దివ్యకాంతులు
- సద్గురు మహాత్మా శ్రీరామచంద్రజీ మహరాజ్
ఆంగ్లప్రతి ‘డివైన్ స్పార్క్స్’
ఒక భక్తునిచే సంగ్రహింపబడి గురువర్యుల సేవగా సమర్పితము
తెలుగు అనువాదము
శ్రీ పి.సుబ్బరాయుడు,
ప్రశిక్షకులు, కడప.
ప్రచురణ:
శ్రీ రాంచంద్రజీ
మహరాజ్ సేవా ట్రస్ట్,
(శ్రీ సాయిబాబ అనాధ శరణాలయం ప్రక్కన)
3/1289-1; కో-ఆపరేటివ్ కాలనీ, కడప-516001.
-o0o-
విషయ సూచిక
ముందుమాట
1. సహజమార్గ విధానము
2. గురువు-ప్రశిక్షకుడు
3. లక్ష్యము-సత్యతత్త్వము
4. విమోచనము-మోక్షము
5. యోగము-రాజయోగము
6. ప్రార్థన
7. ఆధ్యాత్మికత
8. అభ్యాసి
9. దృఢనిశ్చయము-సమర్పణ మరియు భక్తి
10. ధ్యానము
11. యోచనలు-యోచనా రహితత్త్వము
12. ప్రాణాహుతి లేక యోగశక్తిప్రసారము
13. దివ్య మెఱుపులు
14. బంధన రాహిత్యము
15. లయ మరియు సమాధి
16. నిరంతర స్మరణ
17. ఏకాగ్రత
18. మనస్సు
19. పరిణామము-పురోభివృద్ధి
20. శీలము-నడవడి మరియు ప్రేమ
21. శాంతి
22. మన కర్తవ్యములు
23. ఆత్మార్పణము
24. సాక్షాత్కారము
25. సాక్షాత్కారము పొందిన ఆత్మ
26. సాధన
27. పిల్లల గురించి
28. భగవంతుడు
29. దేవతలు-అవతారాలు
30. దేవుళ్ళు-దేవతలు
31. మతము
32. దేవాలయ పూజలు
33. శాస్త్ర గ్రంథములు-బోధనలు
34. నేర్పరులు
35. ఆచారములు
36. అద్వైతము
37. అహం మరియు మాయ
38. అహంకారము
39. వైరాగ్యము-సన్యాసము
40. వెరాగ్యస్థితి
41. వెరాగ్యము
42. కష్టములు
43. అద్భుతములు
44. ప్రశ్నలు
45. సున్నితహాస్యము
46. గురువర్యుల ఆదేశములు-ఉపదేశములు
47. మనిషి అంతము
ముందుమాట
ఈ "దివ్యకాంతులు" గ్రంథము పాఠకులకు సమర్పించడం నాకు లభించిన
మహదవకాశంగా నేను భావిస్తున్నాను. ఇవన్నీ మన పూజ్య గురువర్యులు శ్రీ
రామచంద్రజీ మహరాజ్, షాజహాన్పూర్ (ఉ.ప్ర.) వారు రచించిన, సత్యోదయము, రాజయోగప్రభావము, సహజమార్గదర్శనము, దశాదేశములవ్యాఖ్యానము మరియు ఋతవాణి వంటి పవిత్ర గ్రంథముల నుండి సేకరించి, సమగ్రపరచబడినవి. ఈ గ్రంథములు గొప్ప యోగ తాత్త్విక విషయముల చర్చించి
సత్యతత్త్వమును వెలువరించుటే గాక, ఆ సత్యతత్త్వమును సాధించుటకుపకరించు సులభవిధానములనూ
తెలియజేసినవి. సత్యము మరియు దివ్యజ్ఞానన్వేషణమున శాశ్వత ధ్యేయము నందుకొనగోరు
మహాజ్ఞానుల కొఱకీ గ్రంథములు వెలసినవి. ఇవి
భారతదేశము మరియు ఈ విశాల ప్రపంచము నందు రాబోవు తరముల వారికొక ఉత్తేజము కలుగ
జేయుటకు కూడా ఉపయోగపడ గలవు.
అందువలన పై తెలిపిన గ్రంథముల నుండి సులభగ్రాహ్యములైనవి సామాన్య ప్రజలు అర్థము
చేసుకోగల్గినవి, అంతే గాకుండా ఈ శాస్త్రము నధ్యయనము చేయుటకుత్సాహము
గలిగి యోగసాధన చేయ నెంచిన వారి కనువగు అంశములు యేరి కూర్చుట వాంఛనీయముగా తలంచి ఈ
పనికి పూనుకోవడం జరిగినది. మానవ సేవ చేయుట మరియు అటువంటి
పనే తన శిష్యులూ చేయవలెనని మన గురువర్యులు ప్రగాఢముగా వాంఛ్ఛింతురు. ఈ పుస్తకము గురువర్యుల ప్రియమైన ఆశయము నెరవేర్చుట కొఱకై ప్రచురించ బడినది. దైవీయ మార్గము ననుసరించ దలచి సులభముగా సత్యతత్త్వము సాధించు విధానము కొఱకై
తీవ్రముగా ప్రయత్నించు వారికీ పుస్తకమొక ఆధారమై ఉత్సాహ పరచగలదని నేను గట్టిగా
విశ్వసిస్తున్నాను.
ఈ సంకలనము ఒక్క చూపుతో పాఠకులకు మన గురువర్యుల బోధలు మరియు ఆయన వివరించిన
సహజమార్గ సూత్రములు తెలుసుకొనుటకు సహాయపడ గలదు.
కాకినాడ, లె|| కల్నల్. భరత్సింగ్.
ఆంధ్రప్రదేశ్,
దక్షిణ భారతదేశము.
1. సహజమార్గ విధానము
నేను పురాతన పద్ధతులను అధ్యయనము చేసితిని. వాటిలో గల దోషములు మన సంస్థలో లేకుండా చేసితిని.
పొరల రూపమున తన చుట్టు చేరియున్న స్థౌల్యము నుండి తన్ను తాను విడుదల పొందుటకు
సహజమార్గము అభ్యాసికి తోడ్పడును. ఈ విధానము సత్యతత్త్వమునకు
సన్నిహితముగా అనుసంధింపబడి సూక్ష్మాతిసూక్ష్మమైన మార్గమున పురోగమించును. ఈ విషయమున గురువర్యుల సహాయము ప్రాణాహుతి ప్రసారము ద్వారా లభించుట అత్యంత
ముఖ్యాంశము. ఈ కారణముననే, తన ఉనికిలోని స్థౌల్యమును నిర్మూలించేకన్నా మరింత
పెంపొందించే పద్ధతులకు, సాధనలకు దూరముగా
నుంచుకొనుట అభ్యాసికావశ్యమై యున్నది. సూక్ష్మత వైపునకు సాగు మన
గమనమునకు సహాయకములగు వాటిని మాత్రమే మనము పాటింతుము.
సహజమార్గమున ప్రాణాహుతి ద్వారా దైవకృపను అభ్యాసి వైపునకు ప్రసరింపజేయబడును.
దైవాన్వేషణకు గృహస్థ జీవనము ఆటంకమని సహజమార్గము ప్రస్తావించదు. ప్రాపంచిక మరియు దైవీయ జీవనములు రెండూ వాస్తవానికి జీవితములోని రెండు
భాగములనియు అవి ఒకదానితో ఒకటి సంబంధము గలిగి ప్రక్కప్రక్కనే కలసి సాగవలసినవనియు
సహజమార్గము గుర్తిస్తుంది. ఇది ‘యివ్వు తీసుకో’ ‘చేయుము అనుభవింపుము’
అను ప్రక్రియగా పనిచేస్తుంది గానీ ‘చదువు ఆనందించు’ అనెడి ప్రక్రియ కాదు.
మనము యే యితర విధానమును గాని, మతమును గానీ
నిందించరాదు, విమర్శించరాదు. మీరు యితరులకు మన విధానము
గూర్చి చెప్పండి. ఇతరులు మన విధానమును అర్థము చేసుకొని మంచిదందురు. మన అనుభవములను యితరులు మెచ్చుకొందురు. ఇతరులు యిది గొప్ప విధానమని
చెప్పవలెను.
సహజమార్గములో మనము భగవంతునికి అభ్యాసికి మధ్య అనుబంధ మేర్పడ యత్నింతుము. అది తల్లి పిల్లవానిని చదువుకు సంసిద్ధము చేసి తండ్రి కందించుట వంటిది. గురువు వ్యక్తిమనస్సును, బుద్ధిని, చిత్తమును మరియు అహంకారమును క్రమబద్ధమొనర్చి సంసిద్ధము చేసి భగవంతున కప్పజెప్పును.
సహజమార్గ విధానము అకస్మాత్తుగా ఉద్భవించలేదు. ఆతృతతో వేచియున్న మానవాళికి యిది కృపతో నొసంగబడినది. సహజమార్గము భగవత్ సాక్షాత్కారమునకు సహజసిద్ధమైన విధానముల ననుసరించును. వాటిని దైనందిన జీవితమున పాటింప జేయును. ఇది ధ్యానముతో మొదలిడును.
ప్రాణాహుతిశక్తిచే అనుగ్రహింపబడిన రాజయోగి నిస్సందేహముగా అద్భుతముల ప్రదర్శింప
గలడు. కానీ అలా ప్రదర్శించడాని కిష్టపడడు. కారణం అది అతని పవిత్రతా
తీరునకు అగౌరవప్రదమైనది. అంతేకాదు ప్రత్యక్షానుభవం ఈ అద్భుతములు గణింపునకు రావని నిరూపించినది. ఎందుకంటే అవి యేవిధంగానూ వాస్తవ విశ్వాసాన్ని కలిగించలేవు. సహజమార్గంలో కేంద్రములన్నీ కుండలినితోసహా జ్అగృతమౌతాయి.
ఆలోచన లేకుండానే యిచ్ఛాశక్తి సహజ సిద్ధంగా వృద్ధియై ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక
విధులను (ఈ సహజమార్గ యోగవిధానధ్యానం వలన) నిర్వర్తిస్తారు. అప్పుడొక స్థాయికి చేరుతారు. అక్కడ యిచ్ఛ, పదార్థస్థాయిలో కంటే ఆధ్యాత్మికపు దిశలో మరింత శక్తివంత మౌతుంది.
ఇచ్ఛాశక్తి యొక్క మొదటి తాకిడితోనే సత్యతత్త్వమీ విధానమున ప్రవేశపెట్టబడుతుంది. అది బీజముగా పనిచేసి కొంతకాలమునకు వృద్ధిచెందుతుంది. శిష్యుడు నిరంతరస్మరణము
ద్వారా దానికి నీటిని పారిస్తాడు.
ప్రాపంచిక మరియు ఆధ్యాత్మికమను రెండువైపులు గ్రహించి మనము
ముందుకు సాగవలెను. ఇందులకు మా గురువర్యులు ఆదర్శప్రాయులు. నేను వారి అడుగుజాడలలో వెళుతున్నాను.
తానేమి యోచించునో మరియు వచించునో ఆ స్థాయిలోనే తప్పక జీవించవలెను. ఈ విధానములో గురువర్యులే అభ్యాసిని తీర్చి దిద్దును.
ఆధ్యాత్మికము కొఱకు ఎక్కడి కెళ్ళవలెనో జిజ్ఞాసువులకు దారి తెలియ జెప్పవలెను. ఈ విధానము యొక్క ప్రతిభను తెలియ జెప్పినచో శ్రద్ధగల వారు ఆచరింతురు. గురువర్యులు యిది చేయండి అన్నారంటే, ఆపని చేయగల శక్తిని
ముందే ప్రసాదించేస్తారు.
ఒక చైతన్యవంతమైన సంస్థను స్థాపించాలంటే ఒకే విధమైన ప్రార్థన మరియు విధానము
వుండి తీరాలి. ఇంతకంటే వేరొక గొప్ప మార్గము మరొకటి లేదు.
సహజమార్గ ఆధ్యాత్మిక శిక్షణా విధానమున గురువు తొలదొల్తనే అభ్యాసిని పతనావస్థ
నుండి తన శక్తి ప్రభావమున మేల్కొల్పును. తద్వారా అది స్వతహాగా దైవత్వము
వైపునకు మరలును.
సహజమార్గము నందు ప్రాణాహుతి ప్రసారము ద్వారా దైవకృప అభ్యాసి వైపునకు
మరలింపబడును. మనస్సు, యింద్రియములు మరియు శక్తి సామర్థ్యము లన్నియు దివ్యత
జెందియున్న గురువు శక్తితో, తన్నుతాను సరళముగా
అనుబంధించుకొనవలెను.
ఇటువంటిది (సహజమార్గము వంటిది) ప్రతి చోటా మీకు దొరకదు. ఈ ప్రపంచాని కంతటికీ యిది ప్రత్యేకమైనది. ఇక్కడ మొత్తముబాధ్యత గురువే వహించును.
సహజమార్గ విధానము చాలా సులువైనది. యే విధమైన క్లిష్టతా యిందులో
లేకుండుటే యిందులోని క్లిష్టత.
సహజమార్గములో మనము దేనికోసమూ ప్రయత్నించము. మనం కేవలం భగవంతునితో మాత్రమే అనుసంధించు కొంటాము. ఇక విరక్తి మరియు యింకే యితరుములైనా వాటికై అవే మనల్ని అనుసరిస్తాయి.
సహజమార్గములో అంతిమ (భగవత్) శక్తి ప్రసారాని కణుగుణంగా మనస్సు క్రమశిక్షణకు
తేబడుతుంది మరియు స్వతఃసిద్ధంగా క్రమబద్ధీకరింప బడుతుంది.
సహజమార్గంలో వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించు- కుంటాడు. ఇక సందేహము, భయము వుండనే వుండవు.
ప్రాణాహుతిశక్తి ఒక స్వచ్ఛమైన మనస్సు ద్వారా పనిచేసే దైవీయశక్తి. మనస్సెలా స్వచ్ఛము గావింపబడుతుంది? అది యెలా దైవీయ శక్తితో అనుసంధింపబడుతుంది? యోచన యెప్పుడు శాశ్వతంగా భగవంతునితో అనుసంధింప బడుతుందో అప్పుడన్నది సరళమైన
జవాబు. అయితే యెలా యోచనను శాశ్వతంగా భగవంతునితో అనుసంధించుకోవాలి? ఇదంతా మా గురువర్యులు చేస్తారు. ఆయనే ముందూ చేశారు, యిప్పుడూ చేస్తున్నారు. వారు నిజంగా ప్రకృతిలోనే ఒక
అద్భుతము. ఆయన తన జీవిత కాలములో చేసిన కార్యము ఊహాతీతము. రాబోవు తరముల వారు ఆయన గొప్పదనాన్ని త్వరలోనే గ్రహిస్తారు. మా గురువర్యులిలా ప్రకటించారు:
"సాధకుడు (అభ్యాసి) శ్రద్ధాశక్తులతో పనిచేయు వాడై ఒక
నిజమైన మార్గదర్శకుని గలిగి యుంటే, అతడు మహోన్నతస్థితి నందుకోవడమన్నది ఒక జన్మలోనే, ఇంకా చెప్పాలంటే జీవితంలోని కొంతకాలంలోనే సాధ్యమౌతుంది. అది ఆయన నిరూపించారు కూడా. ఈ నిరూపణ మాటలలో చెప్ప నలవికాని
పని. అది అనుభవము మాత్రమే చూపగలదు. నేను ధైర్యముగా, అనుభవించి చెబుతున్నాను, ఈ సహజమార్గ సాధన
తప్ప మరే సాధనగాని, ఆరాధనగానీ యింత త్వరితగతిని అనగా మానవజీవితములోని
కొంతకాలములోనే యింత మహోన్నత ఫలితముల నివ్వజాలదు. అదీ సహజమార్గము యొక్క స్థానము."
భగవంతుని కార్యమెప్పుడు కూడా ఒక మహోన్నతుడైన మనుష్యుని ద్వారానే
నెరవేర్చబడుతుంది. అంతేగాని ఆ పని నేరుగా జరుగదు. కారణము భగవంతునికి మనస్సు లేదు. మనస్సు ఒక్కటే, చైతన్య పరచు సాధనము. మనిషికి మనస్సున్నది. దానినీ పనికి ఉపయోగించు కొనవచ్చును. అయితే అతడు సంపూర్ణముగా తన
వ్యక్తిగత ఉనికిని కోల్పోయినప్పుడు మాత్రమే యిది సాధ్యము. అలా తన వ్యక్తిగత ఉనికిని కోల్పోయి సంపూర్ణంగా శూన్యుడైపోతే యిక అక్కడ
మిగిలేది మానవ మనస్సు కాదు. మిగిలేది స్వచ్ఛము మరియు
పూర్ణమైన భగవదీయ మనస్సే. అటువంటప్పుడు ప్రకృతి ఆ భగవదీయ మనస్సుతో పనిచేస్తుంది. కానీ బయటికి మాత్రం అది మానవుని శరీరంలో వుండి పనిచేస్తున్నట్లే కనిపిస్తుంది.
భగవంతుడు సంపూర్ణంగా స్థౌల్యరహితుడని మనకు తెలియును కనుక భగవత్సాక్షాత్కారమంటే
అదే విధమైన సూక్ష్మాతిసూక్ష్మ స్థాయికి వీలైనంత వరకు వెళ్ళిచేరుట. ఇదే ధ్యేయాన్ని సహజమార్గములో మనం కలిగి యున్నాము. పొరల రూపములో తనచుట్టూ చేరియున్న స్థూలత్వము నుండి విడుదల పొందుటకు ఈ విధానము
అభ్యాసికి సహాయపడుతుంది.
సహజమార్గములోని అద్భుత విషయమేమంటే, ఈ విధానంలో శిక్షణ
పొందిన ప్రశిక్షకుడు వాస్తవానికి ఒక ఉన్నత స్థితి వరకు యెదిగి వుండనప్పటికినీ
ప్రాణాహుతి ద్వారా అభ్యాసులు అతని స్థాయికి మించిన స్థితులను సైతము అనుభవించునట్లు
చేయగలడు. కారణం ఇక్కడ ప్రశిక్షకుడు తనకు తాను యేవిధమైన శిక్షణ అభ్యాసులకు ప్రాణాహుతి
ద్వారా యిచ్చుట లేదు. కానీ మహనీయుడైన గురువర్యులే అంతయూ చేయుచున్నారు. కనుక ప్రశిక్షకుని వ్యక్తిగత హద్దులు (దోషములు) అభ్యాసులపై యెట్టి ప్రభావమును
చూపవు. అతడు చూచుటకు ప్రాణాహుతి ప్రసారము చేయుచుండును గానీ వాస్తవమునకు అదంతయు అనంతము
నుండే ప్రసారితమగును. అయినప్పటికిని ప్రశిక్షకుని యిచ్ఛాశక్తి తగినంతగా వృద్ధి చేసుకొని ఆ
ప్రవాహమును అభ్యాసివైపునకు మరల్చ గలిగి యుండవలెను.
కాలము పరిపక్వదశకు చేరి తప్పనిసరియై తప్పించుకొనలేని పరిణామము ఆసన్నమై
యున్నది. అందుకొఱకు భగవత్శక్తి మానవ రూపములో యిప్పటికే ఆ పనిమీదున్నది. తుదిదశకు కాలము పరిపక్వమై యున్నది. ప్రపంచము దాని వైపునకు
వేగాతివేగముగా పరుగిడుతున్నది. దీని చర్యలు ఈ శతాబ్దాంతమునకు
పూర్తిస్థాయిలో బహిర్గతము కావచ్చును.
ఆధ్యాత్మికతపై ఆధారపడిన, ఒక విధమైన నాగరికత
భారతదేశము నందుద్భవమగును. అది అనతి కాలములోనే ప్రపంచ నాగరికతగా వ్యాప్తిజెందును.
సుదీర్ఘకాల ప్రార్థన ద్వారా, మన అభ్యాసులు
ఆకలితో అలమటించకుండా వుండునట్లు వరమివ్వబడినది.
యేడు సంవత్సరములలో గురువర్యులు పరిపూర్ణతను సాధించిరి. ఆ తర్వాతి 12 సంవత్సరములలో యింతకు మునుపెన్నడూ యెవ్వరూ యెఱుగని
సత్యతత్త్వజ్ఞానమును పొందగల్గెను. యేడు కాంతి వలయముల నూతనావిష్కరణ
బాబూజీ వారిదే.
ఇంకో నూరు సంవత్సరములలో ప్రపంచము సహజమార్గమును గురించిన పూర్తి సదవగాహనకు
వచ్చును.
2.
గురువు - ప్రశిక్షకుడు
నేను గురువు కావలెననెడు యోచన నామనస్సులో లేశమాత్రమైనా లేదు.
ఇతరులను దైవీయులుగా మార్చాలంటే, నీవు దైవీయునిగా
వుండి తీరాలి. నేను నా గురువునకు మాత్రమే దాసుడను. భగవంతునకు కాదు. నేను మార్గమును గురువును గైకొని మిగిలిన వాటినన్నిటిని వదలి వైచితిని.
నేను గురువు కొఱకు 12 సంవత్సరములు ప్రార్థించితిని.
ప్రకృతి శిక్షించు మార్గములు ప్రకృతికున్నవి. శ్రీ ఎమ్ ప్రశిక్షకుడుగా పనిచేయడం మానేసి 14 సంవత్సరములైనది. అతడిక 14 సంవత్సరములు తనపని తాను చేసిన తర్వాతే పురోగతి మొదలౌతుంది.
ప్రశిక్షకుడు అభ్యాసికి ప్రాణాహుతి ప్రసారం చేస్తూ, తానూ ప్రాణాహుతిని పొందుతాడు.
ఒక వ్యక్తి గడబిడ గందరగోళముతో సతమతమౌతూ, నిరాశకు
గురియైయున్నట్లు గమనిస్తే, అతడు
పట్టించుకున్నా పట్టించుకోక పోయినా నేను మాత్రం యెక్కువగానే బాధపడతాను. నేను భగవంతుని ప్రార్థించి అతని ప్రాపంచిక ప్రశాంతత చెదిరిపోకుండా, అశాంతికి గురికాకుండా వుండాలని కోరుకుంటాను. నేను ఈ విధమైన పనిని నాకై నేనే చేస్తాను. ఇతరుల కొఱకు అట్టి వ్యక్తులను ఈ విధమైన పనికోసం నేను తయారు చేయాలనుకుంటాను.
నేను మలమూత్రములను ఊడ్చివేయు (తోటి) పనిని చేస్తున్నాను.
దైవీయ కృపాధారను లోనికి ప్రవహింప జేయవలెనన్న అది కేవలము గురువు మాధ్యమమున
మాత్రమే సాధ్యము.
ఏవ్యక్తి గాని తన్నుతాను బలహీనుడననుకుంటే, అతనికి వాని గురువుపై విశ్వాసము లేదని అర్థం.
గురువుల కోసం వేటాడుతుండనవసరం లేదు. కానీ ఒక గురువునందు గట్టి
నమ్మకముండవలెను.
అదృష్టవశాత్తు నీవొక మహాత్ముని కనుగొని, అతని సాన్నిహిత్యం
నీలో శాంతి, ప్రశాంతత అనుభవానికి తెస్తే, అతని ప్రభావమున నీలోని మానసిక కలత శాంతిస్తే, నీవతన్ని యింద్రియముల పరిధి నధిగమించిన మహనీయునిగా గ్రహించ వలెను. ఆయన తన అంతర్గత శక్తి నుపయోగించి నీ జీవితములోని ఒత్తిడికి తగిన పరిష్కారము
చూపి నీకు సహాయము చేయ సమర్థుడని అర్థము చేసుకొన వలెను. భక్తి, ప్రేమలతో ఆయనతో సంబంధ మేర్పరచు కున్నట్లయిన, నీవు కూడా తదనుగుణముగా మారిపోవుట మొదలగును.
సరియైన శిక్షణా పద్ధతిలో గురువర్యులు పరిపూర్ణులైతే వారు శిష్యునిలో ఒక
సుగంధము నుత్పన్నముచేసి ఆ శిష్యుడు పూదోట దారి పట్టునట్లు చేయును. సర్వోపగతమైన మహత్తర శక్తిని ఒక వ్యక్తి తన శిష్యులలో చొప్పించ గలిగిన
సామర్థ్యములేని యెడల అతడు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చుటకు అర్హుడుకాడు.
అనుభవపూర్వకమైన జీవితమే జీవించదగినది, చదివి, వ్రాసి గడించిన వాటికి విలువ లేదు. ప్రేమ, విశ్వాసము, భక్తి మరియు ఆత్మస్థైర్యము యివే విజయపథమున నడిపించు
అంశములు. బంధన రహితుడైన వాని సహవాసమే గణింపదగినది. నీవొక స్తంభమునకు నీ శిష్యుడింకొక స్తంభమునకు కట్టివేయబడి వుంటే నీవెట్లు
శిష్యుని బంధవిముక్తి చేయగలవు? నీవు నిజంగా భగవంతుని అన్వేషిస్తుంటే, ఆ శాస్త్రములో
పారంగతుడైన వానిని వెదికి పట్టుకో. అనుభవరహితులు ప్రమాదకారులు.
భగవంతుడు సర్వజ్ఞుడు. మరి అట్టి భగవంతునిలో లీనమైనవాడు కూడా సర్వజ్ఞుడే అయివుండాలి. అయితే మానవత్వపు హద్దులకు లోబడి ఈ సర్వజ్ఞత వుంటుంది. నేను మీ అందరికి గట్టిగా నొక్కి వక్కాణిస్తూ చేయు జ్ఞానబోధ యిదొక్కటే, "సర్వమెఱిగిన వానిని తెలుసుకో".
ప్రకృతిలోగల సర్వస్వము లేక ప్రకృతిచే నిర్మింపబడిన సమస్తము తెలిసిన వాడే
పరిపూర్ణుడు. అయినప్పటికిని అతడు మామూలుగా యేమి తెలియని వానివలె నుండును. కానీ అతడు శాస్త్రములతో సహా విజ్ఞానపు శాఖలన్నింటిలో నిష్ణాతుడై యుండును. ఎవరైనా వీటిలో దేన్ని గురించి ప్రశ్నించినా? నీవేమి తెలుసుకొనదలచు చున్నావని అతి సహజంగా అడగడం ప్రారంభించును.
ఎన్నో యేండ్లుగా గీతను అట్టే వింటున్నప్పటికిని, యిప్పటి వరకు యెవరూ అర్జునుని వలె మార్పు చెందలేదు. అందులకు కారణం గీతను యితరుల కొఱకు వల్లించు వారెవ్వరు కూడా నిజముగా
వారెట్లుండవలెనో అట్లు లేరు. అందుకే వినువారిపై వారెట్టి
ప్రభావమును చూపలేక పోతున్నారు. వినిపించువారు, వారు వినిపించిన గీతలోని స్థితుల యొక్క అనుభవజ్ఞానము కలిగి యుండవలెను. అంతేగాకుండా వారు తగినంత బలమైన యిచ్ఛా, ఆధ్యాత్మిక శక్తి
గలిగి ప్రాణాహుతి ప్రసార ప్రక్రియ ద్వారా వారి స్వరప్రకంపనలు నేరుగా శ్రోతల
హృదయాలను తాకి ప్రభావిత మొనరింప గలిగి యుండవలెను. అటువంటప్పుడే ఈ గీతా పఠనము, వినువారి
కుపయోగపడును.
సాధు మహాశయుడు లేక యోగికి అద్భుత ప్రదర్శనము ప్రామాణికము కానేకాదు. అంతేగాదు, చతురులైన గురువులు, బహిరంగముగా జూపు మోసపుటాట ఇది. వారి గురుత్వ కూటమి వలలో పడవేసుకొనుటకు, బలహీనులు మత ఛాందసులపై జూపు మాయాజాలము. ఎన్నికలో తుది నిర్ణయము
గైకొనుటకు ముందు, అతడీ మార్గమున గడించిన ప్రత్యాక్షానుభవముల
గొప్పదనమును, అతని సామర్థ్యమును గమనించి సంతృప్తి చెందవలసి
యుండును. ఇందుకొఱకు తన విజ్ఞానమును మరియు ప్రత్యక్షానుభావము, ఉపయోగించుకొని నిగ్గు తేల్చుకొన వలెను. ఆ విధముగా సంతృప్తి జెందిన మీదట
అతనిపై సంపూర్ణ విశ్వాసముంచి యిక అతనిపై పూర్తిగా ఆధారపడవలెను. ఇది విజయవంతమైన అన్వేషణకు అత్యంతావశ్యకము.
గురువు రూపమును నీ ముందుంచు కొనుము. అయితే ఈ విధానమున గురువు
నమ్మకముగా మహోన్నతుడు మరియు భగవంతునిలో సంపూర్ణముగా లీనమైన స్థితిలో, మా గురువువలె వుండవలెను. పతంజలి మహర్షి తన 37వ సూత్రములో
దీనినే ప్రోత్సహించెను. ఈ పద్ధతిలో మనము దాటుకొను నాలుగు స్థితులను "రాజయోగ ప్రభావము" న
వివరించ బడియున్నవి. ఆఖరుస్థితి అహంకారము నంతమొందించును. ఇది నిశ్చయమైన విధానము. నేను నా ఆధ్యాత్మిక జీవితమంతయు ఈ విధానమునే అనుసరించితిని. అంతటి గురువు లభించినట్లయిన ఆయన రూపముపై ధ్యానము చేయవచ్చును. లేనియెడల నేరుగా చేపట్టు విధానమే ఉత్తముము.
ఒక సాధువు లేక మహాత్ముడు మామూలు సాంసారిక జీవనము గడుపు మానవునికంటే భిన్నముగా
వుండడు. కానీ అతని మనస్సు, యింద్రియములు
మాత్రము చక్కని క్రమశిక్షణలో వుండి పూర్తిగా అతని స్వాధీనమున నుండును. అతడు ఈ ప్రపంచములోని వివిధ వర్ణములు, జిలుగుల ప్రభావము
నుండి స్వేచ్ఛను పొందియుండి, సతతము తన స్వంత
వర్ణరహిత స్థితిలోనే మునిగి యుండును. ఆయన ఒక విధమైన సంతృప్తిస్థితిని, నిశ్చలస్థాయిని పొంది యుండును. ఆ స్థితి శాంతి మరియు ప్రశాంత
వాతావరణమును లోనికి శ్వాసించును.
ప్రతి యింటిలో ఒక ప్రశిక్షకుడుండవలెను.
ఎవరు స్వేచ్ఛననుభవిస్తున్నారో వారే నిన్ను బంధవిముక్తుని జేయగలరు.
ఎవరైనా ఒక పరిపూర్ణుడైన గురుని శరణ్యములోనికి వచ్చియున్నాడంటే అది నేనొక భగవత్కృపగా
పరిగణిస్తాను. గురువు భగవంతుడు కాడు. ఆయన భగవత్కృపాధార లోనికి
ప్రవహింపజేయు ఒక మాధ్యమము మాత్రమే.
సాధకుని మనఃపూర్వకమైన రోదన, తన యింటి వాకిటి
కడకు ప్రభువును రప్పిస్తుంది.
ఎవరైతే తన ఆత్మను చుట్టియున్న పొరలను చించివేసుకొనడమే గాకుండా యితరుల
సహాయార్థం మరియు మార్గమున అండగా నిలవడం కోసం ప్రాణాహుతి శక్తిని కలిగి యుంటారో
వారు మాత్రమే సమర్థులైన మార్గదర్శులు.
ఆధ్యాత్మిక శిక్షకుడు, సాధకుని మనస్సును
సరిదిద్దుటకు తన యిచ్ఛాశక్తి నెప్పుడు ప్రయోగిస్తాడో అప్పుడే అది ప్రతిభావంతమైన
ప్రశస్తమైన ఫలితములను తీసుకవస్తుంది. ఇచ్ఛాశక్తితో ప్రాణాహుతి
ప్రయోగింపబడుతుంది. అది నిరంతరం ప్రతిభావంతమైనది. సమర్థుడైన శిక్షకుడు
ప్రాణాహుతియోగప్రసారం ద్వారా సాధకుని అధమ వృత్తులను బలహీన పరచి అతని హృదయాంతరాళమున
ఈశ్వరీయ ప్రకాశమను బీజమును నాటును. ఈ విధానములో శిక్షకుడు తన
వెనుకనున్న అనంత దివ్యశక్తిని తన యిచ్ఛాశక్తి నుపయోగించి ప్రయోగిస్తాడు. ఒక రకంగా చూస్తే అతడు ఈ శక్తి నెఱిగినవాడై యుండి దానిని తన యిచ్ఛాశక్తి యనెడు
దర్పణము ద్వారా సాధకుని హృదయముపైకి ఆ శక్తిని సులువుగా మళ్ళిస్తాడు.
భగవత్ సాక్షాత్కారమును వాస్తవముగా పొందియుండి తద్వారా దైవీయ జ్ఞానము అతనిలో
జ్ఆగృతమై యుండిననే తప్ప ఆధ్యాత్మిక విషయమును మరెవ్వరు స్పృశించడానికి కూడా
వీలులేదు.
ఒక వ్యక్తితో కలిసినప్పుడు, తన చిత్తవృత్తులలో ఒక
లాలన, ఒక ఓదార్పు అనుభవంలోనికి వస్తే, అతడిక గురువును కనుగొన్నట్లే. మనం గురువుల వేటలో పడరాదు. ఒక ధృఢనమ్మకం కలిగి వుంటే చాలు, అర్హత కణుగుణంగా
గురువే అతని దగ్గరికొస్తాడు.
ప్రశిక్షకులు ఉత్తమ కార్యాన్ని నిర్వహిస్తారు. వారు కేవలం ప్రారంభిస్తారు. పని పూర్తి చేసేది మాత్రం
గురువర్యులే.
నిన్ను వెకుతున్న వానికై వెతుకుము. నిన్ను నిర్లక్ష్యము చేయనెంచు
వానిని కాదు.
తన్నుతాను వినమ్రునిగా భావించి, ప్రేమ, సేవాభావోత్సాహముతో అభ్యాసులను ఆధ్యాత్మిక మార్గమున తీసుకొనిపోగలుగు వాడే
గురువుగా నుండుటకు అర్హుడు.
నేనే గురువును అన్నభావం నుండి గురువు స్వేచ్ఛను పొంది వుండాలి. ఆయన వ్యక్తిగత ప్రాముఖ్యము మరియు అహంకారమనెడి భావము నుండి పూర్తిగా విడివడి
యుండవలెను. ఆయన పూర్తిగా భగవత్ప్రేమలో లీనమై తద్వారా ఆయన ఉనికి నుండి ఆ భగవత్ప్రేమ
బయటికి విరజిమ్ముతూ మొత్తమంతా అలముకోవాలి.
గురువు మహోన్నత శక్తిమంతుడై మూలమునకు చేరుకొని వుంటే అట్టి మహాత్ముడు
మరణానంతరము గూడా తన అనునాయులకు మార్గదర్శకత్వం నెరపగలడు.
దేవాలయాల్లో పూజలు మరియు తీర్థయాత్రలు కేవలం స్థలమార్పిడి మాత్రం కలిగిస్తాయి. యజ్ఞము నాలుగు ఫలాలనిస్తుంది. అవి ధర్మార్థ కామమోక్షాలు. సద్గురు ఒక్కడే భగవత్ సాక్షాత్కారాన్నివ్వ గలడు.
ప్రాణాహుతినెప్పుడు ప్రసారం చేయాలన్నది గురువు కర్తవ్యము. అది ఆయనకు తెలుసు. అది వ్యక్తి యొక్క స్థాయి మరియు గ్రహించు సామర్థ్యముపై ఆధారపడి వుంటుంది.
అభ్యాసికి తెలియకుండానే గురువు చాలా చేస్తాడు. అంటే వారి ఆధ్యాత్మికోన్నతి కొఱకు వలసిన భావనలతో వారిని ఉత్తేజపరుస్తాడు.
సన్యాసిని ప్రశిక్షకునిగా చేయరాదు. అట్టి వానితో మన కవసరము లేదు.
మన కార్యకలాపములు, చేతలు
క్రమబద్ధీకరింప- బడక మనస్సు క్రమశిక్షణా రహితమైనప్పుడు మనం ఒక మహాత్ముని అండ
నభిలషింతుము. ఆయనే గురువు.
నేర్పరులు కేవలం పుస్తకములు చదివి యుందురు. ప్రత్యక్షానుభవం గడించిన వారు ఆ పుస్తకముల సారమెఱింగి యుందురు. ఆ కారణమున వారి మధ్య చాలా అంతరముండును. తుది దశవరకు యెవరైతే పయనించి
యుందురో వారే యితరులకు విజయవంతముగా మార్గదర్శకత్వము వహించ గలరు. ఈ చదివి నేర్చుకొన్న గురువులు బాట ప్రక్కన యేర్పరచిన మార్గము చూపు స్తంభపు
పలకల వంటి వారు. అవి ఆ దారి యెటు వెళ్ళునో సూచించును. వారు మనకు చేయు సహాయము అంతమటుకే.
దివ్య కాంతిపుంజమంతయు, కాంతిలోనే వేళ్ళూని
యుండును. అంతేగాని ఒక్క క్షణమైనా విడివడి యుండదు. అనేకములైన మొక్కలు, చెట్లూ అన్నీ వేరువేరుగా బయటికి కనబడుతున్నా అవన్నీ భూమాత లోనికే వేళ్ళూనికొని
యుండి, వాటి జీవనాధారము అక్కడ నుండే గ్రహించును. కనుక మన
మూలములు సైతం గురువర్యులలోనే వుండి ఆయనలోనే లీనమౌదము గాక!
అనుభవజ్ఞుడైన గురువర్యుని నుండే సలహాలను గైకొనుము. అనుభవజ్ఞానమే లేని గురువుల కొఱకు ప్రయాస పడడం వృధా. అయితే గురువును పొందుటలో ఆలస్యము చేయవద్దు.
ధ్యానము చేయుటకు, ఆధ్యాత్మిక పురోగతికి
గురువు గలిగి యుండుట అవసరం. ఆయన మన ప్రయాణ దూరమును
తగ్గించును.
3.
లక్ష్యము - సత్యతత్త్వము
సర్వోన్నత నిత్యసత్యశక్తే, భగవంతుడన్నది
సర్వసామాన్య భావన. తాత్త్విక భావన నిర్గుణబ్రహ్మము (అవ్యక్తబ్రహ్మము) ను చేర్చినది. అది అనేకత్వమునకు, భిన్నత్వమునకు
అతీతము. ఉనికికిదే అంతిమ మూలము మరియు ఆధారపీఠము. ఈ సమస్త విశ్వము రూపుదాల్చుట
కవసరమైన మహాచైతన్య కేంద్రము లేక సంపూర్ణాధికారము. ఇది గుణ, చైతన్య, యెఱుక కతీతము. దీనినే పరబ్రహ్మమని కూడా తెలియజేస్తారు.
బ్రహ్మము సర్వజ్ఞుడు.
అతడెట్లుండవలెనో అట్లున్నాడు.
మహోన్నతుడైన గురువే దైవము. అన్ని విషయములందును ఆయన యిచ్ఛయే
రాజ్యమేలును.
భగవంతుడు బ్రహ్మచారికి చాలా దూరమున నుండును. సన్యాసికి మరింత దూరమున నుండును. సంసారికి తన గృహముననే
విరాజమానుడై యుండును.
నేను కొన్నిసార్లు భగవంతునికి బదులు ప్రకృతి యను పదము నుపయోగించితిని. ఈ ప్రకృతిలో ఆకర్షణ లేదు.
సరళ భావమును ప్రకృతిసారముగ పేర్కొంటిని. చైతన్య మిక్కడే ప్రారంభమైనది. అదే దాని నిజమైన మూలస్థానము. నమ్రతా భావము అమాయకత్వమును
సంతరించుకొన్న విధేయతాస్థితియని కూడా వ్యవహరించ వచ్చును. దీనిని సాధించిన వాడు అన్నీ సాధించినట్లే, అయితే అతడలా పైకి యేమాత్రమగుపించడు.
భగవంతుడు ఒక మతము, ఒక తెగకు మాత్రమే
సంబంధించి లేడు. కొన్ని ఆకారములకు, ఆచారములకు
పరిమితుడు కాడు, అలాకాక ఆయనను పవిత్ర గ్రంథముల పుటలలో కనుగొనలేము. ఆయనను మన హృదయాంతరాళము నందే కనుగొనవలెను.
విద్యుచ్ఛక్తిని దాని చర్యద్వారా గుర్తింతుము. భగవంతుని గూడా యిట్లే చర్యద్వారానే తెలియనగును. వెలుగు విషయము కూడా యింతే.
భగవంతుడు మంచి గాక మరేమి కాడు. కనుక భగవంతుడు యెప్పుడూ మంచే
చేస్తాడు. ఎవరు కూడా భగవంతుడు చెడు లేక తప్పు చేస్తాడని యేనాడు యోచించరాదు. అధర్మ వ్యాప్తి భగవంతుని వల్ల అసలే జరుగదు.
ఈ ప్రపంచమెట్లేర్పడినదని సుదీర్ఘయోచన చేయుటకంటే, ఈ ప్రపంచమును యిట్లా ఉనికిలోనికి దెచ్చిన వానిని తలంచి అబ్బుర పడవలెను. ఈ అబ్బుర పడుటే ప్రపంచోత్పత్తిని నీకు తెలియజేస్తుంది. అదెప్పుడంటారా? అది నీవు సత్యస్థితిలో సత్యమైన వాటిని తెలుసుకొన్నప్పుడే.
ఒకే యోచన, ఒకే గురి మరియు ఒకే అన్వేషణ మన దృక్పదంలో వుండాలి. అదీ దైవ సంబంధమైనదై వుండాలి. అదే ధ్యేయంగా, అదే పిచ్చిగా వుండిపోవాలి. దీన్నే నేను ప్రతి ఒక్కరిలో
ఉత్పన్నం కావాలని ఆశిస్తున్నాను. అప్పుడు మాత్రమే తను ఆతృతతో
వేచియున్న దానిని దృష్టిపథంలోనికి తెచ్చుకోగల్గుతాడు.
దైవము సాకారము కాదు నిరాకారము కాదు. రెండింటికి అతీతము.
యోగి ఆఖరు నివాస స్థానము తమము. అదే మూలము. విముక్తాత్మలు యిక్కడే కలిసి మెలసి వుంటాయి.
సత్యతత్త్వము శక్తికి, భావోద్రేకమునకు, వేడికి అతీతము. ఈ స్థితి ఉష్ణము పుట్టకముందు నెలకొని యుండినది. ఇది వాస్తవానికి భావించడానికి, అర్థము
చేసుకోవడానికి వీలుపడనిది. సత్యతత్త్వము యింద్రియముల ద్వారా గ్రహింప వీలుపడదు. కానీ దీనిని ఉనికి యొక్క అంతరాళంలో సాక్షాత్కారింప వీలగును. భగవత్ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము
రెండూ ఒక్కటే.
అన్ని మతములు మూలసత్యములను ఒకచోటికి చేరిస్తే ఒక సమన్వయ ఆధారమునకు చేరుదుము. అదే సత్యతత్త్వము.
మరొక దానితో పోల్చి భగవంతుని తెలుసుకోలేము. ఎందుకంటే భగవంతునితో పోల్చదగిన దేదియు లేనేలేదు. ఇది కాదు, ఇదే కాదు (నేతి,నేతి)
సూత్రము ద్వారానే భగవంతునెఱుగ వలెను.
ఎఱుకలో నున్న మరియు ఎఱుకలో లేని జ్ఞానమంతా పోగొట్టుకుంటే, ఇకనేముంది ఆయనకు నీకు మధ్య ఒక లోతైన సంబంధమేర్పడిందని అది తెలియజేస్తుంది. ఆయన వీటన్నిటికి అతీతుడు. అయితే యిక ఆయన్నే అంటే ఎవరితో
సంబంధమేరచుకుంటివో ఆయన్నే మరచి పోయావంటే అప్పుడు మిగిలేదిక అసలు, అసలైనది మాత్రమే.
సాక్షాత్కార స్థితిని పొందిన వాడు గుర్తింపులేని వాడై అంటే నిరాదృతుడై, ఘనత, గర్వము, అహంకార భావముల నధిగ
మించిన వాడై శాశ్వతముగా ఆత్మశూన్యత్వ స్థితిలో జీవించును.
సర్వజ్ఞత్వమే ఆత్మ సాక్షాత్కారము పొందిన వాని గుర్తు.
సత్యతత్త్వములో లీనమై యున్నాడనగా అతనిలో యింకెట్టి భావనలు వుండవు. అతడు తన శరీరము, మనస్సు, ఆత్మ మొదలైన
భావనలన్ని కోల్పోయాడు. అదీ నిజమైన భగవత్స్థితి.
సున్నితమైన అనుభవశక్తిని గడించి నంతనే సందేహములన్నీ అంతమగును. ఆ తర్వాత జీవితపు వాస్తవ స్థితుల నన్నిటినీ తానే అర్థము చేసుకొన గల్గును.
సంపూర్ణ సాక్షాత్కారము పొందినప్పటికీ, రవ్వంత మానవత్వము
మిగిలే వుంటుంది. భగవంతునిలో సంపూర్ణంగా లీనం కావడ మనేది మొత్తం శరీరపు తొడుగులన్నీ వీడిపోయి
నప్పుడే సాధ్యము.
నీవు సత్యస్వచ్ఛ స్థితిని పొందినావంటే ఆ స్థితి యెఱుకే నీకుండదు. అంతా మటుమాయమై పోతే అప్పుడు సత్యతత్త్వం (అస్లియత్) సత్యతత్త్వమొక్కటే
నిలుస్తుంది.
అసలైనది, వాస్తవమైనది యైన సత్యతత్త్వము వెలుగు కాదు, చీకటి కాదు. అది ధున్ ధ్లాపన్.
ఈ నాడు కావలసినదేమిటి? అది యేదో కాదు
కేంద్రం నుండి వెలువడు శక్తియే. అది మనల్ని దగ్ధము చేయవలెను
లేదా కౌగిలించుకొన వలెను. మనం మార్పును ఆశిస్తున్నట్లయితే ఈ ఆలోచనతోనే మనముండి తీరాలి. అందు కొఱకు మనం యుద్ధవీరుని వలె రంగమున ప్రవేశించి మనల్ని మనం ధైర్యవంతులమని
ధ్యేయ సాధనలో సమర్థులమని నిరూపించు కోవాలి.
భగవంతుడు సులభుడు మరియు అత్యంత సూక్ష్ముడు. అట్టి సూక్ష్మాతిసూక్ష్ముని సాక్షాత్కారం పొందాలంటే, అంతే సూక్ష్మమైన మరియు సున్నితమైన మార్గమునే చేపట్టవలెను.
భగవంతు డొక్కడే. ఒక్కడైన భగవంతుని సాక్షాత్కారమునకు ఒక్క విధానమునే అవలంభించ వలెను. త్రిమూర్తుల భావన మనలను తప్పక జనన మరణముల వైపునకు మరీ మరీ మరల్చును.
మహాప్రళయంలో మాత్రమే శూన్యమనున దేర్పడును.
శూన్యమనునది ఓ విధమైన శక్తిహీనతా భావన గల్గియున్నది. కేంద్రము నందు చలనము లేదు. కానీ దాని పరిసరములలో కానరాని
కదలికలున్నవి. ఇది ఒక కదలిక లేని మూగభావన నిచ్చుచున్నది. ఇది దానికదే అనంతము, వ్యక్తీకరణ మరియు
ఊహ రెండూ కూడ యిచ్చట విఫల మగుచున్నవి.
మనము పవిత్రత నుండి ఉద్భవమైతిమి. మనము ఉనికిలోనికి వచ్చుటకు
కారణభూతమైన పవిత్ర ప్రవాహము నకు ఆధారము కూడా ఆ పవిత్ర మూలమే. ఆ కారణము ననే మనయందంతటా పవిత్రాలోచన పాదుకొని యున్నది.
‘నిజమైన ప్రేమను మాటలో వ్యక్తీకరించలేము. ఇదే అసలైన సత్యతత్త్వము. దీన్ని యేవిధంగాను బహిర్గత
మొనరించ లేము.
మనిషి, ప్రశ్నింపలేని ఆత్మయై పోవును - అంటే అది సత్యతత్త్వము
దరికేగుతున్నదన్న మాట. నేను ఆ ధ్యాసలో నున్నాను. అదీ ప్రశ్నింపలేని ఆత్మంటే.
కేంద్రము మొత్తానికి చర్యరహితము. అందులో శక్తి, సామర్థ్యము యింకా అటువంటి వేవియు లేవు.
ఉనికిరాహిత్యమునకు పరాకాష్ట ‘భూమా’ అని పిలువ బడుతున్న అంతిమ స్థితి.
శక్తిరహితము అన్న పదాన్ని సామాన్యంగా భగవంతునికి కేంద్రమునకు ఉపయోగిస్తాము. నిజానికి అందులో శక్తి లేదు. శక్తి హీనత్వమనడంలోనే శక్తి
యొక్క భావన స్ఫురించు చున్నది. ఆ శక్తి స్తంభించిన స్థితిలో
నున్నది. అదీ కేంద్రములో నున్న శక్తి యొక్క స్థాయి. ఇప్పుడు కేంద్రము సర్వశక్తి భాండాగారముగా తెలియ బడుచున్నది. అంటే స్తంభించి లేక కదలిక లేకుండుటను శక్తిహీనత యని అర్థము చెప్పిరి. నిజనికిదే సర్వశక్తులకు ఉత్పత్తి స్థానమై, శక్తులన్నిటిని మించియున్నది.
ఒకమాటలో సమగ్రపరిస్తే చైతన్య వంతమైన సామర్థ్యమే శక్తి. అది స్తంభించిన (కదలికలేని) స్థితిలో వున్నప్పుడు శక్తిహీన మంటున్నాము.
మానవ జీవిత లక్ష్యము భగవత్సాక్షాత్కారము. అంతేగాని కేవలం శాంతిని పొందుటయే కాదు.
మోక్షమునొక నిముషములో పొందవచ్చును గానీ దాని కనేక అడ్డంకులున్నవి.
మనధ్యేయము స్వచ్ఛము మరియు సరళము. అది ‘సత్’- సత్ మాత్రమే. అక్కడికి కేవలం జ్ఞానరహితులు మాత్రమే చేరగలరు.
సిద్ధాంత విషయమున సర్దుబాటు పనికిరాదు. మనకొకే ఒక సిద్ధాంతముండవలెను.
సాక్షాత్కారము కొఱకు మనము ప్రయత్నించ వలెను. అంతేగాని అదేమిటి? అని విచారిస్తూ కాలహరణం
చేయరాదు.
శూన్యమే అంతిమం కాదు. అది మన తుది ధ్యేయం కూడా కాదు. అది ‘భూమా’ లేక అంతిమం కంటే
మరీమరీ దూరమున నున్నది.
వెలుగు మన లక్ష్యము కాదు. మనం మహోన్నతమునకు వెళ్ళవలసి
యున్నది.
వ్యక్తి సదా సాయుజ్యమునకై తపన పడవలెను.
మనము భగవదీయ లక్షణములను మనలో నింపుకొనవలెను. భగవంతుడు పరిమితుడు, సత్యతత్త్వము
మాత్రము అపరిమితము.
తేలికైన వస్తువు పైపైకి వెళ్ళడానికే మొగ్గు చూపుతుంది. మరో మాటలో చెప్పాలంటే అది మూలము వైపుకే కదులుతుంది. భగవత్ప్రభావమున చైతన్యవంతమైన వన్నియు తమ మూలము వైపునకే యెగుర యత్నించును.
అన్ని సందర్భములలో మన దృష్టి యెఱుకతో అంతిమం లేక దైవం - అంటే సత్యతత్త్వం
వైపునకే మరల్చి యుండవలెననుట ఉత్తమము.
మనము దైవమైపోము. మనము ఆయన్ను చేరగలము మరియు ఆయన గుణములను పొందగలము. మనము ప్రభువు లేక గురువు లక్షణములను లోనికి గ్రహించ వలెను. నీవు భగవంతుడవైతే అప్పుడు యిద్దరు భగవంతులౌతారు. ఈ విశ్వానికి యిద్దరు పరిపాలకు లుండటానికి వీలులేదు. ఉన్నది ఒకే ఒక మహాప్రభువే.
వ్యక్తి తనకు తానే ఒక లక్ష్యమును నిర్ణయించుకొనుట అత్యంతావశ్యకము. హాకీ లేక ఫుట్బాల్ ఆటలో గోల్ కొఱకు యేర్పరచిన కర్రలు తీసేస్తే యిక ఆటకర్థమే
వుండదు.
జనులు తాము మానవస్వరూప భగవంతులమై పోవాలని ప్రయత్నిస్తున్నారు, కానీ పరిపూర్ణులవాలని కాదు.
భగవంతుడు పరిమితుడు కానీ సత్యతత్త్వము అపరిమితము. నిజానికి భగవంతుడు మనమనుకొంటున్న స్థాయి భగవంతుడు కాడు, అంతకంటే అవతల నున్న వాడు.
దైవాన్ని ఉన్నదున్నట్లు అభ్యాసి చూస్తాడు.
సత్యతత్త్వము యింద్రియముల కతీతముగా భావనకందకుండా వున్నది. సత్యతత్త్వము చీకటి తెర వెనుక దాగికొని యున్నది. సత్యతత్త్వము చీకటి తెర నుండే
వెలుగు చున్నది.
భగవంతుడు తప్ప మరెవ్వరూ పరిపూర్ణులు కారు.
సత్యతత్త్వునితో అనుబంధ మేర్పరచుకొని యున్నప్పుడే, నిజమైన స్వచ్ఛత (పవిత్రత) ఆధిక్యతను కనబరుస్తుంది.
దైవత్వము సన్ననిది మరియు బహు పలుచనిది. అటువంటి దానిని మాటలతో చేరడ
మేమంత సులువైన పని కాదు.
భగవంతుని కొఱకు అడవులలో వెతక వలెనని సామాన్య జనులనుకొందురు. కానీ నేను భగవంతుని కొఱకు హృదయాంతరాళమున అన్వేషించ వలెనని భావింతును.
దైవము సర్వశక్తిమంతము. అది కేంద్రము నుండి పరిధులకు
ప్రవహించును. అది ఊహామాత్రము. మనము గుణము నుండి పదార్తము వైపునకు సాగుదుము.
4. విమోచనము - మోక్షము
విమోచనమంటే బంధనములు తెగి స్వేచ్ఛను పొందుట. ఇది మోక్షమునకంటే భిన్నమైనది. ఇది మరుజన్మ ప్రక్రియకు అంతము
కాదు. మోక్షమన జననమరణ చక్రభ్రమణమున ఒక చిన్న విరామము మాత్రమే. ఇది జననమరణ ప్రక్రియ కాసేపు ఆగిపోవుట మాత్రమే. ఆ తర్వాత మరలా మనం భౌతిక రూపాన్ని ధరిస్తాము. ఈ అనంత మరుజన్మల వలయ చలనము మనము విమోచనము పొందిననేగాని అంతమొందదు. ఇదే మన సమస్త బాధలు వ్యధలన్నిటికి అంతము. ఈ విమోచనానికంటే తక్కువైన దేదియు మన జీవిత లక్ష్యముగా గైకొన వీలులేదు. ఏదియేమైన దీన్నధిగమించిన తర్వాత కూడా యింకా పయనించ వలసింది చాలా మిగిలి
యున్నది.
కార్య రూపము దాల్చిన ప్రతీది భగవదిచ్చ కణుగుణమైనదే. వచ్చిన చిక్కంతా అది మన సామర్థ్యమున జరిగినదని భావించుటే. ఈ కారణముననే విజయములకు పొంగిపోదుము. అపజయములకు విపరీతముగ కృంగిపోదుము. ఇదే మనల్ని బంధనములకు గురిచేసినది. ఈ అహంకార భావన లేకుండా వుండటమే
నిజమైన సత్తాగల శక్తి యొక్క ఆగమనము. దీన్ని సాధించడమెలా? కేవలం మనల్ని మనం ఆ దివ్య మహత్శక్తితో అనుబంధించు కోవడం వల్లనే యిది సాధ్యం.
మనం మన చిన్న సృష్టిని వ్యక్తిగత పదార్త అస్థిత్వంతో నిర్మించు కొన్నాము. అది స్థూలత్వపు మరియు వెలుగు చొరనీయని పొరలపై పొరల రూపమున చుట్టుకొని యున్నది. ఇప్పుడు చేయ వలసిన పనేమిటంటే, ఆ స్థూల మరియు
అపారదర్శక పొరలను ఒకటొకటిగా ఛేదించుకుంటూ వెళ్ళి సృష్ట్యాదినున్నట్టి ఆ
పూర్ణస్థితికి చేరడమే. ఇదీ మన సహజమార్గ దర్శనము యొక్క సంక్షిప్త వివరణ. అనగా మన ఈ చిన్న సృష్టిని కరిగించేసి మనల్నిమనం వెనక్కి చుట్టేసుకోవాలి.
5. యోగము - రాజయోగము
విశ్రాంతి యెఱుగని మనస్సును సరిగ్గా క్రమబద్ధీకరించడమే యోగములో ప్రాధమికాంశము.
ప్రేమ, భక్తి భావములు ఆధారముగా గల సాధన చేయకుండా యెవరూ యోగి
కాలేరు.
తాత్త్వికవేత్తలు మనస్సుగుహ నుండి పుట్టుకొస్తారు. యోగులు హృదయ కుహరం నుండి ఉద్భవిస్తారు. కనుక మానసిక సందేహాల కొఱకు
చీకటి గుహలోనే యెప్పుడూ వుండే తాత్త్వికులను సంప్రదించుము. వారే తత్త్వసంబధిత ప్రశ్నలకుత్తర మియ్యగలరు. అయితే యోగి ఆత్మతపనకు సంబంధించిన ప్రశ్నలకుత్తర మియ్యగలడు.
రాజయోగ మొక్కటే వ్యక్తి యొక్క గమ్యమునకు దారి నేర్పరచ గలదు. అది సంపూర్ణము. అనుసరించి, అనుభవించుట ద్వారా దాని నెఱుంగుదుము.
యోగము నీతో కాదు. భగవంతునితోనే మొదలగును.
అహమును ("నే"నను భావము) ప్రక్కన బెట్టి యోగమున పురోగమింతుము. ఇతర పూజా విధానములో అహము విడువకుండును. అందుకే ఫలితము అనానుకూలము. ఒక్కటే యైయున్న అంతిమ సత్యసాక్షాత్కారమునకు ఒకేఒక్క విధానముండ వలెను. సుక్ష్మాతి సూక్ష్మమైన దానిని సాక్షాత్కరింప జేసికొనుటకు అంతే సూక్ష్మమైన
పద్ధతి నవలంభించుట అత్యావశ్యకము. నేను చెప్పినది సబబని తోస్తే
యిప్పుడు నీవు చేస్తున్న నీ పూజలను మూడు నెలల పాటు వదలి వేయుము. ఆ తర్వాత యే విధానము, దానికై అదే
చైతన్యవంతమై యున్నదో, హృదయమునకు మెదడుకు
ఆహ్లాదకరముగా నున్నదో దాని నొక్కదానినే అనుసరింపుము.
సులభమైన దానిని పొందుటకు సులువైన విధానమునే చేపట్టుము. మూఢనమ్మకము నీ కేమేలు చేయలేదు. దారి మొత్తము క్షుణ్ణముగా
ఎఱిగిన వాడై మూలమును కనుగొన్న మార్గదర్శకుని సహాయమున గడించిన ప్రత్యక్షానుభవమే
నీదారిని సిద్ధము జేయును.
సేవా త్యాగములనునవి ఆధ్యాత్మిక దేవాలయ నిర్మాణమునకు సహాయకారులు. ప్రేమ దానికాధార పీఠము. స్వార్థపరత్వము లేని యే
సేవయైనను మంచిదే, ఇక్కడ సేవ అన్న పదాన్ని నేను ఆరాధన అన్న అర్థములో
వాడితిని.
నిజమైన జీవితమున ప్రభువైన వానితో యేకత్వము సాధించుటనే రాజయోగము నేర్పుతుంది. నిజజీవితపు సుధను రుచి చూడాలని నీవు సంకల్పిస్తే, ఆ సంకల్పమును యే శక్తి కూడా అడ్డుకొనజాలదు. మాయకు దూరముగ నుండుమని మనము చెప్పుట లేదు. మనము ఆ మహాత్మునితో కలిసి యున్నామన్న యోచనను సాధనా పూర్వకముగా అలవడ జేసుకుంటే
చాలు, మన జీవిత సమస్య సులభంగా పరిష్కరింప బడుతుంది.
యోగ మార్గము నవలంభిస్తే కష్టాలు ఉపద్రవాలు కలుగుతాయని కొందరంటుంటారు. ఇది ప్రత్యక్షానుభవరీత్యా అంగీకార యోగ్యము కాదు. ఇది కేవలము అజ్ఞానము మరియు మానసిక దుర్భలుల దృక్పదము మాత్రమే. అదట్లుండ వ్యక్తి దీని కొఱకై మొత్తము జీవితము హెచ్చించినను తక్కువే. ఎందుకంటే దీనివల్ల అమితములైన కష్టములు, దుఃఖముల మయమైన వందలాది
జన్మల బాధ తప్పి పోవుచున్నది. కనుక నీ విచక్షణ నుపయోగించి ఒక
చక్కని విధానాన్నవలంభించు లేదా ప్రత్యక్షానుభవము గల మహాత్ములను విశ్వసింపుము.
ప్రకృతినధీనమునందుంచుకొనుటే యోగి ధ్యేయము. అయితే అది పూర్తిగా సాధించ వలెనన్న అతడు పూర్తిగా భగవంతునిలో లీనమై పోవలెను.
మానవునిలో నిండుగా నున్న యోచనాశక్తిని మొత్తాని కందరు మహనీయులు సద్వినియోగ
పరచు కొన్నారన్నది కొట్టవచ్చినట్లు కనబడుతున్న విషయము - రాజయోగమున
అధికారికసిద్ధాంత మంతయు యోచనాశక్తి నాధారము చేసుకొనియే యున్నది.
రాజయోగ విధానమున నీ శాస్త్రమును ఆత్మ లేక భగవత్సాక్షాత్కారమునకు సహాయముగా
గొప్ప ఋషులు మరియు సాధువులు గైకొనిరి. ఇదేమి క్రొత్త మతము కాదు. మనలో రాజై వ్యవహరిస్తున్నది, యోచనే. అదే వృద్ధియై మనల్ని గమ్యము వైపునకు నడిపిస్తుంది.
రాజయోగము ధ్యానముతో మొదలౌతుంది. తద్వారా వ్యక్తిగత మానసము అటూ
యిటూ పచార్లు చేసే దాని అలవాటును మానుకుంటుంది.
6. ప్రార్థన
ప్రార్థన భక్తికి సంకేతము. పవిత్రమైన దివ్యత్వములో మనకు
సంబంధ మేర్పడినదని, దీని మూలముననే మనకు తెలుస్తుంది. ఒక దివ్య మహాప్రభువు మనకున్నాడన్న భావన మనలో స్థిరపడగానే మన మొక దాసుని స్థానమున
నున్నమని అర్థమైపోతుంది. ఇక దాసునికి సంబంధించి సేవ మాత్రమే మిగిలి యున్నది. భరతుని ఉదాహరణ చూడుడు, అతని మనస్సు
యెప్పుడూ యెట్టి మాలిన్యమునకు గురి కానివ్వలేదు. అతని మనస్సంతా ప్రభువుపై అమిత గౌరవము, భక్తి, ఆరాధనతోనే నిండి యున్నది. ఈతని ఉదాహరణతో మనకు అసలైన భక్తి
భావమన నేమో తెలియ జెప్పబడింది. ఇదీ ప్రభువునకు దాసునకు గల సంబంధ
బాంధవ్యము.
ప్రార్థన యాచించడము. ధ్యానము యాచించిన దానిని పొందడము.
గర్వము, మొండితనము, అహంకారమనెడి
గొలుసునకు మరిన్ని వలయముల జత చేయును. శ్రద్ధతో కూడిన ప్రార్థన ద్వారా
భగవంతునితో నేరుగా సంబంధ మేర్పరచు కొనుము, అది ఈ
స్థూలాతిస్థూలమైన అహంకార దూర్తత్వము నుండి నిన్ను కాపాడు రక్షణగా పనిచేయును.
7. ఆధ్యాత్మికత
మితస్వభావము ఆధ్యాత్మికమునకు అత్యంతావశ్యక- మైనది.
ఆహారము శరీరారోగ్యము కొఱకే. కానీ ఆధ్యాత్మికత నిన్ను
సత్యతత్త్వమునకు గొంపోవును.
మతము జనసామాన్యము కొఱకేర్పడినది. ఆధ్యాత్మికత యెన్నుకొనబడిన యే
కొలది మంది కొఱకు మాత్రమే సుమా!
మనమెప్పుడూ పదార్తముయొక్క నిజతత్త్వాన్ని శోధించి బయటపెట్టే పని చేయాలి. ఇదే ఆధ్యాత్మికత సూచించు విషయము.
ఆధ్యాత్మికత బుద్ధిని సరిచేస్తుంది కాని మనిషిని పిచ్చివానిగాను, చెడ్డవానిగాను మార్చదు.
ఆధ్యాత్మిక మార్గము, ఉన్న యితర మార్గము
లన్నిటికంటే సులువైనది.
భగవంతుని పొందుటన్నదే, ఆధ్యాత్మికము యొక్క
ముఖ్యాంశము. మేధావులైన తత్త్వవేత్తలకు తత్త్వమును అధిగమించి వెళ్ళాలంటే ఇది ముఖ్యంగా అవసరం. మతపరమైన పరిష్కారముల కేమాత్ర మందని వాటితో సరిపుచ్చుకోవడం కంటే ఆధ్యాత్మిక
జ్ఆగృతి నాశ్రయింపుము. అది నేరుగా సత్యతత్త్వముతో సంబంధమేర్పరచును.
ఒక వ్యక్తిలో మిత స్వబావము యేవిధంగానైనా చెదిరి వుంటే, అతడు తానెంత మహోన్నత స్థితి నందుకొంటినని జెప్పినప్పటికి అతడసలు
ఆధ్యాత్మికతలోనికి అడుగిడినాడని కూడా చెప్పలేము.
దురభిమానము అత్యంత దుష్టమైనది. ఇంకా చెప్పాలంటే అది ఆధ్యాత్మిక
జీవనమునకు అత్యంత ప్రమాదకరమైన విషము.
దైవీయ ఆధ్యాత్మిక మార్గమున దుర్లభమన్నదే లేదు. కావలసిన దంతయు దృఢమైన యిచ్ఛ మరియు అభిన్నమైన జ్ఆగృతి మాత్రమే. అప్పుడు నీవన్వేషించు చున్నదంతయు నీకు అత్యంత సన్నిహితమై వుంటుంది. అది నీతోనే వుంటుంది. ఇంకా చెప్పాలంటే నీవు వెతుకుతున్నది యెవరినో కాదు, నిన్ను నీవే. దీని కవసరమైనది మండుతున్న హృదయము. అది దారిలోని కంప, కసువు నంతటిని కాల్చి వేయును. నీవు నిజమున కెట్లుందువో
అట్లుండవలెను. ఆతృతను వెన్నంటియున్న బాధే యిందుకు ఋజువు.
ఆధ్యాత్మికత నాధారము చేసుకొనక యే జాతిగానీ యే దేశము గాని మనుగడ సాగించ లేదు. ఇప్పుడో, అప్పుడో ప్రతి దేశము తన ఉనికిని కాపాడు కొనడం కోసం
ఆధ్యాత్మికత నాశ్రయించక తప్పదు.
జ్ఞానివై నిన్ను నీవు చెఱుపుకొనకుము. మతవాదివై దారులను
మూసువేసుకొనకుము. వాటికి దూరముకమ్ము, జీవిత
సమస్యాపరిష్కారమును కనుగొందువు - అదే ఆధ్యాత్మికత.
విశ్వాసము ఆత్మస్థైర్యముతో ఆధ్యాత్మిక రంగమున అడుగిడుము. అహంకారము, స్వార్థచింతన ప్రక్కకు నెట్టివైచి పద్ధతి
నవలంభించుటకు సంసిద్ధుడవు కమ్ము.
యే సాధనము నందైన, మానసిక వృత్తులను
సక్రమముగా సరిదిద్దుటే ప్రాధమికాంశము. మనస్సును క్రమబద్ధీకరించుటన్నది
ఆధ్యాత్మిక విధానపు మూల ప్రక్రియ.
యేకత్వమును భావించుట లేక శూన్యత్వమును సాధించుట అనునది సత్యసాక్షాత్కారమని
చెప్పుట శుద్ధ తప్పు. కేంద్ర మండలం చేరుటకు ముందె సత్యతత్త్వము ప్రముఖస్థాయిలో వుంటుంది. పదార్తము అంతమైన తర్వాత మిగిలివున్న దానినే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు సత్యమని
పిలుస్తారు. కానీ పదార్తము లేక స్థూలత్వము అంతమైన తర్వాత సరియైన కదలిక లేక చైతన్యము
మొదలౌతుంది. దీన్నధిగమించి ముందుకు పోతే యెక్కడ నుండి ఈ పదార్తము మరియు చైతన్యము
ఉద్భవించిందో ఆస్థానం వస్తుంది. దీని తర్వాత మనం చైతన్య రహితం
మరియు శూన్యస్థితికి చేరుకుంటాము. సత్యమనునది శూన్యస్థి
నాశ్రయించిన తర్వాత గలుగు వాస్తవ స్థితి.
మనవద్ద చాలా ఆహారమున్నది. ఆధ్యాత్మికపు వైపున కవసరమగు
ఆధ్యాత్మికాహారము నేల వృధా చేసుకొన రాదు?
సూక్ష్మమానసులకు మహత్తరమైన విషయ మర్థమౌతుంది. జడమానసులకు స్థూలత్వపు భావనే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ప్రాపంచిక వస్తు లాభమునకై గురువు ప్రార్థిస్తే, ఆయన హృదయము ఆధ్యాత్మిక విషయములకు సహకరించదు. యేదియేమైనా ఆయన యిచ్ఛకు అపజయం లేదు.
ఆధ్యాత్మికత తూర్పు నుండి పడమటకు ప్రవహిస్తున్నది. నేనది పడమటి నుండి తూర్పుకు కూడా ప్రవహించాలను కుంటాను. శ్రీ పోరే గారు సాధుపుంగవుడు. ఆయన అత్యంత మహోన్నత స్థితి
నందుకొన్న అయిదారు మందిలో ఒకరు. ఆయన అంతటా యేకత్వాన్ని
దర్శిస్తున్నారు. శ్రీ పోరే మహాశయుడు ట్రిచి (తిరుచురాపల్లి) లో మాట్లాడుతూ "నేను దీని
కొఱకై ఫ్రాన్సుదేశము నుండి యిక్కడికింత దూరము వచ్చితిని" అనెను. ఈయన గురువుగారి యిచ్ఛను ఆజ్ఞాగా తలఁచి అమలు జరుపును.
పసిబిడ్డకు ఆటబొమ్మలు, క్రీడాకారునకు
శారీరక వ్యాయామము, పాఠకునకు పుస్తకపఠనము, అదేవిధంగా ఆరాధకునకు పూజ, భక్తునకు భక్తి, జ్ఞానికి తెలివి, సిద్ధునకు
అధ్భుతాలు, సన్యాసికి యేకాంతము, యెవరికి తగినవి వారికి ఆనంద దాయక సాధనములు. ఇవన్నీ కేవలం ఆనందానికే గాని సత్యతత్త్వమునకు వీటికి అసలు సంబంధమే లేదు. ఇవి కేవలం మానసికోత్సాహము (విశ్రాంతి, ప్రశాంతత) కొఱకే
గ్రహించి అనుసరిస్తారు.
ఆధ్యాత్మికత అత్యంత సున్నితమైనది. దీనితో యేది పోల్చినా అది
బరువైనదిగాను, స్థూలమైనదిగాను కనిపిస్తుంది. కమ్మని సువాసన వెదజల్లే ఒక సున్నిత గులాబీ పరిమళము సైతము దీనితో పోలిస్తే చాలా
బరువుగానే వుంటుంది.
మహోన్నతమైన దాని నందుకొను ఆవశ్యకమేమి?
పరిపూర్ణస్థితిని సాధించి అనంతముతో తనకైతాను సంబంధ మేర్పరచుకొన్న వానితో, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే సర్వజ్ఞుడైన వానితో అభ్యాసము ద్వారా తగినంత సాన్నిహిత్య
మేర్పరచుకొని తద్వారా తన హృదయస్పందన, మూలమందు
వినబడునట్లు చేసుకొనవలెను. ఆ విధంగా సంబంధ
మేర్పరచుకొన్నావంటే దానర్థం ఆ మహాత్ముడు నిన్ను తన హృదయమునకు హత్తుకొన్నట్లే. ఈ విషయమై నీవు లోలోతులకు వెళుతున్నావంటే, నీవు పరిపూర్ణత వైపు
పురోగమిస్తున్నావని దానర్థం. శరణాగతి దీన్నే
తెలియజేస్తున్నది. ఆ శరణాగతే పరిపూర్ణతను సాధ్యపరచు ఒకే ఒక నిశ్చయ మార్గము. ఎఱుకలోనున్న అహంకారము నుండి స్వేచ్ఛ పొందుటే శరణాగతి. ప్రతి ఒక్కటి దానికై అదే స్వతఃసిద్ధంగా సందర్భానుసారంగా యే విధమైన ముందు వెనుక
యోచన లేకుండానే ఆ దశలో జరిగిపోతూ వుంటుంది.
అన్వేషించేవానికి ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి. నిశ్శబ్దమైన మానసము సత్యతత్త్వమూలమును చేరుతుంది.
హాయిని కోరి జనులు భగవంతుని దరికెళతారు. అదే వచ్చిన చిక్కు.
జనులు భగవంతుని తప్ప మిగతాదంతా తెలుసుకొంటారు. ఇది యేమీ తెలియని దానిక్రిందికే లెక్క.
మతము కేవలం నిన్ను ఆధ్యాత్మికతకు సిద్ధపరుస్తుంది. సిద్ధపరచడముతో యిక మతం పని తీరిపోయింది.
ప్రభువుకు సన్నిహితంగా వుండే వారు, చాలా సంపాదించుకొంటున్నామని
అనుకుంటూ ఆదమరచి అతి తక్కువ పొందుతారు. దూరంగా వున్నవారు ఆతృతతో, ఆయనకై తపన చెందుతూ మరీమరీ తలచుకుంటూ మానసికంగా ప్రభువు నెప్పుడూ
అంటిపెట్టుకొనే వుంటారు. అందువల్ల వారు అధికాధికంగా పొందుతారు.
మనం యితరులను పట్టుకొని మన విషయంలో నిర్లక్ష్యంగా ఉండిపోతాము. మనస్సుకు శాంతి సమకుర్చడమే ఒక ఉత్తమ సాంఘిక సేవ. జనబాహుళ్యపు సమస్యే వ్యక్తి సమస్య. భగవంతుడు జనం సమస్యను
జూచుకుంటాడు. మనిషి వ్యక్తిగత సమస్యలను జూచుకుంటాడు.
భగవంతుని గూర్చి తెలుసుకోవడంతో సరిపోదు. కాని ఆధ్యాత్మికశాస్త్ర రీత్యా
సాధించడమంటే నిజానికి భగవంతుని పొందడడమే.
మాంసాహారము ఆధ్యాత్మికతకు యేమాత్రము మేలు చేయదు.
1. ఒక వ్యక్తి జీవితాంతం శ్రమపడి, యే విధమైన అనుభవం
పొందలేక పోయాడు. ఆధ్యాత్మికత పొందలేదు. అది మీకెలా తెలుస్తుంది.? (ప్రశ్న అర్థం కాలేదు)
నేను ఈ విషయం మాట్లాడకముందే నీవది గ్రహించి వుంటావు. మన విధానంలో మనం ఈ స్థానం (హృదయస్థానం) నుండి ప్రారంభిస్తాము. మొదలు పెట్టినప్పటి నుండి తుది వరకు మన మా హృదయస్థానం మీదనే ధ్యానిస్తాము. అయినా కదలిక వుంటుంది. మనం ఆ స్థానాన్ని (త్రికుటి)
కూడా గణనలోనికి తీసుకుంటాం. అన్ని బిందువులు, కేంద్రాలు కూడా మనం పరిగణనలోనికి తీసుకొంటాం. మన యాత్ర ప్రారంభమైంది. అందుకు గురుతు, పురోగమన లక్షణమేమిటి? నీవు యెల్లెడల చీకటిని చూస్తావు. నీవు సూర్యుణ్ణి చూచినా అక్కడ
కూడా చీకటే, చీకటి కనిపిస్తుంది. ఇలా జరిగిందంటే, నీవు సక్రమంగా వెళుతున్నట్లే లెక్క. అదే సరైనది. నీవు వెనుక చీకటిని చూస్తావు. అది చీకటే అయివుంది. అది జ్ఆగృత స్థితికి వచ్చిందంటే అదే అజపము.
2. జ్ఆగృతి ప్రారంభమైతే యేమౌతుంది?
అజపం మొదలౌతుంది. అది నీయందున్న శక్తినంతటిని కూడాదీసుకొని నినదించు ఓంకారము. అది మంచిదే. శిష్యుడు దాన్ని పలకడం మానేస్తే ఆస్థానం నుండి గురువు తన బాధ్యతగా అందుకొని
కొనసాగిస్తాడు. ఆటంకమేదైనా కలిగితే దాన్ని గురువే తప్పక తొలగిస్తాడు. నేను యెక్కువగా చదువుకోలేదు, కనుక ఈ జ్ఞానమంతా
భగవంతుడే నాకిచ్చాడు. నేనిప్పుడు పూర్తిగా అహంకార రహితుడను. ఎందుచేత? నాకాయన అనుగ్రహించిందే మీ ముందుంచుతున్నాను. దైవసిద్ధంతమే వచించుచున్నది. ఉన్నదంతా ఇదే.
3. పురోగమిస్తున్నామనుటకు గుర్తేమి?
నీవు శాంతిననుభవిస్తున్నావంటే, నీ మానసిక వృత్తులు
చక్కబడిన వనుకోవచ్చును. నీవు హృదయంలో తేలికదనాన్నభవిస్తావు. కానీ అన్ని సందర్భాలలో అలా
కాదు. కొందరి విషయంలో అంటే ఇద్దరి, ముగ్గరి విషయంలో
ఆరాటం కలగవచ్చు. పాపం జనులు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోతారు. అసంతృప్తికి లోనౌతారు. అది యెలాగంటే నీవు
పెరుగుతున్నావు. కానీ నీవు పెరుగుతున్నట్లు నీకు తెలియదు, అయినా నీవు పెరుగుతావు. అదీ పరిస్థితి.
4. నాకున్న ఆధ్యాత్మిక సర్వస్వము నేను నా గురువు నుండి పొందినదే. దానిని నేను గుర్వాజ్ఞమేరకు పంచిపెడుతున్నాను. నాదంటూ యేమీలేదు. నేను నా వెంట యేమి తీసుకొని వెళ్ళదలచుకోలేదు. నేను విసిగిపోయాను.
5. నేను దీన్ని (ఆధ్యాత్మికతను) చౌకగా పొందాను, అట్లే చౌకగా పంచి పెడతాను.
6. గీత ఒక గొప్ప గ్రంథము. కానీ అందులో మహోన్నతమైనవి
యివ్వబడలేదు. అందులో ఉన్నదంతయు మంచిదే. సత్యతత్త్వమును గురించి యే
అధ్యాయము- నందును చర్చింపబడలేదు.
8. అభ్యాసి
అభ్యాసికుండవలసిన కనీస అర్హత, తన సాధనను క్రమం
తప్పకుండా అనుసరించుట. కానిపక్షమున ప్రగతి వుండదు. ధ్యానమునందు శ్రద్ధ అవసరము. మనం ఒకే ఒక సిద్ధాంతమునకే కట్టుబడి వుండవలెను. మనము సూక్ష్మాతిసూక్ష్మముతో అనుసంధింప బడుదుము.
నిజమైన అభ్యాసికి సంబంధించిన యే ఆలోచనైనా అది గురువర్యులకు సంబంధించిన దానితో
సమానమే. భగవదిచ్ఛకు వ్యతిరిక్తమైన దాని వైపునకాతడు తిరుగనే తిరుగడు. గురుని ఆజ్ఞ వైపునకే ఆతని మనస్సెప్పుడూ మళ్ళింపబడి వుంటుంది.
నేను అభ్యాసిని నావానిగా భావిస్తాను; అయితే అతడు సాధన
క్రమంగా చేస్తూ నేనన్నది గుర్తుంచుకోవాలి. అభివృద్ధికిది కనీసావసరము.
నేను అభ్యాసుల నుండి సహకారాన్ని మాత్రమే ఆశిస్తున్నాను.
ప్రతి ఒక్కరు, తమ అహంభావాన్ని శూన్యం జేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఎటువంటి ఆలోచనగానీ, చింతగానీ, ఆతృతగానీ అభ్యాసిలో ఉత్పన్నమైతే అది గురువులో ప్రతిఫలించి విశ్రాంతిని
భంగపరుస్తుంది, తద్వారా అభ్యాసి ప్రాణాహుతిని ఆహ్వానిస్తున్నాడు.
ఏదో కొద్దిసేపు మాత్రం ధ్యానం చేయడం వల్ల సుదీర్ఘకాలంలో అది అట్టే ప్రయోజనకారి
కాదు. ధ్యానకాలాన్ని శ్రద్ధ మరియు అర్పణ భావాని కణుగుణంగా ప్రగతి మార్గంలో
పెంచుకొంటూ పోవాలి. జపము, భజన, ఆచారాలు ధ్యానంతో
కలగలపడం ద్వారా ధ్యాన ప్రయోజనాన్ని తగ్గించేస్తాయి.
అభ్యాసి తనలో తీవ్రమైన ప్రేమ మరియు భక్తిని రేకెత్తింపజేసుకొని, తద్వారా గురువర్యులలో కదలిక గలిగించి తనకు కృపననుగ్రహించేట్లు చేసుకోవాలి.
బాధ్యతానిర్వహణ ప్రశిక్షకుని కర్తవ్యము. తదనుగుణముగా మారుట అభ్యాసి
విధి.
ధనుర్ధారి తన లక్ష్యముపై గురి పెట్టని యెడల దానిని ఛేదించలేడు. ధనుర్ధారి వలెనే అభ్యాసి కూడా తన గురి నెప్పుడూ ధ్యేయముపై నుంచి తీరవలెను.
అభ్యాసి నుండి నిజమైన సహకారముండి తీరవలెను. అప్పుడే గురువు అతనిని మున్ముందుకు గొంపోవును. అందుకే అభ్యాసి తీవ్రతరమైన భక్తి విశ్వాసములను పెంపొందించుకొన వలెను.
ప్రాణాహుతి ప్రసారము ద్వారా వ్యక్తి అంతరాత్మను సత్యతత్త్వమునకు మార్పు చేయుట
వల్ల నీచాతినీచుడు సైతం ఉత్తముడుగా పరిణతి చెందగలడు.
చిత్రాతి చిత్రమేమంటే భగవంతుని నుండి మనం సర్వం ఆశిస్తాం. కానీ వాటిని పొందే అర్హతే మనకుండదు.
వార్తనుపంపు తంతి (టెలీగ్రఫీ) సిద్ధాంతమును గూర్చి అందరికీ తెలుసు. ఒక కొస విద్యుత్తుకు అనుసంధిస్తూనే రెండవకొసకు వార్త చెరిపోతుంది. భక్తుని పరిస్థితి యిలానే వుంటుంది. అతడు తన భక్తి సత్తా (శక్తి)
విద్యుత్తు ద్వారా తనను తాను గురువుకు తెలిసేట్లు జేసుకొంటాడు.
9. దృఢ నిశ్చయము, సమర్పణ మరియు భక్తి
ఆశించిన వస్తువును పొందటానికి దృఢమైన యిచ్ఛ, నిరంతర ఆరాటం మరియు అవిశ్రాంతి కలిగి వుంటే విజయం సులభంగా లభిస్తుంది.
సత్యతత్త్వమును తప్పక సాధించాలంటే మన శక్తివంతమైన యిచ్ఛను ఒక్కసారి ప్రయోగిస్తే
చాలు, సరిపోతుంది.
భగవంతునకై తపన అత్యంతావశ్యకం. అది లేక ప్రగతే వుండదు.
పడవ నేరుగా గమ్యస్థానం చేరాలంటే దానికొక సహాయం తప్పనిసరి. మానవ శరీరమే పడవగా భావిస్తే అది ప్రయాణిస్తున్నది ఆధ్యాత్మిక సాగరంలోనైతే అది
విజయవంతంగా విశాల సాగరములో పయనించాలంటే దానికొక చుక్కాని నమర్చటం తప్పనిసరి. ఆధ్యాత్మికరంగంలో చుక్కాని మన దృఢనిశ్చయమే. అదే గమ్యం వైపుకు మనల్ని నడిపించి సహాయపడుతుంది. కొన్నిచోట్ల తప్పక సుడిగుండాలుంటాయి, అయితే మన
యిచ్ఛాశక్తి మరియు ఆత్మస్థైర్యము వీటినన్నింటిని అధిగమింప జేయుటకు సహాయ పడతాయి. ఆ పూర్ణత్వం అదే మన గమ్యంతో నేరుగా సంబంధ మేర్పరుచుకొని చక్కగా ముందుకు సాగడం
మన కర్తవ్యం. గమ్యమంటే అదే, మహోన్నతమైనది. అది యేదో కాదు అది అదే.
నీ మనస్సును సంసిద్ధము చేసికొనుటకు ధైర్యముగ నుండుము. బలమైన యిచ్ఛాశక్తితో అడుగు ముందుకేయుము, నీ విజయము తథ్యము. నీ యిఛ్ఛాశక్తిని సమాయత్తపరచినంతనే దాని చర్య సహజ సిద్ధంగానే ప్రారంభమగును.
మనల్ని మనం దివాలా తీసిన వారుగా తలంచుకొని నిరంతరంగా ఆయన ఆరాధనలో మునిగి
తీరుబడిలేని వారమై యెటువంటి ఆటంకములను పట్టించుకొనక భక్తితో కాలము గడపవలెను.
దైవీయ కృప విషయమై యెప్పుడూ నిరాశ చెందరాదు.
తెలివైన మనిషే మూర్ఖుడు. అతడనేక దారులేర్పరచుకొని
నష్టపోతాడు. మూర్ఖునకన్ని దారులుండవు.
బాహ్య బోధనలు, స్తుతులు, హృదయాంతర్గత
చైతన్యమును జ్ఆగృత పరచలేవు. ఇవి యింద్రియ సంబంధమైన ప్రాపంచిక
వాంఛా సంతృప్తి వరకే పనికి వచ్చును. ఈ వాంఛలకు వాస్తవంగా అంతేలేదు. ఇంద్రియ సంబంధమైన ఒక వాంఛ తీరినంతనే దాని స్థానమున తత్సంబంధమైన దింకొకటి
వెంటనే ఉత్పన్నమగును. ఈ పద్ధతుల వల్ల కోరికలు, వాంఛల వల నుండి
మనము తప్పించుకొను దారే లేదు. అందువల్ల యేవిధమైన
ప్రత్యక్షానుభవపూర్వకమైన ప్రయోజనము వీటి వల్ల సమకూరదు.
సమయమాసన్నమైనపుడు తప్పక అందరూ ఆత్మ స్వేచ్ఛ కొరకు సమస్త వస్తువులను, భావనలను ప్రక్కకు నెట్టి మొత్తముగా తమ్ముతాము జ్ఆగృత పరచుకొందురు. మన ముందున్న సమస్య యిప్పుడున్న ఈ జీవితమునకు పరిష్కారము కనుగొనుట మాత్రమే
కాదు. ఇంకా మున్ముందు రాబోవు యెన్నో జన్మల జీవితముల కన్నిటికి పరిష్కారము కనుగొనుట. ఆత్మార్పణ భావముతో ఉన్న సమయాన్ని వీలైనంత వరకు సద్వినియోగ పరచుకొని నిన్ను
నీవు గురువున కర్పించుకొనుము. గురువు నీకు తెలియకుండానే నీకై
యెంతో చేస్తారు. నీ ఆధ్యాత్మికోన్నతి కొఱకు కావలసిన ఉత్తేజాన్ని నీలో ఆయనే రేకెత్తిస్తాడు. అయితే నీవైపునుండి కూడా తగినంత స్పందన వుండాలి. ఆయన నిన్ను మున్ముందుకు త్రోసుకెళ్ళక తప్పదన్నట్లు, ఆయనలో ఒక తీవ్రమైన భావన నీ యెడల కలుగునట్లు నీవాయనను కదిలించ వలెను. ఈ వ్యవహారములో అదీ నీ పాత్ర. అందుకొఱకు నీవు తీవ్రమైన ప్రేమ
మరియు భక్తిని వృద్ధి చేసుకొన వలెను.
ఆయనను దోచుకోవడమెలా? ఒక భక్తుడే
దీన్నర్థం చేసుకో గలడు.
ప్రేమ మరియు విధేయత ఒకదానిపై ఒకటి ఆధారపడి యున్నది.
బాధాతప్తమైన హృదయముతో నిజమైన సాధకుడు పెట్టిన కేక ప్రభువును అతని వాకిటి కడకు
దెచ్చి నిలుపును. తన్నుతాను సమర్థునిగ మలచుకొనవలెనన్న తన ధ్యేయము మరియు ప్రస్తుత పరిస్థితిని
స్పష్టముగా తన దృక్పదమున నుంచుకొన వలెను.
ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక జీవనములు రెండూ సమాన తేజస్వంతములై ప్రక్కప్రక్కనే
సాగవలెను. నీవు విజయము పొందవలెనన్న రెండు రెక్కలు చాచి ఎగురవలెను. నాకు సాహసవంతులైన వీరుల వంటివారు కావలెను. వారు విజయ పథకముతో తిరిగి రాజూతురు. ఇందుకు ధైర్యము కావలెను. ధైర్యవంతులే ఈ శాస్త్రము నెఱుగుటలో ఉత్తీర్ణులగుదురు. ఇది కూడా మానవ జీవితమున ఒక ముఖ్యాంశమే.
ఆధ్యాత్మికమున నిజమైన అర్హత గలవారికే వాటా లభించును. అందుకే నేను ఉత్సాహపరుస్తూ మరీ మరీ వ్రాసి దీనిని పొందుటకు అర్హత పొందుడని
నొక్కి వక్కాణింతును. అందులకు కావలసిన ముఖ్యాంశములు రెండు, అవి ప్రేమ మరియు
విధేయత. ఈ రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడి యున్నవి.
భగవంతుని ప్రేమించుటకు చాలా విధానములున్నవి. అనేక భావనలు కూడా అనుసరింపబడుచున్నవి. ఉదాహరనకు పితృభావము, సఖ్యభావము మొదలైనవి. నా దృక్పదములో ప్రేయసి కంటే మిన్నయైన బంధుత్వ భావన మరొకటి లేదు. ఈ విధమైన అనురాగ భావముతో పురోగమించుము. కాలగమనంలో పరిస్థితి మారి భగవంతుడు
ప్రియుడై మనం ప్రేయసులమై పోతాము.
నిజమైన భక్తి భౌతిక మరియు ప్రాపంచిక వస్తువులపై కోరికలకు భిన్నమైనది. అది తీవ్రమైన ఆకాంక్షతో చైతన్యవంతమౌతుంది. ఈ ఆకాంక్ష సంతృప్తమైతే యిక దాని స్థానములో మరే యితర ఆకాంక్ష జనించదు. అదే అన్ని ఆకాంక్షలకు అంతము. వాస్తవార్థంలో యిది మన
స్వస్థానము (జన్మస్థానము) యొక్క స్మృతి. అదే మన ప్రయాణము యొక్క ఆఖరు
మజిలీ. దీనితో కలిగిన అనుబంధమునే నిరంతరస్మరణగా భావించ వచ్చును. వాస్తవార్థంలో భక్తి అంటే యిది.
సత్యతత్త్వములోనికి కనీసం తొంగిచూడాలనుకొనే వారికి నా దృక్పదంలో సరైన విధానంగా
భావించి సూచించేదేమంటే, ఆ విధానంతో మన
హృదయాంతరాళాన్ని సృజించ గలగాలి. సామాన్యంగా పాటింపబడుతున్న
బాహ్యవిధానములీప్రయోజనమునకు యే విధంగాను పనికిరావు. అవి గమ్యము వైపునకు మనలను మరలింపజ్ఆలవు.
సంతోషము, నెమ్మది, శాంతి వంటి వాటిని
సాధించుట యితరులకు ఆనందదాయకములు కాని మనకు కరిగి, కలిసిపోవుట మరియు బాధాతప్తమైన ప్రేమ భావనయే విమోచనమునకు మార్గము.
దృఢనిశ్చయము, తిరుగులేని ధైర్యమనునవే మగధీరున కుండవలసిన అతి
ముఖ్యలక్షణములు. అవే అంతిమ విజయమున కావశ్యకములు.
ఒక వ్యక్తి మహోన్నత మహనీయునితో నిజంగా సంబంధ మెర్పరచుకొంటే, అతని భక్త్యాగ్నితో దారిలోని ముళ్ళతీగెలు, కంపలు మొత్తం ధగ్ధమై పోతాయి.
10. ధ్యానము
ధ్యానము చేయునప్పుడు నీ గురువే తన రూపముపై ధ్యానము చేయుచున్నాడని తలంచుము. ఈ పద్ధతిని ఒక అలవాటుగా మార్చుకుంటే కాలాంతరమున నీపై అది యెట్టి ప్రభావమును
చూపునో గమనింపుము. నీవు మరిన్ని సంస్కారములు కూడుటను నిలువరింపజేతువు. కనుక భవిష్యత్తులో అనుభవించాల్సిన పనిలేకుండా సంస్కారములు వృద్ధిఁజెందుటన్నది
తప్పిపోవును. ఇదే మోక్షమునకు మార్గము. కానీ మన ధ్యేయము యింత మాత్రమే
కాదు. యింకాపైనున్నది. మనల్ని మనం అనంతముగా సాగుచున్న మరుజన్మ వలయముల నుండి స్వేచ్ఛను బొందునట్లు
చేసుకొన వలెను. ఈ పద్ధతి కడకు శూన్యత్వమునకు దారితీయును. ఇది చేసి ఫలితము ననుభవింపుము. ఇది త్వరితగతిని సిద్ధించును. ధ్యానము యాంత్రికముగా చేయదగదు. సత్యతత్త్వము యెడ జ్ఆగృతే
ధ్యానము. ధ్యానము యెడ సంపూర్ణ మెలకువ కలిగి యుండవలెను. మెలకువ గల్గిన జ్ఆగృతి కలిగి యుండవలెను, నిశ్చేష్టుడై
గైకొనుట కాదు. ధ్యానంలో కేంద్ర నాడీ మండల నాడులకు మరింత ఉత్తేజము కలిగింతుము. యాంత్రికముగా గాక, మరికొంత మెలకువతో
యిచ్ఛను ప్రయోగించి గ్రహింపు గలిగి ప్రవర్తిస్తే ధ్యానము యొక్క చర్యలు మనకు
తెలియవచ్చును. చురుకైన శుద్ధీకరణ, ప్రవర్తక నాడుల
(మోటార్ నర్వ్) లో మరి యితర నాడులలోను జరుగుతున్నట్లు కనుగొన వచ్చును. మరియు దివ్యశక్తిధార కూడా వాటిలో ప్రవహిస్తున్నట్లు తెలియును. అనుతంత్ర (సింపతిటిక్) నాడులను హృదయము నియంత్రించును. ధ్యానమున ఒక జ్ఆగృత ప్రయత్నమవసరము.
‘నేనెవరు’ అన్నదానిపై కొందరు బోధకులు చెప్పుచున్నట్లు ధ్యానం
చేయడం తప్పు. ఎందుకంటే ఈ విధానములో ‘నేను’ స్థిరంగా ఉండిపోతుంది. ఈ పద్ధతి నేరుగా అహం (నేను) పై ధ్యానానికి దారితీసి అహం బలపడి పోతుంది.
ఆధ్యాత్మికతకు పునాది ధ్యానము.
నీ నిజమైన ధ్యేయమును ముందుంచుకొని ధ్యానం చేస్తే, నీవు ఖచ్చితంగా నీ గమ్యం చేరగలవు.
ప్రతిచర్య సంస్కారాన్ని కలిగిస్తుంది. ధ్యానం కూడా ఒక చర్యే కనుక
ధ్యానం కూడా ఒక సంస్కారాన్ని గలిగిస్తుంది కదా? కానీ అది కలిగించేది భక్తి సంస్కారము. మనం దేన్నయితే ఆశిస్తున్నామో
అదే దాని అనుభవము (భోగ్).
మన స్వగృహాన్ని మనం జ్ఞాపకముంచుకొంటాం. అదే స్వంతగడ్డపై అభిమానం. మన స్వస్థలాన్ని గూర్చిన జ్ఞాపకమే వాస్తవమైన పూజ (ధ్యానము).
గాయత్రిపై ధ్యానం చేయవచ్చు అది మంచిదే. ధ్యానము భగవత్భావనను
మినహాయించి చేస్తే అది అద్భుత ఆకర్షక శక్తుల నుత్పాదిస్తుంది. కానీ సూక్ష్మతను కాదు.
అంతఃశుద్ధీకరణ సంస్కారాలను బయటికి తోసేస్తుంది. ధ్యానంలో హృదయం మన దృష్టి నుండి యెప్పుడు తొలగిపోతుందో, అప్పుడిక అక్కడ మిగిలిందేముందో దాన్నిమనం యెఱుకగా గ్రహించాలి.
నీవు నిజంగా విజయాన్నే కాంక్షితూ వుంటే, ధ్యానం మీద శ్రద్ధ
నుత్పన్నం చేసుకో. శ్రద్ధ కలగడం సాధ్యపడకపోతే కృత్రిమశ్రద్ధనైనా చూపు. అదే వాస్తవమైన శ్రద్ధగా మారిపోతుంది.
ధ్యానంలో అనుభవాలు కలుగుతాయి గానీ వాటిని వ్యక్తపరచటానికి మాటలు దొరకవు.
ధ్యానము తెల్లవారుఝామున 2 గం|| నుండి 4 గం|| లోపల చేసుకోవడం చాలా ప్రయోజనకరం.
ధ్యానము యాంత్రికమైపోరాదు. మెలకువలో యెఱుక గలిగి ధ్యానం
చేయడం అవసరం.
మన ధ్యానము క్రమబద్ధము కాని మనస్సు చేష్టల వల్ల తరచు అలజడికి గురియౌతున్నదని, అందువల్ల తగని ఆలోచనలన్నీ కలుగుతూ పురోగతి లోపించినదనీ చింతిస్తూ
హృదయనిర్వేదమునకు యెన్నడూ గురికావద్దు. భక్తి విశ్వాసములతో ధ్యానము
సరిగ్గా చేయడము ద్వారా యిట్టి స్థితి నుండి సులభముగా స్వస్థత చేకూర్చవచ్చును.
ఆలోచన ఆత్మను తాకగానే ఒక కాంతి రగులుతుంది. అది ప్రకాశరహిత కాంతి. అనేక మంది విషయంలో అదే అతి
సున్నితమైన ధ్యాన వస్తువు.
30 నిముషములకంటే తక్కువగా ధ్యానం చేయడంవల్ల ప్రయోజనం లేదు. శ్రద్ధ గనబరచి నీ సాధనను అరగంట నుండి గంటకు పెంచుకొనుము. నీవు గమ్యము చేరాలనుకుంటే ఈ మార్గాన్ని శ్రద్ధతో పాటించు. ఈ విధానంలో భజన, మంత్రాలు యింకా యితరాలేవీ కలపవద్దు. నీకు వాటితో యెక్కువ ప్రయోజన ముందనిపిస్తే అవే చేసుకో.
ప్రశ్న: బాబూజీ! ఒక వేళ మలినపు ఆలోచనలొస్తే యేం చేయాలి?
నీవు వాటిని ఖాతరు చేయొద్దు. నీవు ప్రక్కకు జరిగావని తెలియగానే
తిరిగి అసలు ఆలోచన, అదే జీవితగమ్యం వైపు మనస్సు మరల్చాలి. అభ్యాసికి అసలు ఆలోచనలే రావడం లేదంటే అతడు తప్పక గురువు గారికి ఉత్తరంద్వారా
తెలియజేయాలి. ఆలోచనలు తప్పక వచ్చితీరాలి, అవి రావాల్సిందే.
ధ్యానం సక్రమంగా చేస్తూపోతే క్రమంగా ఆలోచనలు తగ్గుతాయి. నేను 22 సంవత్సరాలు ఆలోచనల వల్ల బాధపడ్డాను. దైవీయ ఆలోచనలు రావచ్చును. ఆలోచనే రాకూడదనుట తప్పు. నాకూ ఆలోచనలొస్తాయి. కానీ అవి నన్ను కలవరపెట్టవు. నేను అభ్యాసికి ప్రాణాహుతి
నిస్తున్నప్పుడు నాకు అభ్యాసిలోని చెడు ఆలోచనలు వస్తాయి. అవి కొన్ని సమయాలలో నన్ను యిబ్బంది పెడతాయి కూడా. కాని ఆ చెడు ఆలోచనలు కేవలం ఓక్షణం మాత్రమే నన్ను వేదిస్తాయి. అద్దంలో చూసినంత స్పష్టంగా అభ్యాసి యొక్క మంచి లేక చెడ్డ యోచనలను గమనించ
గల్గుదును.
సాధుమహాత్ములు ‘నిన్ను నీవు తెలుసుకో’ అంటారు. కానీ నేను ‘నిన్ను నీవు మరచిపో’ అని చెప్పడానికే యిష్టపడతాను.
హృదయంలో స్పందనలు వినిపించు స్థానముపై ధ్యానం చేయవలసినదిగా నేను సలహానిస్తాను.
నేను ‘హృదయము’ అనే పదాన్నే వాడుతాను. కారణం అది జీవకేంద్రం. అంతేగాకుండా యెక్కడికి మళ్ళించవలెనో అక్కడికి చేర్చగల్గు చైతన్య స్పందనల నది
ఉత్పాదించును. ఇది మనస్సు యొక్క కార్యస్థానము, మరియు విచక్షణాజ్ఞానమును
పెంపొందిచు సాధనము కూడా యిదే. ఒక సూక్ష్మశక్తి ఈ స్థానమున
పనిచేసి దైవీయ శక్తి దిగివచ్చుటకు సహాయపడును. యేదో విధంగా మన ఆలోచన దానితో కలిసిపోతే లేక ఆ విధంగా కలిసేట్లు మనం
శిక్షణనిస్తే తద్వారా అది ఉత్తమమైన దానిని (సరైన దానిని) లోనికి చొప్పించి
సత్యతత్త్వం వైపుకు మళ్ళిస్తుంది. ఆ విధంగా సమస్య
పరిష్కారమౌతుంది.
తగని యోచనలు వస్తే వాటిని మొదట నా గురువర్యునివిగా భావిస్తాను. అవి నిలిచిపోతాయి. అటువంటి తగని యోచనలు మా గురువు చేయరని నాకు తెలుసు.
ధ్యానమొక విధానము. భగవదీయ విషయమై మాటిమాటికి చింతన చేయుటే అది. అందువల్ల యెడతెగని ఆలోచనానుబంధము కొనసాగుతుంది. ఇది సున్నితముగా మనస్సును దైవీయ యోచనవైపునకు మళ్ళించు ఉద్దేశ్యము గలిగి
యుండును.
అభ్యాసపు తొలిదినములలో ధ్యానమునకు కూర్చొన్నప్పుడు ఆలోచనలు
త్రోసుకవస్తున్నట్లు గమనింతురు. ఇది కొంత కలవర
పెట్టినట్లనిపిస్తుంది కానీ వాస్తవానికలా కాదు. ఈ అనంత ఆలోచనా స్రవంతి కేవలం ధ్యాన కాలానికే పరిమితం కాదు. అది ప్రతిక్షణం సాగుచున్నదే. ధ్యాన సమయంలోనే అవి
యెక్కువనిపించడానికి కారణం, ఆ సమయంలో మనం
ఆలోచనలను, ఊహలను ఖాళీ చేసేయాలనుకుంటాం. అలా మనం ఆలోచనా రహిత శూన్యస్థితిని మన యెఱుకగల మనస్సులో ఉత్పన్నం చేస్తాం. అది శూన్యంలోనికి గాలి చొచ్చుకవచ్చినట్లు, ఈ ఆలోచనల శూన్యంలోనికి ఆలోచనలూ జొరబడతాయి. ఎఱుకకు సంబంధించిన అంతరాంతరాళాల్లో నిల్వ వున్న పెద్ద ఆలోచనా భాండాగారం నుండి
శక్తివంతంగా చొచ్చుకొని వచ్చి బాహ్య యెఱుకకు ఈ నిక్షిప్త ఆలోచనలు వచ్చిచేరుతాయి. మనస్సు క్రమబద్ధం కాలేదు గనుక వాటి తాకిడికి కలవరపడి పోతుంది. నిజానికి ఆ ఉత్పన్నమౌతున్న ఆలోచనలు అభ్యాసిని కలవర పెట్టడం లేదు గాని అభ్యాసి
వాటి గురించి యెక్కువగా పట్టించుకొనడం వల్లనే ఈ యిబ్బంది కలుగుతున్నది. ఇట్టి సందర్భములలో సర్వసామాన్యముగా జరుగుతున్న పొరబాటేమంటే, మనస్సును అణచివైచి బాహ్యమైన విధానముల ద్వారా హింసించి అదుపుచేయ యత్నింతుము. అది పొగరుబోతు గుఱ్ఱము నదుపు చేయుటకు చురుకైన చెర్నాకోలాతో వాయించడం వంటిది. ఇందువల్ల తాత్కాలికంగా అది అణగిమణగి వున్నట్లనిపిస్తుంది గానీ దోషము మాత్రము
లోలోపలే అణగి వుంటుంది. ఇది ఒక జీవితాంతపు పోరాట క్రీడగా మారిపోతుంది. కనుక మనస్సు నదుపు చేయడం పరిష్కారం కాదు. దాన్ని సరిచేయడమే తగినపని. తొలుదొల్త చేపట్టిన
అంతఃశుద్ధీకరణ విధానము వల్ల లోలోపలి చెడుతలంపులు బయటికి త్రోసివేయబడాలి. లోపల నిక్షిప్తమైయున్న ఆలోచనలు బయటకు త్రోసుకరావడం వల్ల భాండాగారం ఖాళీ అవుతూ, అవి మన అనుభవ (భోగ్) రూపంలో వ్యయమైపోతాయి. ధ్యానసమయంలో రేకెత్తిన ఆలోచనలను ఖాతరు చేయక వాటిని పట్టించుకొనక పిలువని
చుట్టాలుగా భావించి నిరాదరణ భావముతో నుండుటే సరియైన పద్ధతి. ఇట్లు చేయుట వల్ల వాటి తీవ్రత తగ్గి, అవి మన కలతకు మూలం
కాకుండా పోతాయి.
కాంతివంతమైన సత్యము లేక మానవ- రూపధారియైన మహనీయాత్మ లేక సమర్థుడైన మహనీయునిపై
ధ్యానము చేయవచ్చును. కాని అట్టి సందర్భములలో అట్టి గురువును తాను తన మార్గదర్శిగా యెన్నుకొని
యుండుట తప్పనిసరి. తన ధ్యాన వస్తువుగా చేపట్టిన అట్టి మహాత్ముని ప్రేమింప నారంభిస్తే ఆ మహనీయుడు
గొప్ప శక్తిమంతుడు గనుక ప్రకృతి శక్తి ఆయన ద్వారా నీలోనికి ఉధృతంగా ప్రవహిస్తుంది.
బురదగుంటలో పోగొట్టుకొన్న వజ్రాన్ని వెతకడం వంటిదే ధ్యానము.
వారనుసరించు పద్ధతుల కతీతంగా అభ్యాసులందరినీ నేను సమానంగా ఆదరిస్తారు. ధ్యనసాధన చేస్తూ అభ్యాసి ప్రేమ నభివృద్ధి చేసుకుంటే నా ఈ భగవత్కార్యము వృధా
కానేరదు.
మనం ప్రకాశముపై ధ్యానము చేస్తాము. అది వాస్తవంగా ప్రకాశము కాదు. మనం కేవలం హృదయంలో ప్రకాశమున్నది - అని ఊహామాత్రంగా భావిస్తాము. మన మూలభావం ఈశ్వరీయ ప్రకాశము. ఎందుకంటే దైవ సహాయం లేకుండా మనం
పురోగమించలేము. మనమిక ధ్యానిస్తాం. ఆలోచనలొస్తే వాటితో పెనుగులాడము. ఒక యిబ్బందున్నది. నీవు యోచనలతో తలబడినావంటే నీవు యేకాగ్రతకు మరలుతావు అందువల్ల నీ శక్తితో నీవే
ఆలోచనలను దృఢపరుస్తావు. ధ్యాన సమయంలో మెలకువగానే వుంటావు కానీ ఆలోచనలను పట్టించుకోవు.
యేమికలిగినను పరవాలేదు, ధ్యానానంతరం ఒకటి
రెండు నిముషములు అదే స్థితిలో వుండటానికి యత్నించు, అక్కడేమున్నది? గుర్తించ యత్నించు. అదీ అన్వేషణ, దాన్ని వృద్ధిచేసుకొంటావు.
నేనొక మాట చెబుతాను. నేను రోజులో 2, 3 నిముషాలు మహా అయితే 5 నిముషాలు ధ్యానం చేసేవాడిని. కాని నిరంతరం మా గురువు ధ్యాసలోనే మునిగి వుండేవాడిని. ఆయన నన్ను ఒక గంట కూర్చోమంటే, అలానే కూర్చొనే
వాడిని. కానీ ఆయన ధ్యాస నుండి మాత్రం యెప్పుడూ విడివడి వుండలేదు.
ఒక క్షణం కూడా నా గురువు నుండి నేను వేరైయున్న భావనే లేదు. ఒక వేళ ఆయన ధ్యాస ఓ క్షణం లేకపోతే నేను జీవించలేను. మరణమే యిక దాని పర్యవసానము. ఆయనలో నేనున్నాను, నాలో ఆయనున్నాడు. ఇది అతిశయోక్తి కాదు. ఇదిగో యిప్పుడొక రహస్యమును విప్పిచెప్పితిని.
జనులు నా వద్దకొస్తుంటారు. నేను వారిని పరిశీలిస్తాను. మొదట వారి స్థితిని తెలుసుకొని అ తర్వాత వారికి సమాధానమిస్తాను. వారిని మూలంపై ధ్యానించమని చెబుతాను. అలా చేయకపోతే వారు యెప్పటికి
ఉత్తీర్ణులు కాలేరు. నీ ప్రయత్నం తప్పుగా వుంటే గమ్యం వైపుకు వెళ్ళలేవు. భ్రష్టత వైపుకు వెళతావు.
కొంతమంది నన్ను హృదయంపై ధ్యానమెందుకు చెయ్యాలని అడుగుతారు. అందుకు నా సమాధానం నాకున్నది. మీరు హృదయంపై ధ్యానం చేసినా, లేక త్రికుటిపై ధ్యానం చేసినా రెండూ సరైనవే. నేను హృదయాన్ని యెన్నుకున్నాను.
ఒక వ్యక్తి పైకప్పు నుండి క్రింద పడిపోయాడనుకొందాం. అప్పుడతడు నేలపై పడిపోయాననుకోకూడదు, భగవంతుని ఒడిలో
పడిపోయాననుకోవాలి. ఇది (సహజమార్గం) ధైర్యవంతుల రంగము, పిరికిపందల స్థలం
కాదు. అటువంటి దృఢభావన గలిగి వుండాలి. ఆలోచన క్రమబద్ధీకరింపబడాలి. జ్ఞాపకముంచుకోండి, యిది ఉత్తమోత్తమ
మార్గము, అంతేగాదు అతి సులువైనది కూడా. సాధనలోనికి దిగితే అది యింకా సులువైపోతుంది.
ఇదంతా మా గురువు పనే కనుకనే నేను వచించినా, వ్రాసినా లక్ష్యాన్ని సాధిస్తాను. అదీ ఆయన మార్గదర్శకత్వం. ఆలోచనలో మెదిలిన వెనువెంటనే నన్నాయన ఆస్థానం చెరుస్తారు. నేను చెప్పిందే నమ్ముతాను. యే యితర తత్త్వవేత్త మరోలా
చెప్పినా నేను గణించను. నేను నా మాటను మార్చను, యెందుకంటే నేను
సక్రమంగా చెప్పానని నాకు ఖచ్చితంగా తెలుసు. బహుఃశా యెవరికివారు వారు
చెప్పేదే సరైనదనుకోవచ్చును. వ్రాసేవారందరూ తాము వ్రాసేది
సరైనదేనందురు. కానీ నేను రెండింతలు ఖచ్చితమైనదందును. అదీ తేడా.
సత్యముతో లీనమైనప్పుడే యోచన నిజమైనదౌతుంది. సత్యతత్త్వంలో లీనమవ్వడానికి యత్నించు. సత్యతత్త్వంలోనికి దుమికేయ్. జ్ఞానము, తెలివి వంటివన్నీ దైవత్వంలో పూడ్చిపెట్టబడతాయి. ఎప్పుడూ నీచేయిని మహోన్నతంపైనే వుంచు. అల్ప విషయములను గూర్చి
ఆలోచించకు, ఉన్నతమైన వాటిని గూర్చే యోచించు, వాటి కొఱకే ప్రయత్నించు. చంద్రుణ్ణి చేరాలనుకుంటే
సూర్యుణ్ణి చేరడానికి ప్రత్నించు. బ్రహ్మములో మొత్తంగా లీనమవ్వడమే
ఉన్నతోన్నతమైన ధ్యేయము.
మహామాత రామకృష్ణపరమహంస ద్వారా పలుకుతుందని వివేకానందస్వామి చెప్పారు.
నా విషయం వేరు. నేను మాట్లాడేటప్పుడు, అది నేనే
మాట్లాడుతున్నానా, లేక గురువా, లేక భగవంతుడే
మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. అందులో అహం లేదు. అది సంశయాతీతమైన సత్యము. మీకందరికి అట్టి స్థితి (అది
ఉత్తమమైనది గనుక) కలగాలని నేను ప్రార్థిస్తాను. నేనేమి చెబుతున్నానో, ఎవరు
చెప్పిస్తున్నారో, ఎందుకు చెబుతున్నానో నాకు తెలియదు. ఈ మూడవస్థలు అంతమై పోయినవి.
అక్కడ వేలాది మంది జనము, జంతువులు, చెట్లూ వున్నా నీవు వాటన్నిటిని ఒకటిగానే చూడవలెను. అదే లీనమవ్వడమంటే.
ధ్యాన సమయంలో యేమైనను కానిమ్ము, అదంతా నీ మేలు కొఱకేనని
భావింప వలెను.
11.యోచనలు
- యోచన రహితత్త్వము
యోచనను పవిత్రముగా నుంచుకొనుటే గొప్ప త్యాగము.
మనం వేడుకలు జరుపుకొని యెందుకానందిస్తాము? ఇంద్రియములు వాటిని ఆనందిస్తాయి. అవి ఉప్పునీటి సముద్రము నుండి
తియ్యటి నీటిని గ్రహించ యత్నిస్తాయి.
బయల్వెడలిన దృఢమైన యోచన ఒక రూపం ధరిస్తుంది. ఒక ఆలోచన చెయ్యి, అది పని చేస్తుంది. ప్రయత్నించి చూడు.
ధ్యేయము, ‘సంయమావస్థ’- అంటే సమత్వ స్థితి, కానీ పూర్తిగా
కాదు. వ్యక్తి ఎప్పటికీ పూర్తి యోచనా రహితత్వము పొందలేడు. దాదాపు యోచనా రహితత్త్వమని అనవచ్చును. మనిషి యోచనలేని వాడవుతాడని
చెప్పే సాధువులున్నారు. అట్టి యోచనారహిత స్థితి నందుకోగానే మనిషి చచ్చిపోతాడు. అందుకే నేను "దాదాపు" అన్నాను. అసలాలోచనే లేకపోతే నీవిక దైవత్వాన్ని గురించి కూడా యోచించలేవు.
హృదయములో ఈశ్వరీయ ప్రకాశమున్నదని తలంచి ధ్యానము చేయుము. అది కూడా కేవలము ఒక ఊహే. కాంతిని ముందుకు రువ్వి
ధ్యానమునకు కూర్చొనకుము. ఆలోచనలు వస్తాయి. వాటిని ఖాతరు చేయక ఉదాసీన భావమును వహించుము. ఆలోచనలు వస్తూవుంటాయి. వాటిని యెదుర్కొనజూస్తావు. ఎదుర్కోవాలంటే యేకాగ్రత కావాలి. యేకాగ్రత వల్ల నీవు ఆలోచనలకు
మరింత బలాన్ని చేకూరుస్తావు. ఆలోచనలను పిలువని అతిథులుగా
నిరాదరించుము.
ద్వేషము నకారాత్మకమైన యోచన, నకారాత్మక బంధము. బంధమున్నది కానీ యిది నకారాత్మకమైనది. ద్వేషాన్ని మొత్తంగా
నిర్మూలించు. అప్పుడక్కడ ప్రేమ వుంటుంది. ఏ విషయాన్నీ దోషదృక్పదంతో చూడకు.
సహజమార్గం మనిషిని మలచడంలో యెలా సహాయపడుతుంది?
ఒక దొంగ వున్నాడనుకున్నాం. ఏదో విధంగా అతడి చేత దొంగతనం మాన్పించామనుకున్నాం. ఇప్పుడతడొక మిత్రుని యింటికి వెళ్ళి ఒక మంచి వస్తువు చూశాడు. అతని అధమవృత్తులు అతన్ని ప్రేరేపించడం వల్ల గృహస్థుని మోసగించి ఆ వస్తువు
కాజేయాలనుకుంటాడు.
మనం ధ్యానంలో యేంచేస్తాం? అధమ వృత్తులను స్తంభింపజేసి వాటిస్థానంలో ఊర్ధ్వవృత్తులు పని మొదలుపెట్టేట్టు
చేస్తాం. అంటే పై కేంద్రములు, క్రిందివాటి పనిని
చేపడతాయి. ఆ తర్వాత పై కేంద్రముల పనిని దైవత్వం చేపడుతుంది. అప్పుడు అధమ కేంద్రాల (వ్రుత్తుల) ఆలోచనలు మొత్తం నాశనం చేయబడతాయి. అనగా సర్వం దైవత్వం చెందుతుంది. సహజమర్గమంటే యిది. నాకు సహజమర్గం తప్ప యితర యే తత్త్వశాస్త్రము తెలియదు.
మనం చూస్తున్నాం, వసంతమొస్తున్నది, ఆకురాలు కాలమొస్తున్నది. కానీ అవి సక్రమంగా రావడం లేదు. దీనికెవరు కారణము? జనులు యిదంతా భగవంతుని సంకల్పమనుచున్నారు. కానీ అది కాదు. దీన్నెలా నిర్మూలించాలి, మార్గాంతరమేమి? దీన్ని గురించి నేను వ్రాశాను. ఇప్పుడేమీ నాకు జ్ఞాపకంలేదు. అయితే యిది మన పనే. దీన్ని సహజమైన విధానంలో చెయ్యాలి. అదే సహజమార్గము.
సూక్ష్మమైన సూచన ప్రభావము (శక్తి): ఒక వ్యక్తి మా గురువు వద్దకు వెళ్ళి నేను
చాలా ఆగ్రహము గల మనిషిని అని చెప్పాడు. అది విని గురువర్యులు మంచిది
(అచ్ఛా) అన్నారట. అంతే అదే నిజమైపోయింది. నా సహచర శిష్యులు ఆశ్చర్యపోయారు. సూచనెలెన్నయినా వుంటాయి, కానీ ఆ సున్నితసూచన
ఆత్మకు బహు సన్నిహితంగా వుంటుంది. అదే అచ్ఛా అనే మాట గట్టిగా
అన్నామనుకోండి అది పని చేయదు. మనకు తెలియకుండానే మనం తప్పుడు
నిర్ణయాలు ప్రకటిస్తాం. ఎందుకంటే ఈ విషయాలేవీ మనకు తెలియవు. వీధిలో ఒక అల్లరి పిల్లవాడున్నాడనుకోండి, వాడు బుద్ధిమంతుడౌతాడులే అన్న సూచనిచ్చారంటే, వాడు బాగుపడతాడు. సూచన చాలా ముఖ్యం. అది బాగా పనిచేస్తుంది లేక నాశనం చేస్తుంది. సున్నితమైన సూచననిచ్చి ఇతడు సత్యాన్నిగ్రహించాడు అనగానే అతడు సత్యాన్ని
గ్రహించేస్తాడు. అయితే నీ వద్ద శక్తి వుండి తీరాలి.
మొట్టమొదట నిన్ను నీవు ఉద్ధరించుకో, ఆ తర్వాత లేక అదే
సమయంలో యితరులు కూడా ఉద్ధరింపబడటానికి ప్రయత్నించు. ఒక్కొక్క వ్యక్తే కూడి సమూహమౌతుంది. ఈ విధంగా ఒక్కరి నుద్ధరించు
ఆతడు పది మంది నుద్ధరిస్తాడు.
ఆలోచనల ప్రభావము మహత్తరమైనది. అవి పరిమితస్థితి నుండి
అపరిమితస్థితి వరకు వెళతాయి. అవి అక్కడి వాతావరణంలో సుడులు
రేపుతూ పోతాయి. అవి వాటి పర్యవసానాన్ని కలిగి వుంటాయి. కనుక యెప్పుడూ సకారాత్మక భాషనే
మాట్లాడు. నేను కల్లలాడను అనుటకంటే, నేను "నిజమే
చెబుతాను" అని మాట్లాడు. మజ్నులో లైలాకు సంబంధించిన
ఆలోచన తప్ప వేరు ఆలోచన లేదు. కథ యిలా నడుస్తుంది. ఒక రోజు లైలా తనపై మజ్నుకెంత ప్రేముందో పరీక్షించాలనుకొంది. తన సేవకుని కొకనికి ఒక గిన్నె, చురకత్తి నిచ్చి
కుక్క కొఱకు మాంసం కావాలని మజ్ను వద్దకు పంపింది. మజ్ను తన శరీరాన్ని కోసి కొంత మాంసం పంపించాడు. మరునాడు కూడా లైలా యిదే పని చేసింది. మజ్ను యేమాత్రం సంకోచించకుండా
మళ్ళీ తన శరీరాన్ని కొసుకొని మాంసం పంపించాడు. అయినా లైలా సంతృప్తి జెందలేదు. మజ్ను నన్ను పూర్ణహృదయంతో
ప్రేమించడంలేదని వాపోయింది. మూడవసారి కూడా మళ్ళీ మాంసం కోసం
సేవకుడిని పంపింది. ఈసారి కుడా మజ్ను తన శరీరాన్ని కోసుకోవడం కోసం కత్తి తీశాడు. అప్పుడతనికొక విచిత్రానుభూతి కలిగింది, ఇక తన శరీరాన్ని
కోసుకోలేకపోయాడు. అతనిలో ప్రతి భాగము లైలాదే అనిపించింది. అతనికి అంతటా లైలాయే లైలా తప్ప
యితరం కనిపించలేదు. కనుక గిన్నెను, చురకత్తిని సేవకునికి తిరిగిచ్చి పంపేశాడు. ఈ విషయం తెలుస్తూనే లైలా ఆనంద పరవశురాలై "మజ్ను నన్నిప్పుడు
ప్రేమిస్తున్నాడు. అతడే నా నిజమైన ప్రియుడు" అన్నది. ఇది ఒక కథ మాత్రమే. అయినా అటువంటి మానసిక స్థితి నీలో నీవు ఉత్పన్నం చేసుకో, యితరుల్లో కూడా ఉత్పన్నం గావించ యత్నించు.
ఒక్కసారి తప్ప నేనెప్పుడూ నా ఆలోచనల కలత గురించి లాలాజీ వారికి ఫిర్యాదు
చేయలేదు. నేను గమనించగా ఆ కలతలు నావిగా కనిపించినప్పటికి అవి నావి కావని గుర్తించితిని. కాని అవి వాతావరణంలో వుండు ఉన్నతస్థితులలో గూడా వచ్చి తగులుకొనుచున్నవి.
ఒక ఉన్నతస్థాయికి చెందిన అభ్యాసి తన మనస్సులో కలుగుచున్న ఆలోచనలు తనను అధికంగా
వేదిస్తున్నవని చెప్పుకొనెను. గురువర్యులు హాస్యమాడుతూ ఇలా
అడిగారు. నీవు యేండ్ల క్రితమే "నేను హృదయపూర్వకంగా మొత్తం నీ వాడనే" అని గదా
చెప్పావు, మరి యింకా నీ ఆలోచనలనే వెక్కడివి, అవి నిన్ను బాధించడమేమిటి? అదెలా?
మనిషి అనునిత్యం ఆలోచనా రహితుడై వుండలేడు. అలా మొత్తంగా ఆలోచనా రహితుడయ్యాడంటే, అతని శరీరంలో
ప్రాణం లేదన్న మాటే.
మనమేమి ఆలోచించినా, మననం చేసుకొన్నా
అవి అంతర్గతంగా అలలను రేకెత్తించి యింకా వృద్ధియౌతాయి, శక్తి ఉత్పన్నమౌతుంది. శక్తి తనతోపాటే ఆలోచనలు, భావనలు కలుపుకొని బయటికి ప్రవహిస్తుంది. మనస్సు పవిత్రమైనదైతే దాని
ప్రభావాలు ఉన్నతంగా వుంటాయి, కాని చెడు మానసపు
దుష్టతలంపుల ప్రభావం వల్ల అవి భ్రష్టత చెందు అవకాశమున్నది.
నీవు ఆలోచనల విషయమై జాగరూకుడవై యుంటే, ఆలోచనలు శక్తిని
సమకూర్చుకుంటాయి. వాటి యెడ నిర్లక్ష్యభావనతో నుండుము. నీవు యోచనల గురించి
వ్యధజెందుతున్నావంటే వాటిని నీవు ప్రేమించడం మొదలుపెట్టావని అర్థం. అలా వాటికి నీవు బలైపోతున్నావు. అప్పుడవి వరుసగా రావడం
మొదలౌతుంది. భయపడనవసరం లేదు. అవి వాటి ధార నేర్పరచుకొననిమ్ము నీవు నీ ధారను అనగా భగవదీయ చింతనా ధారను నీ
సంకల్పశక్తితో దృఢపరచుకొని కొనసాగించుము.
12. ప్రాణాహుతి లేక యోగశక్తిప్రసారము
ప్రాణాహితి ప్రసారము వల్ల ఒక వ్యక్తి ఆత్మను సత్యతత్త్వమునకు మార్పుచేసి
అతనిని నీచాతి నీచమైన స్థాయినుండి మహోన్నతునిగా పరిణమింప జేయవచ్చును. కానీ తదనంతర మేమౌతుందన్నది యింకను ప్రయత్నించి చూడలేదు -
మన మనస్సుయొక్క అంతర్గ వృత్తులను త్వరితముగ మనలో క్రమేపి మార్పును
తీసుకరావడానికి ఉపయోగపడు ప్రతిభావంతమైన ప్రక్రియ ప్రాణాహుతి లేక యోగశక్తి
ప్రసారము. సహజమార్గములో దైవకృప అభ్యాసివైపుకు ప్రాణాహుతిప్రక్రియ ద్వారా మళ్ళింపబడును. వాస్తవానికి ప్రాణాహుతి ఆధ్యాత్మికోన్నతిని కలిగించి, బహుతక్కువ కాలములో అభ్యాసిలోని చిక్కులను తొలగించును. స్వతహాగా ప్రయత్నించిన సందర్భములో ఈ కార్యము ఒక దశాబ్దమునకైనా
పూర్తికాకపోవచ్చును. ప్రాణాహుతి చాలా గొప్ప యోగసాధన. మనం పొందనగు విద్య. యోగి తన యిచ్ఛాశక్తి లేక భగవదీయ కాంతిని సాధకునిలో ప్రవేశపెట్టి అతనిలో
అనవసరము మరియు ఆధ్యాత్మికాభివృద్ధికి హానికరమునైన ఆటంకముల నన్నిటిని
తొలగించివేయును.
దైవ ప్రవాహములు సంపూర్తిగా మల, విక్షేప, ఆవరణముల నుండి స్వేచ్ఛను పొంది యుండును.
[మల=మలినములు;విక్షేప =
అవాస్తవోత్పన్నములు, భ్రమలు; ఆవరణములు = స్థౌల్యపొరలు]
ఒక సాధుమహాశయుడు సాధకుని కనీస సహకారముతో ప్రాణాహుతి ప్రక్రియ ద్వారా మార్పును
తీసుకొని రాగలుగును.
ప్రాణాహుతి రాతిని కూడా ముక్కలు ముక్కలు చేయగల్గును.
రోగములు కూడా శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా బయటికి నెట్టివేయబడును.
ప్రాణాహుతి ద్వారా సంస్కారములను శుష్కింపజేసి కాల్చి వేయవచ్చును.
ఈ ప్రాణాహుతి ప్రసారము వలన అభ్యాసిలోనికి జబ్బులు ప్రవేశించవు. ఇది నా అనుభవమే కాదు, మా గురువర్యుల
అనుభవం కూడా. అంతే గాకుండా కొన్ని జబ్బులు శుద్ధీకరణ ద్వారా బయటికి వెళ్ళిపోయిన అనుభవములు
తరచు గలిగినవి.
ఆధ్యాత్మిక స్థితులు మిక్కుటములు గనుక వాటి నధిగమించుటకు పట్టు సమయము కూడా
తదనుగుణముగా లెక్కింపనలవిగానిదే. ప్రాణాహుతి శక్తి మాత్రము ఆ
సుధీర్ఘసమయాన్ని కుదించి లెక్కింప వీలుగాని సంవత్సరముల సంఖ్యను ఒక జీవితములోని
కొంత కాలమునకే తగ్గించి వేయును.
ప్రాణాహుతి అభ్యాసిని భగవంతునితో అనుసంధాన పరచును.
అభ్యాసి నిరంతరంగా ప్రాణాహుతి ప్రసారానుభూతి పొందుతూ వుండక పోవచ్చును. అది అభ్యాసి పెంపొందించుకొన్న గ్రాహకశక్తి ననుసరించి యుండును.
నీ సేవకునిపై నీకు కోపమొస్తుంది. వానిపై మండి పడతావు. సేవకుడు సైతం అంతే తీవ్రంగా తిరగబడతాడు - ప్రాణాహుతి విషయం కూడా ఇట్లే
వుంటుంది. నీవు చూపిన కోపమే కాస్తా యిటో అటో అంతే తీవ్రతతో సేవకుని నుండీ బయట పడింది. ఇదే పద్ధతిలో అభ్యాసిలోనికి ప్రవేశపెట్టబడిన దైవీయ జ్ఆగృతి అతనిని దైవీయం
చేస్తుంది. అది క్రమేపీ అతనిలో మార్పును తెస్తుంది. సహజమార్గంలో జరిగేదిదియే.
ప్రాణాహుతి వెనక వుండి పనిచేయడం వల్లనే ధ్యానము విజయవంతంగా
కొనసాగించబడుచున్నది. ఇది ఒక గొప్ప మనస్తత్త్వ శాస్త్రము. ఇందులో గురువర్యుల స్వంత మానసిక
శక్తి, అభ్యాసిలో నిద్రాణమైయున్న ఆత్మ ప్రబోధ శక్తిని
మేల్కొల్పి కార్యోన్ముఖము గావించి ఆధ్యాత్మికొన్నతి వైపునకు మరలిస్తుంది.
గురువర్యుల మాధ్యమం ద్వారా ప్రాణాహుతి ప్రసారం వల్ల దైవీయ కృప అభ్యాసి వైపుకు
త్రిప్పబడుతుంది. వాస్తవానికి ప్రాణాహుతి వల్ల చిక్కులు తొలగి అభ్యాసికి కలిగిన అతి త్వరిత
ఆధ్యాత్మికోన్నతి, కేవలం స్వప్రయత్నంతో పొందాలంటే పూర్తి పదేళ్ళయినా
సరిపోదు.
గురువర్యులు తన అంతర్గత శక్తిని ప్రయోగించి అభ్యాసిలో నిద్రాణావస్థలో నున్న
శక్తిని మేల్కొల్పి చైతన్యపరచి భగవదీయ కృపాధారను అతని హృదయం వైపునకు మళ్లిస్తారు. అభ్యాసి మరింత ఆనందానుభూతిని పొందుతూ ఆధ్యాత్మికముగా పురోగమిస్తాడు.
1.ప్రశ్న: అభ్యాసి ధ్యాన సమయంలో పొందే ప్రాణాహుతి ప్రసారానికి ఇతర సమయాలలో
అనగా నిరంతర స్మరణలో పొందే ప్రాణాహుతి ప్రసారానికి తేడా యేమైనా ఉన్నదా?
జవాబు: తేడా వున్నది. అది యేమంటే.
ధ్యానసమయంలో ఇతర సమయాలలో
స్మరణలో ఉన్నప్పుడు
అ. ఆహారం భుజించినట్లు ఆహారపు రుచిని
గురించి
ఆలోచించినట్లు.
ఆ. ఒక దృశ్యాన్ని యథా- దృశ్యాన్ని
చిత్రంలో
తథంగా దర్శించినట్లు చూచినట్లు.
గురువర్యులతో అనుబంధమేర్పడిన నాటినుండి నిరంతర ప్రాణాహుతి ప్రసారం (దివ్యశక్తి
ప్రసారం) గురువు నుండి అభ్యాసికి ప్రవహిస్తూనే వుంటుంది. గురువు నిరంతరాయంగా అభ్యాసి అభివృద్ధికోసం పనిచేస్తూనే వుంటారు. అభ్యాసి బహు సున్నితత్త్వంగల వాడైతే తప్ప ఈ విషయాన్ని గ్రహించలేడు.
ప్రశ్న: అభ్యాసి యే విధంగా పురోగమిస్తాడు?
అభ్యాసి ధ్యానప్రక్రియను కొనసాగిస్తూ పురోగమిస్తూ పోతే ఒక మతిమరుపుస్థితి
వృద్ధియౌతుంది. అంటే అతడు తన శరీర ఉనికిని కోల్పోతాడు. అప్పుడు "నేను" అన్న
పదం శరీరానికి సంబంధించదు. ఇది పోయిందంటే, తన్ను తాను ఆత్మగా భావిస్తాడు. యిది ఉత్తమం. ఆ తర్వాత యిదీ మరచిపోతే యిక "నేను" అనునది యెవరికీ వర్తించదు. నిజమైన స్థితి అంటే అది.
"నే"నంటే ఆత్మను అన్న భావన కొంత లోపభూయిష్టమైనదే. అది ఆత్మకునూ వర్తించకుంటే మరి దేనికి వర్తిస్తుంది? అక్కడ యేమీ లేకుంటే, అప్పుడు దాన్ని
శూన్యత్వమనవచ్చు. దాదాపుగా అటువంటిదే యిది. ఇదే లభించిన ఫలితం. దీన్ని వ్యక్తపరచటమెలా? వ్యక్తపరచటం కష్టం.
13. దివ్య మెఱుపులు
విడుదల (కైవల్యం) అంటే స్వేచ్ఛ నుండి స్వేచ్ఛ.
సాక్షాత్కారమంటే మరణానికి మరణం.
ప్రేమంటే యేమిటి? -- ఎందుకు
ప్రేమిస్తున్నావో, దేనికోసం ప్రేమిస్తున్నావో నీకు తెలియడం లేదంటే అదీ
ప్రేమ.
సచ్చిదానందమొక ఆటవస్తువు. భగవంతునకు హద్దులు లేవు. భగవదెఱుక త్రిగుణాతీతము.
ప్రకృతితో లయబద్ధంగా జీవనం సాగించడమంటే, భగవంతుని నుండి
యేదో కొంత పొందినట్లే.
మన ఉనికిలోని జ్ఆగ్రదావస్థే జీవితము.
సరళంగా జీవిస్తున్నామంటే భగవంతునితో సంబంధమేర్పరచుకొని ఉన్నట్లే.
ఇచ్ఛాశక్తికి సందేహము విషము.
మనస్సుకు నిరుత్సాహము విషము.
విశ్వము భగవంతుని విరాట్స్వరూపము. నేను దానిని దర్శించితిని. ఇది బ్రహ్మాండమండలమున కావలనున్నది.
మోసెస్ దర్శించిన వెలుగు: ఇది సంపూర్ణమైన వెలుగు, అందులో కొండలు, జంతువులు, చెట్లూ చేమలు ఉన్న
దాఖలాలు లేవు.
ధ్యానంలో కలుగు పులకింతలు: ఇది పాక్షిక సమాధిస్థితి.
మనదేహం పూర్తిగా శూన్యస్థితికి రావాలి.
గాలిలో ప్రయాణించడం, పదార్థ
తత్త్వప్రయాణము.
శూన్యంలోప్రయాణించడం, ఆధ్యాత్మిక
ప్రయాణము.
సహజమార్గములో ఉన్న కష్టము, అందులో యేకష్టము లేకపోవడమే.
జననం కాదు మరణమే పురోగమనము.
వినాశనం, అభివృద్ధికి సూచన.
భక్తులకు బదులు భాగ్తేలు (చుట్టూ పరిగిడేవారు) ఉన్నారు. నిజమైన భక్తులంటే భగవంతుని పెంపుడు జంతువులు. అదే సాధుత్వము.
గురువు యెదుట తలవంచినట్లు యితరులకు కనబడకుండా వాలిసోలి పోవడమే నిజమైన నమస్కారము.
ఒక మంచి ఆలోచననేది, యెప్పటికిని, అది సేవే.
గొప్పత్యాగము: ఆలోచనను పవిత్రంగా వుంచుకోవడమే గొప్పత్యాగము. మనము వేరేమిటో కాదు. ఇచ్ఛామాత్రులమే.
మనము భగవంతుని గూర్చి యోచిస్తూంటాము. యోచన మనస్సు నుండి పుడుతుంది. ఇది భగవంతునితో అనుసంధాన మేర్పరుస్తుంది. రెండింటి కలయికతో ఆలోచన పుట్టుకొస్తుంది. మూడవది కోరిక. కోరికకు ఆధారము లేదు.
ఆధారము గల్గిన వాంఛ ఉత్తమము.
ఆధారము లేని వాంఛ దూర్తము.
నీవు శరణాగతి పొందితివన్న, మంచిదే కానీ ఆ
భావనను కూడా కలిగియుండకుము.
పుస్తకముల ద్వారా గడించిన జ్ఞానమునకన్నా యెప్పటికీ ఆత్మ ప్రబోధజ్ఞానమే
ఉత్తమోత్తమము.
నీవు సత్యతత్త్వములో లీనమై యున్నప్పుడు నీ ఆలోచన సక్రమంగా వుంటుంది.
నీవు దైవత్వంలోనికి దుమికినంతనే నీ తెలివి స్వచ్ఛత జెందుతుంది.
బ్రహ్మముతో ఐక్యత స్థాపింపబడితే, తెలివి
పనిజేస్తుంది. అప్పుడంతా సంపూర్ణమై వుంటుంది. అది నీవు గమనించి యుండవు.
శాంతి భగవంతుడు కాదు. కాని శాంతి రహితత్వము భగవంతుడు. నిశ్శబ్దంలో నిశ్శబ్దం, భగవంతునికి అత్యంత సమీప్యము.
ఆనందరాహితత్వమే ఒక ఆనందము.
మోక్షము వెయ్యివేలసార్లు పొందవచ్చును. కానీ నీవు విడుదల (కైవల్యము)
పొందితే మళ్ళీ నీవు తిరిగి (ఈ లోకమునకు) రావు.
దైవత్వము స్వచ్ఛమై, సరళమై యుండును.
14. బంధన రాహిత్యము
అన్నిపనులు కర్తవ్యపరంగా భావించి చేసుకుపోతూ, యేవిధమైన బంధమునకు తగులుకున్న భావం లేకుండా మనం మన సాంసారిక జీవనంలో అయిష్టతతో
సాగిపోవాలి. ఉదాహరణకు మనం స్నానం చేసి వచ్చేస్తాం, ఆ తర్వాత దాన్ని
గురించి అసలలోచించం. అది పూర్తిచేశాం, అయిపోయిందంతే. ఒక పద్ధతిగా మలచుకొంటే సాంసారిక జీవనాన్ని తిట్టిపోయాల్సిన పనిలేదు. నీవు (వ్యవహార న్యాయానుసారం) ఒక పనిని చేయక తప్పిందికాక చేశావనుకున్నాం. అందులో నీ కోసమంటూ యేమిలేదనుకున్నాం. అప్పుడది అశ్రద్ధాపూర్వక
కార్యమై నీ మనస్సుపై యెటువంటి ముద్రలూ వేయదు. మనం మన పనులన్నీ అంటే భార్యాబిడ్డలకు సంబంధించినవి సైతం భగవదాజ్ఞానుసారమని
తలచి చేసుకుంటూ పోవచ్చు. ఈ పద్ధతిలో మన చర్యలన్నీ కడకు పూజగా మారిపోతాయి. ఇది మన యోచనను భగవంతునితో అనుసంధాన పరిచే అతి సులభమైన విధానము.
మనమందరిని ప్రేమించాలి కాని బంధుత్వ బంధముతో తగులుకొన్న భావము మాత్రముండరాదు.
మన పిల్లలను మనం భగవంతుని పిల్లలుగా తలచి వారికి సేవచేయవలెను. మనల్ని మనం భగవంతుడు నియమించిన ధర్మకర్తలుగా భావించి పిల్లల సమస్త
సంక్షేమమునకు పనిచేయవలెను.
నా ఉద్దేశ్యములో ప్రతి ఒక్కరు వారికున్న ప్రాపంచిక వస్తువులన్నీ వదిలి
సాంసారిక జీవనాన్ని త్యజించవలసిన పనిలేదు. ప్రతి కార్యమును తన విద్యుక్త
ధర్మముగ భావించి, అది తన ప్రభువు తనకు కేటాయించిన కార్యముగ తలంచవలెను. ఇదే వాస్తవానికి నిజమైన జీవితము. అదే అన్ని సమస్యలకు, అవి ఆధ్యాత్మికమైనవైనా, ప్రాపంచికమైన, అన్నింటికి పరిష్కారము.
తగని రీతిగా తగులుకొనియున్న అన్ని బంధనములు, అనగా రాగద్వేషములు రెండూ ఆధ్యాత్మికతకు విషమే.
15. లయ మరియు సమాధి.
నిర్వికల్పసమాధి మీకు మోక్షస్థితిని ప్రసాదించవచ్చును కాని సత్యోదయములో
చెప్పినట్లు విడుదల (కైవల్యము) అనునది వేరు. నిజమైన సమాధిస్థితిలో మనం
ప్రాపంచికమైన కార్యకలాపములలో, విధులలో ఎంతగా
నిమగ్నమై యున్నప్పటికీ స్వచ్ఛము, సరళమునైన
సత్యతత్త్వముతో నిరంతరము సంబంధము గలిగి యుందుము. దీనిని సహజసమాధిగా తెలిసికొనవలెను. దీన్ని పొందడమంటే మహోన్నత
స్థితిని సాధించినట్లే. ఇదే నిర్వాణమునకాధారము.
మనము సాధన చేయడం ప్రారంభించి, గమ్యము చేరవలెనను
ఆతృతలో పడితే అప్పుడొక దానిపై గురి నిల్పుతాము. అది మన అన్వేషణకు సహాయపడునదిగా తోస్తుంది. దాని పర్యవసానంగా మనకు సర్వం భగవంతుని యిచ్ఛపై ఆధారపడినట్లు భావన కలుగుతుంది. అందువల్ల మనం భగవంతునితో సంబంధ మేర్పరచుకొని వుంటాము. ఇది క్రమేపీ సాన్నిహిత్యంగానూ అనుబంధంగాను వృద్ధియౌతుంది. ఇదే నిజమైన అర్థంలో లయావస్థ యొక్క ప్రారంభము. ఇందు కొఱకు మనకు ప్రయోజనాన్ని సమకూర్చే ప్రేమ, భక్తి వంటి వాటి నెన్నిటినో అనుసరిస్తాము. దీన్నింకా యిలా చెప్పవచ్చు. మన స్వేచ్ఛ, యిచ్ఛ ఆ భగవంతుని అనంత పరిధి యెంత దూరం వ్యాపించి వుందో అంత దూరము వెళుతుంది. మన యిచ్ఛ భగవదిచ్ఛ సమమని మన హద్ధులు, బంధనములు
విఛిన్నముగావించ నంతవరకు ప్రకటించలేము. ఇదీ మన ప్రయత్నము.
సత్యతత్త్వముతో విలీనం సాధ్యమయ్యే దాకా మన ప్రయత్నం కొనసాగుతుంది.
నేను లయావస్థ నుత్పన్నం చేయను. అది సాధించుటకు నేనభ్యాసులకు
సహాయపడతాను.
సంపూర్ణమైన అబివృద్ధి చెందిన మన మనస్సు ఆకాశతత్త్వం లేక మూలంలో లయమౌతుంది. అప్పుడు మార్పులేని స్థితిని మనం పొందుతాము. ఆ స్థితి దేవునికి సైతం వుండదు. ఈ స్థితి "భూమా"లో
మాత్రమే వుంటుంది.
నిద్ర పదార్త సంబంధమైనది. సమాధి ఆధ్యాత్మికమైనది.
బ్రహ్మము సర్వజ్ఞుడు. లయావస్థలోనున్న మానవుడు కూడ సర్వజ్ఞుడే.
16. నిరంతర స్మరణ
నిరంతర స్మరణ కొఱకు ప్రభువు మహాత్మ్యమును గురించి యోచింపుము.
మనము గురువును, అట్లే ఆయన నుండి వచ్చిన వారుగా ఆయన పిల్లలను
సేవించవలెను. అందువల్ల మనము బంధనమునకు లోనుకాము. ఈ అనుబంధము ఆయన పిల్లల ద్వారా ఆయనతోనే
మనకేర్పడుతుంది. ఈ విషయము లోతుగా మనలో నాటుకుంటే మనం సేవలో నిమగ్నమై అది మన విధిగా భావించి
మాహాత్ముడైన మన గురువును అడుగడుగునా జ్ఞప్తికి దెచ్చుకుంటాము. ఈ పద్ధతిలో నిరంతర స్మరణ అలవడుతుంది.
అన్నిటి యొక్క స్మరణ ఆ ఒక్కని స్మరణలో లీనమౌతుంది - అతడే అంతిమ సత్యము. అతని ఉనికిలోని ప్రతిఅణువు ఆ స్మరణకు ప్రతిధ్వనిస్తూ వుంటుంది. దీన్నే మనం సంపూర్ణంగా అహాన్ని పెగలించి వేయడమంటాము. నా దృష్టిలో యిటువంటి స్థితిని ఉత్పన్నం చేసుకొన్నవాడు రూపుదాల్చిన ప్రార్థనే.
మన విశ్రాంతి సమయంలో మన ఆలోచనను భగవంతుని సర్వ వ్యాపకత్వంపై నిలుపుము. అదే ధ్యాసలో నీకు వీలున్న సమయాన్నంతా గడుపుము. ఇది నీకు సంతోషకరమైన వ్యాపకంగానే గాకుండా నిరంతరాయమైన స్మరణగా కూడా వుంటుంది.
మన ఆలోచనలో ఆయన నిరంతరం విరాజమానుడై వుండేట్లు చేసుకోవాలి.
నిరంతర స్మరణ కోసం మనం దివ్యగుణమును గ్రహిస్తాము. అనంతరం ఆలోచన దానిపై నిమగ్నం చేస్తాము. గుణము నుండి ఆ గుణమున కాధారమైన
పదార్తమును (వ్యక్తిని) చేరుతాము. అక్కడ నుండి దాని అంతిమ
మూలానికి చేరుకుంటాము.
నిరంతరస్మరణ ధ్యేయప్రాప్తికి సులువైన మార్గము.
అయన స్మరణ ఒక్కటే, ఆధ్యాత్మిక
మార్గమున పురోగతిని కలిగించు సాధనము.
నీవు 7 రోజులు నిరంతర స్మరణను కొనసాగిస్తే 8వ రోజు దాన్ని నీవు వదిలి
వుండలేవు. అంత అద్భుతశక్తి దానికున్నది.
ధ్యానము నిరంతర స్మరణకు తల్లి. అతీంద్రియ స్థితినందుకొన్న
తర్వాతే స్మరణ స్వతఃసిద్ధంగా జరుగుతుంది. అప్పుడు కూడా నీవు యెఱుకలో
వుండగా ప్రయత్నించి పద్ధతి ననుసరించాలి. ధ్యానమే నిరంతరస్మరణను
పాటింపజేస్తుంది. మీరు యెఱుక గలిగి స్మరణలో ఉండటానికి యత్నించాలి.
యెఱుక గలిగి యున్నామా? యెఱుక మరచి
యున్నామా? అన్న జ్ఞానమే లేకుంటే, అప్పుడు నీకు ఆయనకు మధ్య లోతైన సంబంధమేర్పడినదని గుర్తు. ఈ స్థితులన్నిటికి పైనున్న వాడెవరు? యెవరు ఆయన్ను కూడా అంటే యెవరితో బంధమేర్పరచుకొన్నామో ఆయన్ను కూడా మరచిపోతారో
అప్పుడు, అసలు, అసలు మాత్రమే
ఉంటుంది.
అన్ని సందర్భాలలో మన ధ్యాస అంతిమం లేక ధ్యేయం వైపే మరలి వుండాలని నేను మీకు
సలహా యిస్తున్నాను.
దీనితోపాటే ఆధ్యాత్మిక జీవనానికి జీవంవంటిదైన విశ్వాసము వృద్ధిపొంది మరియు
గురువర్యుల రూపము దృక్పదములో దృఢముగా నిలిచి వెనుక ఆయన స్మరణ కొనసాగుతూ వుండాలి.
నిరంతర స్మరణ సాధించాలంటే, ఆటంకాలను ఖాతరు
చేయొద్దు. పద్ధతిని మాత్రం అనుసరిస్తూనే వుండు. అతీంద్రియ మానసము మిగిలినదంతా
తనే చూచుకొంటుంది.
నీవు శాంతికై తపిస్తే, శాంతి మాత్రమే
లభిస్తుంది. నీవు సాక్షాత్కారానికై తపిస్తే నీకు శాంతి కూడా లభిస్తుంది. కనుక మూలాన్ని ఛేదించు, సాక్షాత్కారానికై తపించు.
ప్రతిక్షణం నీవు స్మరణ సాధన చేస్తూనే వుండు. ఎలా? నీవు కార్యాలయంలో
వున్నావనుకో, ఆయన్ను అలా చింతిస్తూ మరచిపో. నీవు స్మరణను మరచిపోతూనే, అది తనంతటదే పని
చేస్తుంది. స్మరణలో వున్నప్పుడున్న ప్రభావమే కొనసాగుతూ వుంటుండి. నీవు పనిలో నిమగ్నమై వున్నప్పుడు నీవు గమనించలేదు. అంతే తేడా. ఇదంతా ఆయనతో నీకు గల అనుబంధాన్ని బట్టి వుంటుంది. ఎంతగా నీ భావనలో ఆయనతో సంబంధం దృఢంగా వుంటుందో అంతగా నీకు ఫలితముంటుంది.
నేను సదా ఆయన చింతనలోనే మునిగి యున్నాను.
గతాన్ని మరచిపో, భవిష్యత్తును గూర్చే యోచించు.
నేను పురోగమిస్తున్నానా లేదా? అన్న ఆలోచనే
మనసులోనికి రానీయకు. స్వల్ప విషయాలను వదలి భగవంతుని గురించి వినడానికి, ఉత్సుకత కలిగి వుండు.
భగవదీయ శక్తి నిరంతరం పనిచేస్తూనే వుంది. మనిషిని మలచుకోవడ మొక్కటే అవసరమైయున్నది.
సాక్షాత్కారం కొఱకు ఆతృత, తపన తప్పని సరిగా
వుండాలి.
ప్రభువు యొక్క కృప యెల్లప్పుడూ ఉంది. మధ్య మధ్య సూర్యుని వెలుగుకు
క్రమ్మిన మేఘముల వలె అడ్డంకులొస్తూ వుంటాయి.
అంతఃశుద్ధీకరణ క్షుణ్ణంగా జరిగేంత వరకు పరివర్తన కలుగదు.
చేసే ప్రతి పనిలోను, అది కార్యాలయ
విధిగాని లేక మన ఆధ్యాత్మిక సంస్థ కార్యముగానీ శ్రద్ధ గలిగి వుండాలి.
మరుక్షణంలో నీకు సంతోషాన్నిచ్చే విధానాన్ననుసరించి పనులు చేసుకుపో. ఈ జన్మాంతరం వచ్చే స్వర్గం గాని మరేదైనాగాని, దాన్ని గురించి పట్టించుకోవద్దు.
‘సందేహం’ అనే పదం పలుక వద్దు. వివరణ కావాలనో లేక యిదెలా? అన్న ప్రశ్నగా
అడుగవచ్చు.
17. ఏకాగ్రత
సర్వసాధారణంగా యేకాగ్రత అనునది యెఱుకగల స్థాయిలో వున్న భౌతిక మానసము. దీని
చర్య తాత్కాలికముగ భౌతికశక్తి ద్వారా అదుపులో నుంచవచ్చును. ఈ స్థితిలో ముందుకెళ్ళిన వారు ఆంతరంగికముగా యెంతో స్థూలంగాను మొండిగాను
తయారయ్యారంటే వారిక సున్నితము మరియు సూక్ష్మస్థితులలో అస్సలిమడలేరు. బలవంతంగా అణచి పెట్టబడిన ఆలోచనల ప్రభావమున యేర్పడిన యేకాగ్రతా ఫలితము మనస్సుపై
భారాన్ని కలిగిస్తుంది.
ధ్యానమునకు యేకాగ్రత మొదటిమెట్టుకాదు. బలవంతపు నిరోధాన్ని వీడి
ధ్యానాన్ని సహజమైన విధానంలో చేయడమే సరియైన పద్ధతి.
18. మనస్సు
ప్రశ్న: మన మనస్సు యిష్టమొచ్చినట్లు తిరుగుతుంది? మనస్సు కలత జెందుతుంది. పరిష్కారమేమి?
జవాబు: పరిష్కారము అభ్యాసము మాత్రమే. కానీ మనస్సు ఆలోచనారహితంగా
వుండలేదు, వ్యక్తిగత మానసము నిశ్చేష్టమైతే యిక భావనలే వుండవు. నీవు సమస్థితిని పొందుతావు. అంటే అది ఈ ప్రపంచం ఉద్భవించక
పూర్వము సర్వము సమత్వములో నుండిన స్థితి. సమత భంగమైనప్పుడు సృష్టి
జరిగింది. నీవు ఆ సమత్వస్థితి నందుకొన్నావంటే యిక శరీరము రాలిపోతుంది (మరణం
సంభవిస్తుంది).
సంయమావస్థే గమ్యము. అదే సమత్వస్థితి. కానీ సంపూర్ణంగా కాదు. మనిషి పూర్తిగా ఆలోచనారహితుడు
కాలేడు. దాన్ని దాదాపు ఆలోచనా రహితస్థితి అనవచ్చును. అసలాలోచనలే లేకపోతే దైవాన్ని గురించి కూడా ఆలోచించలేము.
పుస్తకములు ఆధ్యాత్మిక ఆహారాన్నే కాదు, మానసిక ఆహారాన్ని
కూడా ప్రసాదిస్తాయి. అందులో రెండూ వున్నాయి. చదివి ఆనందించు, చేసి అనుభవించు అని నేనంటాను.
నేనీ విషయం చెబుతున్నాను, ఎందుకంటే దీన్ని
మీరు యెవరైనా అట్లే అనుసరించ వచ్చు. నేను జడ్జికోర్టులో పనిచేస్తుండే
వాడిని. నేను జడ్జిగారి దగ్గరకెళ్ళేవాడిని, ఆయన ఈ నా ఆజ్ఞలను
వ్రాసి తీసుకురా! అని విషయం చెప్పేవాడు. నే నాయన చెప్పిన విషయాన్ని
అప్పటికప్పుడు జ్ఞాపకముంచుకోలేక పోయేవాడిని. నే నాయనను మరొకసారి చెప్పండని
అడగలేక పోయేవాడిని. యెందుకో నాకు తెలియదు. నేను నా మేజావద్దకు వచ్చి
జడ్జిగారు చెప్పిన ఆజ్ఞలను వ్రాసుకొనిపోయి యిచ్చేవాడిని. అందులో ఒక్క తప్పు కూడా ద్రొల్లేదికాదు. భగవంతుడే నాకు సహాయపడుతూ
వుండేవాడు. భగవంతుడు సహాయపడితే యిక పనులన్నీ వాటికై అవే జరిగిపోతాయి. నీవు యెప్పుడైతే మునిగిపోతావో (దైవచింతనలో) అప్పుడు మరొకరెవరో నీ బాధ్యత
వహిస్తారు. నీవు నీ యింద్రియ జ్ఞానముతో మెలగుతుంటే, నీ బాధ్యత మరెవ్వరూ
వహించరు. కేవలం యింద్రియాలే బాధ్యత వహిస్తాయి. అవి నిన్ను దెయ్యాల వద్దకు
తీసుకెళతాయి. నీ మనస్సు భగవంతునిపై వుండాలి. భగవంతుని ఆరాధించు, ఆయన వద్ద మోకరిల్లు. ఆయనను గూర్చి ఆలోచించు. ఇక నీ యిష్టం వచ్చిన పని చేసుకపో.
ప్రభు కృప: డా|| స్వామి ఒక శాస్త్రజ్ఞుడు. ఆయన షాజహాన్పూర్ వచ్చారు. ఆయన తనకు ‘హార్మోన్’ అంటే యేమో
తెలియదు, దయచేసి నాకు వివరించండని అడిగాడు, నేను యిది, అది కాదు, యిది అది అంటూ
యెన్నో విషయాలు చర్చించాను. నేను చెప్పినవన్నీ సరిగ్గా
వున్నాయని తర్వాత తెలిసింది. నాకు శాస్త్రసంబంధిత పదములు
తెలియవు కానీ నా పరిశీలన సరియైనది. అతని కా శాస్త్ర సంబంధిత పదములు
అర్థమై ఆశ్చర్యపోయెను. కానీ నా పరిశీలన మాత్రము సరియైనదని గ్రహించెను. నేను చెప్పినదంతా సరిగ్గా వుండడంతో ఆయన ఆశ్చర్యపోయెను. మా గురువర్యుల కృపా విశేషమున యెక్కడేమున్నది నేనెఱుగుదును, మరియు దాన్ని నేను విశ్లేషించగలను. ఆలోచించ వలసిన ఆంశముంటే నా
దృష్టికి తీసుకుని రండి.
19. పరిణామము - పురోభివృద్ధి
నీవు సముద్రంలో లోతుకు మునునిగితేనే ముత్యములు సేకరించగలవు.
మనిషి నిరంతరం లయం కావాలనే ఆతృతతో వుండాలి.
దైవకృపనందుకోవడానికి యెప్పుడూజాగురూకుడవై వుండు.
పోగొట్టుకోవడమే సంపాదించుకోవడము.
ఎవరైనాసరే వారు అద్వైతులు కానీ ద్వైతులు కానీ, వారున్న స్థాయి నుండి పైకెదగవలసి వుంది.
కేంద్రం నుండి వెలువడుతున్న శక్తి తప్ప మరేది నేటి జీవనమునకు ఉపయోగపడదు. అది మనల్ని దగ్ధము చేసినా లేక మనల్ని అక్కున చేర్చుకున్నా అదే మనకు దిక్కు. మార్పు కావాలంటే మన ఆలోచన యిట్లే వుండాలి. అందుకు మనం సిద్ధంగా వున్నామా? అన్నది తేల్చుకొని మన సాహసాన్ని పరీక్షించుకోవడానికి రణరంగంలోనికి దుముకు
యోధుని వలె ముందుకు రావాలి.
భగవంతుని కొఱకు ఆరాటం అనునది అత్యంత ముఖ్యమైనది. అది లేకుండా అభివృద్ధి ఉండదు.
నేను త్వరితగతిన అభివృద్ధిని తేవాలని యెక్కువగా శ్రమిస్తాను. కాని అది వారిలో కలతను కలిగిస్తుంది. అది అభ్యాసులకు నచ్చదు. మోతాదు పెరిగేకొద్ది ఆందోళనా పెరుగుతుంది.
దేవతలకు సైతం దుర్లభమైన వాస్తవ జీవనసుధను జనులు రుచి చూచే దినము రావాలని నా
ఆకాంక్ష. జనులు వారివారి గాధలపై చింతిస్తూ వ్యగ్రతతో నున్నారు. కాసేపు ఒంటరిగా కూర్చొని నీ వ్యధలకై నీవు వెచ్చించినంత శక్తినుపయోగించి
భగవంతుని గురించి యోచించు. అప్పుడేమౌతుంది? నీ భగవంతుని గూర్చిన సత్యతత్త్వము, నీ ప్రాపంచిక
స్థూలవిషయముల వలెనే నీకు అర్థమౌతుంది.
ఉన్నతోన్నతమైన ఉత్తమస్థాయిలో, సర్వసాధారణ అభ్యాసము
చేయడము అసాధ్యమే అవుతుంది. ఆ దశలో భగవంతునితో అనుబంధం సజీవంగా
సాధకుడు ఉంచుకుంటే అతని అభ్యాసము సహజసిద్ధంగా అతని ప్రమేయమే లేకుండా, అతని ప్రయత్నం కూడా లేకుండా కొనసాగుతూ వుంటుంది. నమ్మకము మరియు ఆత్మస్థైర్యముతో ముందుకు సాగు ప్రతి అభ్యాసి మన సంస్థలో ఈ దశలలో
వుంటాడు. ఉన్నతోన్నత స్థానములతో ఐక్యత స్థిరపడినప్పుడు మార్గదర్శకత్వం దానికై అదే
లభిస్తుంది. చైతన్యస్థబ్దతా స్థితి (ఈ దశలో మనిషి తన్నుతాను నిర్జీవునిగా భావిస్తాడు) ఆధ్యాత్మికమైనది. వాస్తవార్థంలో దీన్ని ఆధ్యాత్మికతకు ప్రారంభంగా భావించాలి. కానీ జనులు యిదే అంతిమస్థితి యని భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీన్నే ఆకాంక్షించి దీనినే దైవానుగ్రహంగా పొందుదురు గాక!
ఒక మనిషి తను ముందుటి సంఘటనలన్నీ విస్మరిస్తే, అంతటితో పాత శతృత్వాలన్నీ అంతమైపోతాయి. పూర్వము తను చేసిన తప్పులన్నీ
గత జన్మకు సంబంధించినవిగా నమ్మి వాటి ప్రభావం యిప్పుడు నాపైలేదని తలంచాలి. ఎప్పుడూ భవిష్యత్తును నిర్మించు, పాత జ్ఞాపకాలతో
కాలం వృధాపుచ్చకు.
బాహ్యంగా గ్రహించ వీలవుతున్న స్థితే, నీవు సాధించిన
అంతర్గత స్థితిని సూచిస్తుంది. బాహ్యాంతరములు రెండూ ఒకే విధంగా
వుంటే సత్యతత్త్వసాక్షాత్కారం సాధ్యపడుతుంది. ఈ స్థితి నిన్ను నీవు జీవరహితునిగా చేసుకుంటే ఉత్పన్నమౌతుంది.
ప్రత్యేక యిచ్ఛ అంటే యేమిటి? ఇది సందేహాన్నిగానీ
అపార్థాన్నిగాని చొరనివ్వదు. ప్రాపంచిక మరియు ఆధ్యాత్మికమైన
విషయాలన్నిటిలోనూ దీన్ని వ్యక్తి ఉపయోగపెట్టుకోవాలి. తద్వారా అపజయ తలంపులు లేక నిరాశాయోచనలకు తావులేకుండా చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైనప్పటికీ, అంత మాత్రమున ఈ
శాస్త్రపరిజ్ఞానమును ప్రాపంచిక ప్రయోజనముల కుపయోగించుకోరాదని అర్థము చేసుకొనరాదు. ఆధ్యాత్మికమైన వ్యక్తి దీని నుపయోగించుకొనుట అనివార్యమైన పని. ఆతడు దీనిని తనయిష్టానుసారము యెక్కడైనా ఉపయోగించుకొన వచ్చును.
భగవత్ సాక్షాత్కార మార్గమున మూడు అవరోధము లున్నవి. అవి
(1) మనం అనుకుంటాం కాని పనిలోనికి దిగము
(2) ఒకేసారి చాలా విధానాలతో ప్రయత్నిస్తాం
(3) యింకా మనపై మనకు విశ్వాసముండదు.
తేలికదనం అనుభవంలోనికి వచ్చిందంటే సత్యస్థితి నెలకొన నారంభించిందన్న విషయానికది
నిదర్శనం. ప్రేమ భావన కూడా ఒక నిదర్శనమే.
మా గురువర్యుల మాటల్లో చెప్పాలంటే బాహ్యంగా వాతావరణమంతా కనబడిన భగవత్దర్శనం, నిజానికది అంతఃదర్శనము యొక్క ప్రతి రూపమే. ప్రాథమిక దశలో నీ బాహ్యమనస్సువాలకాన్ననుసరించి అది కేవలం బాహ్యమైన అనుభవంగానే
గోచరిస్తుంది. కానీ తర్వాత బాహ్యస్థితి బలహీనపడి అదేస్థితి అంతరంగంలో ప్రతిఫలించి లోనికి
చొచ్చుకొనిపోతుంది. అది తదనంతర స్థితి. ఆ స్థాయిలో వ్యక్తి తనలోతాను మునిగిపోయి వుంటాడు. ఆ స్థితి మరింత సున్నితమౌతూ మున్ముందుకు కొనసాగుతుంది. కానీ ఆ అనంతముయొక్క గట్టు యింకా చాలాచాలా దూరముననే వున్నది.
మాటను ఆలోచనను అదుపులో నుంచుకొనవలెను. అందువల్ల ఉన్నత స్థాయిలో
ఐక్యతను పొందుటకు నీవు అర్హుడవౌతావు.
తన యెదుగుదలను గురించి బిడ్డకు తెలియదు. పెద్దైన తర్వాత ఆ విషయం
అర్థమౌతుంది.
డా|| వరదాచారి తను వ్రాసిన "తత్త్వచరిత్ర"
(హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ) అను పుస్తకం నాకిచ్చారు. నేను చదివి ఆయన కిలా చెప్పను. నీ పుస్తకాలన్నిటిలోకి యిది
ఉత్తమమైనది. ఎందుకంటే దీనిలో ఆలోచనకు సంబంధించి వివరణ వున్నది. యితర పుస్తకాలలో అది లేదు. అదీ పరిణామము.
అరబిందో సిద్ధాంతమైన "ఉన్నత మానసం" (సూపర్ మెంటల్) విషయంలో నేను డా|| వరదాచారితో వివాదపడ్డాను. ఆయనతో నేను ‘కొంత సమయం
నిరీక్షించి చూడు, నేను చెప్పింది సరియైనదో కాదో నీవే తెలుసుకొంటావు’
అన్నాను.
అరబిందో ఉన్నత మానసం (సూపర్ మెంటల్) వచ్చి మనిషి మనస్సును మారుస్తుందని
చెప్పారు. కిరణాలు ఆధ్యాత్మికమై ఉంటాయన్నారు. నేను యిదంతా పూర్తిగా తప్పు
అన్నాను. ఉన్నత మానసం మార్చేదేమీలేదు. దైవ మనస్సు మానవ మనస్సు కంటే
పెద్దది. అయినా అదీ మనస్సే అంతే అది సత్యతత్త్వం కాదు. కనుక అది మార్చ గలిగేదంటూ యేంలేదు. అంతిమసత్యం మాత్రమే
మార్పుతేగలదు. ఇంకేదీ కాదు అని నేనన్నాను. అందులకాయన ఒప్పుకోలేదు. కొంతకాలం తర్వాత మా గురుదేవుల దయవల్ల ఆయనకు, ఉన్నత మానసమునకు, అంతిమ యెఱుకకు గల
తేడా చూపగలిగాను. నీవా స్థితిలో ఉంటే దాని తేడా తెలుసుకోవడం సులభం. ఆ తర్వాత డా|| వరదాచారి మీరు చెప్పినదే సరియైనదని ఒప్పుకున్నారు. అంతిమసత్యం ఒక్కటే (అంతిమ యెఱుక మాత్రమే) మనిషి మనస్సును మార్చ గలదంతేగాని
ఉన్నత మానసం కాదు.
20. శీలము, నడవడి మరియు ప్రేమ
ప్రేమ యిద్దరివిశ్వాసము నంగీకరింపదు. ఇక పలువురన్న మాట యెత్తుటకే
వీలులేదు. అసలు ప్రేయసి ప్రియుడి మధ్య ద్వైత భావనకు చోటేలేదు.
స్త్రీపురుషులందరూ మన సోదరీ సోదరులే. వారి యెడల మన ప్రవర్తనను
ఆవిధంగా మలచుకొనవలెను.
వ్యక్తి తన ఆలోచనకు తన మాటకు కట్టుబడి జీవించ వలెను.
మనం ధైర్యంగా వుండవలెను. పిరికిపందలుగా వుండరాదు. అయితే ఈ ధైర్యం, సాహసం ధర్మము కొఱకై మాత్రమే వుండవలెను.
చిత్రమేమిటంటే సర్వం భగవంతుడివ్వాలని మనం ఆశిస్తాం కానీ వాటిని పొందే
అర్హతకోసం మనమేమాత్రం కనీసం ప్రయత్నించం.
ప్రకృతి నుండి వచ్చిన ప్రతీది చాలా స్వచ్ఛమై వుంటుంది కారణం దాని ఆధారం
స్వచ్ఛమై వుండటమే. మనిషి సంపాదన స్వచ్ఛము మరియు పవిత్రమైనదైతే స్వచ్ఛమైన స్థితిలోనే వుంటుంది. దాని ప్రభావము సన్నిహిత పొరలపై వుండి మానవుని అల్లిక నంతా స్వచ్చము
గావిస్తుంది. ఈ కారణంగానే మునులు నిజయితితో మరియు పవిత్రతతో సంపాదించిన దానిని గూర్చి
బహుజాగ్రత్తలు చెప్పారు.
పాశవిక మనోభావాలు మారిపోయి మానవీయ మనోభావాలుగా (నిజమైన మానవత్వ లక్షణాలుగా)
పరిణతి చెందాలి.
దృఢ నిశ్చయము మరియు అకుంఠిత ధైర్యము ధీర లక్షణములు. అవే అంతిమ విజయమునకు ఆవశ్యకాంశములు.
నిజమైన ప్రేమ మాటలతో తెలుప వీలుకానిది. ఇదే అసలు సత్యతత్త్వము. దీనినేవిధంగాను వివరించ జాలము.
అభ్యాసి శూన్యస్థితి వరకు, యింకా దాన్నికూడ
దాటి పురోగమించడం యెలా? ఆ స్థాయిని తనే స్వయంగా సాధించిన గురువర్యుని దయా, కృపా విశేషము చేతను అది మొదట గుర్తించదగిన అంశమై యున్నది. కానీ అందుకు అభ్యాసి తనలో తీవ్రమైన ప్రేమ, భక్తి ఉత్పన్నం చేసుకోవాలి. దానితో గురువు తన కృపను
అభ్యాసిపై కురిపింపక తప్పని పరిస్థితి యేర్పడుతుంది. శూన్యస్థితిని సాధించడానికి తీవ్రమైన ఆతృత, అందువలన యేర్పడిన కలత ఆరాటము దానికితోడు శ్రద్ధాపూర్వకమైన ప్రేమ, భక్తి అత్యంతావశ్యకములై యున్నవి. హృదయంలో ప్రేమ భావము నిండి
వుంటే ఆరాటము దానికై అదే ఉత్పన్నమౌతుంది. అది యెక్కువా, తక్కువా అన్నదిక్కడ గణించదగ్గ అంశం కానేకాదు, యెందుకంటే అది కాలగమనంలో యింతకింత వృద్ధిచెందుతూ పోతుంది. మీకు నమ్మకంగా చెబుతున్నాను, శూన్యత్వాన్ని, యింకా దాన్నధిగమించిన మహోన్నత స్థితులను ప్రసాదించు వాడు భగవంతుడొక్కడే.
ఆధ్యాత్మికతకు చక్కని నడవడిక అత్యంతావశ్యకము. చక్కని నడవడిక అంటే మన బాహ్యజీవన విధానాన్ని ఒక విధంగా మలచుకొని యితరుల
సానుభూతి మరియు ప్రేమ బడయుట మాత్రమే కాదు. ఈ పదానికి విస్తృతమైన
అర్థమున్నది. ఇందులో మన ప్రతిచర్య చేర్చబడి యున్నది. ఎల్లవేళల ప్రశాంతముగా వుంటూ
సమతుల్యతను గలిగి ప్రకృతితో యేకమైయున్న మన జీవన విధానమని చక్కని నడవడికి అర్థము.
జీవితములో పరమ ప్రియమైన దానిని పొందుటకు నీ చిన్ని హృదయము తప్ప మరేమి సమర్పించ
గలవు? అంతకు మించి తగిన వస్తువింకేమి
గలదు?
మన మితురుల కెవ్వరికి హాని తలపెట్టరాదు. అయితే ఆత్మరక్షణ విషయములోను ఆస్తివిషయంలోను
(ఆక్రమణకు గురికాకుండా) గట్టిగానే వ్యవహరించ వలసి యుండును.
ద్వేషమనునది, చెడ్డ తలంపు. అది నకారాత్మక బంధము (నెగెటివ్), దాన్ని సమూలాగ్రంగా నిర్మూలించుము. అప్పుడు ప్రేమ నిలుస్తుంది.
21. శాంతి
ఆత్మలక్షణముశాంతి, మరి శరీరలక్షణము
తద్విరుద్ధము.
ప్రతిఒక్కరు శాంతిని కాంక్షిస్తారు. అంటే భగవత్ సాక్షాత్కారము వారి ధ్యేయము
కాదని దానర్థము. అటువంటప్పుడు వారు శాంతిని పొందుతారేమో గానీ సాక్షాత్కారము గాదు. కానీ భగవత్ సాక్షాత్కారమే ధ్యేయమైతే, శాంతి దానంతటదే
సహజంగా వెన్నంటి వస్తుంది.
పదార్థముతో మిళితమైయున్నప్పుడది శాంతి, కానీ అది పదార్తాని
కతీతమైతే, అదే ఆనందము.
శాంతి హృదయం నుండి హృదయానికి ప్రసారం చెయ్యబడుతుంది.
మన ఉనికి యొక్క అంతర్గత యెఱుకే శాంతి.
ఎక్కడ యేవిధమైన విరుద్ధ భావముండదో అక్కడ శాంతి వుంటుంది.
ఆత్మలక్షణము శాంతి. మరి అశాంతి అనగా శాంతికి విరుద్ధమైనది, దేహలక్షణము.
అలవాటును పునరావృతం చేసి సంతృప్తి పొందవచ్చును. అయితే శాంతి ఆత్మ సంబంధితము.
22. మన కర్తవ్యములు
అవివాహితులకు ప్రేమించడమెలాగో తెలియదు. కష్టాలనెదుర్కొనని వారికి యితరులకెలా
సహాయం చేయాలో తెలియదు.
ఈ లోకమునకుగాని లేక పరలోకమునకుగాని సంబంధించిన మన కర్తవ్యములను విస్మరిస్తే
మనం మన పవిత్ర విధుల నిర్వహణలో విఫలమైనట్లే.
భగవంతుని యిచ్ఛకు మనల్ని మనం సమర్పించుకొని మన పనిని మనం ఒక విధిగా తలంచి
ఎప్పుడూ చేసుకొంటూపోవలెను. ఇదే వాస్తవ జీవిత సుధాస్వాదనము.
మనము సర్వులను సేవించుటానికి సిద్ధముగా వుండవలెను. మనకు సేవచేసేభాగ్యము కలిగించినందులకు వారికి ధన్యవాదములు తెలుపుము.
నీవు నీ ప్రాపంచిక బాధ్యతలు నీ దారిలోని ఆటంకములుగ తలంతువు. కాని అది జడత్వముతో కూడిన తప్పుడు భావన. మనం ప్రాపంచిక మరియు దైవీయ
కార్యముల రెండింటిని ప్రక్కప్రక్కనే కొనసాగించుకొంటూ ముందుకు పోవలెను. మా గురువు ఈ
విషయములో ఆదర్శపురుషులు. నేను కూడా వారి అడుగుజ్ఆడలలోనే నడుస్తున్నాను.
వ్యక్తి ఎప్పుడూ నష్టపోరాదు. తన సాంసారిక బాధ్యతలు
నిర్వహిస్తూనే భగవత్ సాక్షాత్కారాన్ని గూడా దానితో పాటే అందుకోగలగాలి.
జీవితంలో ఉత్తమోత్తమ మార్గం మన బాధ్యతలను మనం నిర్వర్తించడమే.
అనంతము, సంపూర్ణమునైన గమ్యమును చేరుటే మనిషి ప్రథమ కర్తవ్యము. కానీ యెంతకాలము వ్యక్తి మనసులో గమ్యాన్ని నిర్థారణ చేసికొనడో అంతవరకు తన
ప్రయాణమును విజయవంతంగా పూర్తిచేయలేడు.
మన ఆధ్యాత్మిక సంస్థకు చేసిన సేవవలన అభ్యాసికి ప్రయోజనమున్నదా? సంస్థలో తన వంతు కర్తవ్యము నిర్వర్తించుట మరియు తన పనికి తాను కట్టుబడి యుండుట
అత్యావశ్యకము. సంస్థ సేవను గుర్తెరిగిన వారు కొందరే, అది అభ్యాసి యొక్క
బాధ్యతలలో ఒక భాగము. దాని వలన గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనము పొందుదురు. అంతేకాదు అది అభ్యాసి విధియే గాక గురువుకు కూడా సంతోషము కలిగించు పని. కానీ యేంచేద్దాం యింత అవసరమైన అంశాన్ని జనులు గుర్తించడం లేదు.
నీవే కర్తవు. నావల్లనే యీపని అవుతున్నదని తలచావనుకో అప్పుడు శక్తి నీవరకే
పరిమితమౌతుంది. బయటికి వ్యాపించదు. అలాగాక చేసేది నీవే అయినా అలా అనుకోకపోవడం వల్ల ఆ పని దైవీయమైపోతుంది. అది బయటికి కూడా వ్యాపించి యితరులకూ మేలు చేస్తుంది.
మనసంస్థకు చేసిన సేవ మహాత్ములైన గురువర్యులకు చేసిన సేవగా అంగీకరింపబడుతుంది.
23. ఆత్మార్పణము
ఆత్మార్పణ గావించిన తర్వాత యిక నీకు సందేహమన్న ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. సందేహించడం మానేయ్. అభ్యాసి మనస్సులో సహకారమన్న ఆలోచన ఉద్భవించినంతనే అతడు ఆత్మార్పణ యొక్క మొదటి
స్థాయికి వచ్చినట్లు.
నిజమైన త్యాగమంటే ఉద్యోగం, కార్యాలయం వదిలేయడం
కాదు. లేక అడవికి వెళ్ళిపోవడం కాదు, కానీ నీ అహాన్ని
వదలడమే. నిజమైన అన్వేషకునికి కావలసిందిది.
ఆత్మార్పణము, భగవంతునిపై ఆధారపడడం, నిరంతర స్మరణ అవసరమై యున్నవి.
ప్రేమ, భక్తి, విశ్వాసము, విధేయత మొదలైన వాటి ద్వారా కాలక్రమంలో ఆత్మార్పణము దానికై అదే సంభవిస్తుంది.
దైవీయ మార్గము ననుసరించు వారు తమకైతాము కరిగి పోవడమన్నదొక్కటే వారికున్న యేకైక
ప్రక్రియ.
విజయ రహస్యము సమర్పణమే.
నీవు ‘నాలో నేను యెఱుక దప్పియున్నా’ నంటున్నావు, యెఱుక లేకుండడమన్నది ఆత్మలక్షణము. అది మనం ప్రాపంచిక చింతను
వదలించుకొన్న తర్వాత అనుభవానికొస్తుంది. ఈ యెఱుక లేకపోవడమనేది వృద్ధి
జెందుతూ మనం సంపూర్ణంగా భగవంతునిలో లీనమయ్యే వరకూ కొనసాగుతుంది.
మనం బ్రహ్మంలో లీనం కావాలంటే, మనం ఆయనలో
కరిగిపోవాలి. తల్లి బిడ్డతో ఉన్నది, బిడ్డ కాదు తల్లితో
వున్నది.
ఆయన యిచ్ఛే నెరవేరు గాక!
కొంతమంది యిక్కడకు శోధించడాని కొస్తారు.
ఆయనలో మనం లేకున్నప్పుడే చిక్కులొస్తాయి.
నీలోనే వెతుకు, తప్పక నీలోనే దొరుకుతుంది. ప్రభువున్నాడు ఎప్పుడు? ఎప్పుడు నీ వక్కడ లేవో అప్పుడాయనున్నాడు.
నేను కేవలం అభ్యాసుల నుండి సహకారాన్నాశిస్తున్నాను.
తల్లిదండ్రులు యిది చెయ్యి అది చేయకు అనే మాటలు పిల్లల మేలుకే చెప్పినా అవి
వారికి అసమంజసంగా అనిపిస్తాయి. వారికై వారే అవి సరైనవని
పెద్దయే కొద్దీ గ్రహిస్తారు.
నీకై నీవు మరణించినట్లుంటూ ఆయన వల్ల జీవిస్తూ వుండు. లోలోపల సర్దుబాటు, శ్రద్ధ, అంతర్గత అనుబంధం అవసరం.
నావద్ద నున్నదంతా దోచుకపోండి, అందుకు బదులుగా
మీది అనుకొని మీ దగ్గరుంచుకొన్నది నా కివ్వండి.
నాలో అవాంఛనీయ తలపులు ఉత్పన్నమైతే నేను వాటిని మా గురువర్యులవని అనుకుంటాను, అవి నిలిచిపోతాయి.
అభ్యాసి గురువుతో సంపూర్ణంగా లయమైతే, గురువుగారికి
ప్రాప్తమైనదంతా అభ్యాసికి బదిలీ చేయబడుతుంది. అందువల్లనే గురువులో లీనమవ్వడం గొప్ప విలువైనది. ఇది సాధించడానికి ప్రతిభావంతమైన విధానము శూన్యస్థితిని పొందుటే.
నేను నా గురువును గుడ్డిగా అనుసరించాను.
కోరికలను అధిగమించాలంటే, నిన్ను నీవు
భగవంతునికి సమర్పించుకొనే ప్రయత్నం చేయాలి. అదెలాగంటే మరణించిన వాడు
శవాలంకారుని చేతిలో నున్నట్లుండాలి. దానికి నన్నొక పద్ధతిని
నిబంధించమంటే, నేను మీకొక అతి సులభమైన పద్ధతిని నీ
ముందుంచుతున్నాను. అదేమంటే, మీ కోరికలన్నీ నావి, మీవి కావని తలంచడమే.
గురువుకు తన్నుతాను సంపూర్ణముగా అప్పజెప్పుకోవడం వల్లనే తన ప్రయత్నంలో విజయం
సాధిస్తాడు. సంపూర్ణంగా అప్పజెప్పడమంటే తన్నుతాను యాచకునిగా తగ్గించుకోవడమే. మరోమాటలో చెప్పాలంటే తాను భగవంతుని వాకిటికడ యాచకునిగా మారిపోవడమే.
హద్దులనేకమున్నాయి. ‘నాది’ అన్నదందులో ఒకటి. దాన్ని మరొకరితో అనుబంధించుము. క్రమంగా నాదన్న భావం నశిస్తుంది.
ఐక్యమవ్వడం కోసం మన మెప్పుడూ అతృతతో వుండాలి.
ఆత్మార్పణం సులభంగా సాధ్యపడాలంటే కేవలం ఒక ఇచ్ఛాశక్తే అవసరం. ఇచ్ఛ యెంత తేలికైనది, యెంత
సున్నితమైనదైతే దాని పని అంత ప్రతిభావంతంగా వుంటుంది.
వ్యక్తి తన హృదయాన్ని అమ్మివేయ గల్గితే, అనగా గురువుకు
కానుకగా యివ్వగలిగితే ఇక చేయవలసిందేమీ అట్టే వుండదు. ఇది ప్రకృతి సిద్ధంగా అతన్ని అనంతసత్యంలో లీనమయ్యే స్థాయికి తీసుకెళుతుంది.
అభ్యాసానికి గట్టిగా కట్టుబడటానికున్న యేకైక ప్రతిభావంతమైన మార్గము తన్నుతాను
అనంతముతో అనుబంధించుకొనుటే. మరో మాటలో చెప్పాలంటే అనంతముతో
సంబంధమేర్పరచుకొని సంపూర్ణత్వం సాధించిన మహనీయునితో అనుబంధ మేర్పరచుకొనుట. ఎందుకలా అనుబంధ మేర్పరచుకొన్నామంటే, ఒక మహాపురుషుడు నిన్ను
తన హృదయానికి హత్తుకున్నాడు. నీ ప్రయత్నము వారివైపు
లోలోతులకు దారితీస్తున్నదంటే నీవు అనంతం వైపు పురోగమిస్తున్న
మార్గానెన్నుకున్నావన్నమాట. ఆత్మార్పణమన్న మాటకిదీ అర్థము. ఇదే సంపూర్ణత సాధించుట కేర్పడిన ఖచ్ఛితమైన మార్గము. ఎంతకాలం నీవు ఒక పనిని చేస్తూ నీ వాపనిని చేస్తున్నట్లు భావిస్తావో అంతకాలమది
సరైన విధానం కానేరదు. నీవు ఆత్మార్పణ స్థాయికి దూరంగా వున్నావు. ఎందుకంటే అహంభావము యింకా అక్కడున్నది. ఆత్మార్పణలో యెఱుకకు సంబంధించిన
భావన నుండి విడివడి స్వేచ్ఛననుభవిస్తావు. ఆ స్థితిలో ప్రతీది ప్రకృతి
సిద్ధంగా అవసరానికి తగ్గట్టు, యే విధమైన ముందు
ఆలోచన గానీ, వెనుకటి ఆలోచన గానీ లేక కాలానుగుణంగా సాగిపోతుంది.
అంతము లేక సంపూర్ణస్థితిని పొందుటకు అతి సులభమైన మరియు ఖచ్చితమైన విధానము, నిన్ను నీవు వాస్తవార్థములో ఆ మహానీయునికి ఆత్మార్పణ గావించుకొని నీకైనీవే
జీవించియున్న శవముగా మారిపొమ్ము. ఈ ఆత్మార్పణా భావమును బలవంతపు
ప్రయత్నముతో యంత్రిక విధానమున సాధించ నెంచినచో, అది నిజమైనది కానేరదు. అది తనకైతానే లోలోపల యేవిధమైన
బలవంతపు పరిశ్రమ ఒత్తిడి లేకుండా మనస్సున వృద్ధి చెందవలెను. ఈ వాస్తవమునకు సంబంధించిన జ్ఞానమక్కడుంచుకున్నా అది నిజమైన ఆత్మార్పణ కానేరదు. నిన్ను నీవు సమర్పించుకొన్నావన్న తర్వాత యిక మిగిలిన దేమైనా వుందంటే, నేను నమ్మినంతలో యింకేమీ లేదు. ఈ స్థితిలో నీవు సత్యతత్త్వంతో
సన్నిహిత సంబంధం అనునిత్యం కలిగి వుంటావు. దివ్యశక్తిధార నీలోనికి
నిరంతరంగా ప్రవహిస్తూ వుంటుంది.
గురువర్యునకు సమస్తము సమర్పించి నీ పనిని ప్రారంభించు. నీలోని నీ గురువే నీ యింటి విధులు, వ్యాపార లావాదేవీలు, సంతోషకార్యములు, అన్నీ చేస్తున్నాడని విశ్వసించు. ఆఖరకు ధ్యానంలో కూడా, గురువే
ధ్యానిస్తున్నాడని తలంచుము.
సాధనలో రెండు అంశములున్నవి. ఒకటి నీకైనీవు సాధన చేయడంతోనే
సరిపోదు. ఆ సాధనకు భగవంతుని కృప తోడై యుండవలెను. అదే ఈ ప్రయత్నమునకు
ముఖ్యావశ్యకము.
సామాన్యముగా జనులు ఆత్మార్పణకు ప్రయత్నిస్తారు. వారు దేవాలయాలకు వెళ్ళి సాష్టాంగపడి, ఓ దేవా! నేను
పూజింప సమర్థుడనుకాను, అసలు నేనేమియు
చేయలేని వాడను. నేనేమంత కలవాడిని కూడా కాను, నేను నీకు
ఆత్మార్పణ గావించుకొంటున్నాను, అని మ్రొక్కి
యింటికి తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు వారు ఆత్మార్పణము
గావించామనుకుంటారు. కాని అక్కడ యింకా ‘నేను’ వుంది. మనం ‘నేను’ తో కదలి వెళతాం, తిరిగి ‘నేను’ తోనే యింటికి వస్తాం. మనం ఆత్మార్పణ
చేస్తున్నామన్నప్పుడల్లా ‘నేను’ ఉండనే వుంది. ఇలా ఆత్మార్పణ కోసం ప్రయత్నించి ప్రయోజనం లేదు. సరైన పద్దతేమంటే భక్తిని పెంపొందించుకోవాలి. అదే ముఖ్యమైనది. తద్వారా నేను భగవంతునిపై ఆధారపడి వున్నాననే భావన కలగాలి. అదే భగవంతునిపై ఆధారపడు అత్యుత్తమ విధానము. ఎప్పుడు, నీవు మరొకరిపై ఆధారపడి వున్నావన్న భావన వుంటుందో, అప్ప్పుడు ‘నేను’ నీది గాకుండా ఆయనదౌతుంది. ఇదీ పద్దతి. ఈ పద్దతి ఆత్మార్పణకు దారితీస్తుంది. ఎప్పుడైతే నేను సమర్పణ
గావించుకొన్నానంటామో అప్పుడక్కడ ‘నేను’ ఉంటుంది. నా అభిప్రాయంలో అది దానికైఅదే రావాలి, దాని పర్యవసానం
ఆత్మార్పణమౌతుంది.
దీనత్వం నీలో యేర్పడాలి, దాంతో
పురోగమించాలి. ఎప్పుడు మీరు ప్రతి ఒక్కరికి లొంగి వుంటారో అప్పుడు మీరు మీ యెఱుక లేకనే
సమర్పణమైపోతారు. నేను నా అనుభవంతో చెబుతున్నాను. మీరు యెప్పుడు మీకు
తెలియకుండానే అందరికి లొంగి వుంటారో అదే నిజమైన సమర్పణ.
ప్రశ్న: ఆత్మోద్ధరణ జరుగుతుందా?
జవాబు: ఎప్పుడు భ్రష్టత చెందిందని తెలుస్తుందో, అప్పుడు నీవే దాన్ని తీసివేయగల్గుదువు. మొదట మనల్నిమనం సరిదిద్దుకోవాలి. ఆత్మోద్ధరణ కోసం సంసిద్ధుడవై ప్రారంభించు. ఇది తప్పు, అది ఒప్పు అన్న ఆలోచన మనస్సు నుండి తీసేయ్. ఒకరొకరే కలసి సమూహమౌతుంది. నీవు ఉండవలసిన తీరులో
ఉన్నావనుకో, నిన్ను అనుకరించే వారూ ఉంటారు. నీవు చేయతగింది చేసేయ్. ఇతరులు నిన్ను అనుసరిస్తారు.
24. సాక్షాత్కారము
అనుసరించు విధానము సూక్ష్మము కానప్పుడు, సూక్ష్మాతి
సూక్ష్మమైన సాక్షాత్కారము సాధ్యము కానేకాదు.
ఇంద్రియ జ్ఞానము ద్వారా భగవత్సాక్షాత్కారము పొందాలని జనులు కాంక్షిస్తారు.
అది సాధ్యముకాని పని.
కాంతి మన ధ్యేయం కాదు. మనం మహోన్నతమును చేరాలి.
సూక్ష్మమైనదగు అనుభవశక్తిని పొందిన తర్వాత యిక ప్రశ్నలుత్పన్నం కావు. ఆ తర్వాత తనకైగానే వాస్తవ జీవిత స్థితులను గ్రహించి అర్థము చేసుకొనగల్గును.
ఒక నిముషంలో కైవల్యము (విడుదల, స్వేచ్ఛ)
సాధ్యమౌతుంది, కాని అందుకనేక చిక్కులున్నవి.
తిరుగులేని విజయపథం బాధాతప్త అశాంతిమయ మండుతున్న ఆశయం ద్వారా వెళ్ళుతున్నది. (బాబూజీ ఈ స్థితిలో నిరంతరాయంగా 27 సంవత్సరములు గడిపెను)
మనలో చాలా మంది భగవంతుడంటే యేమో తెలుస్తే చాలనుకుంటారు. ఇది తప్పుడు భావన, భగవంతుణ్ణి
పొందడమన్నది నిజమైన ఆధ్యాత్మిక విషయము.
మనం సాక్షాత్కారాన్ని సాధింప యత్నిస్తాం. కానీ అదేమిటి అనే చింతలో తగుల్కొనకూడదు.
కార్యోన్ముఖము గావింపబడిన సామర్థ్యమే శక్తి. అది నిశ్చలస్థితిలో కనబడని శక్తి. కనుక కనబడని శక్తే మూలమన్న
నిశ్చయమునకు వత్తువు. మరో అర్థంలో చూస్తే అందులో మహత్తరమైన అనంత శక్తి దాగివున్నట్లు తెలుస్తుంది. ఏదోవిధంగా ఆ శక్తి బాహ్యచర్యను అంటే బయటకి పొంగి పొరలుతున్న శక్తిని ఆపగలిగితే
అది సమత్వస్థితికి తేబడి తదనంతరం చాలా ప్రతిభావంతమౌతుంది. మీరందరూ ఆ అంతిమ స్థితిలో అంటే మూలంలో నిశ్చలంగా వుంటూ, యిచ్చలో మాత్రం చైతన్యవంతమైయున్న ఆ స్థితిలో కరిగిపోవాలని నే
నాకాంక్షిస్తున్నాను. కానీ అది వ్యక్తిగత మనస్సు సక్రమంగా క్రమబద్ధీకరింబడి సమతకు తేబడి యిచ్ఛాశక్తి
మొత్తము శూన్యత జెందినప్పుడే అది సాధ్యము. అప్పుడతనిలో మిగిలి యుండునది
శూన్యము, శూన్యము మాత్రమే.
కైవల్యము (విడుదల, స్వేచ్ఛ) నేడు
అతిసులభమైపోయినది, కారణం దివ్యావతారమూర్తి యిప్పుడు ప్రత్యక్షముగా
ఉనికిలో వుండటమే.
ఆధ్యాత్మికరంగమున సూర్యులవలె మీరందరూ దైవమునందు లీనమై పోవాలని నేను
ఆకాంక్షిస్తున్నాను.
విజయ రహస్యము ఆత్మసమర్పణమే.
భగవంతుడే కేంద్రంకావడం వల్ల కేంద్రస్థానాన్ని పొందటానికి భగవంతుని ధ్యేయంగా
యేర్పరచుకొనుము.
ప్రాణాహుతి ధ్యేయము, సర్వస్వమునూ
సహజస్థితికి తేవడమే. అది సాధ్యమై వ్యక్తిగత అహం నశిస్తే సాక్షాత్కారం ఫలిస్తుంది.
కైవల్యం (విడుదల) ఒక జీవితకాలంలోనే లభిస్తుందని మాట యివ్వబడింది, అయితే అది చెప్పింది చెప్పినట్లు ఆచరణలో పెట్టేవారికి మాత్రమే.
సాక్షాత్కారం పొందినాడనటానికి గొప్ప గుర్తు వ్యక్తిలోని స్వార్థం పూర్తిగా
నశించడమే. చాలామంది యితరులకు సహాయం చేస్తారు కానీ వారిలోని స్వార్థచింతన హృదయాంతరాళం
నుండి బయటకి పోదు.
సాక్షాత్కార స్థితి యెలా వుంటుంది? అక్కడ నీవూ లేవు, భగవంతుడూ లేడు.
మార్పులేనిదేదో దానిని సాక్షాత్కారింపజేసికొనుట కుపయోగపడునదే నిజమైన విద్య. అది సాక్షాత్కారమగుటకు, పఠనము గాని, నమ్మకముగాని, హేతువాద దృక్పదము గానీ పనికిరావు. అది అతీంద్రియ జ్ఞానముతోనే సాధ్యము. ఒక వేళ అది ముతకస్థాయిలో
పొందినప్పటికి వ్యక్తి మరింత ముందుకు పురోగమించి సముద్రతీరమును చేరవలసి యున్నది. కొంతసేపు ఆ చల్లదనాన్ని ఆస్వాదించిన తర్వాత తన్నుతాను ఆ అనంత సాగరంలోనికి
నెట్టేసుకుంటాడు. తద్వారా తిరుగులేని ఆ శాంతి, సంతోషమును పొంది
ఆస్వాదిస్తాడు.
సాక్షాత్కారస్థితి ఒక మూగస్థితి. అది వివరింప నలవికాదు. బాహ్యాంతరముల రెండింటియందునూ వెలుగు (జిగి)ను దర్శించుట అనుభవమున పొందుట
సాక్షాత్కారము కానేకాదు. మనము కడకు పురోగమిస్తున్నదక్కడకు కాదు. మనం పురోగమించి చేరుకోనున్న
స్థానములో చీకటీ లేదు వెలుగూలేదు.
బాధ, దుఃఖముల నుండి బయటపడుటే మానవుని ముఖ్యప్రయాసయై యున్నది. మహాత్మాగాంధీ ఒకసారి యిలా వ్యాఖ్యానించారట. "స్వేచ్ఛకు వెళ్ళుమార్గము కారాగారము ద్వారానే వెళుతుంది" అది. ఈ ప్రపంచాన్ని కారాగారముగా భావిస్తే ఈ వాక్యము ఆధ్యాత్మికరంగమునకు కూడా చక్కగా
సరిపోతుంది. ఘోరనిరాశలో జనులు ప్రాణాలు వదిలేయాలనుకుంటారు. కానీ అట్టి సందర్భములలో, చావుతో సమానమైన
జీవనం (విదేహ జీవనం) ప్రసాదించమని భగవంతుని కోరుకోవడం ఉత్తమమని నా అభిప్రాయం.
మనిషి గమ్యము భగవత్సాక్షాత్కారమే. అతని సమస్త కార్యకలాపములు తన
అంతిమ గమ్యము అనగా భగవత్సాక్షాత్కారము చేతనే సూత్రీకరింపబడాలి.
ఈ స్థితి (సహజ మార్గము ద్వారా లభించిన స్థితి)కొఱకు దేవతలు పరితపిస్తారు. కానీ ఇది మనుషుల కోసమే కేటాయింపబడింది. ఇది మనం ఊహించినంత కష్టమేమీ
కాదు. నాకు మాత్రం ఇది మామూలుగా సరళమైన వాటి వలెనే యిదీ సరళమైనది.
ఆలోచనా విధానము తాత్త్వికము. కార్య నిర్వహణా విధానము యోగము. సాక్షాత్కారమార్గము నిష్క్రియ.
ప్రకృతితో కలిసి వెనక్కుమరలి తన్నుతాను యెవరు సూక్ష్మాతిసూక్ష్మము
గావించుకుంటాడో అతడిపై మాత్రమే సత్యతత్త్వముదయిస్తుంది. స్థౌల్యము పూర్తిగా నశిస్తేనేగాని మనం కనీసం సత్యతత్త్వంలోనికి తొంగిచూడడం
కూడా కుదరదు, ఆటంకములేవైనా వుంటే వాటికన్నిటికి మనమే బాధ్యులము. యివన్నీ తొలగించుకుంటేనే గాని మనం సత్యతత్త్వాన్నందుకోలేము.
సూక్ష్మమైన దాన్ని తెలుసుకొనుటకు, సూక్ష్మమైన
విధానమునే అనుసరించవలెను. దీనికి విరుద్ధంగా మన పద్ధతులు స్థౌల్యమైనవైతే, మనకు ముందున్న స్థౌల్యానికి తోడు మరొక వక్రత యేర్పడడం మొదలౌతుంది. అందువల్ల దేహములోని ప్రతి రక్తనాళము ఒక ద్రువాన్ని యేర్పాటుచేసుకొని శరీరంపై
స్థూలాతిస్థూలమైన ప్రభావం చూపి మార్పును కలిగిస్తాయి. వీటిని గురువు శక్తితో నాశనం చేసేవరకు సత్యతత్త్వంనకు దారే తెరువబడదు.
ప్రశ్న: భగవత్సాక్షాత్కారానికి మనం ప్రయత్నిస్తాం? అయితే ఇందులో విజయం సాధించలేని వారం కూడా వుంటామా?
జవాబు: నీకిష్టమైతే దీన్నవలంభించు. నీకింకా నేను భగవత్సాక్షాత్కారాన్ని
సాధించలేను, యింకా యెన్నో జన్మలెత్తాలి, అన్న ఆలోచనలుంటే, అది బలహీనమైన భావన. ఎందుకంటే నీ ఆలోచన యిప్పుడు భిన్నమైయున్నది. కానీ సాక్షాత్కారము అభిన్నభక్తిని వాంఛిస్తుంది.
"స్థితప్రజ్ఞ" అనునది సూక్ష్మజ్ఞానగుణసంపన్నమైన
సమత్వస్థితి.
వ్యక్తి తను పరబ్రహ్మాండమండల స్థితికి చేరితే అప్పుడతన్ని సాక్షాత్కారము
పొందిన వానిగా గుర్తించవచ్చు. అయినా అతడు కాసింత ఆధ్యాత్మికత
పొందిన వాడనే నా అభిప్రాయము. సాక్షాత్కారము మహోన్నతమైనదని నా
భావన. అది భగవంతునిలో లీనమైపోవుట తప్ప వేరు కాదు. నీవటువంటి వ్యక్తులను
కనుగొన్నావంటే, వాళ్ళు తప్పక నా మార్గములో ఉన్నవారే అయివుంటారు.
ప్రశ్న: ధ్యాన సమయంలో ఆలోచనలో కొన్ని సెకండ్లు అంతరాయం కల్గిన స్థితి
ఉంటున్నది. దయచేసి వివరించండి.
జవాబు: అది సహజావస్థ స్థితి. అది ప్రకృతి సహజం. ధ్యాన సమయంలో యేమి కలిగినా, అది మీకు నచ్చినా
నచ్చకపోయినా, అది మంచిగాని చెడ్డగాని అంతా మీ మేలుకేనని మీకు నేను
చెబుతున్నాను. నేను యెక్కువగా చదువుకున్న వాడిని కాను. నేనెప్పుడైనా చదవాలనుకొంటే నేను
నా హృదయ పుటలను తిరగేస్తాను. నా హృదయమే ఒక పుస్తకము. అందు
వ్రాయబడినదేమిటో తెలుసా? "అజ్ఞానము". ఆ పదమొక్కటే నాకు నేర్పబడినది.
ప్రశ్న: పూజ యొక్క ప్రాధాన్యతేమి? ఇంకా యితరములైన
ఆరాధనలు, కుంకుమ మొదలైన వాటి సమర్పణల ప్రాధాన్యతేమైనా వుందా?
జవాబు: నీకు భగవంతుడు కావాలంటే, "ఒంటరిగా" ఆయన దగ్గరికెళ్ళు. యేదారిలోనైనా భగవంతుని వైపు వెళ్ళు. కానీ ఆయన వద్దకు ఆయనకిష్టమైన
పద్ధతిలో వెళ్ళు. నీవు అన్నిటికి కర్తవౌతావు. నీకైనీవే గురువువౌతావు.
ప్రశ్న: భగవంతుని
చేర్చు మార్గములేవి?
జవాబు: వివేకానందస్వామి అపరాభక్తి మరియు పరాభక్తిని గూర్చి వ్రాశారు. అపరాభక్తి అనునది సన్నద్ధమవడం. కానీ యిదొక్కటే సన్నద్ధమగుటకు
మార్గం కాదు. ఇతర పద్ధతులు, మరింత స్పష్టమైనవి కూడా వున్నవి. యేది సరళమైనదో అదే స్పష్టమైనది. దానికి రవంత దివ్యత్వముంటుంది. అదెంత సరళమో అంత సరళంగా నువ్వూవుండు. సహజమార్గము ప్రకృతిసిద్ధమైన
భగవత్సాక్షాత్కార మార్గము.
ప్రశ్న: భగవత్సాక్షాత్కారం పొందిన వాని లక్షణములేవి?
జవాబు: అది దూరస్థమైన విషయము. మనం కేంద్రమండలంలో
ప్రవేశించి యేడు వలయాలు దాటుతాము. అక్కటి స్థితి యెలా వుంటుంది? వ్యాకోచం మొదలౌతుంది. కృష్ణపరమాత్మ దీన్ని విరాట్ అన్నారు. ఆమాట కూడా సత్యతత్త్వమునకు
సరిరాదు. అదీ నేను కనుగొన్న విషయము. ఆ యేడు వలయాల తర్వాత వ్యాపించడం
మొదలౌతుంది. ఆ వ్యాపించేది దైవీయజ్ఞానం. ఆ తర్వాత సంపూర్ణత్వపు పూర్తి రూపం, అదీ మనిషి పరిమితులకు లోబడి వ్యక్తమౌతుంది. హద్దులుండనే వుంటాయి. తదనంతరం లయావస్థ సిద్ధిస్తుంది. ఆ స్థితి చేరిన తర్వాత
మిమ్ములనా భగవంతుడనుగ్రహించు గాక! అప్పటికింకేమి మిగిలి లేదు. ఇక ఈత మొదలౌతుంది. ఆ తర్వాత యిక స్థితులేవీ లేవు. ప్రతీది స్వచ్ఛము మరియు సరళమై
వుంటుంది. ఈత ముందుకు, ఇంకా ముందుకు, మున్ముందుకు
సాగిపోతుంది.
నేను చెప్పే సాక్షాత్కర స్థానం చాలా దూరంలో వున్నది. పరబ్రహ్మాండమండలం చేరిన వాడు సాక్షాత్కారం పొందాడని వారు (ముస్లిములు)
భావిస్తారు. కాని వారు యేదో రవ్వంత సాధించారని నా అభిప్రాయము. దైవీయ జ్ఞానము అక్కడ నుండి మొదలౌతుంది. అయినా అది పుట్టడం మాత్రం
యింకాస్తా ముందే జరిగిపోయి వుంటుంది. ఎప్పుడు నీవు బ్రహ్మంలో శయనించి
వున్నావో అప్పుడే నీకు సర్వజ్ఞత్వం ప్రాప్తించి వుంటుంది. బహుశా అది ఒక అంశ మాత్రమై వుండొచ్చు. బ్రహ్మమే జ్ఞానము. ఎవరైనా యే శాస్త్రమైన ప్రశ్నిస్తే నీవు సమాధానమివ్వగలగాలి. ఇవన్నీ వున్నప్పుడే ఎవరైనా సాక్షాత్కారం పొందిన వారౌతారు. అదీ వారి లక్షణం.
వాస్తవానికి మనమోక రబ్బరు బంతి వలె వున్నాం. గోడకు విసిరి కొడితే తిరిగి వెనక్కొచ్చేస్తుందది. ఎవరైనా భగవంతుని వైపు విసిరేసినా తిరిగి మనం వెనక్కు వచ్చేస్తాం. ఎందుచేత? అధమవృత్తులు శక్తివంతములై
వుండుట చేత, స్వచ్ఛత లేదక్కడ. అధమవృత్తులను చైతన్యరహితం గావించాలి, ప్రతిచర్య వుంటుందక్కడ. ఆ ప్రతిచర్యను నిర్మూలించాలి. అక్కడ స్థూలత్వంలేకుంటే
యిది సులభంగా సాధ్యపడుతుంది. స్వచ్ఛత లోపిస్తే మనకా అర్హత
వుండదు. స్వచ్ఛత ముఖ్యం. స్వచ్ఛత అంటే స్థూలత్వప్రభావం లేకుండుటే.
విరాట్ను ఆంగ్లంలో కాస్మస్ అంటారు. అదే బ్రహ్మాండం. కృష్ణపరమాత్మ దీన్నే బ్రహ్మాండమండలం నుండి చూపారు. ఇదేమంత గొప్పస్థితి కాదు. మనిషి సున్నితత్త్వం గలవాడైతే
ఎప్పుడైనా దాన్ని దర్శించవచ్చును. గీతలో వ్రాయబడినది అతిశయోక్తి. నేను కూడా దాన్ని (విరాట్ను) దర్శించాను. అది వాస్తవానికి నిజం కాదు. కృష్ణపరమాత్మ అంతకంటే గొప్ప
స్థితిని చూపించి యుండవచ్చును. కాని అది ఆయన అవసరానికా సమయంలో ఉపయోగపడనిది. అందుకే ఆయన అంత మాత్రమే చూపించెను. అదే ఆ సమయానికి తగినది. రావలసినవన్నీ ముందే యేర్పడి వుంటాయి. వేల సంవత్సరాల క్రితమైనా, వాటిని గుర్తించగల శక్తిమంతుడైతే తెలుసుకో గల్గుతాడు. పని ప్రకంపనల ద్వారా
చేయబడుతుంది. నీకు యిచ్ఛ వుంటే నీవు గ్రహించ గలవు.
ఒక్కోసారి యిలానూ అవుతుంది. రవ్వంత ఆధ్యాత్మికత లభించిందంటే
చాలు యిక నేను గొప్ప ఆధ్యాత్మిక గురువుననుకుంటారు. దీనికి మొదలే గాని తుది లేదని నేను ప్రతి చోటా చెబుతుంటాను. అయితే లయావస్థలో యిది వుంటుంది. ప్రారంభము, అంతము రెండు సమాప్తం.
నేను యితర మార్గాలతో సహజమార్గాన్ని పోల్చి చెబుతుంటాను. ఉద్వేగముందంటే అది పదార్త జనితమే. ఇది సర్వదా సామాన్యమే. నీవు
దీని వల్ల పతనమౌతావు. ఎప్పుడైతే నిజమైన ఆధ్యాత్మికత వుంటుందో, ఎప్పుడు నీవు
పదార్థం (మాయ) నుండి స్వేచ్ఛను పొందుతావో, అప్పుడిటువంటి
పతనమేర్పడదు. దైవత్వం ఎలా పనిచేయాలో అలా పని చేసుక పోతుంది. గురువు అది యెలా వుండాలో (ఎలా వుంటే మంచిదో) అలా పని చేయిస్తాడు. నీవు భావోద్వేగానికి గురయ్యేట్లు నేను ప్రాణాహుతి ప్రసారం చేయను. నేనెప్పుడూ అలా చేయను. నీవు ఉద్వేగపూరితుడవైతే
భగవంతునికి దూరమౌతావు. ఉద్వేగ మూలము పదార్తములో నున్నది. దైవత్వము స్వచ్ఛము మరియు సరళము.
నేను విధానాన్ని గురించి తెలియజేస్తున్నాను. కొద్దికొద్దిగా నీవు పరిణామం వైపు మరలుతున్నావు. కొద్దికొద్దిగా దాన్ని నీవు పొందుతున్నావు. నీవు పూర్తిగా భావోద్రేకాన్ని నిర్మూలిస్తే, సంపూర్ణ పరిణామం సిద్ధిస్తుంది. పరిణామమంటే ప్రతీవస్తువును
సక్రమంగా ఉపయోగపెట్టుకోవడమే. తన స్థితిని తాను సమీక్షించుకొంటే, వ్యక్తి సున్నితత్త్వాన్ని పెంపొందించుకొంటాడు. మీరు ప్రశిక్షకుని వద్ద కూర్చొంటారు. బహుశా అప్పుడు మీకు ధ్యానం
సరిగ్గా కుదరదు. తర్వాత మీరు గమనించండి. ఒక విధానంలో పనిచేస్తున్నప్పుడు
అప్పుడప్పుడు కలత కూడా కలుగుతుంది. నిజానికదే సరియైన శిక్షణ. కలత రేగిన తర్వాత నేను మరొక మోతాదు యిస్తాను, లేకపోతే జనులు పారిపోవచ్చు. ఇది నేను చేయలేదంటే, నేను నా సేవ చేయనట్టే. ప్రతి ఒక్కరూ సమాధిస్థితి
కావాలంటారు. మీరు భగవంతునికై పరితపించాలి. జనులు సమాధినాశిస్తారు. ఎందుకంటే అది యింద్రియములను సంతోషపరుస్తుంది. ఇంద్రియానందానుభవ మక్కడున్నది.
ఒక వ్యక్తి శివుణ్ణి కలలో దర్శించాడు. ఆ దర్శనానుభవము యొక్క ఫలితమేమి
అని ప్రశ్నించాడు.
వెలుగు సత్యతత్త్వమునకంటే భారమైనదని నేను "రాజయోగ ప్రభావము"న వ్రాసి
యున్నాను. వెలుగంటే యేమిటి? అది ఒకసారి
కనబడిందంటే మన పని ప్రారంభమయ్యిందని అర్థం. ఆ తర్వాత యిక ఆ పనైపోయింది. నీవు దైవంపై ధ్యానిస్తావు. ఇప్పుడు నీ చిన్న ఆత్మ
అద్దానితో (దైవంతో) సంబంధ మేర్పరచుకొంది. రెండెప్పుడు కలుస్తాయో
అప్పుడాలోచన ఉత్పన్నమౌతుంది. ఒక పెద్ద మంటలో చిన్న మంట
కలిసింది. ఇది వెలుగుకాదు. చీకటీ కాదు. అక్కడ సూర్యుడెప్పుడూ ప్రకాశించడు. అది ఒక పలుచని వర్ణరహిత
ప్రతిబింబము. అదీ సత్యతత్త్వం.
25. సాక్షాత్కారము పొందిన ఆత్మ
వ్యక్తి సాక్షాత్కారము పొందిన వాడైనప్పటికిని మానవత్వపు విలువలు యెప్పటికీ
విడువరాదు.
ప్రత్యేకమైన విషయాలు నాకు జ్ఞాపకముంటాయి. నేను నా మనసుతోనే వుంటే నేను మరచి పోవడానికి వీలులేదు. నాకు చాలా ఆలోచనలే వస్తాయి. నేను వాటిని గురించి మరొకరికి
గూడా చెబుతాను. కానీ నాకు మాత్రం జ్ఞాపకముండవు.
నేననుకుంటే నా జబ్బును బాగుచేసుకోవడానికి ఒక నిముషం కూడ పట్టదు. కానీ నాకు భగవంతునిచ్ఛయే జరగడం సంతోషకరం. మా పూజ్య గురువర్యులు బాధ నుండి విముక్తి పొందడానికంటే బాధపడడానికే
సమ్మతించేవారు.
నేనెప్పుడూ కష్టాలకు లోనయ్యేవాడిని. అయినా మా గురువర్యులు నాకు
సహాయమందించే వారు.
కాసింత గూడా, గురువు కావాలనే ఆలోచనను మనసులోనికి రానీకు.
అహింసా విధానాన్నసురించే వాడిని కాను నేను.
నేను మా గురువుగారిని విడిచి జీవించలేను.
నేను అభ్యాసిని మలుస్తాను.
ప్రస్తుత అవతారపురుషుడు కేంద్ర స్థానమునకావలి నుండి దిగి వచ్చినాడు. అందుచేతనే ఆయన మహత్తర తీవ్రమైన శక్తులు గల్గి యున్నాడు.
ఎప్పుడు దుర్మార్గము తారాస్థాయికి చేరుతుందో అప్పుడు ఒకానొక దివ్యాత్మ భూమిపై
అవతరించి, చీకటి మేఘాలను పారద్రోలి, అంతటా వెలుగును వ్యాపింప జేయును.
తనంతట తానుగా (ప్రకృతి సిద్ధంగా) పనిచేయడం భగవంతుని ఒకానొక లక్షణం. ఎప్పుడు సాధకుడు ఈ వాస్తవానికి సంబంధించిన జ్ఞానాన్ని (నేను చేస్తున్నాను
అనుకోవడం) పోగొట్టుకుంటాడో అప్పుడతడు సత్యస్థితిలో ఉన్నట్లు లెక్క.
వాస్తవం చెప్పాలంటే మనల్ని మనం ద్వైతం నుండి వేరు పరచుకోవాలి. అప్పుడు "ఉన్నదున్నట్లుగా వున్న" స్థితి కలుగుతుంది.
సాక్షాత్కారము పొందిన ఆత్మ అత్యంత ప్రాధాన్యతారహితుడు లేక నిరాదృతుడు గా వుంటూ
గొప్పదనము, గర్వము లేక అహంభావము లనధిగమించిన వాడై శాశ్వతంగా
తన్నుతాను పూర్తిగా కోల్పోయిన స్థితిలో జీవిస్తూ వుంటాడు.
సాక్షాత్కారము పొందిన ఆత్మ లక్షణము సర్వజ్ఞత్వము.
ఎవరినా నన్ను దూషించినా లేక కొట్టినా, దాని ప్రభావము నాపై
లేదు. ఇక నేను దాన్ని చెడ్డగా యెందుకు తీసుకోవాలి.
నాకో మనవరాలు పుట్టింది. నాకు అలాంటి భావనేం కలుగలేదు. అటువంటప్పుడు నాకు సంతోషమెలా కలుగుతుంది.
చాలా కాలం నుండి నేను శూన్యస్థితిలో జీవించడం వల్ల నేను సంగ్-బె-నమక్ అంటే
కల్తీలేని రాతి ముక్కగా మారిపోయాను. నే నీ స్థితి నుండి ఒక్క
క్షణమైన బయట పడి వుండటాని కిష్టపడను. మార్పులేని స్థితే అసలైన
స్థితి. ప్రాపంచిక విషయాల నుండి యేమాత్రం సంబంధం లేకుండా బయట పడితే మనిషికి
"చచ్చియు బ్రతికున్న" స్థితి ప్రాప్తిస్తుంది. అది నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తికి ప్రపంచం అవాస్తవంగాను ఒక కలగాను
కనబడినట్లుంటుంది. సంపూర్ణ శూన్యత్వమంటే, ఆ స్థితిలో వ్యక్తి
భగవంతునిలో పూర్తిగా కరిగిపోయి, తన్నుతానే గాదు
భగవంతుణ్ణిగూడా మరచిపోయి వుంటాడు. యోగి యొక్క ధ్యేయము ప్రకృతిపై
అధికారము పొందడము. కానీ తాను పూర్తిగా సంపూర్ణంగా భగవంతునిలో లీనమైపోతేగాని పూర్తిగా సంపూర్ణంగా
ప్రకృతిపై ఆధికారము రాదు.
కొంతమందున్నారు, వారి దృక్పదంలో జ్ఞానము సాక్షాత్కారమున
ప్రాధమికస్థితి, కనుక అవసరము మరియు నిరాదరింపరానిది. నేను వారితో యేకీభవించను. ఎందుకంటే జ్ఞానము మొదడు చేత
మాత్రమే సాధింపదగినది. కానీ సాక్షాత్కారము ఆత్మయొక్క జాగృతి, కనుక మెదడు పరిధి
కందనిది. అందువల్ల జ్ఞానము నిజమైన మహాత్మునికి లేక యోగికి కొలమానము కానే కాదు. అలాగే మహాత్ముడు లేక గురువుకు గుర్తు, వారు చూపు
అద్భుతములు, అసాధారణ చర్యలు, విధులు కావు. వారు సాక్షాత్కార మార్గమున ప్రత్యక్షముగా గడించిన సిద్ధులే గణింపదగినవి. మనిషిని సంపూర్ణుని గావించునది అతని విద్య లేక జ్ఞానము కాదు. కాని సరైన అర్థములో సాధించిన సాక్షాత్కారమే మనిషిని నిజమైన యోగిగాను లేక
సాధువుగాను మారుస్తుంది.
జీవన్మోక్షము అన్నస్థితి వ్యక్తి తన శరీరపుటెఱుక నుండి స్వేచ్ఛపొందినప్పుడు
కలుగుతుంది. ఈ స్థితి పరిపక్వదశనొంది నపుడు దాన్ని విదేహ మోక్షమంటారు.
ప్రశ్న: ఆధ్యాత్మికోన్నతులన్నిటిని సాధించిన వ్యక్తి అవగాహన యెలా వుంటుంది?
జవాబూ: సమత్వంలో వుంటుంది. యెవ్వరూ భగవంతుడు కాలేరు. యెందుకంటే ఈ విశ్వానికి యిద్దరు ప్రభువులుండటానికి వీలులేదు.
26. సాధన
సత్యతత్త్వజ్ఞునికి అనుబంధింపబడి వున్నప్పుడే నిజమైన పవిత్రత ఉచ్ఛస్థితిలో
వుంటుంది.
అనుసరించు విధానము సూక్ష్మము గాకుంటే, సూక్ష్మాతిసూక్ష్మమైన
దానిని గ్రహించుట యెప్పటికీ సాధ్యము గాదు.
స్త్రీలు అనేకమైన విధులను నిర్వర్తించవలసి వుంటుంది. పిల్లలను జాగ్రత్తగా చూచుకోవలసి వస్తుంది. కనుక వారి విషయంలో ఒక సడలింపు చేయబడింది. పురుషులకట్టి సడలింపులేవీ లేవు. వారు పట్టుదలగల్గి క్రమబద్ధంగా
వుండాలి. లేని పక్షంలో పురోగమనం మందగించక తప్పదు.
ఇతరులు యేర్పరచిన పద్ధతులు చాలా వరకు యాంత్రికములై భౌతిక విషయములతోనే
గడచిపోవుచున్నవి. అందుచేతనే సామాన్య జనులు వారి బోధ యెంత వినినప్పటికిని యింకా భ్రమలోను, అజ్ఞానంలోను కొట్టుమిట్టాడుచున్నారు.
మనస్సును మనస్సు, దైవత్వాన్ని దైవత్వమే
తెలుసుకొనగలదు. మరోమాటలో చెప్పాలంటే మనం దైవీయశక్తిని దైవసాక్షాత్కారమునకై ఉపయోగించుకొన వలెను సూర్యుడున్నాడు కాని కప్పియున్న మేఘములను నీకైనీవే తొలగించవలెను. అప్పుడే పూర్తి వెలుగును పొందగలవు.
ఆతృత, ఆరాటము సాక్షాత్కారమునకు తప్పనిసరి.
గురుకృప యెప్పుడూ వున్నది. సూర్యుని మేఘము లడ్డగించినట్లు కొన్ని చిక్కులు
మధ్యలో నున్నవి.
27. పిల్లల గురించి
ప్రశ్న: చిన్న పిల్లలను అతి లేతవయస్సులో ప్రభావితము చేయుట సాధ్యముకాదా?
జవాబు: నిన్ను నీవు మొదట సరిజేసుకో. నీవు పిల్లల జీవితంలోనికేదైనా
చొప్పించాలనుకుంటే, దయచేసి అద్ధానిని నీజీవితంలో నీవు పొందుము.
పిల్లల కొఱకు ప్రార్థన యున్నది. అది మన సంస్థ ప్రార్థనైతే మేలు. ఓ అయిదారు మార్లు దానిని పిల్లలు వల్లించనిండు. తదనంతరం ఓ పదహైదు నిముషములు భగవంతునిపై ధ్యాసనుంచునట్లు చూడుడు, అంతియే చాలును. నీవు వారిలో మంచి ఆలోచనలు, మంచి, మర్యాద పెంపొందుటకు సహాయపడుదువు.
ధ్యాన సమయంలో వివిధములైన స్థితులను దాటి వెళ్ళుదువు. వాటిని నీవు నమ్మి తీరవలెను. హృదయముపై నిశిత దృష్టినుంచుము. అక్కడ జరుగుచున్న మార్పులను గమనింపుము. ఈ విధంగా నీవు మునగడం
ప్రారంభిస్తే రోజురోజుకు సున్నితమై పోగలవు. సున్నితత్త్వాన్ని మరింతగా
పెంపొందించుకో, అది నీ పురోభివృద్ధికి, దివ్యత్వసిద్ధికి తోడ్పడుతుంది.
28. భగవంతుడు
మహోన్నతమైన దానితో అంతర్గతానుబంధమే, గొప్ప భక్తి.
ప్రశ్న: భగవంతుని నాకు చూపించండి.
జవాబు: విద్యుచ్ఛక్తిని నాకు చూపించండి.
ప్రశ్న: మీరు భగవంతుడు నాలోనే వున్నాడంటున్నారు. ఇక నేనెందుకు ప్రార్థించాలి?
జవాబు: భగవంతుడు
నీలో వున్నాడు గానీ నీవు ఆయనలో లేవు.
సత్యతత్త్వములో కరిగిపోవడానికి యత్నించు. సత్యతత్త్వంలోనికి దుమికేయ్.
దైవత్వాన్ని సృజించడమే సరళత.
భగవంతుణ్ణి వాంఛిస్తాం కానీ ఆయనే కావలనుకోం. అదే వచ్చిన చిక్కు.
శ్రద్ధ, ప్రేమ మాత్రమే నిన్ను మహోన్నతమైన దానివైపు
తీసుకెళతాయి. భగవంతునితో అనుబంధించుకో. నేను కేవలం మధ్యవర్తినే.
ఫ్రశ్న: ఎవరు భగవంతుడు?
జవాబు: భగవంతుడే భగవంతుడు. వివరించ వలసిందేమీ లేదు. నేనిదే మీకు చెప్పదలచుకున్నది. భగవంతుడొక వ్యక్తిత్వము. అతనిని
గురించి మనకు తెలియదు. అతడున్నాడు. కానీ మనకు తెలియదు.
ప్రశ్న: పూజ యొక్క ప్రాధాన్యతేమి?
జవాబు: నాకు తెలిసిందొక్కటే. భగవంతుని వైపునకు ఆయన దారిలోనే
కదులు. ఆయన ఆశించిన మార్గములోనే ఆయన వైపునకు కదులు. అదే సరైనది. నీకు యేది చెప్పబడిందో అదే చెయ్యి. నీవు నీ బాధ్యతలను ఆయనపైకి
మార్చేయ్. ఆ తర్వాత ఫలితం చూడు. అన్నిటికి నీవే కర్తవైపోతావు. అన్నిటికి నీవే ప్రభువైతావు.
దైవానికి సంబంధించిన ఆలోచన తప్ప, యితరమేమీ నీ
హృదయమున నుండరాదు. పరిస్థితి అలా మారితే నీవు లయావస్థకు చేరుకుంటున్నావన్నమాట. మీరాబాయికి కృష్ణుని ధ్యాస తప్ప యితరమేమీ లేదు. అందుకు సంబంధించిన ఒక కథ వున్నది. అమె బృందావనానికి అక్కడున్న ఒక
మహనీయుని దర్శనార్థం వెళ్ళింది. ఆయన నేను స్త్రీలను చూడను
అన్నాడు. ఆమె కృష్ణపరమాత్మను దృష్టిలో పెట్టుకొని, నేను ఉన్నదొక్కే
ఒక్క పురుషుడు, పురుషుడన్న వాడు మరొకడు లేడన్న అభిప్రాయంతో వుంటిని, యిప్పుడు యింకొక పురుషుడొచ్చెనా! అన్నది. అంతే ఆ సాధువు తన తప్పును గ్రహించి ఆమెను క్షమించమని వేడుకొనెను.
ప్రశ్న: " భగవంతునికి మనస్సు లేదు" అని తమరు సెలవిచ్చారు. అయితే యిక భగవంతుడు అవతారపురుషుల మాధ్యమమున పని చేయవలసి వుంటుంది. విషయాన్ని దయచేసి వివరించండి?
జవాబు: ఇది చాలా సులభం. ఒకవేళ భగవంతునికి మనస్సే వుంటే
ఆయన మంచో చెడో యేదో ఒకటి చేయాలి. ఆయన భగవంతుడు గనుక మన మాదిరి
చెడుపని చేయడు. మంచి పనే చేస్తాడు. ఆ మంచి పని యొక్క ఫలితాన్ననుభవించడానికి ఆయన కూడా మనిషి వలెనే భూమి మీదకు దిగి
రావాలి. అయినా కొన్ని అరుదైన సంఘటనల్లో ఆయన గూడా చెడ్డపని చేయవలసి వచ్చింది. ఇక నీవే ఊహించు. దైవమునకు మనస్సుంటుందా? ఉండదా?
భగవంతుడు కాదు కష్టము. పద్ధతులే కష్టమైనవి.
సహజమార్గము యొక్క ముఖ్యధ్యేయము లయావస్థ తప్ప మరేదీ కాదు.
ప్రశ్న: జీవునకు బ్రహ్మమునకు గల తేడా యేమి?
జవాబు: జీవుడు, బ్రహ్మము - నేను వీటి గురించి తాత్త్విక పదజాలముతో
జవాబు చెప్పదలచుకోలేదు. ఒక ఉదాహరణ నిస్తాను. మా ప్రాంతాలలో దీపావళి పండుగకు బొమ్మలు చెక్కరతో చేస్తారు. ఆ బొమ్మలను మీరు చెక్కర అనవచ్చు. అంతేగాని చెక్కరను మాత్రం
చూపించి బొమ్మ అనలేరు. అదీ తేడా.
ఈ వాతావరణ రీత్యా భూమి మీద ఒత్తిడి చాలా యెక్కువగా వుంటుంది. పైకి పొయేకొద్ది ఒత్తిడి శూన్యమైపోయే వరకు తగ్గుతూ, తగ్గుతూ పోతుంది. ఆ శూన్యస్థితే బ్రహ్మము. నీవు ఆ జడత్వాన్ని
(చిక్కదనాన్ని) తొలగించుకొంటే నీవే బ్రహ్మమైపోతావు. అదే అద్వైత సిద్ధాంత దృక్పదము.
దైవాన్ని సృష్టించకు. ఉన్నదున్నట్లు ఆరాధించు.
ప్రశ్న:
భగవంతుడెట్లా వుంటాడు?
జవాబు: ఎట్లా ఉన్నాడో అట్లే వుంటాడు.
ఒకవేళ మీ యింటిలో ఒకరు జబ్బుపడ్డారనుకోండి. మీరు కార్యాలయంలో పనిచేస్తున్నా అందోళన మాత్రం పడుతుంటారు. భగవంతునిపై ధ్యాస కూడా ఆ విధంగా ఉంచుకోండి.
ప్రశ్న: భగవంతుని స్మరించుటెట్లు?
జవాబు: భగవంతుడే మిమ్ములను జ్ఞాపకం చేసుకొనేట్లు ప్రయత్నించండి.
ఒక వ్యక్తి నాచేత కృష్ణపరమాత్మ గర్విష్టి యని ఒప్పించాలని సతపోరాడు. కారణం, ఆయన నేనే శ్రేష్ఠతముడను, సమస్తవస్తువులందు నేనే గొప్ప అని అహంకరించెననెను. అందుకు తగిన వాడనని నిరూపించుకొన్నప్పుడు అలా అహం చూపడంలో తప్పేమున్నదని నేను
జవాబిచ్చాను. ఒకడు ఎం.ఎ. చదివి అర్హత సంపాదించినపుడు తాను ఎం.ఎ. అని చెప్పుకోవడం అహం
కానేరదు. నీవు ఎం.ఎ. కాకుండా ఎం.ఎ. నని గొప్పలు చెప్పుకొన్నప్పుడే చిక్కులేర్పడేది. అప్పుడక్కడ అహంకారమున్న దనవచ్చును.
పాశ్చాత్య తాత్త్వికత సందేహముపై ఆధారపడినది, మరి సందేహమునకు పునాది లేదు.
కోపతాపాదులు (అరిషడ్వర్గములు) తెలివి కేంద్రమునకు అనుబంధింపబడినవి. వాటిని సరిదిద్దుకొనవలెను.
తత్త్వశాస్త్రము - అది ఒక ఆలోచనాతీరు.
యోగము - అది ఒక కార్యనిర్వహణము.
సాక్షాత్కారము - అది చేష్టలుడిగి యుండడము.
ప్రశ్న: సహజమార్గము తన ఆధ్యాత్మిక దృక్పదము (భగవత్సాక్షాత్కారము) ను, పాశ్చాత్యులు తమ పదార్త లాభచింతనమును యిచ్చిపుచ్చుకోరాదా?
జవాబు: ఒక బలమైన యోచన ఎప్పుడు కార్యరంగమున దిగుతుందో అప్పుడొక రూపం
ధరిస్తుంది. ఒక యోచన చెయ్. పనిచేస్తుంది. ప్రయత్నించు.
ప్రాణము పదార్తముతో కలిస్తే అంటే శరీరములో వుంటే జీవుడని పిలువబడతాడు. శూన్యంలో కలిస్తే బ్రహ్మంగా పిలువబడతాడు. జీవుడు శూన్యస్థితిలో బ్రహ్మమౌతాడు. భూమి మీదున్న ప్రాణమే జీవుడని
పిలువబడతాడు. జీవుడు తన జడత్వాన్ని పోగొట్టుకొని శూన్యమువలె తేలికైతే బ్రహ్మమౌతాడు.
నీ హృదయంలో శూన్యమునుత్పన్నము చెయ్యి. ఎలా? భగవంతుని, కేవలం భగవంతుని గూర్చే చింతనచెయ్. ఎంత యెక్కువగా శూన్యమేర్పడుతుందో అంత యెక్కువగా ప్రాణాహుతిని అభ్యాసి అనుభవమున
పొందుతాడు. సర్వమెఱింగిన వానిని తెలుసుకో.
29. దేవతలు - అవతారాలు
నేనూ అవతారాల సిద్ధాంతాన్ని నమ్ముతాను. శ్రీరామచంద్ర ప్రభువు వారిలో
ఒకడు. ఆయన అవతార కాలములో అయన గొప్ప సహాయకారిగా నుండెను. కృష్ణపరమాత్మ అవతరించటంతో శ్రీరామచంద్రుని ప్రభావం పోయింది. ఇప్పుడు కృష్ణపరమాత్మ రాజ్యమే కొనసాగుతున్నది. అది తర్వాతి అవతారం వచ్చేవరకు భూమిపై కొనసాగుతుంది. ఆయన తర్వాత యింకా యే అవతారము భూమిపైకి రాలేదు. అందువల్ల మనమిప్పుడందరము కృష్ణపరమాత్మతోనే అనుబంధింపబడి యున్నాము. నీకు అర్థం కావడం కొఱకు విశదీకరింపబడిన అవతార ప్రక్రియ ఇది.
నేను చెప్పునదేమంటే దేవతలు మరణించి మళ్ళీపుట్టి మనరూపం ధరిస్తారు. మనమేమో చచ్చి దేవతలమౌతాము. దీని ద్వారా నేను చెప్పేదేమంటే
దేవతలు కూడా ఈ జననమరణ బంధముల నుండి స్వేచ్ఛను పొందలేదు. కనుక ఈ దేవతల నారాధించటం ద్వారా జననమరణ బంధముల నుండి విడివడిపోలేము. ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవతలు వాస్తవానికి నీ సేవలో నున్నారు. అంతేగాని వారి సేవలో కాదు నీవున్నది. ఈ నిజాన్ని దృష్టిలో పెట్టుకొని
సాక్షాత్కార విషయమున ఈ దేవతలెంత వరకు మనకు సహాయపడగలరో మీకై మీరే
నిర్ధారించుకొనవలసి యున్నది.
మహామాయపరిథి - అనేటటువంటి చాలా క్రిందిస్థాయి నుండి అవతారాలు ఉద్భవిస్తాయి. అవతార పురుషులు పరిమిత శక్తులతో ఈ భూమికి దిగివచ్చి వారు పూర్తిచేయవలసిన
కార్యాన్ని నిర్వర్తించగానే వారు అదే ప్రదేశానికి మరలిపోతారు. ఆ ప్రదేశము నీల వర్ణంలో వుంటుంది. అందుకే అవతారపురుషులు కూడా ఆ
వర్ణాన్నే గ్రహించి వస్తారు. మానవుడు మరికొంత పైస్థానం నుండి
వస్తాడు. అంటే ఆధ్యాత్మిక బిందువునుండన్నమాట. అందుచేతనే మనిషి యింకా
మున్ముందుకు వెళుతూ మూలకేంద్రం వరకు పోగలడు. అక్కడికి అవతారాలు కూడా పోలేవు.
జ్ఞానం మనము మనిషి నుండే పొందగలము, అవతారాల నుండి
కాదు.
30. దేవుళ్ళు - దేవతలు
ఒక యంత్రములోని వివిధ భాగముల వలె దేవుళ్ళు వివిధ విధులు నెరవేర్చే ప్రకృతి
సాధనములు.
సందేహంలేదు ఆ సమయంలో నీవు శ్రీరామలక్ష్మణ లేక శ్రీ ఆంజనేయుని స్మరణలో గడిపావు. అప్పుడు నీకు సరియైన మార్గము నీ దృష్టిపథంలో లేదు. నేరుగా సాక్షాత్కార దిశలో పయనింపజేయు సరియైన దారిలోనికి రావడానికి నీకు
సహాయపడిన వారికి ధన్యవాదములు తెలుపుకొనవచ్చును. వారు వారి పనిని యిప్పటికే చేసినారు. ఇక యిప్పుడు నీకైనీవు
తెలుసుకొని అనుసరించవలసి యున్నది.
అవతారాలు ఒక నిర్దిష్ట ప్రయోజనం సాధించటానికై దిగివస్తాయి. వారికి కేటాయించిన పనికి అవసరమైన శక్తియుక్తులన్నీ వారికి యివ్వబడి వుంటాయి. మరోమాటలో చెప్పాలంటే "ఒక సాధుమహాశయుడు కూడా ప్రపంచములోని సమస్త దుఃఖములకు
గురి కావలసిన వాడే."
ఈ ప్రయోజనమునకు దేవుళ్ళను సేవిస్తే సరిపోతుందా? అలా సరిపోయేట్లయితే యితర మార్గముల కొఱకు యెదురుచూచే అవసరమే వుండి వుండదు. కనుక సాక్షాత్కారమునకై దప్పిక గొన్నవారు వారి దప్పిక తీరు సరియైన మార్గము
కనుగొనుట ఆవశ్యకమైనది. దేవుళ్ళు ఆ మహోత్కృష్టస్థితికి మనల్ని చేర్చలేరు. కారణం వాళ్ళే అది లోపించిన స్థితిలో ఉన్నారు.
మనం నిజంగా సత్యతత్త్వమే ధ్యేయంగా గల వాళ్ళమైతే ఈ దేవుళ్ళు దేవతలు
మనకేవిధంగాను పనికిరారు.
శ్రీకృష్ణపరమాత్మ ఒక అవతార పురుషుడుగా కేంద్రబిందువు నుండి దిగివచ్చెను. అయితే శ్రీరామప్రభువు అవతలి కొస నుండి వచ్చెను. ఈ కారణముననే మనిషి యెటువంటి
ఆదర్శజీవితమునకై యత్నించవలెనో అట్టి జీవితమును ఆయన మనకు చూపి, మనిషి భగవంతుడు కాలేడని తెలియజేసెను.
శ్రీకృష్ణపరమాత్మ వాస్తవంగా అందమైన నీలిరంగులో, ధోవతిలో, జడలుగట్టిన వెండ్రుకలతో, మీసములు గలిగి యుండెను. ప్రశిక్షకుడు శ్రీ చతుర్వేది
గారు సుదర్శన చక్రమును దర్శించెను. అవతారములన్నీ నీలిరంగులోనే
వచ్చినవి. కారణం నీలిరంగులో నున్న మహామాయ నుండే అవతారములు దిగివచ్చినవి.
దేవుళ్లకు కొన్నిసార్లు శక్తి తగ్గి వుంటుంది. ఆ సందర్భాలలో, ప్రత్యేక అవతారమూర్తులు కానీ లేక మరికొంత
తక్కువస్థాయి అవతార పురుషులు గానీ వారికి తగిన శక్తినిస్తారు.
కాలము యొక్క అవసరాన్ని గుర్తించే అర్జునునకు గీతా సత్యములను శ్రీకృష్ణపరమాత్మ
బోధించెను. ఆయనకు మనందరము ఋణపడి యున్నాము. ఎందుకంటే ఆయన గీతను మనందరి
మేలుకోసం వెలువరించెను. అది మనకు కాలాంతరమున మార్గదర్శకమైన వెలుగై భాసిల్లినది. అది కేవలం సిద్ధాంతబోధ మాత్రమే కాదు దైవీయ మార్గగాములందరికి అవసరమైన
సత్యతత్త్వపు ప్రత్యక్ష వ్యక్తీకరణ. అభ్యాసి తన అభ్యాస సమయమున
అధిగమించు వివిధములైన స్థితులకు సంబంధించిన ప్రత్యక్షజ్ఞానమది. సక్రమ సాధన ద్వారా సాక్షాత్కరింప జేసుకొన్న వివిధ స్థానముల వివరణకు సంబంధించిన
విషయమందున్నది. ఏదియేమైనప్పటికి ప్రస్తుతం ప్రపంచములో మహోన్నత స్థితి నందుకొన్న మహనీయులున్నారు. వారు గీతలోని స్థితులను యిప్పటికిని సూచాయగా చూపగలరు. లేక అవే స్థితులను మీలో ఓ లిప్తకాలమైన ఉత్పన్నము చేయగలరు.
తానా స్థాయికి యెదగకుండానే భారత ప్రధాన మంత్రినని ఎవరైనా తనకుతాను చెప్పుకోవడం
తగిన పనేనా? వాస్తవానికి మనం ద్వైతం నుండి
ప్రారంభించి స్వతఃసిద్ధంగానే అద్వైతానికి చేరుకుంటాము. దానిలో మనల్నిమనం కోల్పోతే సత్యోదయమౌతుంది.
ఆలోచించడం తాత్త్వికం, కార్యనిర్వహణం
యోగం. "నేను చేస్తున్నానన్న యోచన లేకుండడం సాక్షాత్కారం", తత్త్వశాస్త్రం హేతువాదంపై ఆధారపడదు. అది అంతర్గత ప్రేరణపై
ఆధారపడుతుంది.
సరియైన పద్ధతి తన దృష్టికి రానప్పుడు యేదో దేవతాపూజలు చేసి వుండొచ్చు. కాని సరియైన పద్ధతి కనుగొన్న తర్వాత, అంతకంటే గొప్పది
మరియు ఉన్నతమైన దానికోసం పాత విధానం త్యజించాలి. సంపూర్ణత్వ సాక్షాత్కారమునకు నేరుగా గొంపోవు విధానము ననుసరించాలి.
స్వేచ్ఛామార్గమున పయనించడానికి మనిషిని సంసిద్ధుని చేసే ప్రాధమిక స్థాయే మతము. వ్యక్తి స్వేచ్ఛా మార్గంలో అడుగిడిన తక్షణమే మత పరిధుల కతీతుడౌతాడు.
31. మతము.
తాను తెలుసుకోవలసింది ఈ ప్రకృతిలో మరింత వున్నది అన్న విషయాన్ని అర్థము
చేసుకోవడానికి సహాయపడునదే మతము.
మన యింద్రియములను సంతృప్తి పరచుటకే మనం పూజలు చేయుదుము.
హృదయంతర్గత యెఱుకను మేల్కొల్పుటకు, బయటకు వల్లించే
స్తుతి పాఠములు యేమాత్రము లెక్కలోనికి రావు. ఇవన్నీ కూడా యింద్రియ సంబంధమైన
ప్రాపంచిక వాంఛాపరితృప్తి కోసమే. ఆ వాంఛలకు అంతే లేదు. అవి ఒకటి తీరిన వెంటనే తత్సంబంధమైన దింకొక్కటి ఆక్కడే ఉత్పన్నమౌతూనే వుంటుంది. సాంప్రదాయ పద్ధతులు ఈ ఆశల కోరికల వల నుండి బయటపడుట కేవిధంగాను పనికిరావు. తన్మూలంగా యేవిధమైన ప్రత్యక్ష ప్రయోజనము దాని వల్ల కలుగదు.
మతము పేరున కేవలం కరతాళధ్వనులు చేయడం తప్ప మరేమీ చేయడం లేదు. అసలు సత్తా అంతరించి, దాని స్థానములో
సాంప్రదాయములు మాత్రము మిగిలి యున్నవి. బాహ్యరూపములు, మూఢవిశ్వాసములు మాత్రము కనుల యెదుట కనబడుచున్నవి. వాటిని మాత్రము, యేమాత్రము సత్యసంధతకు సంబంధమేలేని మత ఛాందసత్వముతోను
మూర్ఖపట్టుదలతోను అనుసరించుచున్నారు.
ఎడతెరిపి లేకుండా యాంత్రికముగా వల్లించడము మరియు పఠించడము, మనలను స్థౌల్యము వైపునకు మరల్చును. స్తోత్రములను చదువ వచ్చును, కాని అది యాంత్రికము కారాదు. అందులోని పదముల అర్థముపై
ధ్యానించవలెను. యేదైన జపం మాటిమాటికి చేస్తే అది స్థూలమైపోతుంది. ఈ విధమైన యాంత్రిక పఠనముగానీ, పూజగానీ మిమ్ములను
మరింత స్థూలంగా మారుస్తుంది. మీరు సూక్ష్మత జెందలేరు.
గాయత్రీ మంత్రార్థము మీద ధ్యానించ వచ్చును. అది మంచిదే. గాయత్రి మంచి మంత్రమే కానీ జనులు గాయత్రిని దేవతను చేశారు.
జనులు యేవిధమైన ఆలోచన, యిచ్చ లేకుండా పూజ
చేస్తారు. కానీ అందువలన యే ప్రయోజనముండదు.
జనసామాన్యము మామూలుగ అనుసరించే ఆరాధనా విధానాలన్నీ యేదో ఒక రకంగా, వివిధములైన స్తుతులే (పొగడ్తలే). అవన్నీ పూర్తిగా అనుబంధము, ప్రేమ, శరణాగతికి భిన్నములే.
భగవంతుడు యేదో మతమునకు, తెగకు మాత్రమే
పరిమితుడై లేడు. ఆయన కొన్ని రూపములకో, వైదిక కర్మలకో కూడా
కట్టుబడి లేడు. అంతేగాదు ఆయన యేవో కొన్ని మతగ్రంథములలో వెతికి కనుగొనవలసిన వాడున్నూ కాడు.
మనిషి అంతిమ లక్ష్యము భగవత్సాక్షాత్కారము. అతని చర్యలన్నీ ఆ అంతిమ లక్ష్యమైన భగవత్సాక్షాత్కారము వల్లనే నియంత్రితమై
యుండును. మతములన్నీ ఒకే స్థానమునకు చేర్చు వివిధ దారుల వంటివి. అవన్నీ భగవత్ప్రసాదితములే. అవి యే జనుల కోసం బహిర్గతం
చేయబడి వివరింపబడినవో వారి కోసమేర్పడి యున్నవి. అవి వాటి స్వంత అనుభవాలకనుగుణంగా జనులకు మార్గదర్శకములైనవి. కానీ కాలము గడచిన కొద్దీ మత స్థాపనాచార్యుల బోధలోని అసలు సత్తా, ఉద్దేశ్యము నిర్లక్ష్యము గావింపబడినది. వారివారి మతముల ఘనతను
నిరూపించుకొని యితర మతములపై ఆధిక్యమును జూపుకొనుటకు మతాచారములను ఆయుధములుగా
నుంచుకొనిరి. కనుక మనము గట్టిగింజల నుండి పొట్టును తొలగించుకొనవలెను.
మతము జనసామాన్యం కోసం. ఆధ్యాత్మికత యెన్నుకొనబడిన యే
కొద్దిమంది కోసం మాత్రమే.
మతము ఒక విధానము మాత్రమే, కానీ జనులు దానినే
జీవితలక్ష్యముగా గైకొనిరి.
మానవ జాతి పుట్టినదాదిగా భగవంతుని ఆరాధించి ఈ దృశ్యమానమైన ప్రపంచమునకు
వెనుకనున్న రహస్యమును ఛేదించి వాస్తవాధారభూతమైన సత్యమును కనుగొనుటలో తీవ్రముగా నిమగ్నమై
యున్నది. ఇదే మతముల పుట్టుకకు మూలము. శాశ్వత స్వర్గానందమో లేక
అటువంటిదే యింకేదో ఆధారకుడు తన దృష్టిపథమున నుంచుకొనుచున్నాడు. అదే తన అంతిమ గమ్యముగా యేర్పరచుకొన్నాడు. దీని కనుగుణంగా నిర్ణయించబడిన విధానములు, ఆచారముతో గూడిన
మతములు ప్రపంచము నందు యేర్పడినవి. ఇవన్నియు మహాత్ములైన ఆయా
మతప్రవక్తల ప్రత్యక్ష స్వానుభవముల ఆధారముగా నిర్ణయింపబడినవి. కానీ పరిసరములు మారి జీవన విధానము సమూలముగా మార్పుచెందినప్పటికి అవే విధానములు
సిద్ధాంతములే అనుసరింపబడుచున్నవి. ప్రస్తుతము పై స్వరూపము మాత్రము
యేమాత్రము మార్పులేక స్థిరముగ నున్నది, అంతర్గత సత్తా
మాత్రము గతించిపోయినది.
32. దేవాలయ పూజలు.
దేవాలయములలో పూజల విషయమై ఆలోచించునపుడు భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని
గుర్తుంచుకోవాలి. అంతేగాని విగ్రహ రూపాన్ని గాదు.
నేను యేనాడు ఎవ్వరిని దేవాలయాలకు వెళ్ళడాన్ని, అక్కడ భగవంతుణ్ణి ఆరాధించడాన్ని వ్యతిరేకించలేదు. అవన్నీ పనికిమాలినవని నేను చెప్పను. అవి కూడా కొంతకుకొంత భగవంతుని
గురించి తెలుసుకొనుటకు సహాయపడును. దయచేసి మీరు ఆ విగ్రహము దేనికి
ప్రతీకో, దాని వెనకున్న భావమేమిటో దానిపై ధ్యానించండి. దయచేసి మీరు గుడి నుండి భగవదన్వేషణ చేయకుండా, ఆ దైవత్వము ననుభవించకుండా తిరిగి రాకండి. మీరు గుడి నుండి రిక్త మనస్సుతో తిరిగి రాకండి. భగవంతుని నిజమైన ప్రేమను పొంది మరలిరండి. మీరు ఆ విగ్రహము యొక్క అర్థముపై ధ్యానము చెయ్యండి, ఆ విగ్రహము యొక్క గుణములను పొందడానికి యత్నించండి. మీరు శ్రీవిష్ణువును దర్శిస్తే ఆ విగ్రహ ప్రయోజనముపై ధ్యానించండి. మీరు వినాయకుడి వద్దకెళితే, వినాయకుని అర్థంపై, అలా యే దేవునిగుడి కెళితే ఆ దేవుని పేరు యొక్క అర్థంపై ధ్యానించండి. ఏ అర్థంలేని పేరు పెట్టి విగ్రహస్థాపన పూర్వపు సాధువులు గానీ, రాజులు గానీ చేయలేదు. ఈ విగ్రహములకు సాధువులు ప్రాణాహుతిని ప్రసారం చేసియున్నారు. ఆ కాలపు జనులు అక్కడున్న దేవుని చూడటనికి గుడికి వెళ్ళి ఆ దేవాలయములో ఆ దేవుని
ఉనికిని అనుభవమునకు తెచ్చుకొనేవారు. ఈ దినములలో అనేక రోతపనులు
దేవాలయములలో గూడా జరుగుచున్నవి. వాటిని మాటలలో వివరించలేము. అయినా మన భారతదేశంలో యింకా దేవాలయములలో భగవదానుభూతిని పొందనగును. పదార్త శక్తి దేవాలయములలో పనిచేయుచున్నది. చెడు ఆలోచనలు మరియు వాతావరణము కొన్ని ప్రదేశములో ఉత్పన్నమైయున్నది. అదియునుగాక దేవాలయముల దర్శనము లేక జపం చేయడము లేక పూజలు చేయడము వల్ల
యింద్రియములకు ఉల్లాసము, ఆనందము లేక సంతోషము
మాత్రమిచ్చును. ఇంద్రియములు సత్యతత్త్వానుభూతిని పొందలేవు. అది ఒక్క ధ్యానము వల్లనే అనుభవించనగును. మీ కెవరైనా యిష్టదైవముంటే ఆ
దైవనామార్థముపై ధ్యానము చేయవచ్చును. మన యిష్టదేవత జ్యోతిస్వరూపమై
హృద్యస్థమైయున్నదని భావింప వలెను. మనమెప్పుడూ అనంతమునే యోచించ
వలెను. ఏ రూపమునకైనా ఒక పరిమితముండును. శ్రీరామ, శ్రీకృష్ణ, యే దేవునికైనా రూపమున్నదంటే, పరిమితమై
యున్నట్లే. రూపముపై ధ్యానసాధనమును చేపట్టి అనంతశక్తిమంతుని (సత్యతత్త్వమును) అనగా
అపరిమితుని చేరవలెను. అప్పుడు మాత్రమే మనము మరుజన్మ నుండి మరియు సంసారసాగరము నుండి బయటపడి
(స్వేచ్ఛబడసి) ఈ జీవిత సమస్యను పరిష్కరించుకుందుము.
నేను దేవాలయములకు వెళ్ళుదును. అక్కడ నేను తలవంచను, ఎందుకంటే గురువే విగ్రహము వద్ద తలవంచెనని చెప్పుకొందురు. దేవాలయములకు వెళ్ళుటవల్ల యే ప్రమాదము లేదు. దేవాలయమంటే అది చాలా మంచిదని అర్థము. ప్రప్రధమమున సంసిద్ధపరచుకొను
దశలో పూజలు, ఆ తర్వాత అడుగడుగే ముందుకేసి కొంత ఉన్నతమైన విషయములను
నేర్పవలెను. దేవాలయములలో తలవంచి నమస్కరించినందున దాని విలువ దానికున్నది. గృహస్థయోగ విషయము కావచ్చును. కానీ అవి కూడా వివిధ రకములుగా
నున్నవి. ఇక భగవన్నామము మాటిమాటికి జపించడం గురించి కొందరు మహాత్ములు చెబుతూ ఈ
కలియుగంలో అదే తిరుగులేని విధానమని సలహాలనిచ్చిరి. నేను మాత్రము ఆ భగవన్నామస్మరణ వల్ల ఉత్పన్నమైన తరంగములలో లీనమైననే తప్ప
అవసరమైన ఫలితము రాదని నా అభిప్రాయము చెబుతున్నాను. నేను కూడా కొన్నిసార్లు ‘రామ’ జపం మానసికంగా చేయమనీ, ఆ చేసేప్పుడు రాముని సర్వవ్యాపక గుణముపై మనస్సుంచమని సలహా యిస్తుంటాను. ఖచ్చితంగా చెప్పాలంటే మన మే జపం చేయడంలేదు, కానీ యోచనను సద్గుణములపై ఉంచి ఆ గుణములు గల స్వరూపము (బొమ్మ) ను మనస్సులో
దర్శించ యత్నింతుము. మనము పదార్తరహిత సంపూర్ణత్వమును చేరవలెను.
నాపై భక్తి గలిగిన వాడైనప్పటికిని నేనొక వ్యక్తిని అభ్యాసిగ స్వీకరించలేదు. కారణం అతడు విగ్రహారాధకుడు కావడమే. నేను తొలుత విగ్రహారాధనకు
వ్యతిరేకిని కాను, అది కూడా ఒక మార్గమని కాకపోతే బాగా నిదానమైన
మార్గమనుకొనే వాడిని. కాని అది విషమును విడుదల చేయునని నా అనుభవమున తేలినది. ఈ దోషము లేకుండిన దక్షిణ భారతదేశమున నూరుమంది సాధుమహాత్ములను తయారుచేసి
యుందును. వారు నా వద్దకొచ్చినప్పుడు వారి నుండి విగ్రహారాధన వల్ల కలిగిన జడత్వమును
బయటకు నెట్టేస్తాను. వారు తిరిగివెళ్ళి మళ్ళీ నింపుకొంటారు. మనమేనాడూ విగ్రహారాధకులము కాము. మహమ్మదీయులు మనలను దొంగలనిరి. మనం దొంగతనం చేయడం
ప్రారంభించితిమి.
ప్రశ్న: రూపరహితుడైన వాడు అంతట వ్యాపించి యున్నప్పుడు విగ్రహంలో కూడా అదే
యున్నదనుకొనుటలో ప్రమాద మేమున్నది?
జవాబు: బంకమట్టి
ప్రతిరూపము బంకమట్టే. కాని బంకమట్టి మాత్రమే ప్రతిరూపము కాదని స్వామీ వివేకానంద చెప్పెను. భగవంతుణ్ణి విగ్రహంలో దర్శించ వచ్చును కానీ కేవలం విగ్రహాన్ని మాత్రం
భగవంతుడనలేము. విగ్రహారాధనలో ఒక గొప్ప లోపమున్నది. అది మనిషి జీవితాంతపు శ్రద్ధగా
మారి, దాని నుండి బయటపడుట కిష్టపడడు. అందువలన ఒక జడపదార్తము వారి హృదయములలో యేర్పడి, దానిని సులభముగా ఛేదించుట వారి గురువు యొక్క యిచ్ఛాశక్తికి గూడా సాధ్యము
గాకున్నది. మనం స్థౌల్యస్థితి నుండి సున్నిత స్థితులకు రావలసి యున్నది. మన మనుసరించు విధానము తదనుగుణముగా మార్పుతేవలయును. ఈ ప్రతిరూపారాధకులు ఆ ప్రతిమకే కట్టుబడి పోదురు.
తెలిసిన మత బోధకులు దేవతారాధనను ప్రోత్సహించిరని చెప్పితివి. దీనికి నా సమాధానము ముందే మీ ముందున్నది. ప్రత్యక్షానుభవము లేని వ్యక్తి యితరులకు సలహాలివ్వదగడు. నేర్చుకొన్న వాడు కేవలం పుస్తకములు మాత్రం చదివి నేర్చుకొని వుంటాడు, కాని అనుభవజ్ఞుడు ఆ పుస్తకములోని సత్వమును రుచి చూచి వుంటాడు. కనుక యిద్దరి మధ్య పెద్ద అంతరమున్నది. మార్గమునందు విజయవంతముగా
పయనించి వచ్చినవాడు మాత్రమే మీకు నిరపాయముగా మార్గదర్శకత్వము నెఱప గలడు. ఆ నేర్పరులైన మత బోధకులు రహదారి ప్రక్కన నిలిపిన వ్రాతపలకల వంటివారు, అవి వివిధ ప్రదేశములకు వెళ్ళు దిక్కులను సూచించును. ఇట్టిదే వారు మనకు చేయగల పెద్ద సహాయము.
33. శాస్త్ర గ్రంథములు - బోధనలు
భగవత్సాక్షాత్కారము లేక స్వర్గానందము, దేవకన్యల సంతోష
సంగమమూ ఆశించు వారికి శాస్త్రములు విలువైనవి కావచ్చును. నాకట్టి ఆశలేవీ లేనందు వలన ఆ శాస్త్రములు నాకేవిధంగానూ ఉపయోగపడవు. అయినా ఈ శాస్త్రములు దైవత్వానికి సంబంధించిన విషయములను చర్చించి గొప్ప
ప్రాముఖ్యతను సంతరించు కొన్నప్పటికీ, అందులో చాలా
విషయములలో గందరగోళమున్నది (స్పష్టత లేదు). అటువంటి వాటి వల్ల కలుగు
నష్టమును నివారించు నిమిత్తం మునియైన మనువు వేదములలో మీ హేతువాద దృక్పదమునకు జవాబు
దొరకదని వాటిని అంగీకరించనవసరమూ లేదు మరియు పాటించవలసిన పనిలేదని స్పష్టముగా
నిర్ధారించి చెప్పెను. వాటి ఆధ్యాత్మిక ప్రాధాన్యతను గురించి నేను నిశ్చయంగా చెబుతున్నాను, అవి ప్రాధమికమైన సిద్ధాంతమును గూర్చి చర్చించడము చేత, ఆధ్యాత్మిక ప్రారంభకులకు మాత్రమే ఉపయోగపడును. వాటికి సంబంధించిన యే శ్రుతులను గణనలోనికి తీసుకొని పరిశీలించినా మీకీ విషయము
స్పష్టమౌతుంది.
34. నేర్పరులు
సామాన్యముగా నేర్పరులైన వారిని నేను యెక్కువగా గౌరవిస్తాను. అయితే వారు సాక్షాత్కార స్థితి విషయమై వారు నేర్చుకొన్నదానిపై ఆధారపడి వారి
దృక్పదాన్ని వెలిబుచ్చుతారు, కానీ వారి
ప్రయోగాత్మక జ్ఞానముతో కాదు. ప్రయోగాత్మక అనుభవజ్ఞానము
మాత్రమే సరియైనది. ఎవరైననుగానీ సాక్షాత్కార విషయములో వాస్తవార్థమున దానిని సాధించి దివ్యజ్ఞానము
వారిలో మేల్కొల్పజేసుకొన్న వారు తప్ప యితరులు ఈ విషయమై చర్చించుటకు అర్హులు కారని నేను
నమ్ముతున్నాను.
చదువుకొన్న మత పండితులు సాధారణంగా జనాలను దేవుళ్ళను దేవతలను పూజింపుడని
ప్రోత్సహిస్తారు. కానీ ప్రత్యక్షానుభవం ద్వారా విషయం తనకైతాను గ్రహించిన వారి విషయంలో యెప్పుడూ
యిలా జరుగదు.
పురాణములలో శ్రీరాముని, శ్రీకృష్ణుని గాథలు
విని భక్తితో కంట తడి బెడతారు. అది ఒక భక్తికి సంబంధించిన
స్థితి. పురాణములు విన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళుగానే యేమాత్రం మార్పులేకుండా
బయటికొచ్చేస్తుంటారు.
మీరు మాటిమాటికి మతగ్రంథములు చదివినప్పటికిని ఆధ్యాత్మిక గురువులు కాలేరు. అలా చేయడం వల్ల మీరు తత్త్వవేత్తలు మరియు నేర్పరులు కాగలరు. ప్రేమ, భక్తిభావము గలిగి సాధన చేయకుండిన యోగులు కాజాలరు. సంపూర్ణమైన ఉనికిని సాధించడమంటే భగవంతుని సాధించడమే. దీన్ని పవిత్ర గ్రంథములు సైతం అంగీకరిస్తున్నవి.
35. ఆచారములు
సద్వృత్తులను ప్రోత్సహించుటకు కొంత వరకు ఈ ఆచారములు సహాయపడ వచ్చునని
నిస్సందేహముగా చెప్పవచ్చును. అవి ఆధ్యాత్మిక శిక్షణా
రంగమునకు కొంత ఉపయోగపడవచ్చును. సాక్షాత్కార మార్గమునకు
సహకరించు పద్ధతిలోనే దీని నుపయోగించుకొనుటకు నాకభ్యంతరము లేదు.
హిందువులలో దేవతల నారాధించు పద్ధతులు సర్వసాధారణముగ యెక్కువ
వ్యాప్తిలోనున్నవి. ఇవి వస్తు సముపార్జన కొఱకో లేక బిడ్డల రక్షణ కొఱకో చేయుచున్నారు. స్త్రీజనము దీని నెక్కువగా ఆచరించు చున్నారు. ఎందుకంటే వారు బిడ్డలకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తారు. వారి అభిమాన బంధముల వల్ల మరింత బలపడతాయి. వారి పాత్రను వారు పోషింపనిద్దాం. ఇక మన పాత్ర మనం పోషిద్దాం.
36. అద్వైతము
ఎవరు అద్వైత సిద్ధాంతమును తొలినాళ్ళ నుండి గట్టిగా అనుసరిస్తూ వస్తుంటారో వారు
భిన్నత్వంలో యేకత్వాన్ని మోటుస్థాయిలో గల్గి వుంటారు. వారు నిజంగా ఆ స్థాయికి
రాగానే ప్రశ్న దానికై అదే అంతరించిపోతుంది.
37. అహం మరియు మాయ
సంపద మిక్కుటముగా కలిగి వుండడము - దానిని గురించి గొప్పలు చెప్పుకోవడంలో
పాపమేమీలేదు. కానీ అది అహంకారాన్ని ఉత్పత్తి చేస్తుంది. వివేకాన్ని మొద్దుబరుస్తుంది. దూరదృష్టిని హరిస్తుంది.
ఒక ముళ్ళచెట్టు విపరీతంగా పెరిగితే, దాన్ని నరికేయాల్సి
వస్తుంది. స్వార్థం యింతో అంతో ప్రతి ఒక్కరిలో వుండనే వుంటుంది. కానీ అది హద్దులు మీరితే తీవ్రమైన దోషంగా పరిణమిస్తుంది. ఆధ్యాత్మిక విషయానికొస్తే మాత్రం, యిది లేశమైనా
లెక్కలేనన్ని చిక్కుల నుత్పత్తి చేసేదిగా మారుతుంది. ఈ విషయంలో నా అభిప్రాయాన్ని గ్రహించడం చాలా సబబుగా వుంటుంది. ‘సంకుచిత మనస్కులు’ అని నేను వాడిన ఆ పదం మూఢుల లక్షణాన్ని సూచిస్తుంది. ఇది బయటికి ప్రదర్శించనంత వరకు తీవ్రంగా పరిగణించ వలసిన పనిలేదు, గానీ అది ఆధ్యాత్మికతకు సంబంధించి మాత్రం యెటుచూచినా ప్రతిబంధకమే.
38. అహంకారము
‘అహం’ వివేకాన్ని పాడుచేస్తుంది. వివేకం చెడిపోతే, మనిషికి పతనావస్థ
సంభవిస్తుంది.
అహంభావము లేకుండా వుండటమంటే నిజమైన ఉత్తేజితశక్తి ఆగమనమే. ఇదెలా సాధ్యం? మహత్తర దివ్యశక్తితో అనుబంధ మేర్పరచుకొనడం వల్లనే
యిది సాధ్యం. అది చేస్తే స్థితులన్నీ గడచి ఆయన సాన్నిహిత్యాన్నందుకుంటాం.
ఎప్పుడు నీవున్నావో అప్పుడు భగవంతుడు లేడు. అంటే యెప్పుడు అహం ఎఱుక వుంటుందో అప్పుడు భగవదెఱుక వుండదు.
మహామాయలో నున్న వాడు ఆధ్యాత్మికముగా బాగుండడు. అతడు ప్రాపంచికముగా చాలా బాగా వుండవచ్చును. సాక్షాత్కారమునకు బ్రహ్మములో లయావస్థ అవసరము.
మార్గములో గొప్ప ప్రతిబంధకము, భేదభావ ప్రదర్శన
మరియు దురభిమానమని నా జీవితానుభవమున కనుగొంటిని. ఇవే దాదాపుగా ఒక విధమైన అహంకారమని భావింపవచ్చును.
అహంకారమనే గొలుసునకు గర్వము మరియు మొండితనము మరొక వలయమును అదనముగా తగిలించి
పెట్టును. ఈ స్థూలాతి స్థూలమైన దోషము నుండి రక్షణ పొందుటకు ప్రార్థన ద్వారా తనకైతాను
నేరుగా భగవంతునితో సంబంధ మేర్పరచుకొనవలెను.
అహంకారము నుండి సంపూర్ణముగా స్వేచ్ఛను పొందుట దుర్లభము. ఎందుకంటే భగవంతునికి మనిషికి మధ్య నామ మాత్రపు భేదముండుట అవసరము. వాస్తవాని కదొక్కటే మనిషిని భగవంతుని వేరుపరచు తెర. ఈ తెర అధమస్థితులలో మందము, చిక్కనైనదై
వున్నప్పటికిని మనోమండలములో మనిషి పురోగమించుకొద్దీ అది సున్నితము, సూక్ష్మముగా మారి కడకు నామమాత్రమై పోతుంది. ఆ తుది స్థాయి మొత్తానికి పని పూర్తయిన దనడానికి గుర్తు. అక్కడే వ్యక్తి అనంతములో లీనమైనాడని లేక పూర్ణత్వంతో ఐక్యత సాధించినాడని
అనవచ్చును. అటువంటి వారు నిజానికి అరుదైనప్పటికిని, కాలగమనంలో
ఉద్భవించటనికి వీలున్నది. అది కూడా ప్రకృతిలో అతని ఉనికి అవసరమై భూమి మీద ప్రకృతి కార్యము నెరవేర్చుట
కొఱకు దిగివచ్చును. నేను నీకు ఈ విషయమంతా వ్రాయుటకు కారణమేమంటే, నిన్ను ఉత్సాహపరచి ఆ అహంభావన యొక్క అంతిమస్థాయి అనగా యెక్కడ ఉనికి దాదాపు
శూన్యస్థితికి చేరుతుందో అక్కడికి చేరుకొనే ప్రయత్నం నీవు చేయాలనే. అదే నా ఆకాంక్ష.
వ్యక్తి తాను చేయగల సమర్థుడై తాను చేయగలనని చాటుకొంటే, అలా చెప్పుకోవడంలో అహంకారం లేదు. తాను చేయలేని దానిని చేయగలనని
చాటుకోవడం అహంకారమే.
వ్యక్తి తన అహంకారాన్ని వదిలేయాలి. ఎలా? అణుకువను వృద్ధిచేసుకోవడం ద్వారా, అదెలా? ఒక మహాత్ముని గొప్పదనాన్ని గుర్తించి అతని దరిజేరి ఆరాధించడం ద్వారా నిజమైన
అణకువ ఉత్పన్నమౌతుంది.
ఆధ్యాత్మిక జీవనానికి మొండితనము, గర్వము మరియు
దురభిమానములు విషములు.
ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని శూన్యపరచు (సంపూర్ణంగా నిర్మూలించు) కోవడానికి
ప్రయత్నించాలి.
39. వైరాగ్యము సన్యాసము
నిజమైన వివేకమనగా మనిషి తన తప్పులను, లోపములను
తెలుసుకోవడం ప్రారంభించి, తన హృదయాంతరాళంలో
వాటికై పశ్చాత్తాపపడటమే. వైరాగ్యాన్ని మీరు సాధించగలరు. కానీ మిమ్ములను తగినంతగా
శుద్ధీకరణ చేసినప్పుడే అది జరుగుతుంది. అది మీ మీద కూడ ఆధారపడి ఉంది. అందుకొఱకు సాయంత్రపు ప్రక్రియ సహజమార్గంలో ప్రవేశపెట్టబడింది.
40. వైరాగ్యస్థితి
వాస్తవమునకు మీరు భగవంతునితోను భగవంతునిలోను యెల్లవేళల వుండటానికి ప్రయత్నించ
వలెను. ఒక క్షణం కూడా విడివడి ఉండరాదు. ఈ స్థితి వరకు పురోగమిస్తే
అప్పుడు మీరు యెప్పుడూ వైరాగ్యస్థితిలోనే వుంటారు. భగవంతునితో మీకున్న అనుబంధ ఫలితమే మిమ్ములను ప్రాపాంచికం నుండి విడివడ
జేస్తుంది. అదే నిజమైన వైరాగ్యము.
41. వైరాగ్యము
అవసరమైన ప్రాపంచిక వస్తువులపై అసహ్యము, ద్వేషమును బలవంతముగా, భౌతికపరంగా అలవరచుకోవడం వైరాగ్య మనిపించుకోదు.
వైరాగ్యమనగా ప్రాపంచికముగా గాని లేక దైవీయపరంగా గానీ మన కర్తవ్యమును
నిర్లక్ష్యము చేయమని కాదు దానర్థము.
భగవంతుని వైపు మనస్సు మరలిస్తే చాలు వైరాగ్యము సులభంగా వృద్ధిచేయవచ్చును.
వివేకము లేకపోవడం వల్లనే మనిషికి భయమేర్పడుచున్నది.
వ్యక్తి పూర్తిగా తాను భగవంతుని వైపు మళ్ళింపబడితే వైరాగ్యము సిద్ధిస్తుంది. అలా జరిగినప్పుడు ప్రాపంచిక విషయములందే కాదు తన స్వంత విషయములందు కూడా అశ్రద్ధ
వహిస్తాడు. తత్ఫలితంగా అతడు శరీరపు యెఱుకే కాదు రానురాను ఆత్మ యొక్క యెఱుక సైతం
కోల్పోతాడు. ఇక మిగిలినదేమిటి? ఏమీ లేదు. కాని మరణంలో జీవనం రీతిలో లేక జీవచ్ఛవంగా మిగిలిపోతాడు.
మన బిడ్డలను భగవంతుని బిడ్డలుగా భావించి సేవ చేయవలెను. వారి సమగ్ర వృద్ధి కోసం భగవంతునిచే నియమింపబడిన ధర్మకర్తలముగా మనల్ని మనం
భావించుకొన వలెను.
తగని రీతిగా తగులుకొని వుండటం (రాగం) తద్విరుద్ధమూ (ద్వేషం) రెండూ
ఆధ్యాత్మికతకు విషము.
ఒక కోరికను సంతృప్తి పరచి నంతనే ఆ స్థానంలో మరొక కోరిక ఉత్పన్నమౌతుంది. ఇలా
యెడతెరిపి లేకుండా కొనసాగుతూనే వుంటాయి.
ఎవర్ని కూడా నీ యెఱుకలోనికి సోదరునిగా, తనయునిగా లేక తనయగా
గ్రహించ వద్దు. కానీ వారివారి స్థాయి, వ్యక్తిత్వము
ననుసరించి నీ బాధ్యతను నీవు నిర్వర్తించుము. ఒక దప్పికగొన్న వ్యక్తి యివి
నీళ్ళు, నేను త్రాగుచున్నాను అన్న భావనలేమీ లేకుండా త్రాగితే
దప్పిక తీరదా? నీ బిడ్డలను నీవు నీ బిడ్డలు అని కాకుండా బిడ్డలు అని
మాత్రం ప్రేమించు.
కొందరికి ప్రాపంచికం ఒక వైపు భగవంతుడొక వైపూ ఉంటారు. చాలా మందికి రెండు వైపులా ప్రపంచమే వుంటుంది.
కొన్ని సమయాల్లో ప్రాపంచిక కష్టమొకటి గట్టి దెబ్బతీసినపుడు ప్రాపంచిక వస్తు
ప్రేమికుడు భగవదారాధకుడుగా మారతాడు. మనిషి యెక్కువగా మానవత్వముతో
కూడి వుంటాడు గనుక ఒక బాధాకర సంఘటన మానవత్వపు పొరను ప్రభావితము చేసి నిరాశ
నిస్పృహకు గురిచేసి అది శూన్యత్వాన్నేర్పరుస్తుంది. ఆ శూన్యస్థలం ప్రక్కప్రక్కనే సమానంగా ప్రవహిస్తున్న దివ్యత్వంతో వెంటనే
నిండిపోతుంది. యేర్పడిన శూన్యత యొక్క లోతు కనుగుణంగా అనగా ఆ లోతు అధికమైతే ఫలితం కూడా లోతుగా
శాశ్వతంగా యేర్పడుతుంది.
42. కష్టములు
తీవ్ర నిరాశలో మనిషి తరచూ జీవితాన్ని చాలించాలనుకుంటాడు. అటువంటి సమయాలలో భగవంతుణ్ణి మరణంతో సమానమైన జీవితాన్ని ప్రసాదించమని
ప్రార్థించడం ఉత్తమమని నా అభిప్రాయము. బాధలు, కష్టములకు వాటి స్థానం వాటికి జీవితంలో ఉంటుంది. అసలు కష్టములే ప్రపంచములో లేకుంటే మనిషి ఆలోచన అవతలి వైపుకు మరలి వుండేది
కాదు. అంటే బ్రహ్మానందం వైపని అర్థం. కనుక కష్టములు మనిషిని
ఉన్నతస్థితి నందుకొనుటకు ఉత్తేజమిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే అవి
ప్రేరకాలుగా ఉపయోగపడతాయి.
కష్టములు మరియు వ్యాధులు ప్రకృతి ప్రసాదించిన మనకు కనబడని వరములు. ఇవి సంస్కార ఫలితముల నుండి మనలను బయట పడవైచును. మనిషిలో పేరుకపోయివున్నవన్నీ వదిలించుకుంటే ఆధ్యాత్మిక పురోగతి నిరాటంకంగా
సాగిపోతుంది. ఇదంతా మనిషి మనస్సు అంతర్గతంగా ఆ వైపుకు మొగ్గు చూపినప్పుడు మాత్రమే సాధ్యం. ఎవ్వరు కూడా తమ సాధారణ ప్రాపంచిక సంబంధిత జీవనాన్ని వదిలేయవలసిన అవసరం లేదు. కానీ అదే సమయంలో దైవాన్ని పొందడానికి ఆవలివైపున గూడా నిబద్ధతతో మెలగాలి. అదే తుదకు మనం పొందవలసినది. వాస్తవానికి వ్యక్తి భగవంతునికి
ఆత్మార్పణ గావించుకోవాలి.
శారీరక వ్యాధి వాస్తవానికి ఆధ్యాత్మిక రుగ్మతను స్వస్థపరచును. కారణం అది కొన్ని సంస్కారాలను వ్యయపరచును. దానితోపాటి సహనశక్తిని పెంపొందించును. సరియైన మార్గంలో పురోగమించు
వారికి ఆధ్యాత్మికస్థితి ఈ శారీరక నలతల వల్ల మెఱుగు పడినట్లు వారే గమనించగలరు.
అంతేగాకుండా ఆ వ్యాధి కాలంలో నిరంతరం భగవంతుని స్మరించడం వల్ల సమయం కూడా సంతోషంగా
గడిచిపోతుంది.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాధల ననుభవించవలసిందే. నాకూ కష్టములుండినవి. ఇప్పుడు కూడా యింకా చాలా కష్టములుండనే యున్నవి. మా గురువర్యుల జీవితకాలములో నేను నా యిబ్బందుల నాయనకు తెలుపుకొంటినే గాని
వాటిని యేమాత్రం తొలగించమని కోరుకొనలేదు.
మనమీ ప్రపంచములోనికొచ్చితిమి గనుక మనకీ బాధావ్యధల నుండి విముక్తి లేదు. మనం తిరిగి మన ఉత్పత్తిస్థానం (మూలం, జన్మస్థానం)
చేరుకొనే వరకు వాటి నుండి బయటపడుటే కుదరదు.
ఉత్తమోత్తమమైన మార్గం మన విధిని మనం నిర్వర్తించుటే.
జీవితంలో ప్రతీది మన సంపూర్ణ శ్రేయస్సునకే యేర్పడి యున్నది. వాటిని సద్వినియోగ పరచుకొనుట నేర్చుకొని, అన్నిటిని మన
కనుకూలంగా మార్చుకోవాలి.
మనమెప్పుడు ఆయనలో లేమో అప్పుడే చిక్కులు కలిగేది.
కోరికలు లేని స్థితే మనకు కావలసినది.
సత్యతత్త్వమునకు బాధే దిట్టమైన రహదారి.
ప్రశ్న: నేనొక గురువు నెన్నుకొన్నాను. ఇంకా నాకెందుకు కష్టాలున్నాయి?
జవాబు: నీవు పనులు చేస్తున్నావు, వాటిలో యేది నీకు
కష్టమునకు కారణమైనది? ఈ విషయమై మీ గురువును సంప్రదించితివా?
మా గురువర్యులను నేను ప్రాపంచిక బాధల నుండి విముక్తిని కోరలేదు. మా గురువు నాకు వాటిని లక్ష్యపెట్టని వైఖరిని ప్రసాదించినాడు.
మానవదేహము ఆత్మనివాసస్థానము. మనకు నచ్చినా నచ్చకపోయినా అన్నీ వున్నాయి. అవన్నీ సమయానుకూలంగా మన ప్రయోజనార్థమే యేర్పడి యున్నవి. మనమే వాటిని సక్రమమైన పద్ధతిలో సర్దిపెట్టుకొని అవసరమైనప్పుడు మనకుపయోగ
పడునట్లు చేసుకొనవలెను. వాస్తవానికి వాటిని సక్రమంగా ఉపయోగ పెట్టుకొనక పోవడము, సరిగ్గా అమర్చుకోకపోవడం వల్లనే చిక్కులేర్పడు చున్నవి గాని, అసలు వస్తువులో యే దోషము లేదు. అదీ కష్టములు యిక్కట్ల అసలు
స్వరూపము. వాటిని సక్రమంగా వాడుకోవడం మేలు, దురుపయోగ పరచుకోవడం
వల్ల కీడు కలుగుచున్నది. శరీరంలోని ప్రతి అణువూ గొప్ప శక్తి పూరితమై యున్నది. ఈ విశ్వమంతా దానితో సన్నిహితముగ అనుసంధించబడి యున్నది.
నీవు సామాన్యంగా దుఃఖపూరిత స్థితి ననుభవిస్తున్నానని నాకు ఫిర్యాదు చేసినావు. ఇది ఆధ్యాత్మికం కూడా కావచ్చు. ఈ దుఃఖభావనలో కూడా నీవు
తేలికదనాన్ని అనుభవిస్తూ వుంటే. అప్పుడు నిన్ను నేను తప్పక
అభినందించాలి.
అనుభవములను పొందటానికే మనిషి జన్మించాడు.
ఈ కష్టముల నన్నిటిని పూర్తిగా శక్తిహీనము చేయుటెట్లు? ఉన్న ఒకే ఒక పరిష్కారము గొప్ప శక్తివంతము దివ్యమునైన దైవము వైపునకు మరలుటే. అప్పుడు శక్తి ప్రవహించ నారంభించి మొత్తం కష్టములను బలహీనపరచును. పనిలో పనిగా వ్యక్తి గీతలో మహోన్నతమైనదిగా చెప్పబడిన స్థితి పొందగలడు. ఆ స్థితిలో వ్యక్తి తన్నుతాను కర్తగా భావించడు. అంతకంటే మహోన్నతమైన స్థితి అంటే, ఇక అక్కడ సంస్కారము
లేర్పడుట నిలిచిపోతుంది. అది అతనిని జీవన్మోక్ష స్థితికి గొనిపోతుంది. ఒక సరళమైన దాని నందుకొనుట సరళమైన విధానముననే సాధ్యపడుతుంది. వాస్తవానికి కష్టములను ఆనందమునకు విరుద్ధమైనవిగా గ్రహింతుము. గానీ అవే మన హృదయములో సత్యతత్త్వపు చైతన్యము (యెఱుక) ను మరల రేకెత్తించి, మనలను శాంతి మరియు పురోగమన మార్గమున పయనింప జేయుటకు సహాయపడును. ప్రతి ఒక్కరికి వారివారి కష్టములు వారికున్నవి. నాకూ నా కష్టములున్నవి. వాటిని గురించి మా గురువుకు
ఒకసారి వ్రాసితిని. వారు నా కిచ్చిన ఈ జవాబు సువర్ణాక్షరములలో లిఖింపదగినది, గమనించండి - చింతలకు గురిచేయడం శ్రేయస్కరము. గృహమే వినయము, ఓర్పు నకు శిక్షణాలయము. దినదినము జీవితములో జరుగు
ఒడిదుడుకులను ఓర్పుతో సహించడమే గొప్ప తపస్సు వంటిది, మరియు అదే గొప్ప త్యాగము. కోపము, రోషమునకు బదులు వ్యక్తి తనలో నమ్రతాభావమును అలవరచుకొన వలెను. ఎవరైనా నిందించి దండిస్తే తప్పు నాయందే వున్నందుననే, నేను దండనకు గురైతినని తలంచెడు భావనే నమ్రతను సూచించును. ఈ విధానములో అన్ని అహద్దులకు తాను లొంగి వర్తించవలసి యుండును. ఇతరులకు యేకాంతము, ఒంటరితనము మరియు
మనుషులతో సంబంధము లేకుండుట బహుశా సంతృప్తి, ఓర్పు మరియు
జీవితపు బాదరబంది నుండి స్వేచ్ఛ నలవరచుకొనుటకు సాధనములు కావచ్చును. కానీ మనకు సంసార జీవనము గడుపుచున్నప్పుడు బంధువుల, స్నేహితుల మరియు సమాజములోని వారల దూషణలు, కోపతాపములే గొప్ప
తపస్సు మరియు త్యాగము. ఎప్పుడూ కష్టముల గురించి దీర్ఘాలోచనలో మునిగి పోవడము వల్ల బాధలు హెచ్చును. వాటితో అనుబంధం మరింత పెరిగి వాటి చింతలో గట్టిగా చిక్కుకొనిపోదుము. ఇది పురోగమనమునకు ఆటంక లేర్పరచి మన విజయావకాశములను తగ్గించి వైచును.
లాలాజీ ఒకసారి సహచరులకిట్లు వ్రాసెను. కష్టములు, చింతలకు సంబంధించి చెప్పాలనుకుంటే, నా కష్టాలు నాకూ
వున్నాయి, వాటిని వింటే మీరు జడుసుకోవచ్చు. చాలాసార్లు భోజనానికి నాదగ్గరేమీ ఉండేదికాదు. నాకు సంతాన మెక్కువ, నాపై ఆధారపడిన
వాళ్ళు కూడా వుండేవారు. ఇవిగాకుండా యింకొందరిని నేనే ఆదుకోవలసి వచ్చేది. వారిని కాదనడానికి వీలులేని
పరిస్థితి. పూర్తి బాధ్యత నాపైనే వుండేది. అందరిని నేనే సంబాళించుకొని
వాళ్ళకు కావలసిన అవన్నీ సమకూర్చవలసి వచ్చేది. మరో విషయం కూడా చెప్పాలి. మా కుటుంబానికంతా కలిపి కప్పుకోవడానికి
ఒకే బొంత వుండేది. అది కూడా అతుకుల బొంతగా మారింది. కానీ నేను దాన్ని ఒక దురదృష్ట
ప్రదర్శనగా తీసుకొనే వాడిని, అదీ కాలంతోపాటే
గడచిపోయింది. సత్యతత్త్వమే నా జీవితమంతా ప్రాధాన్యత గల్గియుండినది. కనుక నేను నా యిక్కట్లను చూచి, యిదిగదా అసలైన
మోక్షమార్గమని యెప్పుడూ నవ్వుకొనే వాడిని.
43. అద్భుతములు
ప్రాణాహుతి శక్తి ప్రసారము చేయగల్గిన రాజయోగి నిస్సందేహముగా అద్భుతములు
ప్రదర్శింపగలడు. కానీ అతడు ఆ పని చేయడు. ఎందుకంటే అది అతడున్న
పవిత్రస్థాయికి అగౌరవప్రదమైనది.
ఇంకా చెప్పాలంటే ప్రత్యక్షానుభవము, ఖచ్చితముగ
నిరూపించి ఈ అద్భుతములు గణింపదగినవి కావని తేల్చి చెప్పినవి. కారణం అవి యేవిధంగానూ నిజమైన విశ్వాసాన్ని పెంపొందించజాలవు.
ఈ అద్భుతముల విషయంలో అభ్యాసి జాగరూకుడై వుండాలి. అవసరమైనప్పుడు మన మార్గంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. కుండలినీ శక్తిని జ్ఆగృతపరచవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరో జూపిన అద్భుతములతో జనులు తమ్ముతాము అభివృద్ధిపరచుకోలేరు. ఇది కేవలం ఒక ఆకర్షణ తప్ప మరేమీ కాదు.
మనిషిని సరైన మార్గంలో పెట్టడమే ఒక గొప్ప అద్భుతము.
అద్భుత ప్రదర్శన ఒక యోగి లేక సాధువుకు ప్రామాణికము కాదు. అంతేగాకుండా బోధగురువులు చేసే బహిరంగ మోసము. బలహీనులు మరియు అమాయక మత విశ్వాసులను తమ గురుత్వపు వలలో పడవేసుకొను ఒక
కుతంత్రము.
మనిషి దేహము, ఆత్మ కలిగి యున్నాడు. ఇవి అతని ఉనికికి ముఖ్యలక్షణములు. శరీరం ఆధారంగా లేకుండా ఆత్మలు
రూపు దాల్చలేవు. రెండింటిలో దేనికున్న ప్రాధాన్యత దానికున్నది. ఈ రెండింటిని తెలుసుకొని మనిషి బాధ్యతతో మెలగుచున్నాడు. శరీరము సరైన పోషణ అవసరమై నిలచి వుంటుంది. ఇక ఆత్మ మూలము యొక్క యెఱుక (జ్ఞానం) తో మనగల్గుతుంది. సహజంగా వ్యాధిగ్రస్తులైనపుడు శరీరాన్ని జాగ్రత్తగా చూచుకోవాలి. అయితే అదే సమయంలో రెండవ పార్శ్వమును గూడా నిర్లక్ష్యము చేయరాదు.
అవసరమునకు తగినట్లు, దేహముపై
శ్రద్ధవహించి దాని పోషణ తప్పనిసరిగా చేయవలెను. అందువల్ల అది సంపూర్ణ సామర్థ్యము గల్గినదై భగవంతుని యెడ, తన యెడ మరియు యితరుల యెడ కూడా తన కర్తవ్యమును తాను చక్కగా నిర్వహించగల్గును.
44. ప్రశ్నలు
ప్రశ్న: భగవంతు డిక్కడున్నాడు, అని వ్యక్తి యెలా
భావించగలడు?
జవాబు: నీలో గ్రహించు శక్తి చురుకుగా (చైతన్యపరుపబడి) ఉంటే భగవంతుని
భావింపగల్గుదువు.
ప్రస్న: తమరు అన్ని ప్రదేశాల్లోనూ యెలా వుండగలరు?
జవాబు: నీకైనీకే విశదము కావలసిన విషయమిది. నీవు నీ విధానంలో చూసుకుంటావు. నేను నా విధానంలో దర్శిస్తాను. మనం భగవదిచ్చను చెడగొట్టరాదు. అది అసహజము.
ప్రశ్న: మేము ఒక గంట ధ్యానంలో కూర్చొంటాము. ఆ తర్వాత ఆ ధ్యాసే వుండటం లేదు. ఇది మాకు కష్టమౌతున్నది.
జవాబు: మనం దాన్ని పాడుచేశాము. మళ్ళీ దాన్ని సరిచేసుకోవాలి. ఓ సంసారికి చాలా పనులుంటాయి, ధ్యానం తర్వాత తన పనిలో తాను నిమగ్నమైపోతాడు.
ఇది నీకొక గుణపాఠాన్ని నేర్పుతుంది. నీవు కూడా భగవంతునిలో మునిగి
నిన్ను నీవు కోల్పోవచ్చును. భగవత్సాక్షాత్కార మనునది యినుప
ముక్క కాదు. అది నీవు గ్రోలవలసిన అమృతము. నీవు శ్రద్ధను కనబరిస్తే బరువు
తగ్గుతుంది, ప్రయోజన మెక్కువుంటుంది.
ప్రశ్న: మనందరం యిదోఅదో యేదో ఒకటి కావాలనుకుంటున్నాం. కొందరు మాత్రం శాంతి- నాశిస్తున్నారు. ఎందుకు?
జవాబు: భగవత్సాక్షాత్కారం అభ్యాసి యొక్క మహోన్నతాశయము. నేను నా అనుభవాన్ని చెబుతున్నాను. నా గురువు పాదసన్నిధికి నేను
చేరినప్పుడు చాలామంది సత్సంగులు వచ్చినారు. వాళ్ళంతా భగవత్సాక్షాత్కారం
మత్రమే కోరేవారు. వారిప్పుడు శాంతిని కోరుకుంటున్నారు. ఈ 40 సంవత్సరములలో పరిస్థితులు
మారిపోయాయి. ఇదంతా పడమటి దేశాల నుండి దిగుమతైంది. 75% అభ్యాసులు ప్రాధమికంగా
శాంతిని వెతుక్కుంటూ వస్తున్నారు.
వ్యక్తి సాక్షాత్కారమునకు సంబంధించిన భావన కలిగి వుండాలి. ఈ విషయంలో భిన్నత్వముండరాదు. ప్రతీది నీ చెంతకే వస్తుంది. నీవు చెప్పినట్లు రాజు చేస్తే దానర్థమేమి? రాజతడు కాడు నీవే.
శ్రద్ధ మరియు ప్రేమ నిన్ను అత్యున్నత స్థితికి చేరుస్తాయి. భగవంతునితో అనుబంధ మేర్పరచుకో, నేను మధ్యవర్తిని.
ప్రశ్న: గురువు మీద యేకాగ్రత కలిగివుంటే సరిపోతుందా? అది విగ్రహారాధన కాదా?
జవాబు: నీవు నన్ను నూరుసార్లు అడిగినా, నేను నీకు
భగవంతునితో అనుబంధం గలిగి వుండమనే చెబుతాను.
ప్రశ్న: నిజాయితితో జీవించడం చాలా కష్టం. యేం చేయాలి?
జవాబు: కష్టాలు ప్రతిదానిలోను వున్నాయి. వాటిని నీవు వాస్తవానికి
హెచ్చించుకొనుచున్నావు. ఒక కష్టముందంటే దాన్నెలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి. మనం అలజడికి లోనౌతాము. ఆ విధంగా కొట్టుకు పోతుంటాం. భగవంతుడు విశ్వాన్ని సృష్టిస్తే మనం మన సృష్టిని చేస్తున్నాం. నీ స్వల్ప సృష్టిని నిర్మూలించేయ్.
కామ, క్రోధ, లోభ మరియు మోహాలను
నాశనం చేయండని వారు చెబుతుంటారు. కానీ యే మతము వాటిని జయైంచమని
చెప్పడం లేదు. మనం వాటిని జయిద్దాం. ఇది ఒక రకంగా విభిన్నవిధానం. అవి అదుపు చేయబడాలి.
క్రోధమనునది భగవంతుని దగ్గరనుండి వచ్చింది. ఇది మనల్ని ఉత్తేజితులను చేసి కార్యోన్ముఖులను గావిస్తుంది. కనుక మంచిదే. దీన్ని మనం దుర్వినియోగ పరుస్తున్నాం.
లోభము, మోహము మన సృష్టే. అందుకే వాటిని నిర్మూలనం చేయాలి.
అహంకారమే ఒక సాధనమై భగవంతుని వద్దకు తీసుకెళుతుంది. దీన్ని సంపూర్ణంగా నిర్మూలించనవసరం లేదు. అది దాదాపూ చచ్చి వుండాలి. అది ‘నేను చేయగల’ ననే బలాన్ని
నీకిస్తుంది. ఇది అత్యంతవసరం. అహంకార ముండవలసిందే. లేకుంటే మనిషి మనిషేకాదు. ఇదే లేకుంటే, భగవంతుడే వుండేవాడు కాడు. మొట్టమొదట ప్రపంచంలోనికి ‘నేను’
(అహం) ను పంపి ఆ తర్వాత భగవంతుడు దిగి వచ్చెను.
ప్రశ్న: మనలో వున్న యే మూలపదార్థం మనల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నది?
జవాబు: ఆ మూల పదార్థాన్ని నీవే సృష్టించుకొన్నావు. నీకు తెలియకుండానే దాన్ని నీవు సృష్టించుకున్నావు.
ప్రశ్న: జన్మే అభివృద్ధి అని నేననుకుంటున్నాను. కదా?
జవాబు: మరణమే నిజమైన అభివృద్ధి.
ప్రశ్న: అందుకే జనులు విశ్వనాశనానికి తెగిస్తున్నారు, ఔనా?
జవాబు: మనిషి భవనాన్ని నిర్మిస్తే అది కాలిపోవాలని ఎప్పుడూ కోరుకోడు.
ప్రశ్న: వాస్తవంలో వున్నదేమి?
జవాబు: వాస్తవంలో యేముండాలో అది ఉన్నది (జో హై సో హై).
ప్రశ్న: భగవంతుడు విశ్వాన్నెందుకు సృష్టించాడు?
జవాబు: దైవచైతన్యము. నేనూ ఆలోచించి ఆలోచించి ఒక సమాధానం కనుగొన్నాను. అది నేను సరైనదనుకుంటున్నాను. ఒకవేళ శక్తి కదలిక లేకుండా నిరుపయోగంగా
కోట్లాది సంవత్సరాలు అలాగే ఉండిపోతే అది గడ్డకట్టుకపోయి వుండేది. కనుక తన్నుతాను జీవంతో మనగలిగేట్టు చేసుకోవడానికి శక్తిని విడుదలచేసి భగవంతుడు
సృష్టిచేస్తున్నాడు. ఆయన తన్నుతాను రక్షించుకొను యత్నములో విశ్వమును సృష్టించెను.
పదార్తము శక్తిగా మార్చబడెను. మొత్తము శక్తి పరిపూర్ణముగా
మార్చబడెను. అదీ సహజమార్గము. ఉనికిలోని ప్రతి వివరము శక్తియే యైయున్నది. అదీ మొదలు. అది శక్తిగా యెదిగినప్పుడు సంపూర్ణ దైవత్వమగుచున్నది. శరీరములోని ప్రతి రోమకూపమునకు తన సూర్యశక్తి ఉత్పాదన విధానమున్నది. అది ద్రువములకు అనుసంధానమై యున్నది. 20 సంవత్సరాల నాటి చలి యిప్పుడు
మాస్కోలో లేదు. మనం చాలా యెక్కువ ద్రువముల నేర్పరచుకొన్నాము. వాటిని మొదట విచ్ఛిన్నము చేయుము. ఇది సహజమార్గ కార్యము.
ప్రశ్న: భగవంతుడు యెవర్ని యిష్టపడతాడు? పురుషులనా, స్త్రీలనా?
జవాబు: మహోన్నతమైన స్థాయిలో ఆడా, మగ అన్న తేడా
వుండదు. అంతా ఒక్కటే. వారున్నట్లుగా వారిని కాకుండా, వారుండవలసిన తీరులో
వారుంటే భగవంతుడు అందర్నీ యిష్టపడతాడు.
ప్రశ్న: అధమస్థాయి జీవులు, జంతువులు
ఆధ్యాత్మికానుభూతిని పొందగలవా?
జవాబు: పొందజాలవు. వాటికి వివేకం లేదు. అవి సంస్కారములను కూడా ఏర్పరచుకొనవు.
ప్రశ్న: గురువుండడం అవసరమా?
జవాబు: జనులు సమాన్యముగ ఆత్మసాక్షే గురువంటారు. ఎప్పుడు విపరీతమైన (అత్యధికమైన) స్వచ్ఛత ఉంటుందో అప్పుడు ఆ మాట సరైనదే. మిగిలిన జనానికి గురువు అవసరం.
మనస్సే విడుదల (కైవల్య) సాధనం. మొదట మనస్సును క్రమబద్దీకరించు. యేదో ఒక గురువు నాశ్రయించు అని జనులంటారు కానీ నిజానికి ఈ పని గురువర్యులది, శిష్యులది కాదు. అసలు ఈ ప్రయోజనం కోసమే గురువున్నది. నేను యే అభ్యాసిని మనస్సు
క్రమబద్ధమొనరించుకొమ్మని ఆదేశించను. కారణం అది శుద్ధ తప్పు. ఇది గురువు కర్తవ్యము. అయితే ఆయన చెప్పినట్లు విని
ఆచరించు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. ఆయన కర్తవ్యం ఆయన్ను
నిర్వర్తించనీ.
ప్రశ్న: ఆ పరిపూర్ణత్వాన్ని చింతన చేయడం వల్ల యేమైన స్వార్థప్రయోజనముందా?
జవాబు: ఉన్నది. కానీ ఈ స్వార్థము అథమమైనది కాదు. ఎందుకంటే అది నీ ఉద్దరణకు
సహాయపడుతుంది.
ప్రశ్న: భగవంతుని గురించి ఆలోచించినపుడు సన్నిహితభావం కలుగుతున్నది. కానీ ఆ సమయంలో ఆయనతో విడివడి ఉన్నట్లనిపిస్తుంది. దీన్నెలా గణించాలి?
జవాబు: నీవు ప్రేమిస్తావు అయినా యెడబాటు వుంటుంది. ఒక బాలుడు ఓ పూటకూళ్ళింట్లో (హాస్టల్లో) తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడనుకోండి, ఆ బాలుడు తన తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. అదే సమయంలో తల్లిదండ్రులకు కూడా
కుమారుని క్షేమంపై ఆసక్తి వుంటుంది. ఇరువురి మధ్య ప్రేమ వుంది అయినా
యెడబాటూ వుంది.
ప్రశ్న: కేంద్రంలో యేచైతన్యము వుండకపోతే సృష్టి యెలా జరుగుతుంది?
జవాబు: సూర్యుడున్నాడు, మనకు వేడి, వెలుతురు యిస్తున్నాడు. కానీ ఆ సూర్యునకు యివేమీ తెలియవు. సూర్యునిలో అటువంటి చైతన్యమేమీ లేదు అయినా మనం వేడి, వెలుతురు మాత్రం పొందుతున్నాం. ఇదే విధానంలో కేంద్రంలో కదలిక
లేకపోయినా, సృష్టి మాత్రం సాగుతూనే వుంటుంది.
ప్రశ్న: ఇచ్ఛకు ఆశకు తేడా యేమి?
జవాబు: ఆశ అనునది యిచ్ఛ యొక్క బలహీనాంశము. అయినా అది బలపడుతుంది. నీవు సత్యతత్త్వంలో లీనమైతే, యిక సాధించాల్సిందేమీ వుండదు. సందేహము యిచ్ఛకు విషము, భగవంతుని గురించి వినడానికి ఉత్సుకత కలిగి యుండుము.
ప్రశ్న: మహాత్ముని దర్శించినపుడు, చేతులు జోడిస్తాము. దీనిలోని అంతరార్థమేమి?
జవాబు: చేతులు జోడించడమొక కృత్రిమమైన పని. సహజసిద్ధముగా గౌరవింప (నమస్కరింప) వలెనన్న నీవు వంగనవసరం లేకుండానే తలవంచు.
ప్రశ్న: ధ్యానం సమయంలో ఆలోచనలొస్తున్నాయి. యేం చేయాలి?
జవాబు: నిన్ను యేదో వేధిస్తున్నది అని నీవంటున్నావంటే అది ఆధ్యాత్మికం కాదని
దానర్థం. అది కేవలం నీ సృష్టి. నీ సృష్టిని నిలిపేయ్.
45. సున్నిత హాస్యం
ఎవరైనానన్ను పొగుడ్తూ మీరు చక్కని ఆంగ్లం (బాష) వ్రాస్తారంటే నేను నా
విద్యార్హతను జ్ఞాపకం చేసుకొంటాను.
ఒక అభ్యాసి మాట్లాడుతూ డా|| కె.సి.వి. నన్నెప్పుడూ
గురువు దగ్గరికెళ్ళమని సలహా యిస్తుంటారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, గోటు మాష్టర్, గోటు మాష్టర్ అంటుంటాడన్నాడు.
బాబూజీ: వివేకవంతులెప్పుడూ అట్లే చెబుతారు.
ఇస్లాంలో దీపావళి భగవంతునికి సంబంధించిన మర్మం విప్పుతుంది.
దశాదేశాలకే పరిమితమయ్యామెందుకు?
మీ ఉద్దేశ్యమేమి? ఎన్ని
వుండాలనుకుంటున్నారు. నా ఉద్దేశ్యం ప్రకారం నేను పదిలో అన్నీ యిమిడ్చాను. మీరు దయచేసి చెప్పండి. ఎన్ని అవసరమంటారు?
ఒక తెలివైనవాడు మూర్ఖుడై వుండొచ్చు, మూర్ఖుడు
తెలివైనవాడై వుండొచ్చు. తెలివైనవాడు చాలా దారులేర్పరచుకుంటాడు. కానీ మూర్ఖుడొక్క దారికే
కట్టుబడి వుంటాడు.
నేను చాలా నిశ్శబ్దమైన మనిషిని. నాకు పని కేటాయించారు గదా! ఇక
నేను మాటకారినైపోయాను.
నా రచనలన్నీ మా గురువర్యులవే. అందులో తప్పులేమైనా వుంటే అవి
మాత్రం నావి.
నాకు వయస్సు మీరిన అత్తగారొకరుండే వారు. ఆమె నీవు భగవంతుని చూచితివా? అని నన్నొకసారి ఆడిగినది. నేను లేదంటిని. అప్పుడామె నా చుట్టు వున్న మనుషులను చూపి, నీవు వీళ్ళందరిని మోసగిస్తున్నావన్నది.
ప్రశ్న: మీ జ్ఞపకశక్తికి మీ మతిమరపు సహాయపడుతున్నదా?
జవాబు: ఎందుకూ? అది జ్ఞాపకశక్తిని తటస్థీకరిస్తున్నది.
నేను అస్సాం చాలాసార్లు వెళ్ళాను. అక్కడొక పెద్దాయనుండేవాడు. ఆయన నాకు ఒక ఉత్తరం వ్రాసి, వ్యాపారంలో నేను
నిజాయితీగా యెలా మెలగాలో తెలియజేయమన్నారు. నేను అన్ని వివరాలతో 14 పుటల
ప్రత్యుత్తర మిచ్చాను. ఆ తర్వాత ఆయన, నీవు నాకొక అద్భుతం చూపిస్తే నీకు నేను 50 దుకాణాలు
యిస్తానన్నారు. నేను దానికి జవాబు వ్రాశాను. 50 దుకాణాల బరువు గాడిద
మోయగలుగుతుంది, నేను మోయలేను. కనుక మీరు ఒక గాడిదకిచ్చేయండి. అందుకోసం మీరు సాధుమహాత్ముణ్ణి వెతకనవసరం లేదు. ఆ తర్వాత ఆయన తన తప్పు తాను తెలుసుకొన్నాడు.
మా కాయస్థ కులంలో ఒక పండుగ నాడు అతిథులందరికి సారాయినిస్తారు. మా బంధువులలో ఒక బిడియస్తుడు సారా తాగడానికి యిష్టపడలేదు. నేనతనికి ఒక మత్తును ప్రసారం చేశాను. అంతే అతడు కాళ్ళు తడబడుతూ, మత్తులో తూలుతూ నా వద్ద నుండి లేచి పోయాడు. అదే మత్తు కోసం ఆతడు నా వద్దకు 3 సంవత్సరములు వరుసగా వచ్చాడు.
ప్రశ్న: సున్నితత్త్వం మనిషికి పుట్టుకతోనే వస్తుందా?
జవాబు: ఎవరూ సున్నితంగా వుండాలనుకోరు. నీవు యేడ్చిగాని నవ్విగాని
పిలుస్తేనేగానీ తల్లి నీ దగ్గరికి రాదు.
ధ్యాన సమయంలో యేమి జరిగిందో దానిపై 2 లేక 3 నిముషాలు ఆలోచించి ఆ స్థితిలో
వుండటానికి యత్నించు, అక్కడేముందో తెలుసుకొనే
అన్వేషణాగుణాన్ని పెంపొందించుకో, మనకు సున్నిత
స్వభావం అవసరం. చాలా మంది బి.ఎ., ఎమ్.ఎ. లు
ఉత్తీర్ణులౌతారు. వారు సున్నితంగా వుండరు. వారు మేధావులు మరియు గొప్ప
విద్యావంతులు, కానీ వారిలో అందరూ కాదు గాని కొందరు నాకు దెలిసి
సున్నితంగా లేరు. డా|| కె.సి.వి. గారన్నట్లు వారి కసలుది తప్ప అన్ని తెలుసు.
ప్రశ్న: నాకు
వెలుగంటే వెలుగే కావాలి.
జవాబు: ఒకవేళ నీ స్థితి అలా వుండగా, అటువంటిదేదో
నీలోనికి వదిల్తే, దాని వెనకుండే వ్యక్తిని నీవు చూడలేవు. వెలుగుంటుంది. వ్యక్తి సత్యతత్త్వాన్ని నీవు దర్శించలేవు. ఆ వ్యక్తిత్వం అడ్డగించబడుతుంది. ఆ వెలుగు అతని వల్లనే
ప్రసరిస్తూ వుండినది. మనం అసలు వ్యక్తి నెందుకు తెలుసుకొన రాదు? నేను డా|| కె.సి.వి. గారితో ఈ వెలుగునకు అంటే జిగి లేని
వెలుగునకు మరొక మాట సూచించమని అడిగాను. నాకైతే సరిగ్గా సరిపోయే మరో పదం
దొరకలేదు.
ప్రశ్న: వెలుగు కావలనున్న వ్యక్తిని తెలుసుకోవడ మెలా?
అది అభ్యాసం వల్లనే సాధ్యము. మనం భగవంతుని కొఱకు తపన పడాలి. మనం యితరత్రా కాలయాపన చేయరాదు. నీవు దాన్ని దర్శిస్తావు, సమయం రానివ్వు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. ఆయన కర్తవ్యాన్ని
నిర్వర్తించనివ్వు. నీ పాత్రను నీవు పోషించు, ఆయన పాత్రనాయన
పోషించనిమ్ము. నీవు తగిన స్థాయిలో లేకపోతే, ఆయన అంతే. తద్వారా రాబోయే దానికోసం వేచియుండకు, ఫలితం తక్షణం లభించాలి. నీవు యింకా ముందుకెళ్లవలసి యున్నదని ఆలోచించు. సంతృప్తి జెందితివా నీ ప్రయాణం కుంటువడుతుంది.
ఒకసారి నేను తిరుపతిలో బసచేసి యున్నాను. నా కోసం ఒక వైద్యుని
పిలిపించారు. గుండెలో నాకు బాధగా వుంది, కానీ అది
ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతున్నది, అని నేను చెప్పాను. వారు పరీక్షించి మందులు వ్రాసి వాటితోపాటుగా నిద్రమాత్రలు కూడా యిచ్చారు. నేనాయనతో నిద్ర పట్టదన్నాను. ఆయన నమ్మలేదు. మరుసటి రోజు ఆయన్ను పిలిపించారు, ఆయన నన్ను
విచారించారు. నేనాయనతో మీరిచ్చిన మోతాదు యెక్కువేమో? నాకు
నిద్రపట్టలేదన్నాను. నాకు మీరు పిల్లల మోతాదివ్వండి అని సలహా యిచ్చాను. మీరు నాకు ఔషదమిస్తారు, అది నాకు మేలు
చేస్తుందో లేదో నేను చెప్పగలనన్నాను.
ప్రశ్న: మనిషికి 2 చెవులు 2 కన్నులు ఉన్నాయి, నోరు మాత్రం ఒకటే వున్నదెందుకు?
జవాబు: ఎందుకంటే నింపవలసింది ఒక పొట్టనే కదా! 2 నోర్లతో 2 పొట్టలు నింపాల్సి
వుంటుంది. ఊహించు 2 పొట్టలను నింపడమెంత కష్టమో అర్థమౌతుంది.
ప్రశ్న: మరణించిన పాపి, పురుగై పుడతాడా? లేక మళ్ళీ
మనిషిగానే పుడతాడా?
జవాబు: ఒక వేళ నేను నీకు సమాధానమిచ్చినా ననుకుందాం! అది నీకెందుకుపయోగ
పడుతుంది? దాని వల్ల నీకొచ్చే ప్రయోజనమేమైనా ఉందా?
ప్రశ్న: జనులు
దీవించమంటారు. ఇంకతకూ అసలు దీవనంటే యేమిటి?
జవాబు: ఒకనికి కుమారుడు కలగలేదు. అతడు కుమారుడు కావాలంటాడు. అతడు కొడుకు కలగాలని దీవించమంటాడు. కాని మరొకనికి ఓ డజను మంది
కొడుకులుంటారు. వానికి కోడుకు కలుగుతాడనడం దీవెన కాదు. నేనెప్పుడూ యిటువంటి తమాషా
సమాధానాలిస్తుంటాను.
ప్రశ్న: నాకు యెట్టి చింతలు, బాధ్యతలూ లేవు. నేను యేవిధమైన సేవ సంస్థకు చేయాలి?
జవాబు: మీరు మీకే సేవ చేసుకోవడముత్తమం. స్వయంసేవ మహోత్తమం.
నేనొకడనున్నానన్న తలంపు గలిగి యున్నంత కాలం భగవంతుని సేవిస్తూ వుండవచ్చు.
46. గురువర్యుల ఆదేశములు - ఉపదేశములు
మొత్తం ప్రపంచములోని స్త్రీ పురుషులందరూ మన తోబుట్టువులే, ఎందుకంటే అందరూ భగవంతుని బిడ్డలే.
చీమ వలె ఉండు.
నేను మరుగుదొడ్లు శుభ్రముచేయు పనిని చేయుచున్నాను.
నేను సహజసిద్ధంగా యెల్లవేళలా కూర్చొని గాని, పరుండి గాని పని చేస్తూనే వుంటాను.
మనం వీలైనంత తేలికదనం గలిగి ఉండాలి.
హృదయంలోని యెడమ ప్రదేశమింకా పరిశోధింపబడలేదు. ఇది కేవలం ప్రాపంచిక పరమైనది.
ప్రకృతి అర్హునకే శక్తి ప్రసాదిస్తుంది.
స్వేచ్ఛ అన్న తలంపు కూడా ఒక బంధమే.
భగవంతుడు సాధారణముగా వరముల నివ్వడు, వ్యక్తిగత యిచ్ఛే
వాంఛలను తీర్చగలిగిన స్థితిని సృష్టించగలుగుతుంది.
ప్రతిఒక్కరిలో ప్రాణశక్తి ఉత్పాదక యంత్రమొకటున్నది. అన్నిటికీ పైన మొత్తం విశ్వమున కంతటికీ కలిపి ఒక ఉత్పాదక యంత్రమున్నది.
మిమ్ముల్నందరిని నేను ఒక యేకాంత సభా మంటపమునకు తీసుకొని వెళ్ళవలసి యున్నది. అక్కడ "సున్సాన్పనా" మనమనుకుంటున్న యేకాంతం వెయ్యిరెట్లు
బరువనుకొనుడు. ఇదే పరిపూర్ణము, యిది మానవుడు సాధించుటకు వీలైనది.
నీవు యేవిధమైన అనుభవ జ్ఞానము లేనివాడైపోతే అప్పుడు నీవు నిజమైన స్వచ్ఛ
(పవిత్ర) స్థితిలో వుంటావు. ఎప్పుడు సర్వం కనబడకుండా
(మాయమై) పోతుందో అప్పుడున్నదే అసలు సిసలైనది.
కాలమే మహోన్నతమైన శక్తి, కానీ దాన్ని
వాడుకొనడం సాధ్యపడదు. దాని ఘాతమును భరింప నెవ్వరికీ సాధ్యము కాదు.
నేను యేమీ చేయకుండానే యెప్పుడూ తీరుబడి లేకుండా (బిజీగా) ఉంటాను.
‘నేను’ (అహం) యెక్కడుందో నేను వెతకాలి కానీ నేను నా ఆత్మను వెతకలేను.
ఒక వేళ నొప్పి శరీరంలోని ఒక భాగంలో వున్నా శరీరంఅంతా బాధ పడుతుంది. ఇదే విధంగా నా అభ్యాసులందరూ భావించాలి.
ప్రపంచంలోని బంధుత్వాలన్నీ మంచివే, ప్రపంచంతో
పెనవేసుకొన్న బంధనాలు మంచివి కావు.
భార్యాభర్తలు బండికున్న రెండు చక్రాలవలె తమ కుటుంబ విధులను నిర్వర్తించాలి. ప్రతి పనిని కర్తవ్యపరంగా భావిస్తూ సాంసారిక జీవితంపై శ్రద్ధలేని రీతిలో
ఆకర్షణకు లోనుగాకుండా సాగిపోవాలి.
ప్రశ్న: కారణము లేని కార్యమేదైనా ఉంటుందా?
జవాబు: ప్రతి కారణము అలా వుండాలి. దానితో కార్యము జరుగుటకు వలసిన స్థలమేర్పడనీయరాదు. ఎప్పుడు రంగస్థలము లేదో అప్పుడు కారణము యొక్క ప్రభావముండదు.
మన సంస్థ గౌరవము చక్కగా కాపాడబడాలి. చాలా పురోగమించిన వానిలోనైనా
చిన్న దోషముంటే, లాలాజీ వారు వారికి ఆధ్యాత్మిక గాలి కూడా సోకదని
చెప్పియున్నారు. మన నడవడి వల్ల యెవరిని యిబ్బంది పెట్టరాదు. ఇక్కడికి వచ్చే జనులకు ఈ వాస్తవములేవీ తెలియరాదు. నేను నా కుర్చీలో కూర్చొని యున్నా నా దృష్టి అన్నివైపులను పరిశీలిస్తూనే
వుంటుంది.
మాట్లాడేటప్పుడు, చదివేప్పుడు వ్యక్తి
యెప్పుడూ జాగ్రత్తగా వుండాలి. శ్రుతినందుకోవడనికి యిది అవసరం. శ్రుతి పైనుండి క్రిందికి దిగి రావచ్చును. కానీ 500 మందిలో ఒకరు కూడా అలా జాగరూకులై లేరు. దీన్ని అలవరచుకొని పెంపొందించుకోవాలి. దీనిపై ధ్యానం చేసి యిదేమిటో
గుర్తించండి.
ఒక బిందువున్నది. దాన్ని నొక్కితే లాలాజీ వారు వెంటనే వచ్చేస్తారు. అది అత్యవసర సమయాల్లో మాత్రమే చేయవలసిన పని.
ఇప్పటి అంతరీక్ష పరిశోధకులు చంద్రునిపై కనుగొన్న విషయాలను గురువర్యులు పదహారు
సంవత్సరముల క్రితమే చూపించిరి.
ప్రకృతిలో జరగబోయే భవిష్యత్విషయాలను ఒక్కొక్కటిగా మనం చూడవచ్చును. అదంతా బ్రహ్మాండ మండల స్థాయికి క్రిందనే కనుగొనవచ్చును.
నా మటుకు నాకంతా నా గురుదేవులే, కైవల్యము (విడుదల)
కూడా కాదు. కైవల్యం ఆయన స్థాయిలో ఆయన చూచుకుంటారు. అది నా స్థాయికి సంబంధించిన పని
కాదు.
ఈ భువనబాండముల యొక్క కేంద్రములో, గ్రుడ్లలాంటి వున్నవి. అందులో ఒకదాన్ని పగులగొడితే దానికి అనుబంధించబడియున్న విశ్వం బ్రద్ధలైపోతుంది. బ్రహ్మములో లీనమైయున్న యిచ్ఛ మాత్రమే యీ పని చేయగలదు. పదార్తరహిత పూర్ణత్వాన్ని గురించి యింక చేయవలసిన పరిశోధనలేమీ లేవు.
భగవంతుడు శ్రేయముగాక మరితరము కాజాలడు, కనుక యేర్పడునదంతయు
మంచే. భగవంతుడు చెడుపు లేక తప్పు, గానీ అధర్మము గానీ
చేస్తాడనీ, అట్టిదేదైనా వ్యాపిస్తుందని ఆలోచన గూడా యెవరూ
చేయలేరు.
కలలు కూడా పాతసంస్కారాలను చూపుతాయి. నీకు భయం కలిగించే కలలొచ్చాయంటే, ఒక సంస్కారం వ్యయమైపోయినట్టే.
అందరినీ సోదరులుగా భావించాలి. ఎందుకంటే అదే వాస్తవం కాబట్టి. అనంతశక్తిమంతుడైన భగవంతునితో మనకున్న సంబంధం తండ్రీ బిడ్డ సంబంధం. అందర్నీ అలా సోదరులుగా భావించడం వల్ల వారితో నిరంతరం అనుబంధం గలిగి, వారితో సన్నిహితంగా మెలగుతాం. వాస్తవానికి అందర్ని సోదరులుగా
తలంచడం వల్ల ఒకరకమైన ప్రశాంత వాతావరణం హృదయంలోనూ పరిసర వాతావరంలోనూ యేర్పడుతుంది. ఇది అభ్యాసుల స్వీయ పురోగతికే కాకుండా పరిసరాల, పరీస్థితులు కూడా మారి సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుంది.
మార్పులేని స్థితే ఆఖరు జన్మ. బాధాతప్త హృదయం, లేక యింకేదైనా మరోస్థితిగాని పొందాలనే కోరిక యిక వుండదు. అదే మహోన్నతమైన ఆధ్యాత్మికస్థితి. దీని తర్వాత మరేమీ
సాధించాల్సింది లేదు.
యెఱుక తప్పియుండటం ఆత్మ లక్షణం. అది మనం ప్రాపంచిక యోచనలను
వదిలించుకొన్నప్పుడు అనుభవంలోనికొస్తుంది. ఈ యెఱుకలేని స్థితి రానురాను అధికమై
కడకు మనం భగవంతునిలో లయమైపోయే స్థితి వరకు వెళుతుంది.
శాంతి హృదయం నుండి హృదయానికి పంపిణీ చేయబడుతుంది.
ఒక తేలికైన వస్తువు యెప్పుడు కూడా పైపైకి యెగరడానికి ప్రయత్నిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే అది తన మూలం వైపుకు కదులుతుంది. దైవ ధార ప్రభావముతో కార్యరూపంలోనికి వచ్చిన ప్రతి ఒక్కటి తన మూలం వైపునకు
యెగిరి చేరుకోవడానికే (మొగ్గుచూపుతుంది) ప్రయత్నిస్తుంది.
మనిషి యెఱుక గలిగి వుండాలి. ఈ యెఱుక భగవదిచ్ఛ యొక్క
ప్రత్యక్ష ఫలితమే. అదే, వస్తువులు రూపుదాల్చడానికి దారితీసింది.
లాలాజీ ఉవాచ: "నాకు కావలసింది సింహాలు, గానీ గొఱ్ఱెలు కాదు." నేను గొఱ్ఱెలను కూడా నా
సత్సంగంలోనికి మర్యాద కోసం (సౌజన్యంతో) అనుమతించాను.
మన నిజమైన ప్రయత్నం లయావస్థ మొదలవ్వడానికే. మనమెపుడు సాధన చేయడం ప్రారంభించి ధ్యేయప్రాప్తికై తపన జెందుతామో, అప్పుడే మన ప్రయత్నానికేది సహాయకారిగా అనిపిస్తుందో దానితో అనుసంధించుకుంటాం. తదనంతరం మనం అంతా భగవదిచ్చగా భావిస్తూ, అలా ఆయనతోనే
అనుసంధాన మేర్పరచుకొని వుంటాం. ఇది క్రమేపీ సాన్నిహిత్యంగాను, అనుబంధంగాను వృద్ధిపొందుతుంది. ఇదే వాస్తవార్థంలో లయావస్థ
ప్రారంభము. అందుకొఱకు సాధన, ప్రేమ, భక్తి యింక
యిటువంటివన్నీ మనకు ప్రయోజనకారులుగా గ్రహిస్తాము. ఇంకా చెప్పాలంటే మన స్వేచ్ఛాయుత యిచ్ఛ, ఆయన అనంత పరిధి
యెంతవరకుందో అంత వరకు వెళుతుంది. ఎంతవరకు మన హద్దులు, బంధనములు ఛేదించుకోమో అంత వరకు మనము, మన యిచ్ఛ భగవదిచ్ఛ
ఒకటేయని నిర్ధారించి చెప్పలేము. ఇదీ మన నిజమైన ప్రయత్నము. ఇది మనం ఆ సత్యతత్త్వంతో లీనమగుటకై చేస్తాము.
సంపూర్ణంగా భగవత్సాక్షాత్కారం పొందిన మహనీయుల విషయంలో సైతం మానవత్వపు అంశ
కాసింతైనా మిగిలి వుంటుంది. సంపూర్ణంగా భగవదైక్యం పొందాలంటే
వ్యక్తి తన శరీరపు తొడుగులన్నిటిని వదిలించుకోవాలి. ఆ తర్వాతే అది సాధ్యమౌతుంది.
నరకం, స్వర్గం మరియు బ్రహ్మలోకం: పాపులకు నరకలోకమున్నది. జ్ఞానరహితులైన వారి కోసం
స్వర్గలోకమున్నది. అమాయకుల కొఱకు బ్రహ్మలోకమున్నది. కానీ తెలివైన, చదువుకొన్న వారికి వారే కల్పించుకొన్న కృత్రిమ స్వర్గమున్నది. ఇక బలహీనులైన వారికి ఈ అశాశ్వత ప్రపంచమున్నది.
లాలాజీ ఉవాచ: ఏ విధంగానైనా మిత స్వభావం లోపించిన వారు, వారు ఎంతటి మహోన్నతస్థాయి నందుకొన్న వారైనా సరే, వారు ఆధ్యాత్మిక రంగంలో అడుగిడనట్లే లెక్క.
నా హృదయము నా సహచరుల యెడ తీవ్రప్రేమ భావముతో నిండి యున్నది. వారికి నేను చేసే సేవ విషయంలో నాకు సంతృప్తి లేదు. నే చేరిన స్థాయికి వారందరూ రావాలని యెంతో ఆతృతతో కోరుకుంటున్నాను. ఎందుకంటే నాస్థాయి వరకు వారిని తీసుకరావడం యిప్పటి వరకు నా చేతుల్లోనే వుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత విషయం యెట్లుంటుందో, మీతో నేను చెప్పాలన్నా యెట్లుంటుందో నేనూ చెప్పలేను. మా గురువు నా కిచ్చిన ఈ అపార సంపద మహారాజాధిరాజులు సైతం పొందియుండలేదు. ప్రపంచంలో దేనితో అది సరిపోలదు. ఇదంతా నేను వెళ్ళేటప్పుడు వెంట
గొంపోదలచుట లేదు. కానీ మ గురువర్యులు చేసినట్లే నేను కూడా యిదంతా మరొకరికి అప్పజెప్పవలెను.
నేను ఒక వ్యక్తిని బిర్లాను చేయగలను, కానీ అది భగవత్సాక్షాత్కారానికి
పనికిరానట్లయితే, బిర్లాను చేసి ప్రయోజనమేమి? నేను భగవంతుని దేనికోసం బలవంత పెట్టడం లేదు. నేను భగవంతుని పని చేయుచున్నాను. భగవంతుడు నా మంచిచెడ్డ
చూసుకుంటాడంతే.
నీకు సంబంధించిన వేమున్నాయ్? మనవేమన్నా ఉన్నాయంటే అవి మన సంస్కారాల మూట, వాటి ప్రభావంతో గల్గిన చిక్కులు, వ్యతిరిక్త పొరలు, వాటిని మనం మన ఆత్మ చుట్టూ పేర్చుకొన్నాం, అవి మన ఆలోచనల ఫలితములే.
ఆధ్యాత్మికత యెంతటి మహోన్నతమైన మానసిక స్థితంటే, దానితో పోలిస్తే ప్రతీది బరువైనది లేక సాంధ్రమైనదే.
నేనొకసారి శ్రీచంబాజీకి యిలా వ్రాశాను - "శ్రీరాముని, శ్రీకృష్ణుని ఈ భూమి మీదకు నేనే పంపాను. ఈ ప్రపంచానికి శ్రుతిని
(వేదాలను) నేనే ప్రసాదించాను."
ఐరోపా చుట్టు ఒక రేఖ వున్నది. అది ఆధ్యాత్మికత (గురువర్యుల) వైపు
గొంపోవుచున్నది. ఇంగ్లాండు లో పేదరికం పెరిగి ఆధ్యాత్మికత వస్తుంది.
గురువర్యులు పూర్తిగా సంస్థ పనులకు అంకితమైయున్నారు. సంస్థ పనుల కాటంకమైతే చాలా దగ్గరి బంధువుల యిండ్లలోని పెండ్లిండ్లకు సైతం
పోవడనికిష్టపడటంలేదు.
దేహంలోని ప్రతి అణువు గొప్పశక్తిని గలిగియున్నది. ఈ విశ్వమంతా దానితో సన్నిహిత సంబంధము గలిగియున్నది. వెన్నుబాములోని ప్రతి బిందువు గొప్ప శక్తితో నిండియున్నది. కాని దాని వైపు యెవ్వరూ మనసు మరల్చలేదు. మెదడు యొక్క కణజాల కలయికలోని
ప్రతి అణువునకు తనదైన మహత్తరశక్తి వున్నది. అది కుండలినీ శక్తి నధిగమించి
యున్నది.
పరమగురువులు లాలాజీ, శిక్షణ పొందకున్నా
పుట్టుకతోనే గాయకులు. ఆయన భక్తి పారవశ్యముతో పాడుతూవుంటే, వింటున్న సాధకులు
మరియు అక్కడకొచ్చే మామూలు అతిధులు ఒక ఉన్నతస్థాయి యెఱుకకు ఉద్ధరింపబడిన అనుభూతిని
ఆ దివ్యగాన మాధుర్యములో పొందేవారు.
అధమస్థాయిలో ఉన్నానని అంగీకరించటం, ఉన్నతస్థాయి నందుకోవాలనే
ఆతృతను కలిగిస్తుంది. నీవు ‘కోరికలకు బానిసనై యున్నాను’ అన్న భావనతో మొదలుపెడితే నీవొక మంచిస్థానం
నుండి గమ్యంచేరే పని ప్రారంభించావన్న మాట. "అహం బ్రహ్మస్మి"
(నేనే దైవాన్ని) అన్న భావనలలో పెనుగులాడి సాధించేదేముండదు.
ఎప్పుడైతే ‘నేను’ అన్న మాట ఎవరినీ సూచించదో, అదే నిజమైన గొప్ప స్థితి.
తరచూ మనం యితరులను పట్టించుకొని, మనల్ని మనం
నిర్లక్ష్యం చేస్తాం. నీ ఆత్మకు శాంతి చేకూర్చడమే గొప్ప సాంఘికసేవ. జనసమూహాల సమస్యా వ్యక్తి సమస్యే. భగవంతుడు సమూహాల సమస్యను
చూసుకుంటాడు. మనిషి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవాలి.
ఒక అద్వైత మత సిద్ధాంతవాదితో గురువర్యులు "భగవంతుడు విశ్వమును
సృష్టించెను". "మీరు యెలుకలను సృష్టించగలరా?" అనెను. భగవంతుడు భగవంతుని స్థాయిలోను మీరు మీ స్థాయిలోను వున్నారు.
ఆత్మస్వాతంత్ర్యము, స్థైర్యము లేని
వారే బలహీనులు.
యెఱుక శక్తిని వీడినపుడే పవిత్రమైనదని తెలుపనగును.
భగవంతునకు రూపమున్నదా లేదా? ఒక వేళ భగవంతునకు
రూపముందనుకున్నాం. నీవు కష్టపడి తపించి భగవంతుని చేరితే, అప్పుడాయన అక్కడి
నుంచి పారిపోతే యేమౌతుంది? నీవు పడిన శ్రమంతా
పూర్తిగా వృధా అవుతుంది. రూపధారియైన భగవంతునికి రూపమునకున్న పరిమితులన్నీ వుంటాయి. నీవు తొలుతనే సమస్యలతో సతమతం కావద్దు. నీకు అనువైన పద్ధతిలో నీవు
ప్రారంభించు, సత్యతత్త్వం తనకై అదే యెట్లుంటే అట్లా ఉదయించనీ.
లాలాజీ బాబూజీతో "నీవొక్కడివే భగవంతుని నుండి పని చేయించుకోవడం తెలిసిన
వాడివి. ఇది లయావస్థ వల్లనే సంప్రాప్తమైనది" అన్నారు.
ప్రశ్న: ప్రతి వ్యక్తిలో ఎన్ని బంధనాలుంటాయి?
జవాబు: శరీరంపై యెన్ని వెంట్రుకలున్నాయో అన్ని. అంటే లెక్కపెట్టలేనన్ని.
మనం దూదిపింజవలె తేలికగా వుండాలి. సమర్థగురువుల ఒకే ఒక త్రోపు సహాయంతో
భగవంతుని వద్దకు మన యానం మొదలైపోవాలి.
ఒక అభ్యాసి గురువర్యుల కొకసారిలా వ్రాశారు. ముందు నేను భగవంతుని చూడనివ్వండి, ఆ తర్వాత నేను
పూజించడం ప్రారంభిస్తాను. గురువిలా సమాధానమిచ్చారు. అన్ని చర్యలకు కడపటిదది. దాన్ని నీ అనుభవానికి తీసుకరమ్మంటున్నావు. ఇదెలా వుందంటే ఒక బాలుడు మొదట షేక్స్పియర్, మిల్టన్ను అర్థం చేసుకోనివ్వండి, తర్వాత ఎ, బి, సి, డి లు నేర్చుకోవడం
మొదలెడతా అన్నట్లుంది. నీవు దేనికోసమైతే తాపత్రయ పడుతున్నావో అదే నీ యెదుట నిలబడితే, ఇక దాని కోసం యెవరైనా నిన్ను పూజలు చెయ్యమని చెప్పే సాహసం చేస్తారా.
చిత్రమేమంటే మనం సర్వం భగవంతుని వద్దనుండి ఆశిస్తాం, కానీ పొందే అర్హతే మనకుండదు.
సమర్పణమే విజయ రహస్యము.
భగవంతుడు అవతరించి ప్రపంచమునకు మరియు మానవులకు శాంతిని క్రమమైన విధివిధానమును
ప్రసాదించుగాక!
సరళమైన జీవన విధానమే ప్రధానమైనది. అదే ఒక విధంగా భగవంతుని
అనుకరించుట.
జీవితంలోజీవమే నిజమైన జీవనము. మరణమంటే మనకెందుకు భయం.
మనం మన శరీరములతో కూడా కేంద్రమండలం చేరవచ్చు. స్వేచ్ఛను పొందిన ఆత్మల వలె మన జీవిత కాలంలో కూడ ఈదడం ప్రారంభించనూ వచ్చు.
ఒక కోరికను సంతృప్తిపరచినంతనే, దాని స్థానంలోనే
మామూలుగా మరొకటి ఉత్పన్నమై కొనసాగుతుంది. ఇలాగే అనంతంగా సాగుతుంది.
ప్రశ్న: ఒక సాధుమహాశయునికి సామాన్యమానవునికి తేడా యేమి?
జవాబు: సాధుమహాశయునకున్నట్లే సామాన్యునికీ ఒక శక్తి మరియు ఆత్మశక్తి వుంటాయి. ఒకే ఒక్క తేడా యేమంటే సాధుమహాశయుడు తన ఆత్మను చుట్టియున్న పొరలను ఛేదించుకొని
వుంటాడు. సామాన్యుడు పట్టుపురుగువలె తన దారములతో యేర్పరచుకొన్న ప్యూపాలో బంధింపబడి
వుంటాడు. సామాన్యుడు దృఢసంకల్పంతో ఈ పొరలను విప్పేసుకోవాలనుకుంటే, ఈ భూప్రపంచంలోని యే శక్తి అతన్ని అడ్డుకోజాలదు. ఒక గట్టి ఉక్కులాంటి యిచ్ఛ ఆధ్యాత్మిక ప్రగతి కొఱకు మనిషికవసరము. ఇది కలిగిన వానికి గమ్యము కనుచూపుమేరలో వుంటుంది. ఇవి నీకున్నవి, అంటే ఇక అపజయమన్న మాటేలేదు.
బ్రతుకంటే తేజోయుత జీవనమే. హృదయరీత్యా చచ్చినవానికే
అధోగతే. హృదయంగల్గి జీవించడమే తేజోయుత జీవనం. నీ హృదయాన్ని మరొకరి కర్పించేయ్. ఇక మిగిలిందే జీవితం. స్వల్ప సంతోషములపై వాలియున్న హృదయాన్ని వెనక్కు మరల్చి సత్యవస్తువుపై నిలుప
వలసి వుంది. అదీ వ్యక్తి తన జీవితంలో చెయ్యవలసిన పని. హృదయం భగవంతునిదిగాను, నీవు మాత్రం నీదిగా
వుంచుకో.
సర్వకాల సర్వావస్థలలో సంతోషంగా వుండేవాడు మహాధైర్య సంపన్నుడు.
మీరందరూ ఆధ్యాత్మిక రంగంలో భానుల వలె ప్రకాశించాలని నేను కోరుకుంటున్నాను.
గురువుగారు నా స్థితిపై ఒకసారి విశ్లేషిస్తూ, యిలా అన్నారు. మనిషి ఔన్నత్యమందే కొద్దీ, తన్ను గురుంచి తాను
తక్కువ జేసుకుంటాడు. అయితే యిది గొప్ప వరము. ఇట్టి వరము మనుషులకు యెన్నో
తరముల కొకనికి గాని అనుగ్రహించ బడదు.
మన గడ్డను (గృహాన్ని) మనం జ్ఞాపకముంచుకోవడం దేశభక్తి. మన జన్మకు మూలస్థానంపై ధ్యాస వుండడం నిజమైన ఆరాధన.
నీవు ముందుకు ఒక్కడుగు వేస్తే నేను నాలుగడుగులు నీ వైపు వేయుటకు ఉత్సాహముతో
వున్నాను.
వస్తువుల సత్యతత్త్వమును గుర్తించుట యందే మనం నిమగ్నము కావలెను. ఆధ్యాత్మికతంటే అదే. కోరికలను సంతృప్తిపరచడ మొక శిక్షగా భావించడంకంటే అసలు కోరిక వుండడమే శిక్షగా
భావించడం ఉత్తమం.
అంతర్గతక్రమత తప్పడము కలత. నీకై నీవు స్పందించకపోతే అవి
సరిచేయబడవు. శాంతి మరియు ప్రశాంతతను ప్రవేశపెట్టాలంటే వాటిని కనీసం ఆపివేసి వుంచాలి. వాటిని ఆపివుంచనంత వరకు మన జీవన విధానాన్ని క్రమబద్ధీకరించి మెరుగుపరచుకోలేము. సరైన క్రమబద్ధీకరణ జరగనంత వరకు సరితూకం సాధ్యంకాదు. కనుక సమత కుదరదు. అదిలేక ప్రకృతితో కలసి మనజాలము. దానివల్ల ప్రకృతిలోని స్వచ్చమైన
వాయువుల నాస్వాదించలేము. దానితోపాటే ప్రకృతితో అనుసంధాన మేర్పరచుకొనుట అవసరము. మనల్ని మనం సత్యతత్త్వయుతుడైన మహనీయునితో, మానవాతీతునితో సంబంధమేర్పరచుకుంటే సర్వము సాధ్యమై అన్నిటిని సాధించగల్గుదుము.
భౌతిక వాదులు జీవితంలో విజయం సాధిస్తారు. ఎందుకంటే వారు పనిలో నిమగ్నమైనప్పుడు తమ్ముతాము మరచిపోతారు. అప్పుడు వారికి తెలియకుండానే దైవత్వం వారికై పనిచేస్తుంది. వారు పనిలో వున్నారు. అందువల్ల దైవాన్ని వారి కొఱకు పనిచేయనివ్వరని యితరులనుకుంటారు.
ఉద్రిక్తతకు గురియైన మనస్సును అదుపుచేయాలంటే, కాసేపు ఊరుకోండి. భగవంతుని గురించిన ఆలోచన చేయండి, లేకపోతే ఆకాశం వైపు
చూడండి, ఉద్రిక్తత మాయమౌతుంది. ఉద్రిక్తత ఒక రకంగా మంచిదే. అది మనిషి వెనక్కు తిరిగి
యోచించడానికుపకరిస్తుంది.
వివేకమంటే దూరదృష్టి గలిగి వుండడమే.
జనులకు భగవంతుడు తప్ప మిగిలినవన్నీ తెలుసు. అంటే దానర్థం యేమీ తెలియనట్టే.
మొత్తం సైనికదళం రణరంగంలో చేయగలిగిన పనిని మించినపని నేను నా మంచం మీద
కూర్చొని చేస్తాను.
మనకు సమయం వృధా చేయడం తెలుసు, కాని పాశ్చాత్యులకు
దాన్ని సద్వినియోగమెలా చేయాలో తెలుసు.
మూడు విషయాలు అవసరం - సరియైన చర్య, సరియైన సాధన మరియు
సరియైన గురువు.
నీ యింట్లో నీవు అతిథిగా వుండు.
మూడు విషయములు మాత్రమే నీవి - నీ గురువు, నీ విధానము మరియు
నీ ఆధ్యాత్మిక సంస్థ.
ఉప్పు సముద్రంలో తియ్యని నీటికై వెతుకు.
సున్నితత్త్వాన్ని పెంపొందించుకొని చూడు, యెంత ఆనందానుభూతి
కలుగుతుందో. వాస్తవాన్ని చెప్పాలంటే మనిషి తను యెక్కడికి వెళ్ళినా తన చుట్టూగల
వాతావరణాన్ని తానే సృష్టించుకోవాలి. అదీ ఆధ్యాత్మికతకు గుర్తు.
ఆధ్యాత్మికతలో వేదాల సారమంతా యిమిడి వుంది. అన్నివేదాలు మంచివే, కారణం అవి
పూర్వఋషులు, సాధుపురుషుల చేత వ్రాయబడ్డాయి.
నేను తలుపులు లేని మహానిధిని. మీరు వచ్చి లూటీ చేయండి. కానీ ఈ లూటీ చేయడంలోని ఆహ్లాదాన్ని కొందరు మాత్రమే పొందుతున్నారు.
నేను ఉపన్యాసకుడను గాను - నేను నిశ్శబ్దోత్పాదకుడను.
గంగానది - కుక్క వెళ్ళి కొద్ది నీళ్ళను గతుకుతుంది. ఒక మహిళ కడివెడు నీళ్ళు తెచ్చుకొంటుంది. కానీ చాల మంది గంగ గట్టుకు కూడా
వెళ్ళరు. గంగ మాత్రం నిండుగ ప్రవహిస్తూనే వుంటుంది.
ఆలోచనలకు జీవముంది. అవి యితరుల జీవితాలపై కూడా పనిచేస్తాయి. బాధాకరమైన విషయమేమంటే మనము మన
ఆలోచనలతో తేళ్ళు, పాములను పుట్టించి యితరులను యేడిపిస్తాము. ఈ పరిస్థితులలో అవి ఆధ్యాత్మిక ప్రయోజనాన్నివ్వవు. నాస్తికత్వపు లోతులలో భ్రమతో కూడిన ప్రయాసయానాన్ని కలిగిస్తాయి. సమయానికి తగ్గట్టు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఒకవేళ అది ఆధ్యాత్మిక స్థాయికి క్రిందిదైనా పరవాలేదు యితరులకు మేలుచేయు పనిలో
మనల్ని మనం నియమించుకోవాలి.
సత్యతత్త్వము పిరికివారి రంగము కాదు. సింహాల్లాంటి సాహసికులు మాత్రమే
సత్యతత్త్వమును సాధిస్తారు. సహజమార్గంలో మనుషులను అలా
సంసిద్ధపరచడం జరుగుతుంది.
భగవంతుని యెదలో దాగి వున్న కృపను ఆహ్వానించుటకు అతి ముఖ్యమైన విధానము ధ్యానము.
తన్నుతాను సూక్ష్మాతి సూక్ష్మంగా పరిణమింపజేసుకొంటూ యెవరు ప్రకృతితో పాటు
వెనక్కు వెళతారో వారిపైనే సత్యోదయమౌతుంది, స్థూలత్వం
సంపూర్ణంగా నశిస్తేనే గానీ సత్యతత్త్వంలోనికి తొంగి చూడ్డం కూడా సాధ్యం కాదు. ఏవైనా అడ్డంకులున్నాయంటే వాటికి మనమే బాధ్యులం.
జ్యోతి యిప్పటికే వెలిగించబడింది. భక్తిగల హృదయములు మాత్రమే ఆ
వెలుగును గ్రహించి ప్రయోజనము పొందగలవు.
ఆధ్యాత్మిక రంగమున మీరంతా సూర్యుల వలె ఉదయించాలని నేనూ ఆశిస్తున్నాను. ఇది భూమి తన ప్రతిబింబాన్ని సూర్యునిపై పడకుండా చేసుకొన్నప్పుడే
సాధ్యపడుతుంది. అంటే కేవలం నీ గమన మార్గాన్ని నీవు అనువుగా యేర్పరచుకొంటేనే వీలౌతుంది. గమనమార్గ మెప్పుడేర్పడుతుంది? ఎప్పుడు నీవు నేరుగా, గమ్యం నీ దృష్టిపథంలో నిండుగా వుంచుకుంటావో అప్పుడు. గమ్యం యెప్పుడు నీకు నేరుగ దృష్టిపథంలో వుంటుంది? ఎప్పుడు నీవు పూర్తిగా ఆయన వాడివైపోతావో అప్పుడు.
ఎప్పుడు మీరు ఆయన వారైపోతారు? ఎప్పుడు మీరు మిమ్మల్ని పూర్తిగా కోల్పోతారో అప్పుడు. ఎప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోతారు? ఎప్పుడు హృదయంలో
ఆయన చింతన తప్ప మరేమీ వుండదో అప్పుడు. అదెప్పుడు సాధ్యం? అది సాధన ద్వారా సాధ్యం. సాధన యెలా సాధ్యమౌతుంది? అది ప్రేమ, శ్రద్ధ వల్ల సాధ్యపడుతుంది. ప్రేమ, శ్రద్ధ యెలా కలుగుతాయి? మళ్ళీ మళ్ళీ యోచించడం వల్ల. ఈ మళ్ళీ మళ్ళీ ఆలోచించడమెలా
సాధ్యపడుతుంది? దృఢనిశ్చయం వల్ల సాధ్యపడుతుంది. ఈ దృఢనిశ్చయం తీసుకోవడమెలా సాధ్యం? అసలెప్పుడు నీవు
నడుం బిగించి నీ విశ్రాంతిని, సంతోషాన్ని త్యాగం
చేసి అలసత్వాన్ని విడిచిపెడతావో అప్పుడే యిది సాధ్యమౌతుంది.
భగవంతుడు నాకు శారీరక శక్తి నివ్వలేదు కానీ ఆయన నాకు దృఢమైన యిచ్ఛాశక్తి
నిచ్చాడు.
తెలివి, మేధావిత్వంగా వృద్ధి చెందుతుంది.
మహేశ్యోగి ఉతృష్టతకు గొంపోవు ధ్యానం గురించి వచిస్తారు. కానీ నేను ప్రతి ధ్యానము ఉతృష్టతకు దారి తీస్తుందని చెబుతాను. ఎందుకంటే ప్రతి ధ్యానం తర్వాత వ్యక్తి పూర్తిగా లీనమై ఉతృష్టత నందుకుంటాడు.
సరళత దివ్యత్వంతో సన్నిహితంగా వుంది.
జీవితం జాగ్రతావస్థలో నున్న ఉనికి.
మనం యిచ్చ గాక వేరుగాము.
జపం: కొందరి
విషయంలో నేనూ జపం చేయమని సలహా యిచ్చినా, నేను జపం చేయడానికి
అనుకూలుణ్ణి కాను ఎందుకంటే అది కేవలం బాహ్య లక్షణ సమన్వితం.
పెండ్లిండ్లు మరియు యితర వేడుకలు వారివారి ఆచారాల ప్రకారం జరుపుకుంటారు. ఈ ఆచార కార్యక్రమాలు, మత సంబంధమైనవి. అవి ఆయా సందర్భాలను సూచిస్తాయి. అంతేగాని వాటికి ఆధ్యాత్మిక
స్థాయిలో యెట్టి ప్రాధాన్యతా లేదు. కావాలనుకుంటే ఈ పెండ్లిడ్లు, వేడుకలు యే మతాచారాలకు సంబంధం లేకుండా కూడా జరుపుకోవచ్చు.
దైవీయశక్తి యెప్పుడూ పనిచేస్తూనే వుంది, మనుషులను
సరిదిద్దుకోవడమే అవసరమైయున్నది.
మరుక్షణం హాయిగా ఉంచగలిగిన విధానాన్ని అనుసరించి కార్యక్రమాలు నెరవేర్చు. ఈ జన్మ తరువాత లభించు స్వర్గంలాంటి వాటిని పట్టించుకోకు.
సత్యతత్త్వానికి బాధ రాచబాట లాటిది. చింతా చీకు తీసేయాలంటే
సంక్లిష్టమైన పదార్థాన్ని హృదయం నుండి తొలగించేసెయ్.
దైవము తప్ప మిగిలినదంతా స్థూలమే.
పాశవికతాన్ని మనిషి నుండి తొలగించేయ్. సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. మనిషి స్థౌల్యం చెందుతాడు, అదే పాశవికత్వానికి
తొలిమెట్టు. తేలికైన స్థితి నుండి బరువైన స్థితికి వ్యక్తి మారుతున్నాడు. వ్యక్తి స్థూలత్వంజెందడానికి చాలా కాలమే పట్టింది. ఒక దినంలో వ్యక్తిని సరిచేయడం సాధ్యపడదు. చాలా కాలమే పడుతుంది.
చాలా మంది నన్ను చూడటానికి వస్తారు. కానీ ఒక్కరూ నన్ను చూడరు.
భగవంతుడు తనలో యేముందో అదే యివ్వగలడు. మనం మాత్రం మనమే మన ప్రయత్నంతో
సృష్టించుకొన్న దంతా మనలో పేర్చుకొంటాము.
నేనున్న స్థితి అనగా యెక్కడ ‘నేను’ లేదో అక్కడ నుండి వైదొలగి తర్వాత
నేనెవరినైనా చూస్తే అతడు ఆధ్యాత్మిక విద్యలో నాకంటే మహోన్నతుడుగా కనిపిస్తాడు. ఒక్కోసారి నేను యింకా ముందుకెళ్ళి ఆలోచించడం మొదలుపెడితే, ఆ వ్యక్తే నాకు ఆధ్యాత్మికత నేర్పినాడని, నా వద్ద నున్న
ఆధ్యాత్మికత అంతా అతడే నా కనుగ్రహించినాడని అనిపిస్తుంది. దీని వల్ల మనకు, మనందరి మూలము సరిగ్గా ఒకటేనని తెలుస్తున్నది. లేదంటే, ఒకరు తమ అనుబంధాన్ని దైవంతో కొనసాగిస్తున్నారు. వేరొకరేమో దైవాన్ని వారి దృక్పదం నుండి దూరం చేసుకొన్నారు, లేదంటే మరచిపోయారు.
మాంసాహారం నిష్కర్షగా మన సంస్థలో నిషేధించడం జరిగింది. నేను దీన్ని మా గురువర్యుల నిర్దేశంగా, ఆజ్ఞగా
ప్రకటించాను. కానీ అలవాటుపడిన వారు విడువలేకపోతున్నారు. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనానికి యే మాత్రం పనికిరాదు. దీన్ని ఒక వేళ బలహీనుడైన వానికి అరుదైన సందర్భములలో యివ్వవచ్చునేమో గాని
ఆరోగ్యంగావున్న వానికి కాదు. జనులు రుచి కోసం మాంసం తింటారు. అది ఆధ్యాత్మిక పురోగతికి హానికరము. వాస్తవం చెప్పాలంటే యేవిధంగాను
తగనిరీతిలో దేనికీ తగులుకోరాదు, అది సకారాత్మకమైనా
(+), నకారాత్మకమైనా(-) రెండూ కూడా ఆధ్యాత్మికతకు విషమే.
దేన్ని గురించి మనం చింతన చేసినా లేక యోచించినా లోలోపల ప్రకంపనలు (అలలు)
కలుగుతాయి. ఈ ప్రకంపనలు హెచ్చింపైతే శక్తి ఉత్పన్నమై శబ్దంతో అది బయటకు నెట్టబడుతుంది. ఈ ప్రకంపనలు వాటితోపాటి ఆలోచనల, భావనల ప్రభావాన్ని
వెంటగొని వస్తాయి. కనుక నిర్మల మనస్సు యొక్క పవిత్ర ప్రభావము గుంపులో కలసి తిరగడం వల్ల అపవిత్ర
ఆలోచనల చెడు ప్రభావమునకు లోనై పతనమయ్యే అవకాశమున్నది.
తన రూపమునకు సమమైన ప్రతిబింబాన్ని ప్రతి వస్తువు ప్రతిఫలిస్తుంది. వస్తువు సూక్ష్మమైనదైతే ప్రతిబింబపు లక్షణం కూడా సూక్ష్మమే అయివుంటుంది. అట్లుకాక వస్తువు స్థూలమైనదైతే ప్రతిబింబం కూడా అదేవిధమైన స్థూలత్వం కలిగి
వుంటుంది.
భగవత్విషయమై ప్రతిజ్ఞాభంగం గావించవచ్చు. స్వేచ్ఛ కూడ స్వేచ్ఛకు ప్రతిబంధకమే, స్వేచ్ఛ సక్రమమైన కార్యనిర్వహణకే.
47. మనిషి అంతము
ప్రతి మనిషి తన అంతమును కలిసికొనుటకు సంసిద్ధుడై యుండవలెను. అంటే వీలైనంత త్వరగా మహోన్నత ఆధ్యాత్మికస్థితి నందుకొనవలెను. అందువలన తన అంతము సమీపించినపుడు తిరస్కరించకుండా వుండగలడు.
మనము వెలుగుకు బయట వుంటే చీకటిలో పడిపోతాము, వివేకానికి దూరమైతే మూర్ఖులౌతాము. సత్యతత్త్వం పోగొట్టుకుంటే
సైతానైతాము.
పొగడ్త పొగిడేవానికి, పొగిడించుకునేవానికీ
యిద్దరికీ హానికరము. చుట్టూ పొగిడే వాళ్ళను నియమించుకొన్న రాజు, ఆ కారణంగానే ఖచ్ఛితంగా పతనమైపోతాడు.
ఎవరైనా ఒక చెంప మీద నన్ను కొడితే వాడికి నా రెండవ చెంప చూపను, దానికి ప్రతిగా నేను పిడికిలి బిగించి ఒక పోటు పొడుస్తాను. ప్రతి ఒక్కరు
దుర్మార్గం నుండి తమ్ముతాము రక్షించుకోవాలి.
అపరిమితము పరిమితములో వున్నది. పరిమితము పరిమితములో యిమిడి
యున్నది.
నేను ఒక్కని కోసం ప్రార్థిస్తున్నాను. నా గురువు నాకు నేర్పినదంతా నే
నతనికిచ్చేస్తాను.
చంచలత్వం మన జీవితంలో ఒక భాగమైపోయింది. కారణం మన వ్యక్తిగత మనస్సును ఆ
పద్ధతిలో తీర్చిదిద్దాం.
పదార్తము, ఆత్మ కలగల్పడం వల్ల యేర్పడిన ఫలితమే మన ఉనికి.
విశ్వము యొక్క సంగ్రహరూపమే మనిషి.
ప్రకృతి సమర్థునికే శక్తిని ప్రసాదిస్తుంది.
భగవంతుని వద్ద కెళ్ళి యేమీ పొందకపోవడం విషాదకరం.
ఎవరైనా దారి తప్పితే నేను వానికోసం మనస్సు నొచ్చుకొంటాను. ఇక అంతటితో సరి.
నరకం ఒక ప్రదేశం కాదు. కానీ ఆత్మ, సూక్ష్మశరీరము ఒక విధమైన తలత్రిప్పుకు గురౌతుంది. ఆ విధమైన బాధను వారనుభవిస్తారు. ఆ వ్యధ తుది దశలో మిక్కుటమై ఒక
రూపము సంతరించుకొంటుంది. అదే మరుజన్మలో సంప్రాప్తిస్తుంది.
సూక్ష్మ మనస్సులకు మహోన్నతమైన భావనలర్థమౌతాయి. స్థూల మనస్సులకు కేవలం స్థూల భావనలే తెలుస్తాయి.
పండితుడవై యుంటే, పాడైపోతావు. మతానుయాయుడవైతే అంతటితో మూయబడిపోతావు. వాటికి దూరం కావడమే అసలువిషయం. నీ జీవిత సమస్య అంతటితో పరిష్కరింపబడుతుంది.
మహాపురుషుల దర్శన మభిలషించడం మంచిదే. అయితే నిన్ను నీవు
దర్శించుకోవడానికి ప్రయత్నించడం మరీ మంచిది.
ప్రాపంచికము, ఆధ్యాత్మికము రెండు సమాంతరంగా ప్రక్కప్రక్కన
నడుపుకుంటూ మనం పయనించాలి. మా గురువర్యులట్లే చేశారు. నేనువారి అడుగుజాడల్లో నడుస్తున్నాను.
ఆధ్యాత్మిక రంగములోనికి విశ్వాసము మరియు ఆత్మస్థైర్యముతో ప్రవేశింపుము. పద్ధతి ననుసరించుటకు సంసిద్ధుడవుకమ్ము. స్వార్థచింత ప్రక్కకు
నెట్టివేయుము.
ఏదైనా చేయాలనుకుంటే ఆత్మస్థైర్యముతో పనిచేయ్. ఈ పని ఔతుంది అనుము. భగవంతుడనుకుంటే ఔతుంది అన్నావంటే నీలో సందేహముందని అర్థం. దైవం ఈ పని కావాలని దలంచి వుంటే అయివుండేది అని కొందరంటుంటారు, అది తప్పుడు వివరణ.
అశ్రద్ధ పురోగతికి విషము గనుక యెట్లయినా అశ్రద్దను వదిలేయాల్సిందే. మనస్సుపై గురువు యొక్క గొప్పదనము పాదుకుంటే ఆయనతో సన్నిహితంగా సంబంధ మేర్పరచుకొని
ప్రార్థిస్తే, అశ్రద్ధ యెప్పటికీ లోనికి ప్రవేశించదు.
భగవంతుడు సాకారుడు కాడు నిరాకారుడు కాదు. రెండింటికి అతీతుడు.
ప్రకృతికి రహస్యములు లేవు. దైవమార్గము ననుసరిస్తున్నానని
ప్రచారము చేసుకొను వారికి అసలు రహస్యములన్నవి వుండరాదని నా అభిప్రాయము.
ఒక అభ్యాసి వైపు తిరిగి బాబూజీ యిలా అన్నారు - ప్రణాహుతి ప్రసారము
కొనసాగుచున్నది. అయినా నీ కోసం నేను చేయాల్సింది చాలా వుంది. అప్పుడా అభ్యాసి నేను చాలా పనికి మాలిన వాడిని అన్నారు. బాబూజీ అతనితో నీవు చాలా మంచివాడివి అన్నారు.
దేనికైనా సిద్ధమే అన్నట్లు ధైర్యంగా నిన్ను నీవు స్థిరపరచుకో, దృఢసంకల్పంతో ముందుకడుగెయ్, నీ విజయం నిశ్చయం.
దైవాన్ని స్మరిస్తూ యింటిని విస్మరించడం మంచిది కాదు.
చంటిబిడ్డను నవ్వించాలంటే నీవూ బిడ్డవలె అమాయకంగా ముఖంపెట్టాలి. అదే విధంగా భగవంతుని సాక్షాత్కరింప జేసుకోవాలంటే మనం కూడా భగవంతునివలె మారాలి.
ఇతరులను దైవీయులుగా మార్చాలంటే నీవు దైవీయుడవై ఉండాలి.
దైవకృపను పొందడానికి యెప్పుడూ జాగరూకుడవై ఉండు.
మనసులో కలిగే భావనే భగవంతుని భాష. చైతన్యరహితంలో చైతన్యవంతుడవై
యుండుము.
అనుభవరీత్యా దైవస్మరణలో జీవింపుము.
నిరంతర స్మరణ నీ స్మరణకొచ్చే విషయం కాదు. నీవు చేయాల్సిన పని.
నేను ఒక సేవకునిగా జనసామాన్యం మేలు పొందాలని సేవ చేయడానికి ప్రాధాన్యమిస్తాను.
నీ హృదయమనే చిన్న గూటిలో నా కింత స్థానం కల్పించి నన్ను నిరంతరం ఋషి
కుటీరాన్ని నీకు జ్ఞాపకం చెయ్యనీ.
-o0o-
ప్రార్థన
ఓ నాధా! నీవే మానవ జీవనమునకు లక్ష్యము
మా కోరికలు మా ఆత్మోన్నతికి ప్రతిబంధకములై యున్నవి
నీవే మా యేకైక స్వామివి, ఇష్ట దైవము
నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము.
