ్యక్తి భగవంతుని అనుభవజ్ఞానమును ఒక సమర్థమార్గదర్శకుని సహాయముననే సాధ్యమగుననుట. సహజంగా ఉన్నతజ్ఞానమేదైనా బోధకుని లేక మార్గదర్సకుని సహాయం లేకుండా సాధ్యపడదు. ఈభావనకూడా బహుసరళమైనది. అనుభవము పొందుటకు తగియున్నది.  

ఇకయీవిధానముయొక్క ప్రత్యేకతను గూర్చి తెలుసుకుందాం. అది యీవిధానపు శిక్షణాపద్దతి. ఆత్మసాక్షాత్కారమీ మార్గమున ప్రాణాహుతి యను యోగశక్తి ప్రసారముద్వారా ఒక జీవితకాలములోనే సిద్ధించును . అందుకు ప్రాణాహుతి యోగశక్తిప్రసారముపై సంపూర్ణాధికారముగల మహనీయుని మార్గదర్సకత్వమున యీకార్యము నిర్వర్తింపబడుచున్నది. యీ దద్దతి సరళము మరియు సహజమైనది. స్పందనలు మార్గదర్శకుని ప్రాణాహుతి ప్రసారముద్వారా సాధకుని కందుచున్నవి. కొంత సాధనన తర్వాత సాధకుడు ఆధ్యాత్మికస్థితులను ఒకదానితర్వాత ఒకటిగా అనుభవజ్ఞానమున  పొందును. వాటిని భావనలమూలమున అర్థముచేసుకొని విశ్లేషించుకో నారంభించును. తన మార్గదర్శకుని గురించి ఆయన కార్యనిర్వహణను గురించి ఆలోచించమొదలిడును. అదే క్రమేణ సహజంగా అతని నిరంతరస్మరణగా వృద్ధిచెందును.

ప్రత్యేక జాగరూకత:- ఈవిధానపు ప్రతిభ, వ్యక్తి ఆధ్యాత్మికపురోగతితోపాటు, ఆత్మశుద్ధీకరణలో నున్నది. హృదయశుద్ధితో ప్రారంభించి, చక్రములన్నీ పూర్తిగా పరిశుద్ధము గావించి ఉద్దీపనచేయబడును. ఇది అత్యంతముఖ్యమైన అంశము. దీని కొఱకు ప్రత్యేకశ్రద్ధతో మార్గదర్శి సంరక్షించుచుండును. ఇట్టి ప్రధానమైన అంశమును విస్మరించినట్లైన లేక ఖాతరుచేయకపోవుటవలన, సాధకుని చక్రములు మేల్కొనబడుటచే ఉత్పన్నమైన శక్తులను సాధకుడు దురుపయోగపెట్టు ప్రమాదము గలదు. కనుక అట్టి ప్రమాదనివారణకుగాను అంతఃశుద్ధీ కరణపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నది.

సహజమార్గము నిజానికి మార్పుచేయబడిన రాజయోగము. ఇది సరళము మరుయు సహజమునైన విధానమే గాకుండా మానవుని సామాన్యప్రాపంచిక జీవనమునకు అనువైనది. ఇది ఆలోచన ఆధారంగా అమరియున్నది. దీని పనితీరు పూర్వఋషుల చేత శాస్త్రబద్ధంగా పరిశీలింపబడినది. పతంజలియోగదర్శనము దీనికొక ఉదాహరణము.

నేను యీవిధానములోని ముఖ్యాంశములను మాత్రమే చర్చించి పాఠకుల యెదుట సహజమార్గ శాస్త్రాధారాలనుంచితిని. ఇది మన జీవితచరమలక్ష్యమును చేర్చుటకు తగినట్లు సంస్కరింపబడి అత్యంత సున్నితము సూక్ష్మమునైన స్థాయికి తీసుకొని రాబడినది

----------------------------------------------------------------------.

CGS= సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ (పొడవు, దవ్యరాశి, కాలం ప్రాతిపదికగా వివరించు శాస్త్రము)

FPS= ఫుట్ పౌండ్ సెకండ్ (పై విధంగానే యీ అడుగు, పౌండ్, సెకండ్ ప్రాతిపదికగా వివరించు శాస్త్రము)

(ఆధ్యాత్మజ్ఞాన్~ జనవరి-మార్చి 2023 పత్రిక నుండి గ్రహించడమైనది)

Saturday, 21 September 2024

మన నిర్మాణమునకు మనమే శిల్పులము

 

మన నిర్మాణమునకు మనమే శిల్పులము

    రచన:-R .రామశాస్త్రి, గుల్బర్గా.                            అనువాదం;- P. సుబ్బరాయుడు, హైదరాబాద్.

జనసమూహములు ఆధ్యాత్మికతను జీవితములో ఆకర్షణ లేనిదిగా, అ‍ఇష్టమైనదిగా, ఆసక్తిలేనిదిగా, పనికిరానిదిగా భావిస్తున్నారు. ఆధ్యాత్మికసాధనకు జీవితములోని అనేకసంఘటనలు ఆటంకము కలిగిస్తున్నవని, సామాన్యమనుష్యుని మానసికస్థితిని పరిశీలించినట్లైన విషదమౌతున్నది. ఈపరిస్థితి కేవలము సహజమార్గసాధనకే పరిమితమైలేదు. ఈఅడ్డంకులు సర్వసామాన్యముగా యేఆధ్యాత్మికసాధనకైనా ఒకేవిధంగా వుంటాయి.

సాధన అంటే యేమిటి? ఈప్రశ్న సహజంగా యెవరైనా యెదుర్కోవలసినదే. సాధన శాంతికొఱకా? సౌకర్యమునకా? సంతృప్తికా? జీవితములో సమస్యల నెదుర్కోవడానికా? లేక భగవత్సాక్షాత్కారానికా? మనస్సును అంతర్ముఖంగావించి ప్రాపంచికవస్తుసముదాయమునకకై ప్రాకులాడకుండా చేయుటకు చేయు తొలిప్రయత్నమిది. నిలకడలేని చపలచిత్తమునకు క్రమబద్ధముగాని మనస్సునకు, పుట్టుకతోనే జీవితమొక రణరంగమై పోతున్నది.

మానవమనస్సు సంస్కృతపదము "మన్" నుండి యేర్పడినది.అది పశువులమనస్సు కంటే భిన్నమైనది. మానవమనస్సు ఉన్నతము మరియు చైతన్యవంతమైనది. అదే మానవుని పెట్టుబడి, మనుష్యజాతి నిజమైన సంపద. ఇదే జీవితాన్ని క్రమబద్ధీకరించి పురోగమింపజేస్తుంది. సంతోషానికి, దుఖఃమునకు, ఆనందానికి, బాధకు, ఆరోగ్యానికి, అస్వస్థకు ఇదే బాధ్యతవహిస్తున్నది. మానసిక ఔన్నత్యమునకు సంబంధించి, ఆధ్యాత్మికమార్గములో యిదే పనిజేస్తుంది. అది అతీంద్రియ స్థితిలో ఆత్మకు అనుసంధింపబడుతుంది. 

రహస్య మహాశక్తి:- ప్రాపంచికవిషయాల ఆకర్షణకు లోబడిపోయి, మనం ఆంతరంగికఆత్మ విషయంలో అంధులమైపోయాము. క్షణభంగురము, నశ్వరమునైన ప్రాపంచికవిషయములకు ఆకర్షితులమై క్రమేణ మహత్తర మానసికశక్తి అటువైపునకు మరలినది. ఒక తమాషా (పిట్ట)కథలో చెప్పినట్లు మానవమనస్సు యేవిధంగా ప్రాపంచిక పైపైమెఱుగులకు లోనై బహిర్ముఖమైపోతుందో గమనించగలరు.

ఒకసారిబ్రహ్మ ఒకరహస్య శక్తిని సృష్టించాడు. ఆశక్తి మనిషి కోరినవన్నీ యివ్వగల మహిమగలది. అయితే మనిషి ఆశక్తిని దుర్వినియోగపరుస్తాడేమోనన్న భయం బ్రహ్మకు కలిగింది. బ్రహ్మ దేవతలను పిలిపించి యీరహస్యశక్తిని యెక్కడదాస్తే బాగుంటుందో చెప్పమన్నాడు. ఇదిఒక గంభీరమైన సమస్యయై చర్చించి చర్చించి ఒకొక్కరు ఒక్కోసలహా యిచ్చారు. ఒకరు ఆశక్తిని సముద్రపు లోతుల్లో నిక్షిప్తం చేయాలన్నారు. ఇంకొకరు పర్వతశిఖరాలలో దాయాలన్నారు. మరొకరు దట్టమైన దుర్గమారణ్యాలలో దాచిపెట్టాలన్నారు. అయితే యివేవి ఆమోదయోగ్యంగా లేవన్నాడు బ్రహ్మ. అప్పుడొక తెలివైనదేవత బాగాఆలోచించి యీరహస్యశక్తిని మానవమనస్సులో దాస్తే సరిపోతుంది. ఎందుకంటే మనిషి తనబాల్యంనుండి బాహ్యప్రపంచపు వస్తువుల మోజులోపడివుంటాడు గనుక యీరహస్యశక్తిని గుర్తించలేడు అన్నాడు.

 

కనుక మనిషి తనలోనేదాగియున్న ఆశక్తిని గురించి తెలుసుకోలేక దానికొఱకు బాహ్యప్రపంచంలో ఇంద్రియముల సహాయంతో వెతుకుతాడు. ఈఉపాయం అందరికినచ్చి మనిషి మనస్సులోనే దాచివుంచడం మంచిదన్న నిర్ణయానికొచ్చారు. ఈకథ మానవుని మనస్సుయొక్క వాలకమును చక్కగా విశ్లేషిస్తున్నది.

నిజమైన లక్ష్యము:- మన గతజన్మల సంస్కారములకు మనం  దాసులమన్న సంగతి మరచిపోయాము. మన గతజన్మల సంస్కారబలమునకు లొంగిపోయికూడా మనయిష్టానుసారం స్వతంత్రంగాఆలోచించి నడచుకోగలమన్న తప్పుడుభావనతో వున్నాము. మన అవసరాలు తీరినప్పటికిని మనం సంతృప్తిపడక, యింకా కోరికలు తీరలేదని వాటికొఱకై ప్రాకులాడుచునే యున్నాము. చక్కనిజీవితము గడపడానికి తగినంతవున్నా, యింకా యింకా కావాలంటూ ప్రయాసపడుతూనే వున్నాము. పూర్వకాలపు ఋషులు మానవుని మానసిక దుర్బలత్వమును గమనించి, బాహ్యప్రపంచపు ఆకర్షణలకు లోనుగాకుండా జాగ్రత్తలు చెప్పియున్నారు. ఆధ్యాత్మిక సాధనకు తగినట్లు మన గతసంస్కారముల ప్రభావమునకు లొంగక, స్థిరముగా పురోగమించవలసి యున్నది.  

పక్షి తనరెండు రెక్కలతో యెగురుతున్నట్లుగా మనం ప్రాపంచికమైన కుటుంబ బాధ్యతలను, ఆధ్యాత్మికమైన గురువర్యుల మార్గమును సమన్వయపరచుకొనవలెను. ఎందుకంటే మన గురువర్యులే మనకు జీవితమున నిజమైన లక్ష్యము. ఆధ్యాత్మికమంటే, మనలోని దైవాన్ని సహజమార్గముద్వారా సాక్షాత్కరింపజేసుకొనుటే. కనుక ఆధ్యాత్మికములో భక్తిగలిగి ఆత్మ, తపనతో పురోగమించుటకు సహకరించుటే మొదటిమెట్టు.

18 వ శ్డతాబ్దపు ఆధ్యాద్యాత్మికవేత్త  జేమ్స్‍రస్సెల్ మహాశయుడు ఒక సందర్భములో యీవిధంగా సెలవిచ్చారు. "నీవు జీవితములో లక్ష్యమును సాధించుటకు అశక్తుడవైతే అది నీదోషము కానేకాదు. కానీ జీవితానికి ఒకలక్ష్యమే లేదంటే, అది మాత్రము నిజంగా దోషమే. కనుక మనకు ఆధ్యాత్మిక మరియు పాపంచిక విషయములలో ఒక నిర్ధిష్టమైన ఆలోచన వుండాలి. ఆరెండిటిమధ్య చక్కని సమన్వయమేర్పరచుకోవాలి. అలాకాని పక్షములో మనజీవితము, మన‍ఉనికి నిష్ప్రయోజనమై పోతుంది. 

ఆధ్యాత్మికజ్ఞానము:- "జంతూనాం నరజన్మ దుర్లభం" అని ఆదిశంకరాచార్యులవారు సెలవిచ్చారు. జీవరాసు లన్నిటిలో మానవజన్మ అరుదైనది. అంతేగాక మనిషికి పశువుకు తేడా గమనిస్తే, తెలివి, వివేకము, భవిష్యత్తుకు సంబంధించి యేది మంచో యేది చెడ్డో లోతుగా ఆలోచించి తెలుసుకోగల విచక్షణాజ్ఞానము, ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మికజ్ఞానము మనిషికే వున్నాయి. భగవద్గీత 10 వ అధ్యాయం 32 వశ్లోకంలో "ఆద్యాత్మవిద్యా విద్యానాం" అన్నారు శ్రీకృష్ణపరమాత్మ. ఆధ్యాత్మికజ్ఞానమే స్వేచ్ఛకు రహదారి. అందుకే అది నిగూడమైనది.

మనపూర్వీకులుగూడా జీవితములో పురుషార్థములైన ఆర్థ (ఆర్థికవిలువలు) కామ (కాంక్షలు) ధర్మములు అశాశ్వతములు. అయితే మోక్షము (విడుదల) అనగా జనన మరణ చక్రమునుండి విడుదలపొందుట శాశ్వతమని నిర్ధారించి చెప్పిరి. ఒక ఉర్దూకవి యిలా అన్నారు. "ఖుద్‍మే ఖుదాహై. ఖుదా కబ్ జుదాహై? జో యేరాజ్ నసమ్‍ఝే, ఓ గధాహై" నీలోనే భగవంతుడున్నాడు. నిన్ను వదలి భగవంతుడున్నాడా?లేడుగదా! ఈసత్యం అర్థంకానివాడు గాడిదే. మన భారతఋషుల ఆలోచన ప్రకారం "తనకుతాను సహాయంచేసుకునేవానికే, భగవంతుడు సహాయపడతాడు" అన్న వాక్యం సరియైనది. ఉపనిషత్తులలోగూడా "గుర్‍నతి ఉపదిశతి జ్ఞానం ఇతి గురుః" అని వున్నది. అనగా యెవరు మార్గదర్శియై జ్ఞాన మిచ్చెదరో వారే నిజమైన గురువు. వారిని దైవముగా భావింతుము (ఆచార్యదేవోభవ) అని ఉపనిషత్ వాక్యము.

ప్రభువు ( గురువు) రక్షిస్తాడు:- సృష్ట్యాదినవున్న మనిషిస్థితికి తిరిగిచేరుకొనుటే మనజీవిత లక్ష్యమై వుండాలి. ఈలక్ష్యమైన మన స్వస్థలమునకు చేరుట, మనకసాధ్యమైనందువల్ల, మనఆత్మను ప్రాణాహుతిశక్తి నుపయోగించి మనస్వస్థలమునకు జేర్చగల సమర్థుడైన గురువు సహాయం ఆవశ్యకమై యున్నది. గురువుగా, దైవముగా మనకు మార్గదర్శకులైనవారు మనగురువర్యులు (మాస్టర్). సమర్థుడైన గురువు దొరుకుట కష్టతరమే. అయితే అన్వేషకుడు మార్గదర్శికై నిజాయితీతో ప్రార్థిస్తే, ప్రకృతే సహాయపడి గురువును మనగడపవద్దకే పంపుతుంది.

ఆధ్యాత్మికత అందరికీ అందదని, సామాన్యంగా అనుకుంటున్నట్లు గాకుండా, సాధనద్వారా సామాన్యులుకూడా భగవత్సాక్షాత్కారము నాశించి పొందవచ్చునని, ఉత్తరప్రదేశ్‍లోని ఫతేఘడ్ నివాసియైన మన ఆదిగురువులు శ్రీరామచంద్రజీ వారు వివరించి చెప్పారు. వారి యోగ్యశిష్యులు మరియు వారి ఉత్తరాధికారియైన ఉత్తరప్రదేశ్ షాజహాన్‍పూర్ వాస్తవ్యులైన శ్రీరామచంద్రజీ వారు కొన్నిమార్పులుచేసిన రాజయోగవిధానమును సహజమార్గమనుపేరున ప్రవేశపెట్టి, తమ గురువుపేరున శ్రీరామచంద్ర మిషన్‍ను స్థాపించినారు. 1982 సెప్టంబర్ ఒకటవ తేదీన ప్యారిస్ ప్రకటన ద్వారా సేవింపబడుటకంటే, సేవచేయుట ఉత్తమమన్న ఆదర్శముతో యీఆధ్యాత్మికసంస్థ మానవసమాజమునకు సేవలందించునని పూజ్యబాబూజీ ప్రకటించారు.

భగవంతుడు మరొక భగవంతుని సృష్టించలేడు. కానీ గురువుమాత్రము శిష్యుని, తనంతటి గురువుగా తయారుచేసి, అతనికి భగవత్సాక్షాత్కారము చేయించగలరు. అన్వేషకుని ఉన్నతజ్ఞానమును గుర్తించి గురువర్యులు అతనిని కంటికిరెప్పవలె కాపాడుకొనును. పశులక్షణములుగల మనిషిని మానవత్వపు మనిషిగాను, అటనుండి దైవీయమనిషిగాను మార్పుచేయుటనునదొక దివ్యమైన అద్భుతము. సర్వజనాళికి శ్రీబాబూజీ "ఆధ్యాత్మికత నాబాధ్యత సాధన మీబాధ్యత" అని ప్రకటించారు. కనుక కేవలం చదివి ఆనందించడంకాదు, సాధనచేసి అనుభవమునుపొంది ఆనందించండి  --- ఓమ్ తత్ సత్.  

 (ఆధ్యాత్మజ్ఞాన్~ జనవరి-మార్చి 2023 పత్రిక నుండి గ్రహించడమైనది)

 

 

 

 

 

 

 

Thursday, 19 September 2024

సహజమార్గంలో ప్రార్థన

 

సహజమార్గంలో ప్రార్థన

 రచన:- మురళీధరరావ్, ధార్వాడ్.                             తెలుగుసేత:- పి. సుబ్బరాయుడు. హైదరాబాద్.

 "అత్యంత ముఖ్యమైనది మరియు అపజయమెఱుగని విధానము ప్రార్థన". అని పూజ్యబాబూజీ మహరాజ్, వారి రచనలలో తెలియజేశారు. ప్రేమ భక్తిపూర్వకముగా మనల్ని మనం సమర్పించుకోదలచిన దైవముతో యీప్రార్థన మనలను అనుసంధానిస్తుంది. ప్రార్థనద్వారా మనము ఆయన యెదుట వినయులమై దీనముగా ఆయన యిచ్ఛకు మనల్నిమనం సంపూర్ణముగా సమర్పించుకొందుము. ఇదే సరైన ప్రార్థనా పద్దతి. ఆయన నిజమైన భక్తులమైనందుకు మనం ఆయన యిచ్ఛకుసంపూర్ణము (తిరుగులేని విధం) గా విధేయులమై యుండవలెను.

 ప్రపంచములోని మతములన్నిటిలో ప్రార్థన సామాన్యముగా వుండనే వుంటుంది. అయితే ఆప్రార్థనలు ఒక్కోమతంలో ఒక్కోవిధంగా వుంటాయి . సర్వసామాన్యంగా వారందరి ప్రార్థనలలో ఆరోగ్యంకోసం, ధనంకోసం, సంతోషంగావుండటంకోసం లేకపోతే అగచాట్లనుండి, బాధలనుండి బయటపడాలని యాచిస్తారు. అయితే  సహజమార్గ ప్రార్థన  అందుకు భిన్నంగా వున్నది. ఇందులో కావాలి యని కోరడ మసలే వుండదు. మానవులకు సర్వసామాన్యంగావుండే యిబ్బందులు నివేదించుకోవడం మాత్రమే వుంటుంది.

 ప్రార్థన-

 ఓనాథా! నీవే మానవ జీవనమునకు లక్ష్యము.

మాకోరికలు మా ఆత్మోన్నతికి ప్రతిబంధకములై యున్నవి.

నీవే మా యేకైక స్వామివి, ఇష్ట దైవము.

నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము.

 ఈవిధమైన సరళ ప్రార్థనలో లోతైన అర్థమున్నది. మొదటి వాక్యముద్వారా మనము ఆయనను హృదయపూర్వకముగా పిలుస్తున్నాము. తద్వార ఆయనను మనవైపునకు ఆకర్షిస్తున్నాము. ఆయనే మనజీవితమునకు లక్ష్యమని అంగీకరించి, మనల్నిమనం ఆయనకు సమర్పించుకుంటున్నాము. మా నిజమైన జీవితలక్ష్యమనడంలో ఒక విశేషమున్నది. మనకు అనేకములైన లక్ష్యములిన్నవి. అవి విద్యకుసంబంధించినవి, వృత్తికిసంబంధించినవి, ఇంకా వ్యక్తిగతమైన వెన్నో ఐహికసంబంధములై జీవనగమనములో మారుతున్న కాలానుగుణములైన కోరిక లెన్నోవున్నవి. కానీ మన ప్రార్థన  వాటిజోలికిపోక, జీవితలక్ష్యము ప్రభువే (గురువే) నని తేటతెల్లము జేయుచున్నది. ఆయనే అన్నింటికి మించినవారు. మనసర్వస్వము. అంతిమసత్యము, భూమా, లేక సర్వంసహా మొత్తమునకు ప్రభువు. మన లక్ష్యము జీవితములోని అన్నివిషయములలోనూ మరియు తదనంతరముగూడా  ఆయనవలె మారిపోవడమే.

సామాన్యంగా ప్రార్థనలన్నీ వ్యక్తిగతంగా వుంటాయి. కానీ సహజమార్గ ప్రార్థన మాత్రము విశ్వజనీనము. మానవ సమాజమున కంతటికీ సారిపోవునదియై యున్నది. కారణం ప్రభువే సృష్టికర్త. మనమీ మానవదేహమున నుండుటకు ఆయనే మూలకారణము. అందుకే మనము ఆయననే మానవజీవితమునకు నిజమైన లక్ష్యమని ప్రకటించుచున్నాము.

 దైవము మరియు మహాశక్తి :- ఏవిధంగా ఆకాశంనుండి రాలిన ప్రతినీటిచుక్క సముద్రముచేరుతుందో, అదేవిధంగా మానవదేహంతో జన్మించిన ప్రతి‍ఆత్మ తనమూలాన్ని చేరుకోవడంకోసం ఆతృతపడుతుంది. ఆమూలమే ప్రభువు (మాస్టర్) అన్న పదంతో గుర్తింపబడుతున్నది.

 రెండూ మూడు వాక్యములలో మనం మనకోరికలకు బానిసలమని అంగీకరించి, ఆయనవైపునకు పురోగమించలేని అశక్తులమని, వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాము. అందుకే, తమరే మాదైవము మరియు శక్తిమంతులని తెలిపి, నీవుతప్ప మమ్ము రక్షించువారెవరున్నారు? నీవేకదా! మాకుదిక్కు. అని ఆయనను మనరక్షణకు పూనుకొనునట్లు చేయుచున్నాము. అందుకే  మనందరిని ఆయనతో, ఆయనయందే వుండునట్లు అనుగ్రహిస్తున్నారు.

 పూజ్యగురువర్యులు చెప్పినట్లు మనము మన గతకర్మలకు దాసులము. మనము మనమనుకున్నట్లు స్వేచ్ఛగా ఆలోచించి, తదనుగుణంగా ప్రవర్తిస్తున్నామనుకుంటున్నాముగానీ, వాస్తవమునకు అది నిజంకాదు. అదంతామన భ్రమ. మనం మన గతకర్మల కనుగుణంగానే నడుస్తున్నాము.

 ప్రార్థనద్వార మనం మన గురువర్యుల యెదుట శరణాగతులమౌతున్నాము. ఆయనే మన దైవంగా, అనంతశక్తిగా నమ్మినందువల్ల ఆయన తన దివ్యకరుణ, ప్రేమతో మనల నందరను అనంతతత్త్వపు తుదిస్థితికి చేరుస్తున్నారు. అందువలననే సహజమార్గ ప్రార్థన సరళము ప్రత్యేకమైయుండుటేగాదు, అర్థవంతమైనది కూడా. ప్రార్థనలో మనమేమియు కావలెనని కోరడమములేదు. కానీ ఆయనే నిజమైన జీవితలక్ష్యమని ఆత్మసమర్పణగావించి, కోరికలకు దాసులమని ఒప్పుకొని మన నిస్సహాయతను నిర్ద్వందముగా విన్నవించుకొని, శరణాగతులమై, మనమేప్రయోజనమునకై జన్మించితిమో ఆప్రయోజనమును పొందగోరుచున్నాము. గురువర్యుల యిచ్ఛాశక్తి సత్యము నిత్యమునై యున్నది. ఆయన దయాదాక్షిణ్యములకు పాత్రులమై ఆయన మనలను ఆయనకడకు అనగా మన వాస్తవ జన్మస్థలమగు ఆ దివ్యధామమునకు గొంపొమ్మని వేడుకొను చున్నాము. 

 (ఆధ్యాత్మజ్ఞాన్ జనవరి-మార్చి 2023 నుండి గ్రహించడమైనది)

 


 

Saturday, 18 May 2024

దైవేచ్ఛ - మానవేచ్ఛ

 

దైవేచ్ఛ   – మానవేచ్ఛ

                                   రచన : శ్రీ ప్రశాంత్ శౌరే  పూణే .   
అనువాదం :శ్రీ పి. సుబ్బారారుడు కడప .

దైవేచ్ఛ మానవేచ్ఛ మధ్య విభేదమేర్పడినప్పుడే మానసిక శారీరకవ్యధలేర్పడు చున్నవి----బాబూజీ మహరాజ్.

మానవుడు  తన‍ఇష్టమొచ్చినరీతిలో  ప్రవర్తించుస్వేచ్ఛ భగవంతుడనుగ్రహించినాడు. అయినప్పటికిని జీవితములో మన పూర్వసంస్కారములే మన యిచ్ఛనుపయోగించుటను నిర్ధారించుచున్నవి. దురదృష్టవశాత్తు మానవ జీవితలక్ష్యమును సాధించుదిశగాకాక సహజమార్గప్రార్థనలో తెలిపినట్లు ప్రాపంచిక స్వల్పవాంచ్ఛా పరితృప్తికై మన‍ఇచ్ఛ, కోరికలదాసునిగా మనలను మార్చుచున్నది. మన స్వతంత్రే చ్ఛను మనమెంత తెలివిగా ఉపయోగించినను, ఆశించినఫలితము దక్కనపుడు నిరాశకులోనై  నకారాత్మక ప్రవృత్తిని రేకెత్తించుచున్నది.

ఫలితము, ఆశించినరీతిలో వున్నట్లైన, అత్యుత్సాహపడుదుము. ఆశించినదానికి అనుకూలమైనా ప్రతికూలమైనా, యెట్లైనను, మనస్సుపై వాటిముద్రలు పడితీరును. వాటిని అదేపనిగా మాటిమాటికి తలచుకొనుటవలన, అవి గట్టిపడి (ఘనీభవించి) పోవును. ఈవిధముగా జన్మజన్మలనుండి పేరుకపోయి, సంచితములైవచ్చి తిరిగి మరల మరల పుట్టుచు మరణించుట కాస్పదమైనవి. ఈసంస్కారములలో (ముద్రలలో) కొన్ని పరిపక్వతజెంది, మన అనుభవమునకు (భోగమునకు) వచ్చును. అవి మనమాశించినట్లుండక పోవచ్చును.

మనిషి మామూలుగా స్వార్థజీవి. తనభవిష్యత్తుతానెఱుగడు. తనకు ప్రతికూలముగా, తన‍ఇచ్ఛకు వ్యతిరేకముగా జరిగిన సంఘటనలు, నిజానికవి అతని మేలుకు,క్షేమున కేర్పడినప్పటికి, అవి తన‍ఇచ్ఛకు, భగవదిచ్ఛకు మధ్యగల విభేదముగా తలచును. ప్రస్తుతానికి జరిగినవన్ని మనకు ప్రతికూలములు, అయిష్టములైన వైనను, అవన్ని మనమేలుకే జరిగినవి. మనం బాహ్యదృష్టి కగుపించినవే నిజమనినమ్మే నైజంగలవార మగుటవలన, మన అంతర్వాణి తరచు మనలను తప్పుచేయనివ్వకుండా హెచ్చరిస్తున్నప్పటికిని, మనమాఅంతర్వాణిని ఖాతరు చేయుటలేదు. అందువల్ల మనం క్రబద్ధముగాని మలినమనస్సు నిర్దేశించినట్లు చేస్తూ, దుర్బలులము వశముతప్పిన వారమై పోవుచున్నాము. ఇట్టి అంతర్గతవిభేదస్థితినుండి బయటపడవలెనన్న, మనల్నిమనం ఆమహాప్రభుని (గురువర్యుని) ఇచ్ఛకు సమర్పితులం కావడమే పరిష్కారమార్గము. ఆయన ఈచ్ఛకు సంపూర్ణముగా లోబడి, మనల్నిమనం సమర్పించుకోవడంవల్ల సమస్యలనెదుర్కొనుటకు, పరిష్కరించుకొనుటకు వలయు సహాయము లభించడమేగాకుండా, మన నెరవేరనిఆశలు, కోరికలఫలితముగా గలిగిన వేదనలు నిరాశానిస్పృహల భారము నుండి ఉపశమనము పొందుదుము.       

 ప్రతిది ఆమహాప్రభువు (గురువు) నుండే లభించుచున్నదన్న  సత్యమునంగీకరించినప్పుడు మాత్రమే, మనమాయన వైపునకు మొగ్గుచూపి, ఆయన ఇచ్ఛకు మనల్నిమనం సమర్పించుకొనుటకు సమ్మతించి కడకు శరణాగతి పొందుదుము. తత్ఫలితముగా  సహజమార్గ దశాదేశములలో మనకివ్వబడిన ఐదవ‍ఆదేశము ప్రకారము మనమేలుకై భగవద్‍వరముగా యివ్వబడిన వ్యధలు బాధాలనుండి మనము విడుదల పొందగోరము. శరణాగతిలో, వ్యక్తిత్వము అణగారి, ద్యైతభావముపోయి, ఆమహాప్రభువు (గురువు) ఒక్కడే నిలచియుండును. ఆయనున్నాడు అంటే అక్కడ మనంలేము. మరోవిధంగా చెప్పాలంటే, ప్రభువుయిచ్ఛ , మనయిచ్ఛమధ్య సామరస్యముంటే, ఆయన సర్వకాల సర్వావస్థలలో యెప్పుడూ వున్నాడు. విభేదమున కాస్కారమే వుండదు. "బాధలు వ్యధలు వేదనలు మానవులకే  కేటాయింపబడినవి" అని బాబూజీమహరాజ్ తన ఒకానొక సందేశములో వెలిబుచ్చిరి. పూజ్యగురువర్యుల రచనలలో, అందునా ముఖ్యంగా ఋతవాణి, దివ్యసందేశములలో తెలిపినట్లు, మానవజాతి, వ్యధలు బాధలనుండి తప్పించుకొనుట జరుగదు. అవి మానసికమైనవి కావచ్చును లేదా శారీరకమైనవికావచ్చును, అవి మన పూర్వచర్యలఫలితముగా పేరుకపోయిన ముద్రలు లేక సంస్కారములు. అవి మనం భోగించుటకై వ్యక్తమైనవి. లేదా  దైవాదేశమున మనము భరించుటకై వచ్చియున్నవి.

 

మనము కష్టాలలో వున్నప్పుడు, నిస్సహాయస్థితిలో వ్యధల నెదుర్కొనలేనప్పుడు, బాధలు మిక్కుటముగా వ్యక్తమౌతాయి. అవి మానవజీవితములో విడదీయలేని భాగములు. వాటినుండి యెవ్వరూ తప్పించుకొనజాలరు. ఎవ్వరూ యేవిధంగానూ మనకు సహాయపడి, కష్టములనుండి గట్టెక్కించలేనప్పుడు, మనం, మన ప్రభువును (గురువును) ప్రార్థిస్తాము. సర్వసామాన్యంగా జనులు భగవంతుని సంతోషపెట్టడానికి, ఆయన ప్రసాదించినవి మరలా ఆయనకే సమర్పించి, తమ బాధలు వ్యధలనుండి ఆయన గట్టెక్కించాలంటారు.

ఈవిధమగు సర్వసామాన్యసిద్ధాంతమునకు సహజమార్గ అభ్యాసులుకూడా అతీతులుకారు. పూర్తిగా దిక్కుతోచని నిస్సహాయస్థితిలో మనం పూజ్యగురువర్యులను ప్రార్థించమని సలహానిస్తాము.

బాధలు వ్యధలనుండి విముక్తిపొందుటకు నిస్సహాయులమై, వాటిని గురువర్యుల పవిత్రపాదములకడ నుంచుటే మనకున్న మార్గము. గమ్యమును దృష్టిలో నుంచుకొని, మన మెపుడు, ఆయనను ప్రార్థిస్తామో, అప్పుడాయన చాలావరకు వాటిని అంతఃశుద్ధీకరణ, ధ్యానము మరియు నిరంతరస్మరణ ద్వారా తొలగిస్తారు. మిగిలినవి వాటిని అనుభవించుట (భోగించుట) ద్వారా  నిర్మూలనమగును. మనకున్నది ఒకేఒకజీవితము ( యీజీవితము) మాత్రమే. కనుక తుదిగమ్యము వైపునకుసాగు ప్రయాణమును,  బాధలు, వ్యధలనుండి  తాత్కాలిక ఉపశమనము పొందుటకొఱకు ఆలస్యముచేసుకొనరాదు. మరోవిధంగాచూస్తే, ఎంతయెక్కువగా వాటిని అనుభవిస్తే, అంతత్వతగా సహజమార్గమున మన పురోగతి సాగును. అంతఃశుద్ధీకరణతో సమర్థవంతముగాను వేగముగాను  ప్రయాణముసాగును. మనజీవితలక్ష్యమైన, ఉత్తమోత్తమ వెలుగులలోకము చేరుటకు, సులభముగా జనన మరణచక్రభ్రమణమును దాటుకొందుము. కష్టములనెదుర్కొనునప్పుడు, మనకు వాటిననుభవించి, ముందుకుసాగి బంధనముల నుండి విముక్తిపొందు శక్తిని ప్రసాదించమని  పరమపూజ్య గురుదేవులను ప్రార్థించవలెను. మనం గురుదేవులపై సంపూర్ణముగా ఆధారపడి, ఆయన ఇచ్ఛకు సర్వము సమర్పించి, జీవితములో  లభించినదంతయు ఆయన కృపతో అనుగ్రహించినదేయని, నమ్మికతో అంగీకరించి న

యెడల, కష్టములనెదుర్కొను శక్తి మనకు సమకూరును.

 అనునిత్యము ఆయనతోనే ఐక్యమై యుండునట్లు, మనలనా  మహాప్రభువు (గురుదేవులు) దయతో అనుగ్రహించుగాక.

(ఇది ఆధ్యత్మజ్ఞాన్ - 2019 అక్టోబర్-డిశంబర్ పత్రికలో   ప్రచురించిన ,Worries, sufferings due to ‘conflict’  between  God’s Will and Man’s will  అను వ్యాసమునకు  తెలుగుఅనువాదము)

అంతఃశుద్ధీకరణ ప్రాముఖ్యము

 

అంతఃశుద్ధీకరణ ప్రాముఖ్యము

              రచన : శ్రీ ప్రశాంత్ శౌరే  పూణే .                                                         అనువాదం :శ్రీ పి. సుబ్బారారుడు కడప .

అంతఃశుద్ధీకరణ సహజమార్గసాధనావిధానముననున్న నాలుగువిధులలో ఒకటి. అంతర్గత శుద్ధీకరణకీ విధి ఉపయోగపడుచున్నది. ఇందులో అభ్యాసి తన ఇచ్ఛాశక్తి నుపయోగించి తనలోనిచిక్కులు మలినములేగాకుండా తమస్సు కూడా, బహుకాలమునుండి ఆత్మచుట్టూ ముద్రలు లేక సంస్కారములై పొరలుపొరలుగా చుట్టుకొనియున్నవాటినెల్లా తొలగించివేయుటకు, గట్టిసంకల్పము చేయును. ఈ మలినములు, చెడుఆలోచనలతో బంధనముల నేర్పరచి  ప్రాపంచికఆకర్షణలకు లోనగునట్లు చేయుట వలన యేర్పడినవి. ఇవి కేవలం యీజన్మకు సంబంధించినవిమాత్రమే కాదు. మనమెఱుగని గతజన్మలలోనివి కూడా విక్షేపరూపమున వచ్చిచేరినవి.

 సహజమార్గసాధనలో భాగముగా యీఅంతఃశుద్ధీకరణను ప్రతిరోజు, తనపనులను ముగించుకొనిన తర్వాత సాయంత్రం నిర్వహించవలసిన విధి. ఇది సహజమార్గులకే ప్రత్యేకం. ఈవిధి మరెక్కడాలేదు. మతపరమైన ఆచారవ్యవహారములలోగాని, ఇతర ఆధ్యాత్మికపద్ధతులలోగాని యెక్కడా యిటువంటిది మనకగుపించదు. బాహ్యశుభ్రతగా, శరీరమునుగాని, యితర వస్తుసముదాయమునుగాని, శుభ్రపరచుకొను విధానమునకు ముఖ్యముగా ప్రాధాన్యమిచ్చుట, మతాచారములలో కలదు గాని, అంతఃశుద్ధీకరణ విషయమై యేవిధమైన ఆలోచనగాని లేక శ్రద్ధగాని చూపించి యెఱుగరు.

 మనపూజ్యగురువర్యులైన శ్రీరామచంద్రజీ మహరాజ్ (బాబూజీ) యీవిధానమును ప్రవేశపెట్టిరి. యీవిధానములో అభ్యాసి తనలోని మాలిన్యములన్ని, ఆవిరి లేక పొగరూపమున తనవీపునుండి బయటకు వెళ్ళిపోవుచున్నవని సంకల్పముచేయును . మనలోని ఆమలినములే మన ఆధ్యాత్మికప్రగతికి అడ్డంకిగామారి, మన స్వస్థానమునకు  తిరిగివెళ్ళు మార్గమున ప్రతిబంధకములగుచున్నవి. మన స్వస్థానమైన గమ్యమునుచేరి అక్కడ సంపూర్ణముగా ఆమహాప్రభువు (గురువు) తో ఐక్యమైపోదుము. ఆమహాప్రభువైన గురువర్యులు సంపూర్ణముగా అంతిమసత్యముతో లయమైయున్నారు. అభ్యాసి తను వదలుకొననెంచిన వాటిపై ధ్యానము చేయకుండా, వాటిని మామూలుగా   సులభంగాతుడిచివేయవలెను.

 ఒకానొక సందేశములో బాబూజీ, యెందుకీ అంతఃశుద్ధీకరణద్వారా గతాన్నంతా శుద్ధిచేసి తొలగిం చుకోవాలో వివరించారు. "మన పాతముద్రలు మనల్ని వెనక్కులాగుతాయి. మననడవడిని చెడుఆకృతికిమార్చి వాటిని సరిదిద్దుకొనలేని స్థితికి తెస్తాయి. మనపాత దురలవాట్ల సంస్కారములకు బానిసలమై పోదుము. అదే మన బంధానమై పోతుంది”.  ఆయన యింకా చెబుతూ, మనస్సు పూర్వసంస్కారముల ప్రభావములకులోనై వాటిని శుభ్రపరిస్తేనేగాని, అభ్యాసిలో మార్పుతీ సుకరావడానికి, వీలులేకుండాపోతుంది"అన్నారు . అవి (సంస్కారములు)  మనలో ఒకవైఖరిని యేర్పరచి, వాటిని మనం మార్చుకోవడం కష్టతరంచేస్తాయి, శుద్ధిచేయబడినట్లైన, చాలామంది విషయంలో వారి వైఖరినిమార్చి సహజంగా సులభంగా సరిచేయవచ్చును. అప్పుడు ఆలోచనాతీరు, నడవడి సహజంగా సరియైన పద్దతికి మారును.

 ప్రభువు (గురువు) కార్యము

కనుక ప్రతిదినం, సాయంత్రం ఒక‍అరగంట శుద్ధీకరణవిధిని నిర్వహించడం అతిముఖ్యము. లేకపోతే అభ్యాసి పురోగమించినప్పటికి అతని పాతసంస్కారములు వెనక్కులాగుతాయి. ఆద్యాత్మికప్రగతి సక్రమంగా సాగాలంటే మనదేహాంతర శుద్ధీకరణ తప్పనిసరి. ఆధ్యాత్మికప్రగతి నాశించదలిస్తే, అభ్యాసి గురువుగారికి సహకరించితీరాలి. మనం శ్రద్ధగా సాధనలోని, ధ్యానము, శుద్ధీకరణ, ప్రార్థన, నిరంతరస్మరణ పాటిస్తూ గురువుగారికి సహకర్తించాల్సిన  అవసరమున్నది. తద్వారా మనమాయనతో  సంబంధమేర్పరచుకొనుట జరుగును. అప్పుడాయన కృపాధార నిరంతరంగా మనలోనికి ప్రవహించి తిరిగి సంస్కారములేర్పడుటను నిరోధించును.

బాబూజీ వ్రాసినట్లు, అభ్యాసి పూర్వసంస్కారముల  నిర్మూలన, గురువుల కర్తవ్యమే. అయినప్పటికీ  అభ్యాసి తన దురాలోచనలతోను, చెడునడత ద్వారాను తిరిగి జడత్వములోనికి జారిపోకుండా జాగరూకుడైయుండుట అత్యంతావస్యకము. కనుక జాగ్రత్త చాలాముఖ్యము. అంతఃశుద్ధీకరణ ప్రతిదినము చేసుకొనుచుండినచో, యేవిధమైన ముద్రలు పడకుండా, సంస్కారములేర్పడుట జరుగనిస్థితికి అభ్యాసిచేరుకొనును. 

ఆత్మవిశ్వాసంతో, నిశ్చయంతో శుద్ధిప్రక్రియ జరగాలి. శుద్ధిప్రక్రియ పూర్తికాగానే  వ్యక్తి తేలికదనాన్ని అనుభవములో పొందాలి. అనుదినధ్యానం, అంతఃశుద్ధీకరణ వలన మనలోని అస్థిరత, చపలచిత్తాన్ని పోగొట్టుకోగలము. ్రశాంతత  శాంతి మనయందంతటా నెలకొనాలి. మనలోని ముద్రలన్ని కడిగివేయబడగానే హృదయభారం తొలగిపోతుంది. సమర్థవంతమైన శుద్ధీకరణ, రాత్రి నిద్రించుటకుముందు చేయుప్రార్థన వల్ల ఉదయధ్యానం యేవిధమైన ఆలోచనల తీవ్రతలేకుండా సజావుగా సాగును.

ఒకసారి కర్నాటకరాష్ట్రంలోని గుల్బర్గకేంద్ర ప్రశిక్షకసోదరునికి చెబుతూ బాబూజీ శుద్ధీకరణప్రక్రియ జరుగునపుడు మరియు పూర్తవ్వగానే యేమౌతుందో యిలా తెలియజేశారు. "హృదయంలో శూన్యమేర్పడి, ఆశూన్యప్రదేసమంతా భగవత్‍కృపతో నింపబడుతుంది"

 ప్రయోజన ద్వయం  

అంతఃశుద్ధీకరణప్రక్రియలో చేసే సంకల్పం  లేక ప్రయోగించే ఇచ్ఛాశక్తి ధ్యానప్రక్రియలోకూడా అభివృద్దికితోడ్పడి నిరంతరస్మ రణతో శక్తివంతమౌతుంది. ఈరెండు సూత్రములతో  గురువుగారి కృపాప్రవాహం  నిరంతరంగా కొనసాగుతుంది. గురువుగారు చెప్పినట్లు "పాతవాటిని విఛిన్నంచేయడం ఆధ్యాత్మికశాస్త్రంలో ఒక‍అధ్యాయం" అది గురువుగారి బాధ్యత. సత్యతత్త్వమార్గంలో, పూర్వసంస్కారముల  విఛిన్నావసరమున అభ్యాసి సహకారమందించడం అవసరం.

మానవజాతికి బాబూజీ యిచ్చిన మొదటిసందేశంలో యిలా సెలవిచ్చారు. వ్యక్తి తనకుతాను యెలా మేలుచేసుకుంటాడో పరిశీలిద్దాం. ప్రపంచం సూక్ష్మపరమాణువుల కలయికవల్ల యేర్పడింది. అవి (పరమాణువులు) చాలాదట్టంగా మరియు చీకటిగానున్నవి. అయితే వాటిమధ్య మిణుకు మిణుకు మంటున్న కాంతికూడా యున్నది. అది పురుషుడు ప్రకృతి ప్రక్కప్రక్కనే యుండునన్న  సిద్ధాంతమును నిర్ధారించుచున్నది. తెలివి, వివేకముగలవారు దివ్యత్వమువైపునకు మరలి, కాంతిదిశకు దృష్టిసారించి ప్రయోజనము పొందగలిగారు. మిగిలినవారు ప్రాపంచికవస్తు ఆకర్షణకు లోనై చీకటిపరమాణువులతో సంబంధమేర్పరచుకొని దృడమౌతూ ఆత్మచుట్టూ పొరలపైపొరలలను చుట్టుకొనుచూ పోయిరి. వారు మాయప్రభావము స్థిరపడుటకు తగు సారవంతమైన భూమిని కల్పించిరి. అందువల్ల ఆప్రభావము శరీర‍అణువులపైబడి , అది పొరలపై కేంద్రీకృతమై,  అందుండి మెదడుమధ్యభాగమున ప్రతిఫలించినది. ఇదే సంస్కారములేపడుటకు కారణమైనది. ఆసంస్కరములే లోనికిచిచ్చుకొనిపోయి పరిసరములకు, మనస్సు తగులుకొని వ్యక్తిప్రవృత్తులకు ఊతమిచ్చినది. తద్వారా అతడు చెడునుండి మరింతచెడుకు లోనైపోయెను. ఈస్థితిలో గురువర్యుల శక్తిమాత్రమే అతని అంతర్గత తమస్సును  తొలగించి రక్షించ సమర్థము.  

 గురువు లీనమగుట

కేవలమొక కనుచూపుమాత్రమున సాధకునిలో తేలికదనాన్నుత్పన్నంచేయగల అద్భుతశక్తిమంతుడు మాత్రమే  నిజమైనగురువు. తొలుత నేరుగా చీకటివైపునకు సాగు, సాధకుని ఆలోచన, వెలుగును  అంతరంగమున గ్రహించునట్లు జేసి, కాంతివైపునకు ఆమహనీయుడు మరల్చును. తద్వారా అతనిని వెలుగులకుగొంపోవుదారి సుగమమై అతనిలోని అంతర్గతశక్తితో, ఆదారిన ప్రయాణముసాగించుటకు తోడ్పడును.అందువల్ల అతని సమస్య పరిష్కారమై అతనికి వ్యతిరేకముగా పనిచేయు శక్తులనుండి రక్షింపబడి అతనిమేలుకై వున్నవాటిని గ్రహించమొదలిడును. 

 "ఇంకొక విశేష విషయమొకటున్నది. అది గురువు లీనమగువిధమును గ్రహించి తనూ అదేవిధముగా గురువులో లీనమగుటను సాధించినయెడల, యిక అతడధిగమించలేని ఆధ్యాత్మికస్థితియే వుండదు. నేను దీనిననుసరించితిని. అది యిప్పుడు నేనున్న స్థాయికి చేరుటలో సహాయపడినది.భగవంతుడు మీకాశక్తి సామర్థ్యముల ననుగ్రహించుకాక--శ్రీరామచంద్రజీ షాజహాన్‍పూర్. (Messages Eternal)

(ఇది ఆధ్యత్మజ్ఞాన్ 2024 జనవరి మార్చి పత్రికలో   ప్రచురించిన, Importance  of  Cleaning  in Sahaj  Marg  Sadhana అను వ్యాసమునకు  తెలుగుఅనువాదము)

పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి

  పూజ్యలాలాజీ మరియు మన ఆధ్యాత్మికప్రగతి సోదరీసోదరులమైన మనమంతా యిక్కడ యీదినం (ఫిబ్రరవరి 14/ బుధవారం 2024) మన ఆదిగురువులైన పూజ్యలాలాజీవారి 1...